Monday 11 July 2016

అనుపమాన అనర్ఘ రత్నం అబ్దుల్ కలాం

అనుపమాన అనర్ఘ రత్నం అబ్దుల్ కలాం
https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_11.html
మతములన్నవి మొన్నమొన్న వచ్చినవి. ముందు నుండి ఉన్నది ఈ సనాతన ధర్మమే. ఎవరన్నది చూడకుండా మంచిని మెచ్చుకొనుటే మన సంస్ కృతి. అందుకే నేను తెలుపబోయే ఈ మహనీయుడు ఈ ధర్మములోని విశిష్టతను తన అక్కున చేర్చుకున్నాడు.
మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... 'పి ఎం నాయర్’
కలాం గారి సెక్రెటరీ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ పొదిగై వారు చేసిన ఇంటర్వ్యూ లో తెలిపిన వారిని గూర్చిన కొన్ని వాస్తవాలను గమనించండి. నాయర్ గారి ఆంగ్లమునకిది తెలుగు సేత.
1. డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయన కు ఆ యా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు. ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు. ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలో నుండి తనతో తీసుకు వెళ్ళలేదు.
2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలల మధ్య కాలములో వచ్చియుండవచ్చు. రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం మన దేశంలో. ఒక రోజు కలాం గారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగినారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పినాను .బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం ఇవ్వడం కోసం కేటాయించమని అనాధాశ్రమాలకు ఇవ్వమని చెప్పినారు. నిజమైన సేవా సంస్థలను పరిశీలించే పనిని కొందరికి అప్పచెప్పి తాను అందులో ఏమాత్రపు జోక్యమూ చేసుకొనకుండా ఉండిపోయినారు . ఆ విధముగా నిజమైన యోగ్యతగల సంస్థలను ఎన్నుకొన్న తరువాత నన్ను తన గదిలోనికి పిలిచి లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి అన్నారు. నేను మీ ఔదార్యము పదుగురికీ చెబుతాను అంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు . ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం !
3. ఆయనకు తన మాటలకు అందరూఎస్ సర్అనవలెనన్న నైజం లేదు. ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగినారు.నో సర్!” అన్నాను. ఆయన మౌనంగా ఉండిపోయినారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయ మూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేమిటండి అన్నారు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్! విని అవసరం అయితే తన అభిప్రాయం మార్చుకుంటారు సర్" అన్నాను. ఆయన ఆశ్చర్య పోయినారు .
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించినారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టిఇచ్చినారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది. ఆ రెండు లక్షలూ ఆయనే చెల్లించినారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే ఉంచుకొన్నారు. ఆయన ఉన్న రోజులకు అద్దె చేల్లిస్తానన్నారు కలాం గారు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు ఉంచుకోన్నందుకు తన నివాసానికే తానూ అద్దె చెల్లించుతాననే నిజాయతీని మేము భరించలేము అని ముక్త కంఠముతో ఆయన కార్యాలయ పరివారమంతా వినయముతో తిరస్కరించినారు.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిసినాము. అందరినీ పేరు పేరునా పలకరించినారు. ఆయన నా భార్య ఎందుకు రాలేదు అని అడిగినారు. తన కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది అని చెప్పినాను నేను.
మరుసటి దినము మా ఇంటి ముందు పోలీసులు వచ్చి దిగినారు. ఏమిటి హడావుడి అని నేను అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని వారు తెలిపినారు.
ఇంత వరకూ ప్రపంచం లో దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు .
చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
1) 3 పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Bangalore Flat handed over to scientists’ community long time ago
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.
ఈ విషయాలు తెలియని వారికి అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే ! ఒక గొప్ప మహానుభావుడిని మనం కళ్ళతో చూసినాము అనీ, ఆయన నివసించిన కాలం లో మనమూ నివసించినామనీ గర్వంగా పది మందికీ చాటుదాము.
మహనీయుల చరిత్రలే మనకు ఆదర్శప్రాయములు. కొన్నింటినైనను వారినుండి నేర్చుకొందాము.
మంచిని గౌరవించే సనాతన ధర్మము మనది.
వారి సుగుణములను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. వారిని గూర్చి ఈ అల్పుడు వ్రాసిన పద్యము కేవలము చంద్రునికి నూలుపోగు వంటిదే!
కోహినూరు బోలు కోలారు గని బోలు
మలల రాజు మంచు మలను బోలు
అన్యుడతడు కాదు అబ్దుల్ కలామిది
రామ మొహనుక్తి రమ్య సూక్తి

No comments:

Post a Comment