Wednesday 27 March 2024

కుమ్మరికొక ఏడు గుదె కొకనాడు

కుమ్మరికొక ఏడు గుదె కొకనాడు

https://cherukuramamohan.blogspot.com/2024/03/blog-post.html

పూర్వము కుమ్మరివారు పలు విధములగు అమ్ముటకు యోగ్యమైన కుండలు చేయుటకు ఒక ఏడాది కాలమును తీసుకొనే వారు. గుదె అన్నది అవి చేయుటకు ఉపయోగపడే కొరముట్టు లేక పనిముట్టు. అది పట్టుకొనుటకు వీలు కలిగిన పిడితో ఉన్న దీర్ఘ ఘనపు దిమ్మె. దానితో ఎంతో ఎట్టయినా దొంతరగా పేర్చిన నేలను తాకియుండు  కొత్త కుండల వరుసను కొట్టినట్లయితే మొత్తము సంవత్సరపు కృషీ నేలపాలే!

అదేవిధముగా ఎంతో శ్రమకోర్చి వ్రాసే వ్యాసములను ఒక EMOJI తో కొట్టి వేయకుండా చదవండి. మన పూర్వుల ఔన్నత్యమును గ్రహించండి.చేతనైన నాలుగు మంచిమాటలు వ్రాయండి. ఒక్క మల్లె పూల సారము తన సౌరభామును ఎంతో దూరము వ్యాపిమ్పజేస్తుంది కదా! ఇది ముఖ్యముగా యువతకు నా మనవి. 

మనవి,మన్నింప దగినవి, మరువలేనివి,మరువకూడనివి,మనశ్శాంతి కూర్చేవి ఈ విధంగా మనము తప్పకుండా తలపోస్తాము . కానీ ఈ అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఏ వ్యాసమునైనా ఒకసారి చదివితే మీకే అవగతమౌతుంది. పై విభాగములలో,దేనికైనా ,మీరు చదివిన వ్యాసము చెందేతుగా వుంటే మీ అనుభూతి తెలుపండి. అట్లు చేయుటకూడా నా దృష్టిలో రచయిత కొరకు గాదు. సాటి పాఠకుల కోసం. అది చూసి ఇంకా కొందరు చదువవచ్చు. ముఖ్యంగా మన సంస్కృతి , మన భాష, తపోధనులైన మన మునుల గూర్చిన విషయాలు చదివినప్పుడు అవి ఇంకా పదిమందికి పంచండి. ప్రవచనములలో లోకమాన్యత పొందిన మాడుగులవారు,సామవేదం వారు, చాగంటివారు, గరికపాటి వారి అత్యుత్తమ ప్రవచనములు ఎన్నియో, ఎంతమందో వినివుంటారు. వారి పై ఎంతో ఆరాధనా భావమును పెంచుకొని వుంటారు. మరి అంతటి గౌరవనీయులు,పుంభావ సరస్వతులు చెప్పిన విషయాలను ఎంతవరకు గ్రహించుతున్నాము, ఎంతవరకు పాటించుచున్నాము అన్నది సమస్య. చెప్పునపుడు,ఎంత వినవలెనని వున్నా మనసు తప్పుదారి పట్టవచ్చునేమోగానీ వ్రాసినది చదివేటపుడు ఆ వీలు లేదు . ఎందుకంటే ఎక్కడైనా మనసు ఒకవేళ చెదిరినా,తిరిగీ ఆ భాగము చదివే అవకాశము వుంటుంది . విన్నది నచ్చవచ్చు గానీ, నచ్చినదంతా చెప్పలేము. వినే వ్యక్తీ కూడా దొరకవలె . రచన ఐతే వీలు దొరికినపుడే చదవ వచ్చు . అందువల్ల నేను కోరేదేమిటంటే మంచి వ్యాసము ఎవరు వ్రాసినవైనా నచ్చితే చదివి, బాగుంది నలుగురూ చదవవలసినది అని నాలుగు మాటలు వ్రాయండి. బాగున్న వ్యాసాలు పదిమందికి పంచండి. ఇది దయవుంచి నా వ్రాతలకు 'ప్రకటనగా' దీనిని భావించవద్దు. ఈ ముఖపుస్తకపు గోడపై ఎందరో పండితులు,అనుభవజ్ఞులు,విద్వాంసులు, ఎన్నో మంచి విషయాలు , తమ వయును కష్టాన్ని లక్క చేయకుండా మంచిని పంచావలెనను ఒకే ధ్యేయముతో వ్రాస్తున్నారు. మీరు చదివి ,పంచి, సహకరించి అటువంటి వ్యక్తులను ఉత్తేజపరచితే తమ గ్లానిని కూడా మరచి ఇంకా మంచి విషయాలు చెబుతారు . 

మంచిని పంచుదాం. మంచినిపెంచుదాం.

స్వస్తి.

 


Monday 11 March 2024

ఆసక్తి కరమైన చాటువు

వెలయాలును, శిశువల్లుడు
ఇలయేలిక, యాచకుండు నేగురుధరలో
గలిమియు, లేమిము, దలపరు
కలియుగమున గీర్తికామ! కాటయవేమా!
కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. వెలయాలు, పసిబాలుడు, ఇంటి అల్లుడు, భూపతి,  బిచ్చగాడు భూమిపై గల ఈ 5 మంది తాము ఆశించే వ్యక్తి వద్ద ఇవ్వగల సత్తా ఉన్నదా లేదా అని యోచించరు.

“ కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా
 కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” అనగా

సూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ గింజలు

కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి మామూలుగా కనపడే ఆ దానిమ్మ గింజలని కవి ఎంత అద్భుతంగా!

వర్ణించాడో చూడండి. ఆ చిలుక తినే దానిమ్మ గింజలు. “ హరి నఖర భిన్న మత్త మాతంగ

కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” హరి అంటే సింహం. సింహం యొక్క

నఖర=గోళ్ళతో (పంజాతో) భేదించ బడిన మత్త గజము యొక్క కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన, (ఏనుగు కనబడితే సింహం ముందుగా దాని కుంభస్థలం పైకి ఎగిరి కొడుతుందిట.)

ముత్యాలహారంలోని ముత్యాలవలె ( కుంభస్థలంనుండి స్రవిస్తున్న రక్తంతో తడిసి, కొంచెంఎరుపు,

కొంచెం తెలుపుగా కనబడే ముత్యాలవలె) దానిమ్మగింజలు ఉన్నాయిట” చూసేరా! చిన్న

విషయాన్ని ఎంత గొప్ప ఉపమానంతో వర్ణించాడో కవి. అందుకనే ---

“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః/

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే”  అనగా

కావ్య సృష్టి చేయటంలో కవి బ్రహ్మవంటివాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించు కొంటాడు. అని ఆర్యోక్తి. అట్టి కావ్య ప్రపంచంలో చాటువులని కూడ కవే సృష్టించాడు.

అందరూ ఇష్టపడే మామిడి పండుని కవి ఎంతగోప్పగా చాటువులో వర్ణించాడో ఇప్పుడు చూద్దాం.---        

“ ఆభూచ్చామా జంబూ:, దళిత హృదయం దాడిమ ఫలం/

సశూలం సంధత్తే హృదయమవమానేన పనసః/

భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలి ఫలం/

సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి//” ఇది శ్లోకరాజం.

ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం చూద్దాం;--- “ జంబూ: = నేరేడు పండు. దాడిమ ఫలం= దానిమ్మ పండు. పనసః= పనసపండు. లాంగలి ఫలం = నారికేళఫలం.( కొబ్బరి కాయని సంస్కృతంలో ఫలమనే అంటారు) చూతం = మామిడిపండు.” ఇవి పై శ్లోకం లోని ఫలాలు. ఇప్పుడు వివరణాత్మకమైన భావాన్ని తెలుసుకొందాం. పై శ్లోకం మరలా చదవండి. ముందుగా నాల్గవ పాదం భావం చూద్దాం

“పళ్ళలో మామిడిపండు ‘ఫలరాజంగా’ ప్రపంచంలో కీర్తించ బడటం చూసి, మిగతాకొన్నిపళ్ళు చాలా బాధ పడ్డాయిట. ఎలా అంటే (ఇప్పుడు మొదటి పాదం నుండి చూద్దాం) నేరేడుపండు ముఖం మాడ్చుకొందట, దానిమ్మపండు గుండె బ్రద్దలైందిట, పనసపండు గుండెలో కత్తి దిగినట్లు అయిందిట, కొబ్బరికాయ గుండె నీరైపోయిందిట. ఈ విధంగా పళ్ళన్నీ తమ బాధని వ్యక్తపరచాయి.!” అని కవి ఎంత అద్భుతంగా వర్ణించేడో చూసేరా!? ఇందులో చమత్కారం ఏమిటంటే నేరేడు పండు నల్లగాఉంటుంది, దానిమ్మని పగలుకొట్టి కాని తినలేము, పనసపండుని కత్తితో గుచ్చికాని విడతీయలేము, కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. ఇవి ఆయా పళ్ళకి సహజంగ ఉండే గుణాలు. వీటిని కవి ఎంత గొప్పగా పైచాటు శ్లోకంలో వర్ణించేడో చూసారా! అది కవియొక్క ప్రతిభ. ఇట్టిదే ఇంకొకటి.

“ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి/

సౌందర్య మాహవసి లోచన లోభ నీయం/

అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే/

యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి //

“రసాలసాలము” అనగా మామిడి పండునే పై చాటు శ్లోకంలో కవి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి.—“ఎవరికైనా కీర్తి, అందము ఉంటే చాలదు, మెత్తనైన మనసు కూడ ఉండాలి అది నీకు (మామిడి పండుకు) లేదు” అని కవి చమత్కరిస్తున్నాడు. ఎలాగో చూడండి.

 “ ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగ ఉంది;” అని మామిడిపండులో సహజంగా ఉండే టెంకని కఠినమైన మనస్సుతో పోల్చి వర్ణించడం కవి “క్రాంత దర్శిత్వానికి” నిదర్శనం. కనుకనే కవిని ‘ప్రజాపతి’తో పోల్చినారు.
స్వస్తి.

Saturday 7 October 2023

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు

 ఉయ్యాలవాడ సూర్యచంద్రులు 

https://cherukuramamohan.blogspot.com/2023/10/blog-post.html
ఉపోద్ఘాతము.
ఇది కాస్త ఎక్కువగా ఉన్నదని విసుగుచెందనవసరము లేదు. ఇక్కడ కథానాయకులు ఇరువురూ రెడ్లే!  రాయలసీమ లోని రెడ్లలో మా బాల్యములో అనగా ఒక 70 సంవత్ఇంసరాలకు పూర్వము బ్రాహ్మణ విశ్వాసము కలిగియుండేవారు. పైపెచ్చు వారు ధర్మనిష్ఠాగరిష్ఠులయి ఉండేవారు. ఈ సందర్భముగా నా అనుభవము ఒక 50 సంవత్సరముల పైచిలుకు నాటిది మీతో పంచుకొంటాను. ఈ ఉపోద్ఘాతములు ముగిసిన పిదప అసలు కథలో ప్రవేశింతము. 
కాలగమన మను కడలి పొంగినాకాయ మెప్పుడో  మాయ మయ్యినాకర్పూరములా కరగి పోయినాధర పై సూర్య ప్రభాత కరమ్ములుశీతాంశుని ఆహ్లాద కిరణములుప్రసారితమ్మగు నంత కాలము లోకమాన్యులౌ వీరుల శూరులయశోవిభవ సౌగంధ వీచికలుమన దేశోన్నతిమన అభ్యున్నతినిదశదిశలా ప్రసరింప జేయగా  కీర్తి పతాకము అనంత కాలము హిమాలయము పై రెపరెపలాడును. 
అటువంటి మహానుభావులేప్రస్తుతపు కర్నూలు జిల్లా లోనిఉయ్యాలవాడ అనే గ్రామంలో ఉదయించిన నరసింహారెడ్డి మరియు వెంగళరెడ్డి. ఒకరు యుద్ధ వీరు లయితే ఒకరు దాన శూరులు. ఇరువురూ ఒకే మారుమూల పల్లెలో జన్మించడము
అతి గొప్ప విశేషము. వారి ఘనత గౌరవము విని గర్వపడాలంటే ........
వారి గురించి చెరుకు రామమోహనరావు గారు వారిని గూర్చి చేసిన వ్యాఖ్యానము వింటే మీకే తెలుస్తుంది ఒడలు  గగుర్పొడుస్తుందా లేదా అని.....
ఉయ్యాలవాడ పెద్ద వూరు కాదు. కానీ ఆ వూళ్ళో అస్తమించని సూర్యచంద్రులు చిరస్థాయిగా వున్నారు. వారే ఉయాలవాడ నరసింహా రెడ్డి మరియు ఉయ్యాలవాడ బుడ్డా వెంగళ రెడ్డి. సిపాయీల పితూరీకి ముందే తెల్ల దొరల తలలు తెంచిన అరివీర భయంకరుడు నరసింహారెడ్డి అయితే ఎముకలేని చేయి కలిగి అభినవ దాన రాధేయుడనిపించుకోన్నవాడుబుడ్డా వెంగళ రెడ్డి. 1846 లో నరసింహారెడ్డి ఉరికంబమేక్కితే 1900 వరకు జీవించినాడు బుడ్డా వెంగళ రెడ్డి. వెంగళ రెడ్డి గారి పుట్టుక 1922 లో జరిగినట్లు తెలియవస్తున్నదికానీ నరసింహారెడ్డి గారి పుట్టుకను గూర్చి నాకు ఎరుక కాలేదు. ఈ మహనీయులను గూర్చి ఎందరికి తెలుసునో నాకు తెలియదు కానీ ,నాకు తెలిసిన మేరకు ఒకసారి పునశ్చరణ చేయు ఉద్దేశ్యముతో వీరిని గూర్చి మీ ముందుంచే ప్రయత్నము చేయుచున్నాను.
మిగిలినది మరొక మారు.......

వీరిని గూర్చి వ్రాయుటకు నాకు ఆలంబన రెండు పుస్తకములు. నరసింహారెడ్డిని గూర్చి పాణెం నరసరామయ్య గారు వ్రాస్తేబుడ్డా వెంగళ రెడ్డి ని గూర్చి గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్రాసినారు. ఇరువురు ఇప్పటి కర్నూలు వారే. అసలు నరసరామయ్య గారిది ఉయ్యాలవాడే.సారస్వతమునజ్యోతిశామున మహా పండితుడు.ఒకప్పటి గవర్నరు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి గురుతుల్యులు. వీరి పుస్తకములు పాఠ్యాంశములుగా వెంకటేశ్వర కర్ణాటక విశ్వవిద్యాలయములలో పాఠ్యాంశములుగా ఉండినవి. వీరు జ్యోతిశములో సిద్ధ హస్తులు.B.V. రామన్ గారి అష్ట్ర లాజికల్ మాగజిన్ కు ఎన్నో వ్యాసాలను అందించినారు. ఎందఱో నాయకులకువారి భవిష్యత్తును గూర్చి చెప్పినారు. వారు చెప్పినట్లు ఆయా నాయకులకు జరగడమే వారి విద్వత్తుకు కారణము.

వారి స్వంత మేనల్లుడు నంద్యాల గోపాల్ మరియు నేను పక్క పక్క ఇండ్లవారమే కాకుండా సహా పాఠకులము చక్కని స్నేహితులము. బాల్యములో నా స్నేహితుని ఇంటికి వారు వచ్చినపుడు వారిని చూసేవాడిని. కాని వారి జ్ఞానమును గుర్తించే జ్ఞానము ఆ వయసులోనాకు లేదు. పూర్వ జన్మ సుకృతము వల్ల ఆయన నా 45 సంవత్సరాల వయసులో తారసిల్లినారు. అప్పుడు వారికి ఆతిథ్యము ఇచ్చే అదృష్టానికి నోచుకొన్నాను. వారు ఎంతో ఆప్యాయముతో స్వ దస్తూరి తో ఇచ్చిన 'స్వాతంత్ర్య వీరుడుపుస్తకము నా పుస్తక మణిహారములోని పతకములో పొదిగిన అనర్ఘ రత్నము.ఇది 18.12.1984 న జరిగిన ఉదంతము. ఆ పిదప వారిని తిరిగి కలిసే అవకాశము భగవంతుడు నాకు సమకూర్చలేదు. వీరి మేనల్లుడు నంద్యాల గోపాల్ ఆంద్ర ప్రభ సబ్ ఎడిటర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి YSR, చంద్రబాబు వంటి నాయకుల మెప్పులు పొంది చిన్నవయసులోనే తనువు చాలించినాడు.

అసలు ఈ ఇద్దరి చరిత్రలను కావ్యములగా వ్రాసిన ఈ మహనీయులకు  ఆలంబనము  మరొక మహా మనీషి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఆయన పరిశోధనా ఫలితమే ఈ వాస్తవ గాధా కావ్యములకు ఆలంబనము.

వీరు అటు నరసింహారెడ్డి గారిని గూర్చి వారి వంశీకులైన కర్నాటి అయ్యపురెడ్డి గారినుండి (రూపనగుడి అన్న వూరి గ్రామ మునసబు) బుడ్డా వెంగల రెడ్డి గారిని గూర్చి వారి వంశీకులైన బుడ్డా శివారెడ్డి గారు మరియు బుడ్డా దస్తగిరి రెడ్డి గారి నుండి అంతో విషయమును ఎన్నో వివరములను సేకరించితానూ స్వయముగా ఎంతో కృషిచేసి రెండు పెద్ద వ్యాసములుగా ఘారతి లో ప్రచురించి యుండినారు.1999 లో తిరిగీ వీరు బసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు ముక్కామల్ల నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహముతో ఆ మహానుభావులకు 'రేనాటి సూర్యచంద్రులుఅన్న పేరును పెట్టి Andhra సారస్వత వినీలాకాశము పై సూర్యచంద్రులుగా సుస్థిరము చేసినారు.ఎంతో మంది సుబ్బారావులు వారిలో 'అబ్బాఅనిపించే సుబ్బారావులు ఎంతమంది .
 ఇక తిరిగి విషయానికొస్తే ఈ 'స్వాతంత్ర్య వీరుడుఅన్న పేరుతో వ్రాయబడిన నరసింహారెడ్డి గారి చరిత్ర పూర్వాపరములు శ్రీయుతులు పెండేకంటిి వెంకట సుబ్బయ్య గారు (మాజీ బీహారుకర్నాటక రాష్ట్ర గవర్నరుగానే గాకకేంద్రములో గృహ మరియు ఉభాయసభా వ్యవహార మంత్రిగా యుండినారు.) ఈ విధముగా తెలిపి యున్నారు. "నా పర్యవేక్షకత్వమున ఉయ్యాలవాడలో జరిగిన రైతు మహా సభలో స్వాగతోపన్యాస సందర్భమున శ్రీ పాణ్యం నరస రామయ్య గారు ఈ క్రింది పద్యము చదివినారు:
" అమిత ప్రాభవ సర్వసైన్య సముపెతాంగ్లేయసామ్రాజ్య సిం
హము మీసల్ నులిబెట్టి లాగుచు నుదగ్రాటోప వీరోచితో
ద్యమ సంరంభమొనర్చునట్టి 'నరసింహారెడ్డి'కాస్థాన రం
గముగా భూరి యశంము గాంచినది మా గ్రామంబు పూర్వంబునన్ "
 అప్పుడు సభనలకరించిన కీర్తి శేషులగు దామోదరం సంజీవయ్యగారు (ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి)కల్లూరు సుబ్బారావు గారు (1967 లో పద్మశ్రీ గ్రహీతఅనంతపురము కలెక్టరు రూథర్ ఫోర్డ్ తో కాంగ్రెసు సింహము అని అనిపించుకొన్న మహానుభావుడు)  కళా వెంకట్రావు గారు (మాజీ రాష్ట్ర అమాత్యులు ) ఆ పద్యమునకు ఆకర్షితులై ఆ వీరయోధుని చరిత్ర వ్రాయమనుట జరిగింది. అప్పుడు తంగిరాల వారి పరిశోధనా సారమును గ్రహించి స్థానికుల నుడి ఇంకను అనేక వివరములను సంగ్రహించి నరసరామయ్య గారు కాయ రచనకు పూనుకొన్నారు. " వీరికి కీర్తి శేషులు కర్నాటి అయ్యపురెడ్డి గారు మరియు K.C. వెంకట రెడ్డి గారు బాసటగా నిలిచి ఈ కావ్యమును బాహ్య ప్రపంచము చూడగలుగు అదృష్టము కలిగించినారు. ఈ పొత్తము రాశిలో చిన్నదే కానీ వాసి లో గొప్పది. ఇది వెంకటేశ్వరా విశ్వవిద్యాలయ విద్వాన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథముగా యుండినది.వీరు కవిగా ఆంద్ర ప్రదేశ ప్రభుత్వముచే సన్మానింప బడినారు.
వీరి మేనల్లుడు నంద్యాల గోపాల్ ఆంద్ర ప్రభ సబ్ ఎడిటర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి YSR, చంద్రబాబు వంటి నాయకుల మెప్పులు పొంది చిన్నవయసులోనే తనువు చాలించినాడు. ఆతని నిధనమునకు వీరందరూ స్వయముగా వచ్చుటయే ఆతని గొప్పకు తార్కాణము.
మొదలు వీర నరసింహా రెడ్డి గారిని గూర్చి తెలుసుకొందాము. దానికి ఉపోద్ఘాతముగా అచ్చటి రెడ్డి గార్ల మనస్తత్వము అవలోకించుదాము.రాయల సీమ రెడ్ల మానసిక స్వభావము శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటలలో
" కరుణ కల్గేనేని శరణన్న శత్రువు
నైన కాచి విడుచు నాత్మ బలము
పగయ గల్గెనేని పర తన భేదమ్ము
చూపకుండా చంపనోపు ఛలము "
మెత్తనైన వారిచిత్తము మొత్తము నా మాటలలో
మెత్తనైన మనసు మేలుచేయు గుణము
ఆదరమ్ము యొప్పు అతిధి సేవ
ముగుద జడన గల్గు  మూడు పాయలబోలు
సీమ రెడ్డి గార్ల చిత్త మెపుడు
ఈ మాటను బలపరుస్తూ 51, 52 సంవత్సరాల క్రితము  భారతీయ స్టేట్ బాంక్ లో నా ఉద్యోగ కాలములో జరిగిన ఉదంతము నొకదానిని తెలిబరచుతాను. 
మిగిలినది మరొకమారు...........
ఉయ్యాలవాడ సూర్యచంద్రులు-2
అప్పటికి bank లో నేను  గుమాస్తా గా చేరి ఒక రెండు సంవత్సరములు అయి ఉండ వచ్చు.(కాకినాడ) రామచంద్ర పురము నుండి ఒక వ్యక్తిని తాత్కాలికముగా కడప జిల్లా లోని జమ్మలమడుగు కు బదిలీ చేసియుందడినారు . జమ్మలమడుగునేటి కడప కర్నూలు జిల్లాల ఎల్ల.రాయలసీమకు ఆతను క్రొత్త. కానీ అతని క్రొత్తదనమునాతో మాత్రము రెండు మూడు రోజులలోనేపోయి నాకు చాలా ఆప్తుడైనాడు. తాను చూడకముందు కడప పై ఏర్పరచుకొన్న అభిప్రాయమును పూర్తి గా మార్చుకొన్నాడు. కాలాంతరములో అతను తన స్వస్తలమునకు పోయినాడు కానీ మళ్ళీ అక్కడినుండీ వేరొక వ్యక్తిని CASH OFFICER గా  అక్కడినుండీనే post చేసినారు. నా మొదటి మిత్రుడు నా పేరు చెప్పి ఇతనిని పంపినాడు.
 ఈయన నన్ను కలిసిన వెంటనే, "మా ప్రాంతాలలో ఎవరైనా తప్పు చేస్తే పై అధికారులు నిన్ను జమ్మలమడుగుకు transfer చేస్తాననే వారండీ"అన్నాడు. "మీరు భయపడనవసరము లేదు. నేను మీకు నాకు చేతనైన అన్ని విధాలా సహాయ పడగలను" అని నేనన్నాను. అతనికి కాస్త ఊరట లభించివుంటుంది.
 CO (CASH OFFICER) కాబట్టి కోశాగారము లోని డబ్బు బంగారు నగలు సరిచూచు కొనుట ఆరంభించినాడు. మాకు Branch సాయంకాలము 5 గం. ల వరకైనా clerks అంతా పని కలిసి మెలిసి చేసి main day book tally చేసి 4 ,4-30 గం. లకు ball badminton  ఆడను పోయే వాళ్లము. సాయంకాలము 6 గం. లకు play ground కు messenger ఆఘమేఘాల మీద వచ్చి " సార్ మిమ్మల్ని కొత్త CO సారు సైకిల్ లో కూర్చోబెట్టుకొని వెంటనే పిలుచుక రమ్మన్నారు " అన్నాడు. నా చేతిలోని bat (racquet అనవలెనేమో) వేరే స్నేహితునికి ఇచ్చి వెంటనే అతని తో సైకిల్ లో బయలుదేరినాను. Branch లోనికి వెళ్ళగానే ఆయన చాలా భయ పడుతూ కనిపించినాడు. నన్ను చూసిన వెంటనే ప్రక్కకు గొనిపోయి "సార్ దొంగ బంగారు నెక్ లెస్ బయట పడింది వెంటనే హైదరాబాదు లోని head office కు తెలియబరుస్తాను" అన్నాడు.
 నేను అతనిని చల్లబరచిమీరు ఈ పనిని రేపు ఉదయము కూడా చేయ వచ్చును కాబట్టి మనము ప్రొద్దుటే bank jeep లో ఈ లోను తీసుకొన్న వ్యక్తి వద్దకు పోయి విషయము తెలుసు కొందాము. అంతవరకు ఏమీ చేయవద్దు.మీరు తొందరపడితే మీకు charge ఇచ్చే వ్యక్తికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆలోచించండి. మనము వాస్తవము తెలుసుకొన్న పిదప ఒకవేళ అతను నిజముగానే తప్పు చేసి ఉంటే తప్పక head office కు తెలియబరచుతాము " అన్నాను. ఆయనా సరేనన్నాడు. ప్రొద్దుటే, bank 10 గం. లకు మొదలు కావలసినది ఉన్నా 8 కె జీపులో ఆ లోను తీసుకొన్న రెడ్డిగారి ఇంటికి బయలు దేరినాము. జీపు అందులో నన్ను చూసి అతను గుర్తించిఉదయము కాబట్టి మరియు పెడ నీళ్ళు చల్లుటవల్లచల్లగా వుంటుంది కాబట్టి బయట మంచము వేసి దానిపై దుప్పటి పరచి కూర్చో బెట్టినాడు.

విషయము చెబుదామని నేను నోరు తెరిచే లోపలే " సార్ gold lone విషయములో ఏదయినా గోల్మాల్ జరిగిందా " అన్నాడు. ఆశ్చర్య పోవటం మా వంతైనది.  నేను " అవును రెడ్డి అందుకే వచ్చినాము అన్నాను." మిమ్ముల చూస్తూనే నాకు అర్థమైనది సార్. మా అన్న చాలా దుర్మార్గుడు. మా అమ్మ నాయన ఇటీవల లోను తీసుకోనేదానికి కొద్ది రోజుల ముందుగా మరణిస్తే వెంటనే భాగ పరిష్కారము చేసినాడు. అప్పుడు ఈ నేకేసు నాకు వద్దు దీనికి బదులు గాజులు ఇవ్వు అని అన్నా కూడా ఇదే ఇచ్చినాడు. ప్రోద్దుటూరిలో (ప్రొద్దటూరు బంగారుకు ప్రసిద్ధి) కంసాలివద్ద ఈ నెక్లెసు తీసుకొనేది నా స్నేహితుడు చూసి నాకు చెప్పినాడు. నాకు పొలం పనులకు డబ్బు అవసరమై ఈ నగ bank లో పెడితే ,ఇది అసలా నకిలీనా అనేది తెలుస్తుంది మంచిదైతే నాకు లోనూ వస్తుందని పెట్టినాను. మీ వాళ్ళు లోను ఇచ్చినండువాల ఇది మంచిదనుకొన్నాను. మీరు భయపడ నవసరము లేదు. ఇప్పుడే మీతోబాటు వచ్చి డబ్భు కట్టేస్తాను. పంటడబ్బులున్నాయి అని ఇంట్లోకి వెళ్లి డబ్బు తీసుకొని చొక్కా వేసుకొని మాతోనే బయలుదేరినాడు.
 కథ సుఖాంతము. కొత్త CO ఆ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పి పంపిన తరువాత నా చేయి పట్టుకొని "మీ సహాయము మరవను అని అంటూ ఈ రోజుతో మీ రాయల సీమపై ఉన్న అభిప్రాయమును పూర్తిగా మార్చుకొంటున్నాను. మా ప్రాంతము లో ఇంత నిజాయితీ చూడలేము" అన్నాడు. ఆయనకు ఆ వూరు ఎంత నచ్చిందంటే retire కాబోయే మునుపు LFC లో ఆవూరు వెళ్లి అందరినీ పలుకరించి వచ్చినాడు. అప్పుడు నేను మద్రాసు లో ఉన్నందువల్ల ఆయనకు తెలియక కలువలేక పోయినాడు. ఆ విషయము ఇటీవల అనుకోకుండా కలిసినపుడు ఆయనే చెప్పినాడు.
ఇక్కడ అన్న దుర్మార్గుడే కానీ మోసగించింది తమ్ముడినేపరులను కాదుఅదీ ఆస్తి కోసము గడ్డితిని. ఇక ఆ తమ్ముని మంచితనము మనసారా గుర్తించండి.అక్కడి ప్రజలుముఖ్యముగా రెడ్లు ఇంత మంచి స్వభావము కలిగి యుంటారు. ఈ జమ్మలమడుగు నొస్సముకోవెలకుంట్లపాణెము మొదలైనఇంచు మించు 80 ప్రాంతాలు కడప మండలము క్రింద వుండవని విన్నాను. దీనినే కాకుండా ఇంకా కర్నూలు (కందెన ఓలు ) బళ్ళారి అనంతపురము లొని అనేక ప్రాంతాలను కలిపి రేనాడు అనేవాళ్ళు. కర్నూలు కడప కు ముస్లీములను నిజాం నవాబు నియమించియుండినాడు. తరువాత కాలములో ఈ మొత్తము రేనాటిని ఆంగ్లేయులకు ధారపోసినాడు.
ఇక ముందుకు, నరసింహారెడ్డి గారిని గూర్చి తెలుసుకొందాము...........

 ఉయ్యాలవాడ సూర్యచంద్రులు-3 

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

 

ఇక నరశింహా రెడ్డి గారి రూపు రేఖలు ఎంత ధీర గంభీరంగా వున్నాయో చూస్తాము, కవి శేఖరులగు కీ.శే, నరసరామయ్య గారి పలుకులలో:

కలికి తురాయి గిల్కొలుపు పట్టు రుమాలు

గట్టిన యుత్తమాంగమ్ము తోడ

వైష్ణవ భక్తీ భావము చాటు నూర్ధ్వపుం

డ్రమ్ము నీటు గొల్పు ఫాలమ్ము తోడ

గ్రేవల కెంజాయ రేకలింపారు నా

తత దీర్ఘ నేత్రముల తోడ

జిరు నిమ్మకాయల నిరువైపు నిల్పుకో

జాలిన గుబురు మీసముల తోడ

వైరి హంవీర విదళన ప్రళయకాల

దండ నిభ ఖడ్గ కలిత హస్తంబు తోడ

ప్రజకు భయభక్తి సంభ్రమ భావములను

గొలుపు వర్చస్సు తోడ నబ్బలియుడలరు

కలికి తురాయి కలిగి పట్టుబట్టతో చుట్టిన తలపాగా గలిగిన శిరస్సు గలవాడై,వైష్ణవాచార సంపన్నతను చాటునట్టి ఊర్ధ్వ పున్ద్రములు గలిగిన వాడై,కెంజాయగల ఆకర్ణాంత లోచనుడై, చిన్న నిమ్మకాయలను నిలబెట్టగల పురితిప్పిన మీసములు గలవాడై, వైరి వీరుల ప్రాణాంతకమగు యమదండమును బోలిన ఖడ్గము గలవాడై, ప్రజలలో భయము, భక్తి, సంభ్రమ,విభ్రమాది  భావాలను కలిగించు ముఖ వర్చస్సు కలవాడై ఆ మహావీరుడు యొప్పారుచుండెను. చూచినారు కదా నరసరామయ్య గారి పద్యవిన్యాసము.ఒక్క సీసములో మొత్తము రెడ్డిగారి రూపు రేఖలే కాక గుణగణాలు కూడా కళ్ళకు చిత్ర రూపమును ఎంతో విచిత్రముగా చూపించినారు. ఇక జానపదుల మాటలలో ఆయన వీరత్వమును గమనించుదాము.

సై సై నరసింహా రెడ్డి ,రెడ్డి

నీపేరే బంగారపూ కడ్డీ

రాజారావు రావు బహద్దర్ నారశింహ రెడ్డి

కరువు వచ్చినా కాటక మొచ్చిన ఆదరించె రెడ్డి

అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ

అంటూ నాలుగు గ్రామాలందున మంది లేచినారు

 

అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి

పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి

చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి

ఆల మందలో పులి దుమికిన చందాన దూకినాడు

ముల్లు కోల తన చేతినవుంటే మున్నూటికి బదులిస్తాడు

 

మన దేవుడినే మట్టు పెట్టుటకు వచ్చిరి తెల్లోల్లు

రెడ్డి కోసము ప్రాణం పోయిన స్వర్గం వస్తుంది

ఈపోద్దిదియ రేపు తదియ రా, బెదుర బోకుమోయి

నీటిమీదను బుగ్గ వంటిది నరుని పానమోయి

నీతి మాలిన తెల్లోల్లను తెగ నరుకుదాము రండోయ్

ఇది మా రోజులలో జానపదుల నోళ్ళలో ఎప్పుడూ నానుతూ వుండేది. ఈ పాట బాణీని.తల్లా పెళ్ళామా అన్న సినిమా లో ననుకొంటాను,

రాజనాల పై 'సై సై జోడెడ్లా బండి బండి . ఇది మేలైన దొరలా బండి' అన్న పాటకు వాడుకోన్నారని నా సహపాటి, ఆప్త మిత్రుడు మరియు జానపద బ్రహ్మ బిరుదాంకితుడు కీర్తి శేషుడు మునయ్య చెప్పేనాడు.

నరసింహా రెడ్డిపుట్టుపూర్వోత్తరాలు

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలో 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీభరణాల ఏర్పాటు చేసింది.ఒకప్పుడు కడప పాలెగాళ్ళ ఏలుబడిలో వున్నఉయ్యాలవాడ గ్రామం ఇప్పుడు, ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సంజమీదారు అయిన చెంచుమల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి. నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించినారు.

 

భరణము తెల్ల వాడయిన తహశీలుదారు పంపకపోవడముతో రెడ్డి తన వార్తాహరుని  యాతని వద్దకు పంపవలసి వచ్చింది. గతములో

ఎప్పుడో తనకు మర్యాద ఇవ్వలేదనే నెపముతో ఆతను ఆ వచ్చిన వ్యక్తిని అవమాన పరచి, "మీ రెడ్డికి అవసరమైతే తననే వచ్చి తీసుకొమ్మను" అని అవమాన పరచి పంపినాడు తనకు రోజులు తీరినాయని తెలుసుకోలేక. 1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, గతములో రెడ్డిగారు తనకు తగిన మర్యాద ఇవ్వలేదనే అపోహను కారణముగా చూపి, ఆ వచ్చిన వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు. 1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో,తన అంగ రక్షకుడు వడ్డె ఓబన్న వెంటరాగా  కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసినాడు. వచ్చినాడని తెలియగానే తలుపులు లోపలికి బిగించుకొని కిక్కురుమనకుండా లోన కూర్చున్నాడు. అంతట భీషణ రోషారుణజ్వాలానేత్రుడై, ఆ అరుణ కాంతి ముఖమండలమంతయు వ్యాపించ" నా కరవాలమును నిచ్చెనగా చేసి నిన్ను యమసదనమునకంపెద" ననుచు తన ముష్టిఘాతంముచే ఆ తలుపులు బ్రద్దలు జేసి ,నరసరామయ్య గారి మాటలలో, ఈ విధముగా చంపినాడు.

కరకర పండ్లు నూరి చెడుగా! ఇటు రమ్మని పట్టి ఈడ్చి ని

ర్భరమగు నక్కసమ్ము మెయి, వాని శిరమ్మును కాలదన్నుచున్

గరకు కటారు కేలగొని గ్రక్కున వైవ,శిరమ్ము మొండెమున్

ధరణిపయిం బడెన్ రుధిర ధారలు మందిరమెల్ల జిమ్మగన్

వానిని ఆ విధముగా పరిమార్చి బొక్కసము వైపునకు దారి తీసినాడు రెడ్డి తన అంగ రక్షకునితో. అక్కడ తారసపడినాడు క్షత్రియుడగు 'బొందిలి నారసింగ్' అనెడు ఖజానా కాపుదారు. వీరి పూర్వీకులు బుందేలుఖండ నివాసులట. రెడ్డి అతనితో "మనము మనము కొట్టుకొని చచ్చుట ఎందుకు మాతో కలసిన అందరమూ కూడి ఆంగ్లేయులను ప్రతిఘటించూదాము" అని అన్నాడు. అప్పుడా వీరుడు " మీ మాట ఎంతో సమంజసముగా వున్నది కానీ నాకు ఆంగ్లేయులతో ఉప్పు తిన్న ఋణమున్నది. కడుపు కాలే నాకు నౌకరి ఇచ్చి నా సంసారాన్ని నిలబెట్టినారు. నేను భారతములో కర్ణుడనైనాను. ఋణము తీర్చుకోనక తప్పదు" అంటూ చేతిలోని తుపాకీ వదిలి నడుమున వున్నా కరవాలమును సర్రున లాగినాడు. అంతలో అంగ రక్షకుడైన ఒడ్డె ఓబన్న అడ్డుపడి తన కరవాలమును అడ్డువేసి, యుద్ధము చేసి అతనిని కూలవేసినాడు.మరి నారసింగ్ కు ఉన్న కృతజ్ఞత అసలు ఆంగ్లేయులకే ఉండివుంటే మన దేశమును మోసము తో పొందియుండరు కదా! ఆ విధంగా అక్కడ కత్తి దూసిన సిబ్బందిని పరిమార్చి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను గ్రహించి తనకు ముత్తవలసింది తీసుకొని మిగతది పేదలకు పంచి అచటి నుండి వెడలినాడు రెడ్డి. ప్రొద్దుటూరు సమీపంలోనిదువ్వూరు ఖజానాను కూడా కొల్లగొట్టినాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి కడప తాత్కాలిక మండలాధిపతి యైన 'కాకరెన్' అనువాడు ఈ అవమానమును తన అవమానముగా భావించి తన సైన్యమున కొంత ఉయ్యాలవాడకు పంపించెను. రెడ్డి గారు కత్తి చేతబూని తన గృహము బయటికి వచ్చి "నాదేశస్తులగుటచే,మీతో నాకు వైరము లేదు కావున, మొదటి తప్పుగా భావించి మిమ్ము ప్రాణాలతో వదలుచున్నాను. మీరుతెచ్చిన కత్తులు కటార్లు ఈటెలు బాకులు తుపాకులు అన్నింటిని సమర్పించి  తిరుగు ముఖం పట్టండి." అన్నదే తడవుగా పరుగెట్ట ప్రారంభించిందా సైన్యము.అహంకార పూరితులౌ తెల్ల దొరలకు ఇది కంటగింపాయెను. 

మిగిలినది ఉయ్యాలవాడ సూర్యచంద్రులు - 4 లో ...........

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు  - 4

రెడ్డిగారు ఒక సందర్భములో తన అనుచరులతో ఈవిధంగా చెబుతారు :

దైవ వశమున తహశీలు దారు గాథ

కాకతాళీయమైయోప్పే గాని, మునుపే

సిద్ధపడియుంటి, నీ విదేశీయ విభుత

పైని, మన ప్రాంతమందు విప్లవము రేప

అంతటి దేశాభిమాని ఆయన.

తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలినాడు. సహృదయుడు వీరాగ్రేసరుడు అయిన   ఔకు దుర్గాన్ని పాలించే, కృష్ణ దేవరాయల అల్లుడైన అళియ రామామరాజు గారి గోత్రికుడైన నారాయణరాజుతో మంతనాలు జరిపి తగిన సమయములో ఆంగ్లేయులపై దండెత్తుటకు తగిన సమాలోచనలు జరిపినారు. తన సహాయము అన్ని విధాలా ఉంటుందని రాజు గారు రెడ్డి గారికి మాట

ఇచ్చినారు.రెడ్డి తన బస నోస్సము కోటకు మార్చుకొన్నాడు . ఆకు మళ్ళ అన్న ఊరిలో బస చేసిన గోసాయి వెంకన్న అన్న బైరాగి మరియు యుద్దవీరుని చేర దీసినాడు రెడ్డి . ఈ గోసాయి దాదాపు 20 మైళ్ళ దూరమున జరిగే విషయాలు చెప్పగలిగే వాడట. అంటే సంఘటితమైన దాడుల గూర్చి తెలుపగలిగేవాడు . ఇది ఇట్లుండగా ఆంగ్లేయులు లేఫ్టినంట్ కల్నల్ వాట్ సన్ అనువానిని రెడ్డిని బంధించుటకు నియోగించినారు.రెడ్డి మహాదాశ్యమును గౌరవించినవారై ' ముక్కమల్ల' 'ముదిగోడు' 'కానాల' 'సంజామల' మొదలగు జానపదముల బోయలంతా రెడ్డి పక్షమున జేరి తెల్లవారి బ్రతుకును తెల్లవార్చాలనుకొన్నారు. ముట్టడిలో రెడ్డి గారు ఆంగ్లేయులు ఎట్లు తలపడినారన్నది , శ్రీ నరసరామయ్య గారు ఈ విధముగావర్ణించుచున్నారు:

వడిసెల రాల్ శరంబులు తుపాకుల గుండ్లను రెడ్డి సైన్యముల్

వడి గురిపింపజొచ్చె జడివానగ దుర్గమునుండి హూణులుం

బెడిధముగా శతఘ్నికలు పెల్చుచు భీకర మారణాస్త్రముల్

విడుచుచు  బోరసాగిరి , కడింది మగంటిమి కచ్చె మీరగన్

ఆంగ్లేయుల శస్త్ర,సైనిక సంపత్తి చాలలేదు.రెడ్డి చండ ప్రచండుడై వెలుగొందు చుండ తెల్లవారన్న తెల్ల కాలువలు వాడి, వడలి , కమిలి నల్లగా అయిపోయినాయి. పాలు పోవని వాట్ సన్ మార్గాంతరము గానక తమ ఆయుధ గిడ్డంగులున్న బళ్ళారి నుండి మందు గుండు సామాగ్రి కి పురమాయించినాడు. అది పసి కట్టిన నారాయణ రాజు మహాశయుడు తన బుద్ధి బలముచే , వారు ఆయుధములు తెచ్చునపుడు మార్గ మధ్యమున ఛద్మ వేషములలో యుక్తి యుక్తముగా

వారిని పారద్రోలి ఆయుధములను చేజిక్కించుకొన్నాడు. తనకత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని నియమించి ఈ వార్తను రెడ్డి కి చేరవేయమన్నాడు రాజు. ఆతడు అర్థ రాత్రమున, ఆంగ్లేయులు కోట బయట నిదురించునపుడు తన బాణమునకు సందేశమును సంధించి కోటలో బడునట్లు చేసి తన దారిన తానూ పోయినాడు. ఆ వార్తను విని రెడ్డి పరమానంద భరితుడై రెట్టించిన ఉత్సాహముతో, ఆహా సహవసమునకు రాజు ఉపమానము కదా యని తలంచి,పోరుచేయ దొడగెను. బ్ర.శ్రీ. నరసరామయ్య గారి మాటల్లో రెడ్డి దక్ష యజ్ఞమున వీరభద్రుని వలె ఏ విధముగా వైరులను దునిమినాడంటే :

నడుము దాపల యున్న యదిడంబు చేబూని

శిరములు పైకెగజిమ్మిజిమ్మి

మొలనున్న పిడిబాకు వలనొప్ప ధరియించి

కుఉతుక క్రోవులన్ కోసికోసి

కడిమి మూపున నున్న గండ్రగొడ్డలి దాల్చి

కరములు పాదముల్ నరికి నరికి

తురగంబుపై భద్రపరచిన బల్లెంబు

గొని,వడి రోమ్ములం గ్రుమ్మిగ్రుమ్మి

దక్షవాటీ భయానకోద్దండ మూర్తి

వీరభద్రుని యాపరావతారమనగ

జండతేజుండు, రెడ్డివీరుండు,సమర

సీమ  పీనుగు పెంటగా జేసి వైచ

రాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా పగులునంటారు పెద్దలు. ఇద్దరు HOT SUNS తో యుద్ధము చేయలేక WHAT SON తోక ముడుచుకొని తన ఆంగ్లబలముతో వెనుదిరిగినాడు. ఈ దుండగులు తిరిగీ రెట్టింపు సైన్యముతో దాడి చేయగలరని భావించిన రెడ్డి, నోస్సము మైదాన ప్రాంతమయినందువల్ల , తన నెలవును నలమల శ్రేణి లోని అహోబల  క్షేత్రమునకు యోజనము దూరము ఉత్తరమునగల చిక్కటి అడవి ప్రాంతమున గల దుర్గమమైన దుర్గమునకు మార్చినాడు. ఆ సమయమున Forest Ranger ఒకడు అమిత కౄరుడై అడవుల నానుకొనియుండు పల్లె వాసులను నిర్దాక్షిణ్యముగా హింసించుచుండెను. ఆతని దురాగాతములకు ఓర్వలేక ఆ పల్లెల ప్రజానీకములోని ప్రముఖులు ఆంగ్లేయుల పోబిడి (కదలికలు) తెలుసుకోన పల్లెలలో తిరుగు రెడ్డి గారి గూఢచారులతో తమ మొరలను ఆయనకు వినిపింప జేసినారు. అది మొదలు ఆయన కూడా ప్రమత్తుడై ఆ Ranger కదలికలను గమనించ సాగినాడు. ఒకనాడు వాడు 'రుద్రవర'మను గ్రామమున ఉన్నాడని తెలిసి తన బహిఃప్రాణమైన వడ్డె ఓబన్నతో బయలుదేరినాడు. రేంజరు బంగాళా ముందు నిలిచి 'రారా బయటికి' అని ఒక్క ఉరుము ఉరిమినాడు రెడ్డి. అంతే, పలాయన మంత్రం పఠించినాడు రేంజరు.ఊరిలో ఎవరూ ఆశ్రయమివ్వకపోగా ఒక చాకలి వానిని ఆశ్రయించి డబ్బు ముల్లెను ఆశ జూపి ఆతని మైలబట్టల గుట్టలో దాక్కొన్నాడు. రెడ్డి కూడా వానిజాడ తెలుసుకొని చాకలి ఇంటిని చేరుకొన్నాడు. రెడ్డి రోషారుణ నేత్రాలను చూసి పండుటాకువోలే పదురనారంభించినాడు చాకలి. తన భయములో మైలబట్టలవైపు పదే పదే చూచుచున్న చాకలిని గమనించినవాడై ఆ ధూర్త కిరాతకుని పసిగట్టి జుట్టుబట్టి బయటికి లాగి నిర్దాక్షిణ్యముగా నరికినాడు. వణుకుచున్న మడేలన్నను మందదలించి,బయటికి వచ్చి, పారిపోవుచున్న ranger యొక్క ఇద్దరు అనుచరులను ఓబన్న తో కూడా వెంబడించి ఇరువురు వారి కుత్తుకలనుత్తరించినారు. అదే సమయములో రెడ్డికి కంభము మొదలగు ప్రాంతముల వారంతా ఇతోధికముగా ధన ధాన్య వస్తు సముదాయముల నివ్వగా ఆ ప్రాంతపు తహశీలుదారుడైన ఒక భారతీయుడు  పదవీ వ్యామోహముచే రెడ్డి కదలికలను చేన్నపట్టణములోని తన ప్రభుత్వమునకు చేరవేయనారంభించినాడు.తన వేగులచే సమాచారమందుకొన్న రెడ్డి చెడిన శరీరాంగమునుత్తరించకున్న శరీరమునకే చేటు కలుగునని తలంచి ఆతనిని చంప నిశ్చయించెను. ఇంతలో ఆ ప్రాంత ప్రజలు, బహుశ సంక్రాంతి పండుగ ఏమో, వేడుకలలో భాగంగా కోడి పందేముల నిర్వహించ దలచి రెడ్డి గారిని కూడా రమ్మని మనసారా ఆహ్వానిన్చినారు.రెడ్డి కూడా మ్లేచ్చులతో పోరి యలసిన వాడైనందున సంబరాలలో తాను కూడా పాలుపంచుకోనెంచినాడు. ఈ విషయమును తెలుసుకొన్న తహశీలుదారుడు తెల్లవాడైన అప్పటి పోలీసు సూపరింటెండెంటును తోడు గొని ఎంతో ఆనందముగా కోడిపందెములు చూచుచున్న రెడ్డిని పోలీసులతో చుట్టుముట్టినాడు.తన చుట్టూ రక్షణ వలయమునేర్పరచ దలచ రెడ్డి వారిని వారించి ఆగ్రహోదగ్రుడై కరవాలము కైగొని వారి పై బడెను . ప్రాణములనరచేతనుంచుకొని తహసీలుదారుడు సుపరింటెండెంటు పరుగెట్ట నారంభించినారు.రెడ్డి వారిని పట్టి పీకలు గోసి మాత్రు భూమికి రక్త తర్పణము గావించినాడు.ఓబన్న మిగత సైన్యముతో పోలీసులను విగత జీవుల జేసినాడు. ఈ వార్తను విని తెల్లబోయిన తెల్లవారు ఇక ఏమాత్రము జాప్యము చేసినా తమ ఉనికికే మోసము వాటిల్లగలదని తలంచి 'కెప్టెన్ నార్టన్' అను వానిని విరివిగ సైన్యమునే కాక సాధనములను కూడా నొసంగి, రెడ్డిని  ఇక ఉపేక్ష చేసిన తమ ఉనికికే ముప్పు వాటిల్ల గలదని తలంచి , ఆ మహావీరుని తుదముట్టించ పంపినారు. రెడ్డి ఈ వార్తలు విని అప్రమత్తుడై తన సైనిక బలంబులను వ్యుహాత్మకముగా యుండజేసి యుద్ధమునకు సంనద్ధమాయెను. నార్తను గిద్ధలూరి వద్ద తన సైన్యమును విడిది చేసి యుద్ధతంత్రమును తన అనుయాయులకు వివరించి , రెడ్డి కోటకు ముందు మార్గమును ఏర్పరచ నాజ్ఞాపించేను. వారు అంతయును అదేవిధముగా అమలుజేసిన పిదప, మెరుపు దాడులచే తెల్లవారి ప్రాణములు కొల్ల గొట్టేను.స్వేతమూకలకు చేతగాక చింతించుచున్న తరి నార్టన్ బళ్ళారి నుండి మరుల సైన్యమును రప్పించెను. సంగ్రామము భీషణమై రెడ్డి దండుకు గూడా బహుళముగా ముప్పు వాటిల్లెను.మంచినీటి బావులలో నీటి మట్టము బాగా తగ్గిపోయి త్రాగునీటికి తల్టట ఏర్పడెను. ఇంతలో రెడ్డిగారి సతీమణి అనారోగ్యముతో స్వర్గాస్తురాలయ్యెను. కాశీ కి వెళ్ళిన తల్లి విశ్వనాథ దర్శనముతో, వెనుకకు రాలేక, కైలాసమును జేరెను. అచంచల మతియైన రెడ్డి ఇదియంతయు దైవఘటన యని తలచి, శత్రువుల సంఖ్యా బలమును అంచనా వేసి, మాసముల పర్యంతము యుద్ధము చేయుటవలన తమ కోటలోని అనుపానములన్నియు శత్రువులకవగతమైయుండునని తలపోసి తన నెలవు ఎర్రమల ప్రాంతమునకు కోట వెనుకవైపు దారినుండి తన ముఖ్య అనుచరులతో మార్చినాడు. అచ్చట,పేరుసామల అన్న వూరికి దగ్గరగానున్న  జగన్నాథఆలయమను ప్రాంతమున గల నరసింహస్వామి దేవాలయమును తన స్థావరముగా చేసుకొనెను.ఆ దేవాలయమునకు దగ్గరగు అల్వకొండ యను ప్రాంతము నుండి రెడ్డిగారి బంధువులు తమకు నమ్మకస్తుడనిపించిన నొక గొల్లవానితో ఆయనకు భోజనము పంపెడివారు.

అచట నార్టన్ కోట నుండి ఎదిరింపు గానక  తన యుద్ధ నైపుణ్యమును తానే మెచ్చుకొనుచూ కోట బురుజులను బ్రద్దలు చేసి లోనికి వెళ్లి రెడ్డిని గానక తానూ శిగ్గు పడుటయే గాక రెడ్డి యుద్ధ తంత్రమును మెచ్చుకోనేను. తన వేగులను వేగిరమే రెడ్డిజాడల నేరుకపరచ వినియోగించి రెడ్డిని మట్టుబెట్టు మార్గమునాలోచించ సాగెను.విషయమును తన గూఢచర్య వర్గము ద్వారా తెలుసుకొని , రెడ్డియున్న ప్రాంతమునకు అతి చేరువకాని ప్రాంతములో తన విడిది ఏర్పాటుచేసుకొనెను . రెడ్డిగారి కుడిఎడమ హస్తములగు ఓబన్న వెంకన్నఅహోబల నారశింహుని దర్శనార్ధమై వెళ్ళగా, నార్టన్ ఆ విషయమును గ్రహించి వల పన్ని వారిని స్వర్గస్తులను జేసెను. రెడ్డికిధి ఆశనిపాతమాయెను. విధి బలీయమని తలంచెను కానీ తన పట్టుదలను సడలించలేదు. ఎట్టకేలకు, గొల్లవాని ( వాడు అని ఉపయోగించుటను తప్పుగా అర్థము చేసుకోవద్దు. భాగవతములో నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు ,,, అన్న పద్యమును గుర్తు చేసుకొండి , వంటవాడు , ఇంటివాడు, చేయువాడు  ఇత్యాదులన్నీ యథా ప్రయోగమ్ములు. వ్యాకరణ పరముగా అవి తప్పులు కావు.) విషయము కనుగొన్న వాడై వానికి అపరిమితమౌ డబ్బును ఆశగాచూపి తానూ తీసుకుపోవు ఆహారములో విషము కలిపి రెడ్డికి పంపించు ఏర్పాటు చేయించెను. ఆ ఆశావహుని స్వార్తమునకు ఈ రాయల సీమ సింహము బలియైపోయెను. 1846 అక్టోబరు 6 న స్పృహ తప్పిన రెడ్డిని బంధించి, 1847 ఫిబ్రవరి 22 న, ఊరూరా చాటింపు వేయించి కలెక్టరగు కాక్రేన్ సమక్షములో ఉరి తీయించమని తీర్పు.  అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా ఉత్తరువు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించినారు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా ఉత్తరువు.రెడ్డిగారి ఉరితీతను చూసి కసాయి వాడే  కన్నీరు కార్చినాడని ప్రతీతి.నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినదట. ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూసినారట. ఒక తార నేలవ్రాలెననవలెనో లేక  రెడ్డి తారయై నింగి చేరెననవలేనో నాకు తోచుట లేదు.

ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్నస్వాతంత్ర్యం. ఇటువంటి మహనీయుల గూర్చి తెలుసుకొండి. నాటి దాస్య శృంఖలములు నేడు కనిపించక పోవచ్చు కానీ అంతకన్నా భయంకరమైన దాస్యము లో కొట్టుమిట్టాడుతూవున్నాము.అవి భావ దాస్యము, భాషా దాస్యము,వేష దాస్యము,నడత,నడక అంతా దాస్యమే.మరి ఈ శృంఖల తెంపగలిగినది యువతనే. మనసు పెట్టి ఆలోచించితే అవగతము కాగలదు.

ఎంకోకమారు బుడ్డా వెంగళ రెడ్డి గారిని గూర్చి  .......... 

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు  - 5

వెంగళ రెడ్డి

రెండవ భాగము బుడ్డా వెంగళ రెడ్డి గారి ఔదార్యము దానపరత్వము వారిని గూర్చి వ్రాసిన గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని గూర్చిన పరిచయము తో కాస్త నిదానముగా తెరపైకి వస్తాను. అపర శిబి చక్రవర్తిగా అభినవ రాధేయునిగా గణుతికెక్కిన బుడ్డా వెంగల రెడ్డి గారిని గూర్చితెలుసుకొనుటకు మునుపు వారిని గూర్చి అజరామరమైన పద్యకావ్యము వ్రాసిన పేరుకు ప్రాకులాడని మహా కవిని, ఒక మహోన్నత వ్యక్తిని గూర్చి తెలుసుకొందాము. ఆ మహనీయుని పేరు గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వీరు విశ్రాంత ఉన్నత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాలలో నివసించుచున్నారు. వారు ఆంధ్రమున  ఉప పండితునిగా తమ ఉద్యోగ జీవితము మొదలుపెట్టి ఉన్నత పండితునిగా ఉన్నతి సాధించినారు.వీరి చదువు,ఉద్యోగమూ అదే పాఠశాలలోనే. ఇది వీరి అరుదైన ఘనత. వీరు సంస్కృత, ఆంద్ర,కన్నడ,ఆంగ్ల భాషల్లో అసమాన పండితులు. వారియొక్క పాత విద్యార్థులు అందరుకలిసి ,వారు వారించినా వినకుండా మహాగురు సన్మానమును నిర్వహించినారు.ఎంత కాలము క్రిందటి విద్యార్థులనైనా ఇట్లే గుర్తించ గల్గుట వారి శిష్య వాత్సల్యతకు తార్కాణము.కుటుంబపరముగా కూడా ఎన్నో కష్టాలను సహించి సంసారమును సమర్థవంతముగా నడిపిన ధీశాలి.100 పుస్తకముల రచయిత. వీరు కవనములో చేత బట్టని సాంప్రదాయమే లేదు. అమూల్యమైన పుస్తకములు వ్రాసియు , వాటిపై మూల్యము ప్రకటించక ఉచితముగా పంపిణి చేసిన జ్ఞాన దాత. ఏరోజూ ఎవరినీ ఆశ్రయించక తన పుస్తకములు తానే ముద్రించుకొన్న అపర పోతన్న. కృతి భర్త, ఈ మహనీయులైన 'సూర్యచంద్రులను' ఆంధ్రమన్న నభోమండలముపై ప్రతిష్టించిన అపర భగీరథుడు అయిన శ్రీయుతులు తంగిరాల వెంకట సుబ్బారావు గారి మాటలలో 'శాస్త్రి' గారిని గూర్చి చెప్పాలంటే 'కృతి స్వీకర్తకు కొన్ని బాధ్యతలుంటాయి.వాటిలో కావ్య ప్రకాశనం(ముద్రణం) లో కవికి చేయూత నివ్వడము.కానీ తమ్ముడు శాస్త్రిగారు కవిసమ్రాట్ విశ్వనాథ వారి వలె 'మనస్సన్యాసి'. నా నుండి ఏమీ ఆశించలేదు.ఇది వారి సచ్చీలత్వానికి వ్యక్తిత్వ మహోన్నత్వానికి ఋషి వంటి  నిరీహకు, స్వచ్చదర్పణ సదృశమైన సౌమనసానికి తార్కాణమే అయినా, నాకు మాత్రం మిక్కిలి అసంతృప్తిగానూ, వెలితిగానూ, వ్రీడ గానూ వుంది. ఏమి చెయ్యను? ఇది శాస్త్రిగారి మహోన్నత గుణ నగమునకు దర్పణము. ఇక ఆయన కవితా రీతిని గూర్చి శ్రీయుతులు బేతవోలు రామబ్రహ్మము గారు ఏమన్నారో చూదము.'పాత్రలు తెరిచి , ధాన్యపు బస్తాలనొకచోటనే పేర్చి ,వండి వడ్డింపజేసి, క్షామ పీడితుల్ని ఆదుకొన్న మహానుభావుడు కదా వెంగళరెడ్డి గారు.అదే పద్ధతిలో శాస్త్రిగారు కూడా నాయకుడి గుణధాన్య రాశిని పద్యాల బస్తాలో నింపి ఉత్తర భాగాన పేర్చి రుచ్యంగా విందు భోజనంగా వండి వడ్డించి మన ఆకలి తీర్చారు.పద్య కవితా ప్రియులు ఒక రకంగా ఇప్పటి కాలాన క్షమా పీడితులే. శాస్త్రిగారు కడుపు నిపారు.నాలాగే గర్రున త్రేన్చబోతున్న పాఠకులందరి  పక్షాన అంటున్నాను-అన్నదాతస్సుఖీభవ.' సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి గారి మాటలలో 'ప్రస్తుత మీ

కావ్య నిర్మాత గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి మహోదయులు కవివతంసులు,విపశ్చిదగ్రణులనడములోఅతిశయోక్తి లేదు. వీరిప్పటికే ఆంద్ర ప్రదేశములో లబ్ధప్రతిష్ఠులు.ఎన్నో గద్య పద్య గ్రంథాలతో తెలుగువాఙ్మయ సరస్వతిని సర్వాలంకార భూషిత గావించినవారు. ఈ విధంగా వ్రాసుకొంటూ పోతే ఎన్ని పుటలైనా వ్రాయ గలిగేటంత గొప్పదనము కలిగినవారు శుబ్రహ్మణ్య శాస్త్రివారు. 'కవి దోర్దండుడయిన శాస్త్రి గారి పాండిత్యము ముందు, మోడు బారిన మావి తరువైనా మోసులెత్తక మానదు.' అని అన్నారు జోశ్యం విద్యాసాగర్ గారు. ఈవిధముగా, పరిచితులనడుమ గణుతికెక్కిన వీరి గుణగణములను గూర్చితెలుపుట నా శక్తికి మించినపని. ప్రచారమునకు నోచుకోవలెనన్న విచారమే లేని వ్యక్తిత్వము వీరిది. ఇక కథా నాయకుడి విషయానికి వస్తాము.

ఆంద్ర ప్రదేశము లో దాన కర్ణులుగా ప్రఖ్యాతి గాంచినవారిలో రాయలసీమలోని బుడ్డా వెంగళరెడ్డి , యాదాళ్ళ నాగమ్మ, నెల్లూరు మండలములో కోడూరి బాలకోటారెడ్డి,గుంటూరు మండలములో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు,గోదావరి మండలములో డొక్కా సీతమ్మ సుప్రసిద్ధులు.

నేటి కడప కర్నూలు జిల్లాల్లో కుందు నదీ పరీవాహక ప్రాంతాన్ని 'రేనాడు' అంటారు.ఇప్పటి కర్నూలు జిల్లా కోవెల కుంట్ల తాలూకాకు చెందిన ఉయ్యాలవాడ గొప్పదనాన్ని గూర్చి ముందే చెప్పుకొన్నాము. ఆ గ్రామ వర్ణన మరొక్కసారి శాస్త్రి గారి మాటలలో చదవండి :

తుంగోత్తుంగ తరంగ చాలనములన్ తోడైన హంద్రీ సరి

ద్భంగావృత్తమహీతలమ్మినుమడింపన్ జుట్టునేర్లెన్నొ పా

రంగా పుష్కల సస్య వృద్ధికినపారప్రఖ్య నార్జించి పే

రంగాంచన్ విలసిల్లు తీరమిది నోరూరించు మాధుర్యముల్

 

ఇక అక్కడి పాడిపంట  పౌరుల గూర్చి చదవండి. నాయకుని గుణశీలము కూడా ఇక్కడే మచ్చుకు చూపించి కథకు నాంది పలికినారు.

పచ్చని పంటచేలు చేలువంబున డంబు  వహించు తోటలున్

ముచ్చటగోల్పు మేడలు నమోఘ వినిర్మిత వృత్త కుడ్యముల్

మెచ్చెడి పాడి, పాడి తమ మేని నరంముల నింపు పౌరులున్

వచ్చెడి బాటసారుల కపార కృపాసాహితాదరమ్ములున్

ఆ గ్రామమందలి సుసంపన్నమైన కుటుంబీకులు నల్లపరెడ్డి అక్కమ్మ గార్ల ప్రథమ పుత్రుడు మన నాయకుడు.జననం క్రీ.శ.1822 .

సాధారణ ఎత్తు.గుండ్రని ముఖము గౌరవర్ణము.ముఖములో స్పోటకపు మచ్చలున్నా ఆకర్షణీయమైన విగ్రహము. సాముగరిడీ చేసి ధృఢమైన శరీరమును గలిగిన వాడు.ప్రథమ సంతానమగు ఆయనకు ఈశ్వరరెడ్డి తమ్ముడు, తిమ్మమ్మ, సుబ్బమ్మ చెల్లెళ్ళు. వెంగళరెడ్డి గారి మొదటి భార్య నాగమ్మ నిస్సంతుగా గతించింది.తిరిగి పెళ్ళియాడినా పిల్లల లేమిచే తమ్ముడు ఈశ్వరరెడ్డి కుమారుని దత్తత తీసుకొన్నాడు.బంగారమునకుతావియబ్బినట్లు పుట్టుకతోనే దానగుణము అబ్బినది ఆ మహనీయునికి.బాల్యము లోనే తానూ కొన్న తినుబండారములు సాటి పిల్లలకు పంచేవాడు ఆయన దాతృత్వమును గాంచి ప్రజలు బడా వెంగళ రెడ్డి అని అనేవాళ్టట. అది రాను రాను రాను బుడ్డా వెంగళ రెడ్డి అయినదని అంటారు. అసలుగా వారి ఇంటిపేరు 'మద్దెల'. 'మజ్జరి' అనుట కూడా కద్దు. ఆయన దానగుణాలను గూర్చి తెలుసుకొంటూ పోతే మనము ఆశ్చర్యపోక తప్పదు. ఆయన సచ్చీలతకు దానగుణానికి ఈ పద్యము కొలబద్ద.

మిగతది మరొకమారు........... 


ఉయ్యాలవాడ సూర్యచంద్రులు  - 6

బుడ్డా వెంగళరెడ్డి

బుడ్డా వెంగళరెడ్డి రాజిలె ధనమ్మున్ దాన సచ్ఛీలమం

దడ్డంబేమియులేక చేగోనిన ధన్యాత్ముండు బుణ్యాత్ముడై

వడ్డించెన్ తనకున్నయంత వరకున్ వాత్సల్యమేపారగా

'రెడ్డీ' నీవే దధీచి వా శిబివనన్ 'రేనాట కీర్తించగన్'

ఆయనకు పండితపోషణ బహు ప్రీతి. సంస్కృత పాఠశాల ఆ కాలములోనే నెలకొలిపి విద్యాదానము చేసిన మహనీయుడు.తన ఇంటి పనివాళ్ళందరికి భోజన వసతులు ఉచితముగా ఏర్పరచేవాడు.ప్రతి ఏటి ఉగాదికి ఆయన చేసే అన్నదానానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీతరలి వచ్చేవి. తనకు వద్దిచిన ప్రతి వస్తువూ పంక్తిలో ప్రతియోక్కరికీ వడ్డించవలసిందే. వారి ఈ మాట శిలాశాసన తుల్యము.పోటీ పడి నెయ్యి త్రాగేవారికి త్రావినంత నెయ్యి గిన్నెతో వంచి పోయించే వారు.ఆయన వంశీయులు నేటికినీ ఈ సదాచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఒకరోజు రాత్రి ప్రయాణము తన గుర్రముపై చేస్తూవుండగా దారిలో దొంగలు అడ్డగించినారు.వారిని లాలించి బుజ్జగించి ఇంటికి పిలుచుకుపోయి భోజనము పెట్టించి వారి నాలుగు మూటల బియ్యము అంటే 500 K.G లు ఇచ్చి పంపిన దాత. వారి వద్ద ఒక అపురూపమైన జాతి గుఱ్ఱము వుండేది. ఆయన ప్రయాణాలన్నీ దాని పైనే. ఊరిలోని ఒక వణిజుడు ఆ గుర్రమునకు వలయు ముంతెడు ఉలవలు రెడ్డిగారి దివాణమునకు పంపి లెక్క వ్రాసుకోనేవాడు.సంవత్సరం చివర అతని బాకీ తీర్చుట నాటి గొప్ప ఇంటివారి ఆనవాయితీ. కొన్నాళ్ళకు ఆ గుఱ్ఱాన్ని తన గురువుగారైన ధరణి సీతారామయ్య గారికి దానము చేసినారు. కానీ గుఱ్ఱానికి దాణా యదా తతంగానే పోయేది. సంవత్సరము చివర ఆ వర్తకుడు డబ్బుకు వస్తే గుఱ్ఱము తన గురువుకు దానము ఇచ్చినట్లు చెప్పి ఆ గుఱ్ఱము బ్రతికినంత కాలము దాణా ఖర్చు తన వద్ద నండినే తీసుకోమ్మన్న ఉదారుడు.శివరాత్రికి 20 రోజుల ముందు నుండి తమ ఊరిలోని అగస్తీశ్వరాలయములో సంతర్పణలను నిరాఘాటముగా 25 సంవత్సరములు జరిపిన మహనీయుడు. ఒకసారి ఒక బిచ్చగత్తె రెడ్డిగారి ముంగిట నిలిచి ఒక పాత కోక ఇమ్మని అడిగింది. ఆ మాట విన్న రెడ్డి గారి ఒక భార్య పాతదేందుకు నీకోసం క్రోత్తదే నేయింఛి ఇస్తాములే అన్నదట. ఆ మాట విన్న రెడ్డి చిలుకకోయ్యకు తగిలించి ఉన్న కొత్త చీర తెచ్చి ఆ బిచ్చగత్తెకు ఇచ్చినాడట. ఆయన భార్య లబోదిబోమంటూ అది నా పుట్టినింటివారు పెట్టిన కొత్త కోక అన్నదట.రెడ్డిగారు కూడా 'అందుకే నీ మాట నిజము చేయుటకు అది ఆ బిచ్చగత్తెకు ఇచ్చినా'నన్నాడట. ఎంతటి ఔదార్యమో! ఇంటిలో గంగాలముల నిండా మజ్జిగ వుంది కూడా లేదని ఒక బ్రాహ్మణ స్త్రీని తన భార్య చెన్నమ్మ వెనక్కు పంపుతూవుంటే గమనించిన రెడ్డి మళ్ళీ తానూ మాజ్జిగ పోస్తే బాగుండదని ఆవు పడ్డనే దానము చేసిన దానవీరుడాయన. ఉయ్యాలవాడ సమీపములో 'పాంపల్లె' అన్న వూరిలో ఇద్దరు బ్రాహ్మణ సహోదరులుండేవారు .వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒక  వడ్యాణము కావలసి వచ్చి రెడ్డి గారిని అరువు ఇమ్మన్నారు. దాని బరువు ఒక శేరు (అంటే 250 గ్రాములు ఇంచుమించు). రెడ్డిగారు అది ఇవ్వడమే కాకుండా , వారు తిరిగి తెచ్చి ఇస్తే ఆడపిల్లకు పెట్టినది మళ్ళీ వెనక్కు తీసుకోనన్న వదాన్యుడు ఆయన. యువ గణము ఆరోగ్యమునకై వ్యాయామశాల ఏర్పాటుచేసి అందు చిన్న కమ్ము, పెద్ద కమ్ము అన్న వస్తాదులను పోషించుతూ, వారితో, ఉచితముగా యువకులకు  శిక్షణ ఇప్పించేవాడు.తానూ వారితో అప్పుడప్పుడు మల్ల యుద్ధము చేసే వాడు. చెన్నంపల్లె గ్రామం లో వెంగళరెడ్డి గారిని చంప టానికి మాటువేసిన విషయము చెప్పిన ఒక మాలకు , ఆతని జీవితమంతా ఆశ్రయమిచ్చి తనవద్దనే ఉంచుకొని పెళ్లి పేరంటము చేసి ఆ దంపతులను తన వద్దనే ఉంచుకొన్న మానవతావాది ఆయన. ఒకసారి జొన్నల మూటలు (బస్తాలు) ఎద్దుల బండికి ఎత్తుకొని కొందరు ఉయ్యాలవాడ పోతూ వుండినారు. మూటలకు రంధ్రములు ఉండుట వల్ల జొన్నలు భూమి మీద రాలుతూ వుంటే  రెడ్డి గుఱ్ఱము దిగి అవి ఎరుకొంటూ ఉయ్యాలవాడ చేరినాడు. వారి బండి కూడా వారి ఇంటి ముగితే నిలిచి వుంది. రెడ్డి గారు వారిని జూచి ఎవరు కావలెనంటే వారు 'వెంగళ రెడ్డి గారు' అన్నారట. అందులకాయన 'సరే సరే ముందు భోజనము చేయండి' అని వారికి విస్తరాకులలో రూపాయలు వడ్డింప జేసినారట. వారు బిక్క మొగము వేసుకొని చూస్తే ఆయన' మరి గింజాలు ఎరుతూవుంటే ఎగతాళి చేసినారే మరి ఇపుడు రూపాయలు తినండి' అన్నాడట. ఆయనే వెంగళరెడ్డి అన్న విషయము వారికర్థ పోయింది. సిగ్గు తో తల వంచుకొన్నారు. రెడ్డిగారు రూపాతలు తీయించి వారికి మృష్టాన్నము పెట్టించి దాన్యమునకు తగు మూల్యము చెల్లించి పంపించినాడు. హాస్య స్ఫోరకమైన ఈ యదార్థ సంఘటన గమనించండి.రెడ్డి గారి తల్లి అక్కమ్మ వితరణ శీలి కానీ అమ్మయకురాలు. ఆ వూరిలో వుండే పాణ్యం సంజీవభోట్లు అన్న బ్రాహ్మనికి ప్రతిరోజూ దిన భత్యం ఇచ్చేవాళ్ళు.ఒకసారి తన ఇంట్లో ఏర్పడిన సమస్యల వల్ల ఆయన బహుశ పోరుగూర్లకు పోయినాడో ఏమో  ఒక నెలరోజులు రెడ్డిగారి ఇంటివైపు రాలేదు.సమస్యలతో సతమతమౌతున్న ఆయన రెడ్డిగారి ఇంటికి పోగానే 'సామీ ఎక్కడికి పోయివుండినా'రని అడిగింది. ఆయన విసుగుతో 'స్వర్గానికి పోయి వస్తున్నా'నని అన్నాడు. ఆ అమాయకురాలు 'మా ఆయన కనపడినాడా, ఆయన బాగుండాడా సామీ' అన్నది. ఆ బ్రాహ్మడు ' కనబడినాడమ్మా' అన్నాడు. 'ఏమన్నాడు సామీ' అన్నది.అందుల కాయన చలి ఎక్కువగా వుంది దుప్పటి కావాలన్నాడు' అని ఆమెతో అన్నాడు. ఆమె ఇంట్లోవున్న కొత్త దుప్పటి తెచ్చియిచ్చింది. చాటుగా వెంగళరెడ్డి గారు విన్నారని ఆ బాపనికి తెలియదు. నాల్గు రోజుల పిమ్మట రెడ్డి యాతని బిలచి 'స్వామీ దుప్పటి మా నాయనకు ఇచ్చినావా' అన్నాడు . సంజీవ భొట్లు గారికి నోరు పెగల లేదు కానీ కాస్త తమాయించుకొని 'రెడ్డీ మేము కప్పుకొంటే మీ తండ్రి కప్పుకొన్నట్లు కాదా' అన్నాడు. రెడ్డి ఆయన సమయస్పూర్తి కి నవ్వుకొని ఇంకా 6 క్రొత్త దుప్పట్లు ఆయనకు ఇచ్చి పంపించినాడు. క్రీ.శ.1826  క్షయ నామ సంవత్సరములో నాటి కదప్ కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలలో ఇంత వరకు రాణి కరువువచ్చింది. దీనిని 'డొక్కల కరువు' అని కూడా అన్నారు.ఆ కరువుకు కడుపులు మాడి వేలమంది మరణించినారు. కడుపు నిండా తిన్నవారేవరైనా  కనిపించితే , రోజులకొద్దీ కడుపులు మాడ్చుకొనే ప్రజలు, వారి డొక్క చించి అందులోని అన్నము తినేవారని అంటారు. అందు కే ఆ కరువుకు ఆపేరు వచ్చింది. ఆగల రాజ్యాదికారులు నెలకొల్పిన గంజికేంద్రాలు వెలవెలబారినాయి.అవి ఏ విధంగానూ ప్రజల ప్రాణాలు కాపాడలేక పోయినాయి. అట్టి స్థితిలో ప్రజలను ఒక్క దయనీయుడగు మహనీయుడు వెంగళరెడ్డి మాత్రమే తన ఆస్తి మొత్తము వెచ్చించి కాపాడగలిగినాడు.  పూటకు 8,000 మంది కి తక్కువ లేకుండా 3 నెలలు ఆదుకొన్న ఘనకీర్తియాతనిది. ఎంతటి దయాగుణ సంపన్నులో ఎంతటి దానపరులో! అసలు ఈ కరువుకు బలికాబోతున్న అంగ్లేయునికి ప్రాణము పోసిన ఘనత రెడ్డిగారిది. ఆయన తమ్ముడు ఈశ్వరరెడ్డి కూడా అన్నకు బాసటగా నిలిచి తన ఆస్తీని కూడా అన్నకే ఇచ్చి పేదల నాదుకోమ్మన్నాడు. ఆస్తి అంతా హారతి కర్పూరము చేసి ఆకలిగొన్న వారిని ఆదుకొన్న మహనీయులు.

భయంకరమైన ఈ కరువును శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటలలో చదవండి.

మిగిలినది మరొకసారి............

బుడ్డా వెంగళరెడ్డి 7

 ఎండి బీటలు బారి గుండెలవియజేయు

పొలముల గని రైతు బోరుమనియే

మేతకి కదిలిన మేలి పసులమంద

లెండు డొక్కల చ్చచ్చుచుండె నచటె

పాలీని గేదెల పరువెత్త జేసిరి

ఆలమందల తోడ నడవులకును

కడుపు నిండని తల్లి కడుపు పంట నిసుంగు

చనుబాలు దొరకక చనెను దివము

ఎవరుజేసిన పాపమో ఎరుగరాదు

ప్రకృతి కోపించి ప్రళయ సంపాతమనగ

తీవ్రమౌ క్షామ దావాగ్ని దివియజేసే

అదియ రాయల సీమ లో నగ్గి రేపే

 కరువు మొత్తము ఈ పద్యములో కళ్ళకు కనబడుతుంది.

ఈ సమాచారము భారత దేశములోని తమ ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా తెలుసుకొన్న బ్రిటీషు మహారాణియగు విక్టోరియా మహారాణి

ఆ కలియుగ పరోపకార ధౌరేయుడగు దాన రాధేయునికి 20 తులాల పతకము బహుమతిగా ప్రకటించి ఇప్పించి సన్మానించింది. రెడ్డిగారు అధిపోగోట్టుకొంటే మళ్ళీ 10 తులాల పతకమును ఆ పరాంతపు కలెక్టరు ద్వారా అందజేసే ఏర్పాటు చేయించింది. శత్రువుల చేత కూడా కీర్తింపబడిన ఆయన దాన పరత్వమును ఎంత కొనియాడినా తక్కువే.అది స.శ. 1900 డిసెంబరు 31వ తేదీ.వెంగళరెడ్డి ఆనాడు పిల్లలకు  మశూచి టీకాలు వేయించే పనిమీద ఊరిలోకి వెళ్ళి,ఇంటికి వచ్చి భోజనము చేసి మధ్యాహ్నము 12 గం. అనాయాస మరణము పొందినాడు. ఎంతటి పుణ్యమూర్తియో కదా!ఆ నాడు బాలునిగా వున్నబ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహం గారు వెంగళరెడ్డి గారి మరణాన్ని గూర్చి చెప్పినది వారి మాటలలోనే " టీకాలు వేయించటానికి వెంగళ రెడ్డి మాయింటికి రాగానే నేను భయపడి పారిపోతూవుంటే బలవంతముగా పట్టి తెప్పించి , మిఠాయి తినిపించి , తన జేబులో నున్న ఒక రూపాయి నాలుగు అణాలు నాకిచ్చి, టీకాలు వేయించి, ఇంటికి వెళ్లి మధ్యాహ్నము 12 గం. లకు అకస్మాత్తుగా మరణించినారు. రెడ్డిగారితో కడపటి దానము గ్రహించినవాడను నేనే !" రెడ్డిగారిని వారియింటి వామి దొడ్డిలోనే సమాధి చేసి ఇప్పటికీ ప్రతి సంవత్సరము నిరంతరాయంగా సమారాధన చేస్తూనేవున్నారు.ఇవంతా ఆయన బ్రతికిన కాలములో జరిగిన విషయాలు. ఇపుడు ఆయన పరమపదించిన పిదప జరిగిన ఈ సంఘటన చదవండి.

రెడ్డిగారు మరణించుటకు కొన్ని రోజుల ముందు తన కుమారుని ఉపనయనము కోసము ఒక పేద బ్రాహ్మణుడు రెడ్డి గారిని కొంత ధనము

యాచించినాడు. రెడ్డిగా సరేయని ఆధానము ఇవ్వగా ఆ బాపడు "అయ్యా ఈ డబ్బు ప్రస్తుతానికి మీ వద్దనే ఉంచండి నేను

ముహూర్తమునకు రెండు రోజుల ముందు వచ్చి తీసుకొంటాను" అన్నాడు. రెడ్డిగారు అందుకు 'సరే' అన్నారు. ఒకరోజు ఆ బ్రాహ్మడు

ఉయ్యాలవాడకు పడిగెపాడు అన్న ఊరి దారిగుండా వస్తూవుంటే రెడ్డిగారు గుర్రముపై ఎదురు వస్తూ ఆతనికి కనిపించినారు. రెడ్డి గారు

ఆయనకు నమస్కరించి " స్వామీ ! మీ ధనము పసుపు గుడ్డలో చుట్టి వెదురు కొమ్ములో ఉంచి గాటి పట్టున ధన్తులో పెట్టినాను

మావాళ్ళనడిగి  తీసుకోండి" అన్నాడు. ఆయన అల్లాగేనని వెళ్లి జరిగినదంతా ఇంటివారితో చెబితే ముక్కుపై వ్రేలు వేసుకొనుట వారి వంతయింది.వారు ఆయనతో " ఆయన గతించి పది దినములైనది. మీకు కనిపించి చెప్పినాదంటే మాకు మిక్కిలి ఆశ్చర్యముగా వుంది " అంటూ ఆ తావులో చూస్తే డబ్బు చెప్పింది చెప్పినట్లుగా అక్కడే వుండినది. ఆ డబ్బు తీసుకొని ఆయన సంతోషముగా వెళ్ళిపొయినాడు. ఇటువంటి దానశీలిని నేను ఈ విధంగా  తలచుకోగలుగుట నా అదృష్టమని తలన్చుచుచూ పద్య కావ్యముగా వ్రాసిన శ్రీ గొట్టుముక్కల

సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కరిస్తూ ఈ క్రింది పాట తో స్వస్తి పలుకుతాను.

మా బాల్యములో ప్రతి బిచ్చగాని నోటిలోనూ ఈ పాట వినేవాళ్ళం

ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నదీ ధర్మం సూడరయా

నేటికి బుడ్డా ఎంగాలరెడ్డిని దానా పెబువని తలవరయా

పచ్చి కరువులో పానము బోసేను బెమ్మ దేవుడే ఆయనయా

ఆకలి కడుపుకు అన్నము పెట్టె ధర్మ దాత యని తెలియరయా

గోవిందా యని వన్న వారికి గోవుల దానము చేసెనయా

అరి నారాయణ అన్న వారికి అన్న వస్త్రము లిచ్చునయా..

ఈ విధంగా ఆ పాట సాగుతుంది. పూర్తి పాఠము నాకు జ్ఞాపకము లేదు.

స్వస్తి