Wednesday 22 March 2017

సంస్కృతభాషలో నేను చూసిన ఒక ఏకాక్షర శ్లోకం


సంస్కృతభాషలో నేను చూసిన ఒక ఏకాక్షర శ్లోకం
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!
ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన
రోః = భయం కల
అర = వేగంగా పరుగెత్తే
రురోః = జింకయైన మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న
ఉరో రరే = వక్షము నందు
రీరారా = లీల నాపాదించునట్టి
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన
ఉః = లక్ష్మి = సీత
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూ శత్రువైన రావణునికి
రిః = నాశం కల్గించినదై
ఆరిరా = చెలికత్తెలను
రా = పొందిన దాయెను
శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.

Sunday 19 March 2017

ఘటన (భర్తృహరి సుభాషితం)

ఘటన (భర్తృహరి సుభాషితం)
కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు లేక ప్రతిభ కలిగిన మేరకు పూర్తిగా రాణించుతారు. కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు. కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు. భర్తృహరి ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి .
సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే
అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః
దీనికి ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగు సేత
నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు నా
నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్
ఒకే నీటి బిందువు కాలే ఇనుము పై బడితే ఆవిరియై పోతుంది, అదే తామర ఆకు పైబడితే ముత్యమువలె ప్రకాశిస్తుంది, మరి ముత్యపుచిప్పలోనే బడితే ముత్యమే అయి కూర్చుంటుంది. ఈ శ్లోకమున అధమ మధ్యమ ఉత్తమ పురుషులను పైన చెప్పిన విధముగా పోల్పబడింది. నిజానికి ఆయా వ్యక్తుల వద్ద పనిచేయవలసి వచ్చుట కూడా ఘటన లేక అదృష్టమే కదా! ఇందుకు కర్ణుడు చక్కని ఉదాహరణ.

ఈ సందర్భములో నాకొక వాస్తవిక సంఘటన గుర్తుకొస్తూవుంది. ఒక సారి కార్యాలయ కార్యార్థినై  నేను మా ఉన్నతాధికారి యొద్దకు పోవలసి వచ్చింది. పని ముగిసిన తరువాత 'అదృష్టము' అన్న విషయము పై మా మాటలు మరలినాయి. అప్పుడు నేను పైన తెలిపిన భర్తృహరి సుభాషియమును తెలుపుట జరిగింది. ప్రొద్దు బుచ్చుటకు కాక మాటలు మనఃపూర్వకముగా సాగుతున్నాయి కాబట్టి నేను పై ఉదాహరణ చెప్పినవెంటనే ఆయన మరి ఆవిరయిన ఆనీటిచుక్క  వాతావరణ ఉష్ణోగ్రతకు తిరిగీ ద్రవీభవించి, ఈ పర్యాయము ముత్యపు చిప్పలో పడవచ్చు కదా! అన్నారు. అందుకు నేను అవకాశము 1/3 వ వంతే కదా, కావున తిరిగీ కాలే ఇనుము పైన పడే అవకాశము కూడా అంతే ఉన్నదన్నాను. ఆయన నా మాటను త్రోసిపుచ్చలేదు.

ఈ ఉపపత్తిని జీవితమునకు అన్వయించుకొంటే మనము ఆహా ఓహో అని అనే వారికంటే గొప్పవారు ఎంత మంది గుర్తింపే లేక మట్టిలో కలిసిపోయినారో!
సరస్వతీపుత్రునిగా స్వామీ దయానంద సరస్వతిచే ఆప్యాయముగా పిలువబడిన, 14 భాషలలో అసాధారణ పాండిత్యము గలిగిన, రష్యన్ కాన్సలేట్ జనరల్ చెన్నపట్టణమునందు అనర్గళముగా ఒకటిన్నర గంట ఉపన్యసించిన, సంగీత నాట్యములలో అద్భుత ప్రావీణ్యము కలిగిన, మధుర గాత్రము కలిగిన, వైష్ణవుడయ్యును  శివతాండవమును ఆచంద్ర తారార్కము గావించిన , ఒకనాటి దేశాధ్యక్షుడు రాధా కృష్ణన్   కొనియాడబడిన పుట్టపర్తి నారాయణాచార్యులవారికి దాదాపు చేతికందబోయిన జ్ఞానపీఠ పట్టమును తన లౌకికమునుపయోగించి ఒక రెడ్డిగారు తన్నుకుపోయినారు.
దీనివల్ల జ్ఞానపీఠ పట్టమును పాండిత్యమునకు గాక పైరవీకి అందించినట్లయినది.
ఘటన అంటే అదే కదా!

Thursday 16 March 2017

ఆచారములు సాంప్రదాయములు

ఆచారములు సాంప్రదాయములు

https://cherukuramamohan.blogspot.com/2017/03/blog-post_16.html

ఆచరించుట అన్న మాటకు చేయుట అని అర్థము. ఇల్లు శుభ్రముగా ఉంచుకొనుట ఆచారము. మరి అందరి ఇళ్ళు శుభ్రముగానే ఉంటాయా అంటే ఉండకనూ పోవచ్చు అన్న జవాబు వస్తుంది . ఒకప్పుడు ఆవు పేడ కలిపిన నీళ్ళు ఇంటి ముంగిట చల్లి ముగ్గువేయుట ఆచారము. నేడు అది మృగ్యము. ఒకప్పుడు అయ్యా, స్వామీ , పెద్దాయనా, పంతులుగారూ, గురువుగారూ అనుట ఆచారము . దగ్గరితనము వుంటే అత్త ,మామ,బాబాయ్,పిన్ని,అన్న, వదినె, అని ఎన్నోవిధాల పిలుచుకొనే వాళ్లము. ఇప్పుడది లేదు. అన్నింటికీ ఒకటే మంత్రమే! అదే ' ఆంటీ-అంకుల్' మంత్రము. అంటే ఒకనాటి ఆచారము వదిలి కొత్త ఆచారాన్ని అమలుపరచుకొనవచ్చు. దానివల్ల కొంత కాలానికి అటువంటి పని ఒకటి చేస్తూవుండినామా అన్న సందేహము మనలో తలెత్తుతుంది. పూర్వము ఈ ఆచారాలను 3 విధములు జేసినట్లు తోచుచున్నది. 1. దేశాచారము 2. కులాచారము 3. జ్యాత్యాచారము ఈ మూడు కాకుండా 4.మతాచారము అనునది కూడా ఏర్పరచుకొనవచ్చును.

1.దేశాచారము: మనలో మేనమామ కూతురుని వివాహము చేసుకొనుట కద్దు. కొన్ని ప్రాంతములలో చేసుకోరు. ముస్లిములు, క్రైస్తవులు వారి మతములలో లేకున్నా పుస్తెలు మెట్టెలు ధరించుట కద్దు. ఇది దేశాచారమేకదా!

2.కులాచారము: దీనికి ప్రత్యేకముగా నేను ఉదహరించ నవసరము లేదనుకొంటాను. ఇది స్త్రీలకు బాగా తెలుస్తుంది.

వారికి కార్యాల విషయములో పరిశీలన అధికముగా వుంటుంది. అందుకే ఆపస్తంభ ధర్మ సూత్రములలో 'యత్ స్త్రీయాహుస్తత్' అని తెలుపబడినది. అంటే 'స్త్రీలు చెప్పిన విధముగా చేయుడు.'అని అర్థము.

3.జాత్యాచారము: ఎన్నో కొండ జాతులు వుండేది మనము చూస్తూనే ఉన్నాము. వారి ఆచారాలు విలక్షణముగా వుంటాయి. వారి వారి కులపెద్దలు ఆదేశించిన తీరుగా ఆ జాతీయులు నడచుకొంటారు .

4.మతాచారము: ఇక్కడ మతము అంటే ఏ క్రీస్తు మతమో, ఏ ఇస్లామో కాదు. మనసుకు తోచిన ఆలోచనను మతము అంటారు. ఒక సమూహములో ఏమి చేయవలయునో తెలియని పరిస్థితి ఏర్పడితే వారు పెద్దగా ఎంచుకొన్న అతని అభిమతము ప్రకారము ఆ విధిని నిర్వర్తించుతారు. రాను రానూ అదే అచారమైపోతుంది.

సాంప్రదాయము అటువంటిది కాదు. అది ఎప్పటికీ వుంటుంది. ఆచరణ లేక అమలులో తేడాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు పెళ్లి, దేవతార్చన , నోములు, వ్రతములు ఆచరించుట. పండుగలను పాటించుట. ఇవి సాంప్రదాయము క్రిందికి వస్తాయి. మనము పాటించ వచ్చు లేక ఆచరించ వచ్చు ఆచరించకనూ పోవచ్చు. సాంప్రదాయమునకు ఒక మూలము వుంటుంది. ఆచారము ఒక కుట్టించుకొన్న బట్ట లాంటిది. వేసుకొన్నంత కాలము వేసుకొని వేరేది కుట్టించుకొంటాము. సాంప్రదాయము, సంస్కృతి అనే శరీరమునకు అంగము. ఇది వాడక పోవచ్చును గానీ నరికివేయము.

అసలు సంస్కారముల ప్రతిరూపములే సాంప్రదాయములు. బంకమట్టిని ఉదాహరణగా తీసుకొందాము. కుమ్మరి దానిని సంస్కరించే వరకు అది కేవలము మట్టే, దానిని తగిన విధముగా సంస్కరించిన తరువాతే ఒక చట్టి గానో,ఒక మూకుడు గానో ఒక బాన గానో, ఒక కడవ గానో,ఒక కళాఖండము గానో తయారవుతూవుంది. కావున ఈ సంస్కారములు మనకూ అవసరమేగదా. అసలు సంస్కారములే మానవులను సంఘటితము చేస్తాయి. ఈ సంస్కారాలు 16 అని స్మృతులు, గృహ్యసూత్రాలు తెలుపుతాయి. ఇవి గర్భాదానము, పుంసవనము, సీమంతము,

విష్ణుబలి,,జాతకర్మ,చంద్రదర్శనము,నామకరణము,అన్నప్రాశనము కర్ణవేధ, చూడాకరణము,అక్షరాభ్యాసము,

ఉపనయనము,కేశాంతము, స్నాతకము,వివాహము,అంత్యేష్టి .ఈ సంస్కారములు శూద్రుల విషయములో 10 యగునని వ్యాసులవారు చెప్పినారు. కానీ నేడు చాలా సంస్కారాలు అంతటా కరువై పోయినాయి'

వివాహము ,అంత్యేష్టి అందరూ జరుపుకొంటూనే వున్నారు. నామ కరణమూ, అన్నప్రాసన ,చూడాకరణము(పుట్టు వెంట్రుకలు),కర్ణ వేధ (చెవులు కుట్టించుట ) ఇవి అన్నీశాస్త్రోక్తముగా జరుపుకొనుట దాదాపుగా మానుకొన్నాము.

ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః.

మన సాంప్రదాయాన్ని కాపాడుట మన ధర్మం. మరి మన ధర్మాన్ని కాపాడుదాం. మన సంస్కృతికి పూర్వ వైభవము కల్పిద్దాం.

Monday 13 March 2017

ఆర్యుల దండయాత్ర

ఆర్యుల దండయాత్ర
ఆర్య అన్న పదము సంస్కృత జన్యము. దానిలో సందేహమే లేదు.
పాశ్చాత్యులు ఈ ' ఆర్యన్ ఇన్వేషన్ థియరీ' అన్న ఒక వితండ వాదమును మనలను మభ్యపెట్టుటకు తెచ్చినారు. ఇంచుమించుగా క్రీ.పూ.1500-1000
మధ్యకాలములో మన దేశముపై దండయాత్ర చేసి ద్రావిడులు అన్న తెగను దక్షిణ భారతమునకు తరిమి వేసినారు అని. అసలు ద్రావిడులు అన్న తెగయే లేదు. ద్రవము చేత చుట్టబడిన ప్రాంతములో ఉండుటచే ద్రావిడులైనారు. అసలు చరిత్రలో ద్రావిడ సామ్రాజ్యము అన్నది మనము చూడము. అసలు ఈ వాదమును పాశ్చాత్యులు ఎందుకు తెచ్చినారంటే మీరు క్రీస్తు పూర్వమే మా చేత జయింపబడినారు ఇప్పుడు జరిగినది కొత్త కాదు అని చెప్పుటకు. అసలు మన సంస్కృతి, సాహిత్యము, భాష ఇప్పటిది అని ఇదమిద్ధముగా చరిత్రకారులు చెప్పలేని స్థితిలో వున్నారు. క్రీస్తు పూర్వము 5000 ఈ హరప్పా నాగరికత అని తేల్చిన కుహనా చరిత్రకారులు, నేడు ఈ నాగరికతను క్రీస్తు కు పూర్వము 10 లేక 11 వేల సంవత్సరముల కాలమునాటిదని ఒప్పుకొనుచున్నారు. ఇక అక్కడి శిధిలాలలో యజ్ఞవాటికలు, ఆభరణములు, తీర్చిదిద్దిన వీధులు, భవనములు, స్త్నాన శాలలు అనేకములు కానవచ్చుచున్నవి. యజ్ఞ వాటికలు వున్నవి అని వేదములు ఎప్పుడో తెలిపియుండ లేదా! ఎందుకనగా యజ్ఞ ప్రాధాన్యత ఒక్క వేదములో తప్ప వేరెందును చెప్పినది లేదు. జురాష్ట్రులు అగ్నిని ఆరాధించుతారు కదా అని అనవచ్చు. జురాష్ట్ర అన్నది సౌరాష్ట్రకు వికృతి శబ్దమని కంచి పరమాచార్యులు నడిచే దేవునిగా పేరుబడ్డ చంద్రశేఖర యతీంద్రులు తమ అనుగ్రహ భాషణమునందు ఒకపరి ఉటంకించి యుండినారు.
ఇక ఆర్య శబ్దమును గూర్చి ఒక మాట. ఆర్య అన్నది ప్రకృతి , దానికి  వికృతి మనము వాడే 'అయ్య' అన్న పదము. ఇది ప్రాకృత జన్యము. తెలుగు ప్రాకృతమునకు అతి దగ్గరి భాష.
ప్రాకృత భాషలో వెలసిన గాథా సప్తశతి సుమారు రెండు వేల సంవత్సరాల కిందటి నాటిది. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా వరకు గాథల్లో ప్రతిబింబించినవి.ఈ గాథల సంకలన కర్త శాతవాహన చక్రవర్తి హాలుడు. శాతవాహనులు తెలుగువారు.

కావున ఆర్యుల దండయాత్ర ఒక కట్టు కథ అని నాకు చేతనయిన రీతిలో క్లుప్తముగా తెలిపినాను.

Please read David Frawley in his own words.

One of the main ideas used to interpret—and generally devalue—the ancient history of India is the theory of the Aryan invasion. According to this account, India was invaded and conquered by nomadic light-skinned Indo-European tribes from Central Asia around 1500-1000 BC, who overthrew an earlier and more advanced dark-skinned Dravidian civilization from which they took most of what later became Hindu culture. This so-called pre-Aryan civilization is said to be evidenced by the large urban ruins of what has been called the ‘Indus valley culture’ (as most of its initial sites were on the Indus river). The war between the powers of light and darkness, a prevalent idea in ancient Aryan Vedic scriptures, was thus interpreted to refer to this war between light and dark- skinned peoples. The Aryan invasion theory thus turned the ‘Vedas’, the original scriptures of ancient India and the Indo-Aryans, into little more than primitive poems of uncivilized plunderers.

 I think the simple explanation I have given will suffice the fact that Aryans did not come from any where. This is a divide and rule game played by Europeans. Bala GangaadharaTilak said vedas are 3000 years old. Though it was stated by a scholar and a honest statesman I don't trust it. There are so many proofs stating the fact that the VEDAS are apourusheya. Even Nehru also told synonymous to 'Aryans came from out side and the Vedamantras are folklore songs sung by cow boys.' 
you can read David Frawley . Aryan invasion theory was proposed by the British archaeologist Wheeler around the early part of the twentieth century. According to this theory, all the Vedas were not composed in India. They were composed by members of tribes, the so called Aryans, who invaded India from the Northwest, destroyed the old civilisation in the Indus Valley, supposedly Dravidian, and drove out these original inhabitants to the south of India and other parts.
All the modern archaeologists like Shaffer declare that there is no archaeological evidence for such an invasion; the invasion is a myth propagated by historians.

There are so many references in Rigveda abut river Saraswati which was dried by B.C.1750, gives so many references. Can we judge the date of river Saraswati's birth.

As we find so many mala fides in the nature of the Europeans in their Governance we can not trust them. In olden days there were not as many tools as they are available now-a-days to draw the facts and inferences.

Saturday 11 March 2017

హిమగిరి సొగసులు (శ్రీయుతులు చొప్పకట్ల సత్యనారాయణగారి వివరణ )
అటజని గాంచె , భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర ఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
దటక చరత్కరేణు కర కంపిత సాలము, శీత శైలమున్ ;
మనుచరిత్రము- అల్లసాని పెద్దన!
హిమాలయమును వర్ణించు అద్భుతమైన యీపద్యము పెద్దన గారిది. ఆంధ్ర కవితా పితామహునిగా, తొలిప్రబంథనిర్మాతగా, రాయలచే గండపెండేరమును దొడిగించుకొనిన కవిపుంగవునిగా పెద్దన ప్రశస్తినందినవాడు.
వయసా,వచసా ,వర్ఛసా పెద్దన పెద్దయే! వర్ణనల లోనేగాక కథాకథనమున సిధ్ధహస్తుడు. " అల్లసానివాని యల్లిక
జిగిబిగి "- యను ప్రశంస యతని గొప్పతనమునకు ప్రతీక!
అరుణాస్పద నగరమున ప్రవరుడను నాహితాగ్ని వసించును. అతనికి తీర్థయాత్రపై మక్కువ.కానీ
తీరికయేలేదు. ఒకనాడు అతిథిగా వచ్చిన సిధ్ధుని వలన పాదలేపనమును పొంది, ఆకాశగమనమున హిమగిరి
కరుదెంచెను.
కం: ఆమందిడి యతడరిగిన
భూమీ సురుఁడేగె, తుహిన భూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షా పేక్షన్;
ఆతరువాతి పద్యమిది. కొంచెం అర్ధం వివరిస్తా!
అర్ధ వివరణము: భూమిసురుడు- బ్రాహ్మణుడు (ప్రవరుడు) అంబరచుంబి- ఆకాశమును ముద్దిడుచున్న; శిరత్- శరసులనుండి (శిఖరములనుండి) ఝరీ- కొండకాలువలయొక్క; పటల- సముదాయముపు: మహుర్ముహుః- మాటిమాటికి
లుఠత్- క్రిందకు జారిపడు; అభంగ- విరుగని; తరంగ- కెరటములను; మృదంగ- మద్దెలలయొక్త ; నిస్వన- ధ్వనులకు; నటనానుకూల-
నాట్యానుకూలముగా; స్ఫుటత్-స్పష్టపడుచున్న; పరిఫుల్ల- బాగుగా విప్పుకొన్న ;కలాపి- నెమళయొక్క; కలాపిజాలమున్: పింఛముల
సముదాయములు గలదానిని, తటక: కొండ చఱియలయందు; చరత్-తిరుగాడు; కరేణు- ఏనుగుల; కర-తొండములచే;కంపిత- వంపబడుచున్న ;సాలమున్-మద్దిచెట్లు గలదియు అగు; శీతశైలమున్: హిమగిరిని:; అటజని- అటకుబోయి; కాంచెన్-చూచెను.
భావము: పాద లేపనం సాయంతో యెగిరి వచ్చిన ప్రవరుఁడు. హిమాలయ పర్వతమును జూచాడు. అదియెలావుంది?
చాలాయెత్తుగా ఉంది. దానిశిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగిరి శిఖరమునుండి కొండకాలువలు క్రిందకు జారిపడుతున్నాయి. ఆప్రవాహాల మ్రోతలు మద్దెలల ధ్వనుల ననుకరిస్తున్నాయి. ఆధ్వనుల కనుకూలంగా నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆకొండ చఱియలలో విస్తారంగా ఏనుగులున్నాయి. అవి అక్కడి మద్దిచెట్ల కొమ్మలను తొండములతో వంచి ఆకులను మేస్తున్నాయి.
ఇదీ మంచుకొండ దృశ్యము! ఈదృశ్యాన్ని కవితా కమనీయంగా పెద్దన వివరించిన తీరు అద్భుతమైనది.
" అంబరచుంబి..........
ఇత్యాదిగా నారంభమైన యా సుదీర్ఘసమాసము హిమాలయముల ఉన్నతికి నిదర్శనము. కొండ శిఖరములనుండి సెలయేటి ప్రవాహ ములు జాలువారుట, మిగుల సుందరతర దృశ్యము. సెలయేటి మ్రోతలు మద్దెల ధ్వానముల నుపమించుట,తదనుగుణముగా నెమలి గుంపులయాటలు మంజుల మనోహర దృశ్యములు. కొండచఱియలలో యేనుగులు విహరించుట ఆహిమగిరి శక్తికి నిదర్శనము. మద్దివృక్షముల కొమ్మలను వంచుట ఇత్యాదులు అచటి వృక్షసంపదకు సంకేతము.
కొండలయున్నతి ఆకాశమంటుట చే నతిశయోక్తియు, అభంగతరంగముల ధ్వానము మద్దెలమ్రోతలపై నారోపణము చేయుట చే రూపకము, వెరసి "రూపకాను ప్రాణిత అతిశయోక్తి యలంకారము"- ఇందుచెప్పబడినది.
అసమాన మైన పదాడంబరము, సుదీర్ఘసమాసములు, పాఠకుల కలవిగాని యానందాశ్చర్యములను కలిగించు
చున్నవి గదా! ఇదీ పెద్దన గారి వర్ణనలోని గొప్పదనము!

రాయలసీమ రసజ్ఞత మరియొక దత్తపది

రాయల సీమ రసజ్ఞత
క్షామము దాపురించి పలుమారులు చచ్చెను జంతుసంతతుల్
వేమురు జచ్చినారు ప్రజ వేనకువేలు చరిత్ర లోపలన్
క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా
నామృత పుష్టికిన్ కొరత నందని రాయలసీమలోపలన్
కన్నీరు,మున్నీరు,పన్నీరు,తేనీరు అనే పదాలను యిచ్చి రాయాలసీమ లో నీటి కోసం
 రాముడిని ప్రార్థించ మని ఒకసారి అవధానం లో నాగఫణి శర్మ గారిని అడుగగా వారి పూరణ :
కన్నీరున్ దిగ ద్రావలేము గదరా గంభీర మేఘా కృతీ
పన్నీరౌ నీ కడగంటి చూపు చిలుకన్ భద్రాంగ జాగేలరా
మున్నీరై చను సీమ జీవితములో ముత్యమ్ము నీ చూపే రా
తిన్ నాతిన్ గలిగించు వాడ దయతో తేనీరు రామప్రభో

   నేను అంతటి శక్తివంతుడను కాదు కాబట్టి ఇంటి వద్ద పూరించినది
కన్నీరన్నది త్రావలేము వరదా కరుణింత చూపింపవా
మున్నీరై యది ముంచి మాదు ఎదలన్ మోదంబు గొంపోయె, నీ
పన్నీరౌ కరుణాకటాక్షములచే పట్టింపులన్ వీడుచున్
తిన్నాత్రావితి నంచు వూరుకొనకన్ తేనీరు రామప్రభో! 
దత్తపది
ఏసుమేరిసిలువచర్చి కృష్ణుని పరంగా ...
ఒక గోపిక శ్రీకృష్ణునితో చేసుకొనే విరహముతో కూడిన వేడికోలు, గమనించండి. నేను ఇంటిలో కూర్చొని పూరించిందే!
ఏ సుదతి నీడనుంటివొ
నీ సఖినెడబాయ న్యాయమేరీతియగున్
భాసిలు వరదా నా దరి


నీసరి చర్చించలేను నిజముగ కృష్ణా!

Thursday 2 March 2017

సమస్య మనది -- సలహా గీతది 1- 15

 సమస్య మనది - సలహా గీతది  (గీత - అధీత)
http://cherukuramamohan.blogspot.com/2017/03/1.html


ఏపనికైనా ఆరంభము ఒకటుంటుంది. ఒక పని చేయుటకు పాత్రత అత్యవసరము.అట్లని accident అయితే ambulance కొరకు కాచుకొని ఉండము కదా. ఎదో ఒక విధంగా   ఎవరో ఒకరు ఆస్పత్రి చేర్చినట్లు నేను గీతా ప్రాశస్త్యము తెలిపే ఈ పనికి పూనుకొన్నాను. మన సందేహాలకు ఎటువంటి సమాధానాలు గీత సమకూర్చుతుందో చూస్తాము. నిజానికి నాకు యోగ్యత లేదు, ఈ ధర్మాన్ని కాపాడవలెనను తపన తప్ప. నా తప్పుకు ఒప్పుకు దేవుని బాధ్యునిగా చేసి తిప్పలు తప్పించుకొని తిన్నగా విషయానికి వస్తున్నాను. గీత-అధీత!అంటే స్థూలముగా గీత చదివినారా ! చదవకుంటే చదివి మీ సందేహాలు తీర్చుకొండి అన్నది సందేశము.

ప్రస్థాన త్రయము అన్న పేరు మనము విన్నదే కానీ ఆ మూడు ఏవి అని బహు సూక్ష్మముగా స్పృశించుదాము. మనము ఈ దేశములో పుట్టినందుకు నిజముగా గర్వపడవలె. ఈ భూమి మహనీయులకు ఆలవాలము, మహాత్కార్యములకు ఆలవాలము, మానవత్వమునకు ఆలవాలము, మంజుభాషణమునకు ఆలవాలము, మమతానుబంధములకు ఆలవాలము.సకల వేద, వేదాంగ, వేదాంత సారమును విశ్వ కళ్యాణము కొరకు విస్తృతముగా వివరించిన వివరించిన ఘనత మన ఋషులది.
ఆహార నిద్రా భయ మైధునాది పాశవిక తత్పరత కతీతముగా తనకున్న బుద్ధిని సంపాదించిన జ్ఞానమును ఉపయోగించి జీవన ప్రస్తానమునకు అనగా బయలుదేరుటకు , ఎక్కడికి అంటే వచ్చిన చోటికి, వలయు వివరములను విశ్వమానవ కల్యాణమునకై వివరణాత్మకముగా విపులీకరించినారు. " ప్రతిష్ఠంతే అనే నేతి ప్రస్థానంబ్రహ్మసూత్రములు." అంటే మార్గము అనే అర్థము.ఆ వివరణలే ప్రస్తాన త్రయములు.' త్రి ' అంటే మూడు అని అందరకూ తెలిసినదే! అందులో మొదటిది ఉపనిషత్తు. ఇది ఒకటి కాదు. ఇన్ని అని ఇదమిద్ధంగా చెప్పనూలేము. కానీ మన సౌలభ్యము కొరకు ముక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తుల పేర్లను తెలియబరచినారు. ఈ 108 లో చివరిది ముక్తికోపనిషత్తే . 'ఉ' అంటే వద్ద అని 'ప' అంటే పదములు లేక పాదములు నిశతి అంటే కూర్చునుట. అంటే జిజ్ఞ్యాసువు గురువు పాదముల చెంత కూర్చుని పరతత్వము తెలుసుకొనుట అని అర్థము. 
ఇక రెండవది బ్రహ్మసూత్రములు. సూత్రము అంటే త్రాడు అనే అర్థమే కాకుండా సూచించేది అనే ఒక అర్థము ఉన్నదని విజ్ఞులు చెప్పగా విన్నాను.ఇవి బ్రహ్మ స్వరూపమును సూచించుతాయి  కాబట్టి వీనికి బ్రహ్మ సూత్రములు అన్న పేరు సార్థకమైనది. బ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు శ్రవణ రూపములో బోధించితే బ్రహ్మ సూత్రములు 'మనన' రూపములో బోధించుతాయి."శ్రోతవ్యో మన్తవ్య " అని ఉపనిషత్తులే చెబుతున్నాయి.ఇక మనన తరువాత మిగిలినది 'ఆచరణ'.దానిని తెలిపేదే మూడవదియైన 'భగవద్గీత.' ఈ భగవద్గీత భవ తారకము . ఆలకించినా,ఆలపించినా ఆచరించితే అవ్యయ పదము అందుకోవడమే! లౌకికముగా మన ధర్మ సందేహాలకు భగవద్గీత చెప్పే పరిష్కారమార్గాలు గమనించూదాము అనుసరించుదాము. ఆనందమును పొందుతాము. 

రేపు  సమస్య - సలహా తో కలుస్తాము.

సమస్య మనది -- సలహా గీతది - 1
భగవద్గీత, బైబిలు ఖురాన్ ల వంటిది కాదు. అది జీవితపు చీకటిలో కరదీపిక. ఇహపరాల విజ్ఞాన వేదిక. భగవద్గీత ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఇక్కడ customer అన్నవాడు ముముక్షువు. ఎన్నో ఊహలు ఎన్నెన్నో  సందేహాలు. అన్నింటికీ సమాధానాలు కావాలి. మరి ఒక్కొక్క సమాధానానికి ఒక్కొక్క చోటికి పోలేడు. మరి అన్నీ ఒకే చోట దొరికే అవకాశముంటే ఆ ఒక్క చోటే చాలు. మరి అంతకంటే ఆ కష్టమరుకు అంటే ఆ ముముక్షువుకు వేరేమి కావలసి వుంటుంది. పరమునందుకొను మార్గములు పలు తెరగులని చెబుతున్న గీత ఇహ సాధనమునకు గూడా ఎన్నో మార్గములను సూచిస్తూవుంది. అందుకే దీనిని లక్ష్య గ్రంధమనికూడా అనవచ్చును. ఇందులోని శ్లోకసారమును మనము ఎంతో సులభముగా మన జీవిత, కార్యాలయ, ఔద్యోగిక మరియు ఆంతరంగిక విషయములకు మాత్రమే గాక సునిశిత 
పరిశీలనము ద్వారా ప్రతి జీవిత సమస్యకును తగిన సమాధానమును సమకూర్చుకొనవచ్చును. భగవద్గీతలోని జ్ఞానము అపార పారావారము. దేవుడు ఒకడే అయినా ఏ పేరును స్మరిస్తూ తరింపదలుస్తామో ఆ రూపముననే ప్రత్యక్షమయినట్లు భగద్గీత ఒకటే అయినా మనము తలపోయు సమస్యకు తాను సమాధాన రూపములో మనకు దర్శనమిస్తుంది. ఇక మనము ఈ క్రింది సమస్యతో మన సందేహములను ప్రారంభించుదాము.
సమస్య మనది-సలహా గీతది-1సమస్య: 
నేనేమో సర్వ సన్నద్ధమైనాను. చివరి నిముసములో అది నిరుత్సాహామో, భయమో, నిర్లక్ష్యమో, నన్నావరించింది. పని జరుగుతుందన్న నమ్మకము సన్నగిల్లింది. నాకు ఏమీ తోచుట లేదు.
సలహా :
నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ఆత్మస్థైర్యము అన్నది ఆచరణకు ఆభూషణము. పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టు. 
నీ కార్య సాఫల్యమునకు అదే ఉడుము పట్టు. ఇక్కడ ఉడుము ను గూర్చి రెండు మాటలు చెబుతాను. పూర్వము పెద్ద పెద్ద బురుజులుగల కోట పైకి శత్రు సైనికులు .చేరాలంటే బలమైన మోకుకు (అంటే పురి గల చేంతాడు లాటిది.) ఈ ఉడుములు చాలా తెలివి గలవి. వీటికి పొడ వైన మెడ, శక్తివంతమైన తోక, అవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా బలిష్టంగా ఉంటాయి. 'ఉడుము అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు తాళ్ళు కట్టి, మూతికి బెల్లం పాకం రాసి శత్రువుల కోటగోడల వద్ద పైకెక్కింపజేసే వాడు. అవి పూర్తిగా పైదాకా ఎక్కిన తరువాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టుకునేది.  ఎంత గట్టిగా పట్టుకునేది అంటే ఆ మోకు ఆధారంగా సైనికులంతా కోట గోడలెక్కి కోటలోనికి చేరుకోనేవారు. ఇంతమంది ఆ ఉదుమునకు కట్టిన మోకు సహాయముతో ఎక్కినా ఉడుము మాత్రము చలించేదికాదు. అందుకే 'ఉడుము పట్టు' అన్న సామెత జనబాహుళ్యములో ప్రబలమై ఉన్నది .  'భయముంటే జయముండదు'. అందుకే 'పట్టు విడకు నేరే సాధన ఫలియించును శుభకామన' అన్న మాటను కలకాలమూ గుర్తుంచుకొనవలసియుంటుంది. 'ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై' అన్నది భర్తృహరి సుభాషితము. 'అలసత్వమును గూర్చి ఒక్క మాట చెబుతాను. 'అలసత్వము' అన్నది ఒకటే పదమైనా అందులో మనము 'అల' సత్వము' అన్న రెండు పదాలుగా మన అవసరము కొరకు విడగొట్టుకొనవచ్చును. 'అల' మనస్తిమితమును దూరము చేసి ఆలోచనకు తావివ్వక అనర్తమును సృష్టిస్తుంది. అదే 'సత్వము' అన్నది ఉత్తమోత్తమ గుణము. 'సత్వము' గలిగినవాడే మనస్సును నిగ్రహించి తనదారికి మరలించాగాలుగుతాడు. గలవాడు సాధించలేనిది లేదు. కొంగ తానూ నిర్ణయించుకొన్న మార్గమునకు కట్టుబడి సరసులో కొంగజపము చేస్తూ నిలబడి చిన్న చేపలను తాకకుండా, ఏ పరిస్థితిలోనూ నిరుత్సాహపడకుండా, ఉండుటచే పెద్ద చేపలకు భ్రమ కలిగించి తన పబ్బము గడుపుకొనుచున్నది. మనకు కావలసినది కూడా ఆ పట్టుదలే!
ఇక భయమును గూర్చి. బాల్యములో వీధి కుక్కలు వెంటబడితే కరుస్తాయేమోనన్న భయం తో పరుగెత్తే వాళ్లము. అప్పుడు , ఇల్లు చేరిన పిదప మా అమ్మమ్మ చెప్పేది " నీవు పరిగెత్తటం వల్ల అవి నిన్ను వెంబడిస్తున్నాయి నీవు స్థిమితపడి నెమ్మదిగా నడువు ,అవి నీ జోలికి రావు. ఆమాటే నా జీవితపు రాచబాట అయ్యింది. ఈ వాస్తతవము, పరీక్ష కొరకై నిరీక్షించే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఒలుపు వైనముగా నిలుపు నిదానముతో ఏపనిచేసినా అలుపు ఆయాసము లేకుండా ఉంటుంది. రోడ్డునకు మధ్యలో నిలబడి దూరము నుండి వచ్చె పెద్ద ట్రక్కును చూస్తె మొదట చిన్నదిగానే కదా కనబడుతుంది. పట్టించుకోకుండానో పరధ్యానముగానో ఉండి దగ్గరకు వచ్చినపుడు చూస్తే ఊహకు అందకుండానే చూచినవాడులోకానికి దూరమై పోవచ్చు. కాబట్టి దీర్ఘదర్శనము కలిగినచో ఆపదలను అధిగమించి ఆనంద ఫలితములందుకొనవచ్చును.

ఇంతటి గొప్ప విషయాన్ని రెండు పంక్తులలో భగవద్గీత ఎంత హత్తుకోనేవిధంగా చెప్పిందో చూడండి .

సమరమునకు సర్వ విధములా సమాయత్తమైన తరువాత పాప భీతి యను భ్రాంతి లో మునిగిన  బీబత్సునితో 
కృష్ణు డిట్లంటున్నాడు.
క్లైబ్యం మాసమ గమః పార్థ నైతత్వయ్యు పద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్విష్ఠ పరంతపా 

తగని సమయమున తలపులు మారెను

నపుంస తత్వము నరముల నిండెను 
దుర్బలత్వమును దూరముచేయుము
పరంతపా అదె పరమోత్కృ ష్టము 
                              (స్వేచ్ఛానువాదము)
ఇక్కడ పార్థ అని పరంతప అని రెండు సంబోధనలు కృష్ణుడు అర్జనునకు  వాడుచున్నాడు. మొదటిదానికేమో, పృథ కుమారుడు  (అంటే కుంతీదేవి మరోపేరు పృథ ) అన్నది ఒక అర్థమైతే , వేరొక అన్వర్థములో  పార్థివ మైన శరీరము, అంటే మట్టిలో కలిసిపోయేది, కలిగిన అర్జునా ! అని. అంటే మానవులమైన మనమందరమూ ఎదో ఒకరోజు మన్నులో కలిసి మిన్ను జేరవలసిందే అని అన్వయాత్మకముగా చెబుతున్నాడు. అంటే లేనిపోని వ్యథలు వ్యామోహాలు పెట్టుకోకు. చేయవలసిన పనిని సాకులుచేప్పి తప్పించుకోజూడకు, అని హెచ్చరించుచున్నాడు. ఇక పరంతపా అన్నది రెండవ సంబోధన. యుద్ధభూమిలో వున్నారు కాబట్టి, అర్జనుడు వీరాధి వీరుడు కాబట్టి, శత్రువులను తపపింపజేసే వాడా అంటున్నాడు. అంటే అతని సామర్థ్యము అతనికి గుర్తు చేస్తున్నాడు. అసలు 'పరంతప' అన్న మాటకు శత్రు భయంకరుడు అన్న అర్థమును తీసుకొనవచ్చును. అరిశాద్వార్గాములే మన నిరంతర అన్తఃశత్రువులు. వానిని మట్టుబెట్టగలిగినా లేక కనీసము అణచివేయ గలిగినా మనము లక్ష్యసాధనకు అడుగు ముందునకు వేసినట్లే! ఈ విధముగా సరియగు సమయములో సరియయిన సలహాను ఇచ్చుటనే కదా పాశ్చాత్యులు counselling అనేది. మన దేశములో ఎన్ని వేల సంవత్సరములనుండి ఉన్నదో గమనించండి. అందుకే తన పంచ రత్న కీర్తనలలో త్యాగయ్య 'సమయానికి తగు మాటలాడి' అన్నాడు. విద్యార్థుల విషయములో , ధైర్యము నింపటము తల్లిదండ్రుల బాధ్యత. ఏదయినా interview కు వెళ్ళే సమయములో ఈ శ్లోకము గుర్తుంచుకొంటే ఎంత ధైర్యమిస్తుందో ఎంత ధైర్యమొస్తుందో చూడండి. ఏ పని ప్రారంభాములోనైనా పైన తెలిపినఈ శ్లోకము ఒక శిలా శాసనము.
మరియొక సమస్యకు జవాబుతో మళ్ళీ కలుస్తాము.
**************************************



సమస్య మనది -- సలహా గీతది -- 2
(http://cherukuramamohan.blogspot.com/2017/03/1.html)

సందేహం : నేను ఎంతో బాగా ఈ EXAM కు మా INSTITUTE LECTURER చెప్పిన విధముగానే Prepare  అయినాను. ఎలా చేస్తానో అని భయం. ఈ TEST మరియు INTERVIEW ఉత్తీర్ణుడనై ఉద్యోగము తెచ్చుకోగలనో లేదో  నా రాత ఎట్లుందో? ఏదయినా ఉద్యోగిగా  పని చేస్తున్నపుడు కూడా ఇదే భయమే ఉంటుందేమో!

సమాధానం : అసలు అన్ని విషయములకూ మూలము ఆత్మ బలము. దానిని ముందు వడిసి పట్టుకోవాలి. దానిని అభివృద్ధి పరచుకోవలెనంటే తగిన గురువును నీవు గుర్తించవలసియుంటుంది. అర్జునునికి ఆ కష్టము కలుగలేదు. ఆయనకు మొదటినుండి మిత్రుడయినవాడే గురువయినాడు. మంచు పర్వతములో తాపమునకు తావుండదు కదా! అర్జునుడు చేసుకొన్న పూర్వ జన్మ పుణ్య ఫలితమది. నీ విషయము అట్లు కాదు. గురువు పై గురి కుదురుట అత్యంత ముఖ్యము. కావున నీకు గూడా మొదట గురువును ఎన్నుకొనుట అన్నది సమున్నతమైన విషయము. నీకు ఆకలి అవుతూవుంది అనుకొందాము. అట్లని ఏ బండి దగ్గర తిండి తినలేవు కదా! నీ స్తోమతకు తగిన హోటలును వెదికి అక్కడికి పోతావు. హోటల్ కు పోయిన తరువాత నీలో ఆత్మ బలమే వుంటే నీవు కోరినది తెప్పించుకొంటావు లేక కొంత ఆలోచనా బలము వుంటే ఎక్కువగా Customers Tiffin తెప్పించుకొంతున్నారో చూసి నీవుకూడా దానికే Order ఇస్తావు.  ఈ రెండూ లేవనుకొంటే ‘కాలే కడుపుకు మండే గంజి’ అన్నట్లు ఎదో ఒకటి తిని వస్తావు. ఇది లోక సహజము. 

ఈ విషయాన్ని ఒకపరి గమనించు. నీవు LECTURER అంటున్నావు కదా!  LECTURER కూడా ఒక విధమగు TEACHER అన్నది మనకు తెలుసు. ఇప్పుడు TEACHER కు ఒక 'గురువు'కు గల తేడా గమనించు . TEACHER పాఠము చెప్పి ముఖ్యమైన ప్రశ్నలు వాని సమాధానాలు చెప్పడముతో తీరి పోతుంది. గురువు బాధ్యత అది కాదు. గురు అనే మాటకు ఆంగ్లములో ఎన్ని అర్థములున్నాయో చూడండి.
Spiritual teacher, teacher, tutor, sage, counsellor, mentor, guiding light, spiritual leader, leader, master Acharya, Pandit; Swami, Maharishi.
అంటే ఒకే వ్యక్తిలో ఈ గుణాలన్నీ వుంటే అతను గురువౌతాడు .గురువుకు వయోభేదము ఉండదు. 
చిత్రం వటతరోర్మూలం శిష్యా వృద్ధః గురుర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాః ఛిన్న సంశయః
ఈ శ్లోకము వల్ల మనకు అర్థమగుట లేదా! మర్రి చట్టు నీడన కూర్చున్న దక్షిణామూర్తి యువకుడు మరియు గురువు. శిష్యులంతా వయోవృద్ధులే! అయినా వారిలో ఆ తారతమ్యము లేదు. గురుత్వము సంపాదించుటకు వయోభేదము అడ్డు రాదు.

శంకరాచార్యులవారు తన శిష్యుడైన సురేశ్వరాచార్యుల వారికన్న (పూర్వాశ్రమములో శంకరులతో వాగ్వాదమున ఓడిపోయిన మండన మిశ్రులవారు ) చాలా చిన్న వారు. అసలు గురువగుటకు బ్రాహ్మణుడు మాత్రమె అర్హుడు అనుటకు వీలు లేదు. జగద్గురువులు అపర శంకరులు అగు భాగవత్పాదులవారు 'చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ'  అన్నారు. ఎంతటి గొప్ప సందేశమో చూడండి. శంకరులకంటే మండన మిశ్రులవారు పెద్దవారయికూడా శంకరులవారి శిష్యులే! కృష్ణ పరమాత్మ అర్జనునికి బావ అంతకుమించి గొప్ప మిత్రుడు.  బలరామ కృష్ణుల గురువైన సాందీపని మహర్షి, వారికన్నా  వయసులో చాలా పెద్దవాడు. వీరు మువ్వురు గురువులే . శిష్యులకన్న చిన్న,సమాన, పెద్ద వయసు కలిగిన వారు. గురుత్వము అంటే నేను సాంద్రతకు అన్వయించు కొంటాను. గురువుకు కేవలము విద్య చెప్పుటేగాక  నడవడిక, సంభాషణా చతురత, పరిశీలన, ఒకటేల అన్నీ కలిగి తన శిష్యునికి నేర్పుచూ అతనికి ఆపద కలుగకుండా గూడా కాపాడుకొంటాడు. అందుకే ప్రతిదినము బోధనాంతములో
సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహైః
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
అంటే ఈర్ష్యా ద్వేషాలకు అతీతముగా కలిసిమెలిసి ఉందాము అన్న మాటకు కట్టుబడి యుంటారు వారు.
ఇంకొక మాట, నీవు నీ Lecturer ను పరీక్షించిన తరువాత నీవు అతనిపై ఎంతవరకూ ఆధార పడవచ్చును అన్న నిర్ణయమునకు రాగలవు. నీకు పూర్తిగా భరవసా వుంటే ఇక దిగులు పడనవసారమే లేదు. గురువు ఏ విషయమును బోధించినా, శిష్యునిపై వాత్సల్య పూరితుడై అతని బాగును కాంక్షించుతూ అతని ప్రగతికి పునాది వేస్తాడు. దీనికి బోధనా సామర్థ్యము ఎంతయో అవసరము. అందుకే 'సమయానికి తగు మాటలాడి...అన్న వాక్యాన్ని త్యాగయ్య ఎంతో అనుభవ పూర్వకముగా తన కీర్తన యొక్క పల్లవిలో పోడుగుతాడు. ఆ అనుభవమునకు పరాకాష్ట శ్రీ కృష్ణుడు. అందుకే గీతలో తన షడ్దర్శనానుభవమును కూడా రంగరించి ఉచితానుచితములను ఆకళింపు చేసుకొని అర్జునునికి ఉపదేశము చేసినాడు.
ఇంకొక విషయము చెప్పవలసి వుంది. కలెక్టర్'స్ ఆఫీసు వుంది. తప్పక కలెక్టరు వయసులోచిన్నవాడేఅయి ఉంటాడు. ఆయన వద్ద పనిజేసే ఉద్యోగులు సామాన్యముగా పెద్దవారు అయివుంటారు. మరి కలెక్టరు ఆజ్ఞాపించిన ఉత్తరువుల మేరకు ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించ వలసినదే కదా! మేరము వయసులో పెద్దవారమని ఆజ్ఞాపాలన చేయకుండా ఉండుటకు వీలు లేదు కదా! అదే విధముగా శిష్యులు కూడా గురువునాజ్ఞ పాటించవలసిందే! ఆ నమ్మకముతో పనిచేస్తే ఒకవేళ తన సలహాలో ఏదయినా పోరబాటుదొర్లినా తానే సవరించుతాడు.
అహంకారము మాని ఆలోచన పెంచినంత మాత్రాన కూడా గురువు దొరకితీరుతాడన్న నమ్మకమునుంచుకోలేము. . అయినా దానికి పూర్వజన్మ కర్మ ఫలము తద్వారా సంపూర్ణ భగవదనుగ్రహము తోడయితేనే అది జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయము తెలియజేసుకొంటాను.
దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం , ముముక్షుత్వం , మహాపూరుష సంశ్రయః ||
అని ఆది శంకరులవారు చెప్పిన మాట. పరమేశ్వరుని అనుగ్రహము లేనిదే ఈ నరజన్మ, మోక్షేచ్ఛ అపరిమితముగా కలుగుట, మహాపురుషుల ఆశ్రయము అనగా తగిన గురువును పొందగలుగుట అన్నవి సాధ్యము కావు. ఒక సారి శృంగేరి పీఠపు ముప్పై ఏడవ గురువైన జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వాములవారు తమ ప్రప్రథమ అనుగ్రహ భాషణములో తాను ఆ పీఠమును అలంకరించుట , తనకు ఏమీ తెలియని వయసులో తమ గురువగు భారతీ తీర్థుల   వారివద్ద వేద శాస్త్రాధ్యయనము చేయవలెనను బలీయమైన అభిలాష తనను గురువు పాదాల చెంత చేర్చినదని తెలుపుకున్నారు. ‘ నేను ఈ పట్టమునకు యోగ్యుడినా?’ అన్న వారి సందేహమునకు జవాబుగా ఈ విధముగా  భారతీతీర్థులవారంటారు ‘అమ్మ కరుణచే నేను నీకు మార్గదర్శిగా ఉంటాను’ అని. చూచినారా శిష్యుడు గురువును గురువు జగన్మాతను ఎంతగా నమ్మినారో! దానిని అచంచల విశ్వాసమంటారు. ఆనమ్మకమే శిష్యుని అత్యున్నత శిఖరాలకు చేర్చగలుగుతుంది. మనసా వాచా కర్మణః
అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం |
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే ||
అని నమ్మినాడు ఈ మహనీయుడు. పై శ్లోకము యొక్క భావమేమిటంటే గంగాతీర్థము అజ్ఞానులకు, విద్య తీర్థము వివేకులకు, ఉన్నవి కానీ భారతీ తీర్థుల వారిని ఆశ్రయించితే అజ్ఞాన తిమిరము అంతమగుటయేగాక   ప్రజ్ఞానజ్యోతి ప్రభవించుతుందట. ఎంతటి గురుభక్తి ఎంతటి అచంచల విశ్వాసము. అంతటి ప్రతిభాశాలి యగు గురువు దొరకక పోయినా కూడా, మనమిపుడు లౌకిక విషయమును ప్రధానాంశముగా చర్చిన్చుచున్నాము కాబట్టి, మనకు ఒక నిజాయితీ గలిగిన గురువు ప్రయత్నమూ మీద దొరుకవచ్చు. మనలో లేని మంచి గుణములు కలిగిన వ్యక్తిని మనము విచక్షణతో  ఎన్నుకోగలిగితే చాలు. అటువంటి గురువు అర్జనునకు మిత్రుని రూపములో దొరికినాడు కాబట్టే ఆయన కృష్ణుని గురువుగా చేసుకొన్నాడు . అది ఆయన అదృష్టము. తదేక దీక్షతో ఆయన పొందిన అనుభవమును మనమూ పొందవచ్చు. ఏ విధముగా నంటే గీతను తదేక ధ్యానముతో సాధించి.
పైన తెలిపిన విధమైన ప్రశ్నను అర్జునుడు  శ్రీకృష్ణునిపై సంధిస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి.

 కార్పణ్య-దోషోపహత-స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ-సమ్మూఢ-చేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే‘హం శాధి మాం త్వాం ప్రపన్నం    భగవద్గీత 2-7
పిరికితనమునకు లోనై నా సహసిద్ధమయిన స్వభావమును కోల్పోయినాను. ధర్మాధర్మ విచక్షణ నాకు ఎండమావిగా కన్పట్టుచున్నది. నాకు శ్రేయస్కరమగుదానిని తెలుపుము. నీ శిష్యుడను నిన్నాశ్రయించినాను.
ధర్మమధర్మము తడుమగలేను
పిరికితనము నను పీడిస్తున్నది.
శ్రేయస్సేదో శీఘ్రము తెల్పుము
నీదు శిష్యుడను నిను శరణంటిని (స్వేచ్ఛానువాదము) (భగవద్గీత 2-7)

దాయల  జంపగ దయ అవరోధము
చొరబడకున్నవి  శౌర్యము ధైర్యము
దేహిని, ఎద సందేహము ప్రబలెను
'కిం కర్తవ్యం' కృష్ణా తెలుపుము
బంధువర్గమును పరిమార్చలేని ఒక నిస్సహాయ స్థితిలో వున్నాను. ఆ దోషముచే నా శౌర్యము డిల్ల పడి పోయినది. చిత్తము మొత్తము ధర్మసందేహమున తగుల్కొన్నది. నీ శరణు తప్ప నాకు గత్యంతరము లేదు. నన్ను శాశింపుము అంటున్నాడు పార్థుడు.
అది ఛాత్రుని లక్షణం. గురువు ఛత్ర ఛాయలో ఉండేవాడు ఛాత్రుడు. ఆ నమ్మకమే గురువును ప్రేరేపించి డోలాయమనములో వున్న శిష్యుని నావను కష్టాల కడలినుండి గట్టెక్కిస్తుంది. అదే జరిగింది ఆఖరుకు. అర్జనుడే అమితానందకందళితుడై ఈ విధంగా అంటాడు.
 నష్టో మొహః స్మృతిర్లబ్ధా
త్వత్-ప్రసాదాన్మయాచ్యుత
స్థితొ స్మి గత-సందెహః -
కరిష్యే వచనం తవ 18 - 73
జ్ఞాతి మోహమును జ్ఞానము దునిమెను
కర్తవ్యము నాకవగత మయ్యెను
శంక  తీర్చితివి, శత్రుల జంపగ
ఆనతి నివ్వుము ఆప్త రక్షకా  (స్వేచ్ఛానువాదము) (18 73)
హే కృష్ణా నా సందేహాలన్నీ పటాపంచలయిపోయినాయి. నా బాధ్యత నాకు గుర్తుకొచ్చింది . నీ మాట నాకు వేదము. నేను నీ ఆజ్ఞానువర్తిని.
దీనినిబట్టి గురువు మీద ఎంతటి నమ్మకము కావలెనో , గురువుకు తన శిష్యుని మనఃక్లేశమును దీర్చి కార్యోన్ముఖుని జేయ ఎంత ధీమంతుడై వుండవలెనో తెలుస్తుంది. ఇక మార్కులు వాటికవే వస్తాయి. పైగా గురువు అప్పటికి ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉంటాడు. నీ కష్టసుఖములు అర్థము చేసుకొనగలుగుతాడు. ఏపనికైనా ధైర్యము స్థైర్యమే ప్రధానము. అవి గురువునుండి లభించితే ఆ శిష్యునికిక అడ్డేముంది.
అంటే తన శిష్యుని గ్లాని తొలగించి అతనిని కార్యోన్ముఖుని చేయాలంటే గురువు కూడా ఎంతో శ్రమించ వలె. ఇక్కడ తల్లి , లేక తండ్రి కూడా గురువు కావచ్చును. స్నేహితుడు కూడా గురువు కావచ్చును. సమ్యక్ పరిశీలన  అవసరము. అదే జరిగితే ఆ అనుబంధము ,ఆప్యాయత, ఆత్మీయత, అంతఃకరణ , అనురాగము పరస్పరము వున్న ఎవరైనా గురు శిష్యులు కావచ్చును. నేటి సమాజమున అటువంటి గురువుల ఆవశ్యకత ఎంతయోనున్నది. శ్రద్ధ సమయము జత చేరితే సాధించుట కష్టము కాదు. ఇదే విషయమును ఒక Corporate Office కు కూడా వర్తింప జేసుకొన వచ్చును. అర్జంటు గా ఒకపనిని అప్పజెప్పి  చేసి తెమ్మని నీ పై అధికారి నీకు ఆదేశమునిచ్చినాడు. నీకు అది ఎట్లు చేయవలసినది తెలిసిరాలేదు. నీతోబాటూ పనిచేసే ఒక Senior వద్దకుపోయి అతనిని అడిగి తెలుసుఇకొని, లేక అతని సహాయమును తీసుకొని ఆ పనిజేసి గడువులోపలనే మీ Boss కు అందజేస్తావు. ఆ Senior ఆ పనికి సంబంధించినంతవరకు నీ గురువు. అంటే అర్జునునికి శ్రీకృష్ణుని అంతటి వాడు. నీ వినయము నీ విధేయతే నీ సాఫల్యమునకు సోపానములు. అవి వుంటే నీ సాంగత్యముకూడా మంచి వారితో ఏర్పడుతుంది.
సాంగత్యము సక్రమమైతే సత్ఫలమునకు కొదువలేదు.
ధ్యాన మూలం గురోర్మూ ర్తిః
పూజ మూలం గురోర్పదం
మంత్రం మూలం గురోర్వాక్యం
మోక్ష మూలం గురోర్కృపాః
గురువు యొక్క స్వరూపము శిష్యుని ధ్యానమునకు మూలము. గురువు పాదము పాదార్చనకు మూలము. గురువు వాక్యము మంత్ర మూలము. గురువు యొక్క కృపయే మోక్షమునకు మూలము.
తస్మై శ్రీ గురవేనమః
స్వస్తి
*********************************************************************************

సమస్య మనది - సలహా గీతది --3

సమస్య :జరిగే ప్రతి సంఘటనకు, అది మంచి గానీ చెడు గానీ, నాలో ఒక ప్రతిక్రియ కల్గుతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తులపై, వారు అయినవారు అయినా కాకున్నా పరితాపము పెరుగుతుంది. చచ్చిన వారు చచ్చినారే అని బాధపడగా బ్రతికినవారు బాగుపడలేక పోతున్నారు అని బాధ. ఇది ఏవిధంగా తీరగలుగుతుంది?


సలహా : ఇది నీ భ్రమ. ఈ భ్రమయే ఒక నిర్లిప్తతకు, ఆ నిర్లిప్తత ఒక విధమగు వైరాగ్యానికి దారి తీస్తాయి. ఈ వైరాగ్యమును కూడా మన పెద్దలు మూడు విధములుగా విభజించినారు.
 1. పురాణ వైరాగ్యము 2. ప్రసూతి వైరాగ్యము ౩. స్మశాన వైరాగ్యము.

1.     పురాణ వైరాగ్యము: నీవు విశ్వామిత్రుని జీవితమును గూర్చి, ఆయన బ్రహ్మర్షి అయిన విధమును గూర్చి ఒక పౌరాణికుడు ఎంతో హృద్యముగా చెబుతూవుంటే తస్దేకముగా విన్నావు. వెంటనే నీవుకూడా తపోదీక్ష వహించి అంతటివాడు కావాలనుకోన్నావు. పురాణం ముగిసింది. బయట పాడినావు. మార్గ మధ్యములో ఉందీ వుందని బట్టలతో నాట్య విన్యాసము చేయుచున్న ఒక నటి Wallposter చూసినావు. ఇప్పుడు నీ మెదడులో విశ్వామిత్రుడు లేదు, పురాణమూ లేదు. ఇప్పుడు కేవలము నీవు ఆ నటి నాట్యము చేస్తున్న ఊహ తప్ప. అంటే ఈ పురాణ వైరాగ్యము క్షణికము అని తెలిపోయినది కదా! సదా ఆభావన మనసులోవుంటే నీ కర్తవ్యము నుండి నీవు విముఖుడవు కావు.

2.    ప్రసూతి వైరాగ్యము: ఇల్లాలు ప్రసవించే సమయములో ఇక వద్దురా పిల్లలు అనుకొంటుంది. కానీ కొంతకాలము తరువాత అబ్బాయి\అమ్మాయి పుడితే బాగుణ్ణు అనుకొంటుంది. అంటే ఒక వస్తువును పొందుటకు కలిగినబాధ ఆ క్షణమునకు చాలా ఎక్కువ అని అనిపించినా కొంత కాలము తరువాత అందలి ఆనందము హృదయమును ఆవహించుటతో తిరిగీ అదేకావలెనని అనిపిస్తుంది. దీనినే తాత్వికులు మాయ అంటారు. ఇంగ్లీషు మందులు తీసుకొంటే వ్యాధి అణిగినట్లు ఇక్కడ కోరిక అనిగియుండినది కానీ అది తుడిచిపెట్టబడలేదు.

3.    స్మశాన వైరాగ్యము: ఒక Chain Snatcher యొక్క భార్య చనిపోయింది. ఆమెకు ఉత్తరక్రియలు జరుపుతూ ఇక నేను ఆడవారి బంగారు గొలుసులు లాగి ఎవరికివ్వాలి. అసలు ఇక నా బ్రతుకునకు అర్థమొకటి ఏడ్చిందా! అని ఎంతో విలపించినాడు. ఆ బాధను భరించలేక సారా కొట్టుకు పోయి సారా త్రాగినాడు. సారా పోస్తూ ఒక మదవతి కనిపించింది. ఎట్లయితేనేమి ఇరువురి మధ్య ఆకర్షణ ఏర్పడి సహజీవనము సాగించ మొదలుపెట్టినారు. మొదటి భార్య పిల్లలు వీధిపాలయినారు. కొత్త భార్య కోసం మళ్ళీ తన పాత వృత్తి మొదలు పెట్టినాడు. దీనివల్ల ఏమి తెలుస్తూవుంది. పెరుగుతున్న తులసి మొక్క వరదలో కొట్టుకపోయినట్లయినది.

కావున మనలో ఏర్పడిన సంకల్పము  మంచిదై దానికి బలము చేకూరితేనే అది కార్యరూపము దాలుస్తుంది. మాయా మోహములు ఆవరించు ఉన్నంతవరకు మనిషికి  తన బాధ్యత తెలిసిరాదు.

ప్రతిజీవికీ, జీవితములో తనకొక విధి,బాధ్యత , కర్తవ్యము ఉంటుంది. నీ మనసును ఆ బాధ్యత పైన లగ్నం చేస్తే అన్యధా కలిగే ఆలోచనలు వాటికవే పటాపంచలైపోతాయి. ఎందుకంటే నీ మనసు నీ పని పై లగ్నమైవుంది కాబట్టి. ఇక పనిలేనపుడు నీవు ఆలోచించే వ్యక్తులను గూర్చి అంటావా వారంతా వారివారి 1.ప్రారబ్ధ 2.సంచిత కర్మఫలములననుభవించుతూ మూడవదియైన, తదుపర్ జన్మలో వచ్చే ఆగామి కర్మననుభవించుటకు,   కర్మల జేసి వాని ఫలితములనుభవింప ఎదురుచూచుచున్నారు. ఇందులో నీ ప్రమేయము అసలేదీ. మరి ప్రమేయమే లేకపోతే చింతపడి ప్రయోజనమేమి పొందుతావు.
భగవాన్ రమణుల, తెలుగులోకి అనువదించిన "ఉపదేశ సారం" ఎందరో ముముక్షువులకు మార్గదర్శకము. ఈ చిన్న సంస్కృత శ్లోక పాదము ఎంత అర్థవంతముగా వుందో చూడండి.

ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం | చిత్త శోధకం, ముక్తి సాధకం ||”

అంటే పైన చెప్పిన ప్రకారం కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాసక్తి లేకుండాను, లోకహితార్థముగాను, ఈశ్వరార్పితముగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.


అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, అవి మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి. ఈ మాటను సులభముగా అర్థము చెసుకొనవలెనంటే మనము ఒక పని చేయ తలపెట్ట దలచినపుడే మంచి చెడులను క్షుణ్ణముగా పరిశీలించి, ఈ కర్మ ఫలితము మన ప్రస్థానమును  పరమాత్ముని సమీపమునకు చేర్చుతుందా అన్న అవగాహనతో చేయుట అత్యుత్తమమగు విషయము. కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకొని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకొని కర్మలు చేయాలి. అప్పుడే ఆ కర్మ త్రికరణ శుద్ధి కలిగియుంటుంది. సత్వ గుణమును ఎంతగా మనము అభివృద్ధి పరచుకొంటామో మన బుద్ధి కూడా ఎక్కువగా సత్వగుణ సముపేత కార్యాచారణము మీద మక్కువ ఎక్కువగా చూపుతుంది. మనము వర్తమానములో ఎపనినైతే ప్రారంభిస్తున్నామో దాని కొనసాగింపు ఆగామి కర్మ అవుతుంది.ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుండి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను అంతఃకరణ శుద్ధితో చేసి అది మన భూతకాలకర్మానుబంధము అగులాగున జాగ్రత్త పడవలెను అంతేగానీ అది సర్పబంధము కాకూడదు. కావున ఎప్పుడయితే విచక్షణాయుతమైన కార్యాచరణకు నీవు గడంగుచున్నావో అప్పుడు నీవు 'జ్ఞాని' అన్న పట్టమునకు చేరువవుతున్నట్లే. అప్పుడు ధర్మా ధర్మ విచక్షణతో కర్మాకర్మ లను గమనించి ఆచరణ గావించ గలవు.

ఈ విషయాన్నే కృష్ణుడు అర్జనునితో ఈ విధంగా చేబుతాడు : 

అశోచా నన్వశోచన్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే 

గతాసూనగతాసూంశ్చనాను శోచంతి పండితాః  11-2


అగతుల విగతుల నందరి గూరిచి

తలపోయకు నీ తలలో చేరిచి

ప్రజ్ఞా వాదపు భ్రమలో మునుగడు

జ్ఞాని వానిపై జ్ఞాపకముంచడు     (స్వేచ్ఛా నువాదము )      11-2


ప్రజ్ఞావాదము ను గూర్చి ఒక మాట చెప్పుకొందాము. ఇది చాలా పెద్ద విషయము. నా దృష్టి లో ప్రజ్ఞా వాదమంటే ' దూరంగా ఒక ఇంటిలోనుండి పొగ వస్తూవుంది. తనకు గల  ప్రజ్ఞను వాడి వెంటనే నిప్పులేనిదే పొగ రాదు అని చెబుతాడు. కాబట్టి ఇంటికి నిప్పంటుకొనింది అంటాడు.' నిజానికి ఇది నిజమైతీరనవసరము లేదు. ఇల్లన్న తరువాత ఏ వంటకో వార్పుకో , లేక ఏ సాంబ్రాణి వెలిగించుట వల్లనో కూడా పొగ రావచ్చు. దూరమున్నందువల్ల వాసన రాకపోవచ్చు మరి అంతమాత్రాన ఇల్లుకాలుతూ వుంది అన్న నిర్ధారణకు రాలేము కదా!  ఇదీ  ప్రజ్ఞా వాదము నా అభిప్రాయములో ! కాబట్టి అది తర్కమునకు నిలువదు.

పండ అంటే ఆత్మ విషయమైన జ్ఞానము. ‘పండా ఆత్మా విషయా బుద్ధిః  సాయేషాంతే పండితాః’ అంటే ఆ ఆత్మజ్ఞానము  కలిగినవాడు పండితుడు.  అతడు తన జీవితాన్ని తామరాకు నీటిబొట్టు లాగా గడుపుతాడు .అంటియున్నట్లే ఉంటాడు కానీ అంటించుకోడు. జ్ఞానమునకు వేదశాస్త్రాలన్నీ కంఠ పాఠమై యుండ నవసరములేదు. విచక్షణ వుంటే చాలు. జీవితము నశ్వరము. నేడు అతడైతే రేపు నీవు. ఇది చక్రము. అందరూ దీనినంతుకొని తిరుగావలసిందే!  కాబట్టి చింత వీడి నీ కర్మల నీవాచారించు. అవి దుష్కర్మలు కాకుండా చూసుకో! 

అసలు ఈ శ్లోకమును నీ లౌకిక కార్యాలయమునకు సంధించుకొంటే ఒకడు transfer అవుతాడు, ఒకడు suspend అవుతాడు, ఒకడు పనీ పాట చేయడు. నీవు వీరిలో ఒక్కొక్కరిని గమనించినపుడు ఒక్కొక విధమగు అనుభూతి. కానీ ఈ విషయములకు ప్రాధాన్యతనివ్వక నీ బాధ్యత నీవు సక్రమముగా నిర్వర్తించుకొంటూ పోతే నీకు రావలసిన promotions రాకుండా పోవు. నీకు రాక పోతే అది నీది కాదనుకో. మనసును అల్లకల్లోలము కానీకుండా ఆరోగ్యముగా వుంచుకొనగలుగుతావు. అది వుంటే నీ వార్ధక్యమును చక్కగా గడుపుకొన గలుగుతావు.  నీ ఆత్మ పరమాత్మను కలిసేవరకూ నీతో వుండేది నీ శరీరము. దానికి తనపనులు తానూ చేసుకోగలిగే వసతి దానికి కల్పించు. అది నీ ఆధ్యాత్మిక దఎయమునకు చక్కని బాటను వేయగలుగుతుంది. ప్రభుత్వ మరియు బెంకింగ్ కార్యాలయములలో ముఖ్యముగా retire అయ్యేకాలానికి  BP, DIABETES లేకుండా ఉన్నవారిని వ్రేళ్ళ పైన లెక్కింపవచ్చును అన్నది నా అభిప్రాయము. తస్మాత్ జాగృత.

స్వస్తి.


*******************************************
సమస్య మనది -- సలహా గీతది -- 4
సమస్య : అతను నాకు అత్యంత ఆప్తుడు. అతను గతించుతాడని నేను తలవనేలేదు. నేనతనిని మరువనే లేను. 
సలహా : నీకు జవాబు చెప్పబోయే ముందు 'రైలు ప్రయాణము' ను గూర్చి నేను వ్రాసిన ఈ గేయమును గమనించు:
రైలు ప్రయాణము -జీవన యానము
వచ్చునెప్పుడని యన్నది తెలుసు
పోవు నెప్పుడని యన్నది తెలుసు
వచ్చి పోవు ఆ బండి కొరకు నీ
తపన దెందుకో ఎవరికి తెలుసు
     రాకపోకలకు నడుమన మనము
     రాద్ధాంతములను చేయుచుందుము
     జీవితమే ఒక రైలు ప్రయాణము
     మేటి విల్తుడది వదలిన బాణము
రెండిటి నడుమన యున్నభేదము
ఏమిటన్నయది ఇపుడే చూతము
రైలుయానమున గాంచెదమంతము
జీవయానమది చూడుమనంతము
      ఖర్చులు మనవి కష్టము మనది
      సంపాదించే సౌఖ్యము మనది
      పంచిన ధనము,పెంచును ఘనము
      రైలు యాత్రలో ధన మింధనము
 ప్రయాణ వేదిక ప్రవేశ మందిన (ప్రయాణ వేదిక = railway platform)
మరునిముసమ్మే మొదలుబలాటము
ఎప్పుడు వచ్చును ఎక్కడికొచ్చును
అన్నది పెంచును మన ఆరాటము
       గమనాగమనపు సూచికలున్నా
       సేద తీర్చుటకు వీచికలున్నా
       సహన మన్నదే కనబడదన్నా
       ఎండమావి యది ఎటుల గాంచినా
 వచ్చునంతలో తిండి తినెదము
అంతలోపలే నిదురపోయెదము
పిల్లల పాపల నరచికరిచెదము
మనుషులన్నదే మరచిపోయెదము
        జీవ యానమున డబ్బు చెల్లదు
        మిత్ర బాంధవుల తోడు నొల్లదు
        త్రికరణ శుద్ధిని బుద్ధిగ పెంచిన
        చిత్తము ఈశుని వీడి వెళ్ళదు
 పునరపి జననం పునరపి మరణం
చావు పుట్టుకలు వలయ తోరణం
మన చేతలు మన జన్మ కారణం
నీతి మాలితే బ్రతుకు దారుణం
          అనుబంధాలు ఆత్మీయతలు
          అన్నవేవి మనమొచ్చేటప్పుడు
          మనవనుకొన్నవి మనతోనున్నవి
          మన తోడేవీ! పోయేటప్పుడు
 పోవు రైలు మన కమితోల్లాసము
తిరుగు యానమున ఉదాసీనము
జీవికి ఏడుపు, వచ్చునప్పుడు
ఏడిపించు తా పోవునప్పుడు
        వచ్చుటకేడ్చిన జీవి తాను మరి
        మోహము కోపము లోభము వంచన
        ఐశ్వర్యమ్మును అక్కున చేర్చును
        అహంకారమును ఔదల దాల్చును
పోవునప్పుడో పూచికపుల్లయు
కోరుకున్ననూ కొనిపోలేమను
నిజమును మరచి నీల్గుచుందుము
బట్ట లేకయే వచ్చిపోయదము
        తృటిలో మనసులు కలుపుకొందుము
       తృటిలో మమతలు పెంచుకొందుము
       ఎవరిది వారిదె గమనము గమ్యము
       అంతలోపలే ఈ అనుబంధము
 అంతము లేనిది అంతు తెలియనిది
ఆలోచింపగ ఆత్మ ప్రయాణము
అవసరాలకు ఆనందాలకు
ఆలవాలమది రైలు ప్రయాణము
         ఒక్కసారి యోచించ దలచితే
         ఒక్క మాటలో చెప్పదలచితే
         పోయి వచ్చుటే రైలు ప్రయాణము

         వచ్చిపోవుటే జీవన యానము
పై గేయములోని వేదాంతమును ఆసాంతమూ గుర్తుంచుకొని ఈ సమాధానమును చదివి నీ ఆలోచనలను చక్కదిద్దుకో! ఇక ఈ విషయమును గమనించు. ఒక చిన్న పిల్లవాడు గాలి బుడగ కొన్నాడు. ఎంతో సేపు ఆడుకొనుచుండినాడు. ఆ బాలుని ఊహకు అందకుండానే అది పగిలిపోయింది. కాసేపు ఏడ్చినాడు. కొంత సమయము  గడిచిన వెంటనే తన దృష్టి వేరే ఆట వస్తువు మీద పడింది. మొదటిది మరచిపోయినాడు. తరువాత రోజు ఆ స్మృతి లేనే లేదు. ఆ బాలుడు నీవని ఊహించుకో. ఆ లేత వయసులో లేని మమకారము పెద్దయిన తరువాత ఎందుకు వచ్చినట్లు? వయసు తో బాటూ నీవు మమకారము పెంచుకొంటూ పోయినావు. ఇప్పుడు ఆ వ్యక్తి లేక వస్తువు పోతే బాధ తో కృంగిపోతున్నావు. రేపు నీవే వయోభారముచే కృంగి పోతావు ఆపై నీవే వుండవు. ఏమయి పోతూంది నీ మమకారము.
ఇంకొక వాస్తవాన్ని గమనించు. మనిషికి 1. బాల్యము 2. కౌమారము 3. యౌవ్వనము 4. వార్ధక్యము అన్న నాలుగు దశలు వున్నవి అన్న విషయము మనకందరకూ తెలిసినదే. ఇప్పుడు మొదటి దశ యగు బాల్యమును తీసుకొందాము. నీవు పుట్టినపుడు మీ ప్రక్క ఇంటిలో పిల్లలు లేని దంపతులు వున్దేవారనుకొందాము. నీవు ఎంతో ముద్దుగా ఉన్నందువల్ల వారు నిన్ను ఎత్తుకొని ఎంతో ముద్దుచేసేవారు. ఉద్యోగరీత్యా వారికి బదిలీ యగుట మూలమున వారు వూరు వదలి వెళ్ళిపోయినారు. ఒక 25 సంవత్సరముల పిదప నీవున్న వూరికి, మీయింటికి వచ్చి మీ తండ్రి పేరు చెప్పి ఉనారా అని అడిగినారు. ఉన్నారు ఇప్పుడే బయటికి వెళ్ళినారు అని చెప్పినావు. వస్తారు రండి కూర్చొండి అన్నావు. ఇంతయినా వారెవ్వరూ అన్నది నీవుగానీ నీవేవ్వరు అన్నది వారు గానీ గుర్తించలేదు. కారణము ఏమిటి. నీ బాల్యము అన్న మొదటి దశ విడుచుటతో నీ పరిసరములు మారిపొయినాయి. కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు. యౌవ్వనముతో, కౌమారము యొక్క నైసర్గికము కూడా నీ నుండి నిష్క్రమించింది. అంటే దీనివల్ల మనకు ఏమి అవగాతమౌతూ వుంది. మనము ఒక్కక్క దశ వదలుచున్నప్పుడల్లా ఆ దశకు సంబంధించిన అనేక విషయములను, మనుషులను, పరిసరములను కూడా మరచి పోతున్నాము. శరీరము విడువలేదు కాబట్టి దానిని అంటుకొనియున్న బుద్ధి కొన్నింటిని గుర్తు పెట్టుకొనియుంది. కాయము మాయమైతే బుద్ధి కూడా భూతాలలో కలిసిపోతుంది. మల్లి గుర్తు వుంచుకొనే అవకాశము లేదు. ఆత్మా అమరము కావున అది వేరు ఉపాధిని పొందుతూ వుంది. అంటే, నీ ఆత్మ పరమాత్మను చేరి తిరిగి వేరొక దేహమునాశ్రయించుచుచున్నది.ఇదే విషయాన్నే శ్రీ కృష్ణుడు ఈవిధంగా చెబుతున్నాడు.

దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనంజరా
తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి    13-2

వపుషము మారిన వరుసగ బాల్య,కు
మారమెవ్వనము మరి వార్ధక్యము 
ఆత్మకు తోడుగ అనుసరించునవి
వేరొక కాయము వేరొక ప్రాంతము
ఇందుకోసమై ఎందుకు మోహము 
వీడుము దానిని విధిగా ధీరుడ    (స్వేచ్ఛానువాదము ) 13-2
ఆకారము చూసి భ్రమయ వద్దు. ఆత్మ ను గూర్చి తెలుసుకో! నీవిపుడు కలిగియున్న దేహానికి బాల్య యౌవన కౌమార వార్ధక్యాలెట్లు కలుగుచున్నాయో, ఈ దేహమును వీడి వేరొక దేహము నాశ్రయించి నపుడు దానికీ ఈవే అవస్థలుంటాయి. రూపము మారుతుంది. గతములో నీ స్థూల సూక్ష్మ, కారణ శరీరములతో చేసిన కర్మలు నీ అత్త్మకు అంటవు కావున వేరొక వపుషమునకు మారినపుడు నీకు తలంపుకు వచ్చుట లేదు. అటువంటి జ్ఞాపకాలు అసలు బుద్ధికి సంబంధించినవి. శరీరముతో బాటూ బుద్దికూడా మట్టిలో కలిసిపోతుంది.  కాబట్టి నీవు గుర్తించడముములేదు. అంతే కానీ ఆత్మికులమైన మనకు మరణము లేదు. మరి ఆ వాస్తవాన్ని నీవు గ్రహించినావంటే  మోహము దేహము పై  కలుగదు. ఈ సందర్భములో ఇంకొక మాట చెప్పుకొందాము. వాల్మీకి రామాయణం అరణ్య కాండలో ఈమమకారాల గూర్చి ఒక మాట శ్రీరామ చంద్రుడు  చెబుతాడు :
యదా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే 
సమేత్యపి వ్యపెయేతాం కాలమాసాధ్య కంచన

ఏవం భార్యాశ్చ పుత్రాంశ్చ జ్ఞాతయస్య ధనానిచ 
సమేత్య వ్యవధావంతి  ధృవోహ్యేషాం వినాభవః
పెద్ద ప్రవాహములో కొట్టుకుపోయే రెండు దుంగలు ఒకటై కలిసి కొంతదూరము పోయిన తరువాత తిరిగీ దేనికది విడిపోయి తమ ప్రయాణమును ఆ ప్రవాహములో కొనసాగించుతాయి. దారాపుత్ర ధన జన సముదాయము కూడా అంతే.
ఇన్ని విధాల పెద్దలు చెప్పినా కూడా ఇంకా ఈ మమకార వికారములు అవసరమా!

*******************************************
సమస్య మనది -- సలహా గీతది -- 5 
సమస్య  : చనిపోయిన శరీరము బూడిదయిపోవడమో,  మట్టిలో కలవడమో జరుగుతూవున్నది కదా, మరి ఎటూ చచ్చే దానికి మంచే ఎందుకు చేయాలి? నేను పనిచేసే సంస్థలో, బాధ్యతనెరిగి ప్రవర్తించని వారు ఎందఱో వున్నారు. కష్టపడి పనిచేసే వారూ వున్నారు. మరి ఇరువురిలో పరమాత్మ ఆత్మ రూపములో వున్నపుడు ఈ తేడాలెందుకు.

సలహా : ఇవి రెండు విషయములుగా వర్గీకరించి ఒక్కొక్కటిగా విశ్లేషించు కొందాము. ముందు అసలు ఎటుతిరిగీ చచ్చేదానికి మంచి చేయవలసిన అవసరమేమిటి అన్న విషయమును గూర్చి పరిశీలించుదాము.

శరీరము పంచభూతాత్మకము. పంచ భూతాలు 1.పృథివి (భూమి) 2. ఆపస్సు (నీరు ) ౩. తేజస్సు ( వెలుగు ) 4. వాయువు (గాలి) 5. ఆకాశము (ఆకాశం గగనం శూన్యం .  అందనిది, అగుపించనిది. అగుపించుతూ వుంది అని మనమనుకోనేది భ్రమ.) పంచభూతముల యొక్క కలయికే ప్రాణము. ఈ పంచభూతములలోని అణువుల కలయిక చేత  ఒక ప్రాణము ఏర్పడుతుంది. మరి ప్రాణులలో ఒకరికొకరికి పోలిక ఉండదు కదా అంటే అది ఈ అణుసంయోగములోని అనంతవిధముల నిష్పత్తుల పౌనఃపున్య ప్రభావము వల్ల. ఈ వాస్తవాన్ని గమనించు. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు పోయాగా అది మూడు నాలుగు రోజులలో   మొలకెత్తి భూమిపై కనిపిస్తుంది. నిజానికి అది పెరగుటకు భూమి, నీరు, గాలి, ఆకాశము (ఎండ అనగా సూర్య రశ్మి, చంద్రకాంతి* నుండి వచ్చే ఉష్ణము) అన్నియు కావలసిందే!  దీనివలన ఒక ప్రాణి ఉత్పన్నమగుటకు పంచభూత శక్తి ఎట్లు సహాయపడుతున్నదో మనకు తెలియుచున్నది. ఈ పంచభూత శక్తి పలు ప్రాణులుగానూ, మానవునిగానూ  రూపములు ధరించుచున్నది. అప్పుడు పంచభూతముల స్థితి ఏమనగా -- గాలి మనసుగాను, నీరు ప్రాణశక్తిగాను, నిప్పు శరీరమును నిర్వర్తించు శక్తిగాను, భూమి దేహముగాను, ఆకాశము ఆత్మ ఉండు చోటుగాను ఉండును. ఇదే మానవుని రూపము. ఇవి అన్ని చేరి ఒక మానవుని ప్రాణముగా ఏర్పడుతున్నవి.

(* చంద్రకాంతి మొక్కల పెరుగుదలకు ముఖ్యము అన్న విషయమును తెలుసుకోనుటకై అతి క్లుప్తముగా తెలియజేయుచున్నాను. దీనికి ‘సమస్య మనది సలహా గీతది’ తో సంబంధము లేదు. 
చంద్రుని కాంతి, అమృత గుణములు కలది; అది, ఓషధులు, కూరగాయలు, పండ్లు, ధాన్యములు వంటి సమస్త వృక్ష జీవరాశికి పుష్టిని కలిగించి పోషిస్తుంది. ఋగ్వేద సంహితలోని  97 వ సూక్తము లోని 19 వ మంత్రము ఈ విధముగా చెబుతుంది: "ఏ ఓషధులకు రాజు చంద్రుడు అగుచున్నాడో, ఏవి భూమండలమున అనేక చోట్ల లభించునో, వేనిని బృహస్పతి ఉత్పత్తి చేసినాడో అవి రోగికి శక్తిని ప్రసాదించునుగాత."
ఈ యొక్క పోషక గుణములను చంద్రకాంతి అనగా వెన్నెల కు అందించేది తానే అని శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీతలో పేర్కొంటున్నాడు.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ।।   13 - 15

వసుధయందు నే వ్యాప్తి నొందుచూ
సమస్త ప్రాణుల సంరక్షించెద
చంద్రుడనై నే సర్వౌషధులకు
పుష్టిని పూరా పురమాయించెద                               13 - 15
పృథ్వి అంతటా వ్యాపించి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రునిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.

 చంద్రుడి పెరుగుదల మరియు పతనము మొక్కల ఎదుగుదలను ప్రభావితము చేస్తుంది. మొక్కలు , నేల మరియు నీటిమట్టము, తేమపై గురుత్వాకర్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  కృష్ణ పక్షములోని చంద్రుని వెలుతురు మొక్కల వేర్లకు ఎక్కడలేని బలమును చేకూర్చుతాయి. విత్తనములు మొలకెత్తుటకు మంచి సమయము. మొక్కల పోషణకు, ఫలించుటకు శుక్లపక్షము మంచి అదను. ఇది నేటి Science చెబుతూ వుండే మాట. నా మాట కాదు.
మరి ఇంతటి గొప్పవిషయములను తెలిపిన వేదములను, వాటిని తరతరాలుగా కాపాడుకొంటూ వస్తూవున్న బ్రాహ్మణులను మనము ఎంత చిన్న చూపు చూస్తూ వున్నామో ఒక్క సారి సింహావలోకనము చేస్తే అవగతమౌతుంది ఆయా విషయములయోక్క ప్రాశస్త్యము. వేదచోదితవిషములను అర్జునుని ఆలంబనగా తీసుకొని యుద్ధమునకు సుముఖునిజేయు నెపముతో ఎన్ని చెబుతున్నాడో చూడండి ఆ పరమాత్ముడు.)
తిరిగీ అసలు విషయమునకు వస్తే, ఆత్మ ను అంటి పెట్టుకొని ఉంది ఈ నశ్వరమైన శరీరము. ఆత్మ పరమాత్మ చేరితే మరి పంచ భౌతికము పంచ భూతాలను చేర వలసినదే కదా ! ఆ విషయమును చక్కగా గ్రహించమని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు:

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినో  ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత
  18--2     

పార్థా వపుషము
 పార్థివ మేనని
అవ్యయమైనది ఆత్మయేనని 
అవినాశమ్మని అప్రమేయమని
ఎరుగుము, వైరుల నెదిరి పోరుము     (స్వేచ్ఛానువాదము ) 18--2     

అర్జునా! అంతా నీ భ్రమ గానీ దేహములే వేరు దేహి ఒకటే . అదే ఆత్మ. అది అవ్యయము, అవినాశము. ఆత్మ వీడితే, మిగిలేది పంచభూతాలలో చేరిపోయే శరీరమే ! నీ యుద్ధము దుష్కర్మల కూడిన శరీరములను దునుముటకు మాత్రమే. సందేహము మాని నీవు చేయు కర్మ కొరకై సన్నద్ధుడవుకమ్ము. అరటి పండు వలిచి నోట్లో  పెట్టినంత సులభముగా చెప్పినాడు మహా జ్ఞాని యైన శ్రీకృష్ణుడు.
ఇక్కడ ఆత్మ విద్యుత్  ( Electricity ) అనుకుందాము. మన ఇంటిలోని అన్ని విద్యుత్ ఉపకరణములలో అది ఉన్నది . ప్రతి ఉపకరణము ఒక దేహము. అందులోకి విద్యుత్తు చేరనంతవరకు అది మృతమే . ఏ మీట నొక్కితే ఆ నాళిక లేక కళిక (tube or CFL bulb ) వెలుగుతుంది లేక ఏ విద్యుదుపకరణము యొక్క మీట నొక్కితే అది పనిజేయుట మొదలుపెడుతుంది . ఒకవేళ విద్యుత్తు ప్రవహించే రెండు తీవెలను ( + మరియు - ) తాకినామంటే  విద్యుద్ఘాతము కలుగుతుంది. వెంటనే దానినుండి ఆత్మను వేరుచేస్తాము, అంటే మీట తిరిగీ నొక్కి విద్యుత్ ప్రవాహము ఆపుజేస్తాము. అప్పుడు అది నిర్జీవమౌతుంది. అంటే విద్యుత్ ప్రవాహము నిలచిపోతుంది. ఇక్కడ విద్యుత్ నాళిక మంచివ్యక్తి, వదిలిన తంతులు చెడ్డ వాడు. రెంటిలో కూడా విద్యుత్తే కదా వుండినది. కాబట్టి సృష్టి అంతా ఒకే విధముగా ఉండుటకు వీలుండదు. విద్యుత్తు ఒకటే గానీ ఉపకరణములు వేరువేరు. దేని పని దానిది. కావున ఒకే విద్యుత్తే వినాశనమునకు దోహదపడుతుంది, వికాసమునకు దోహదపడుతుంది.  కాబట్టి ఉపకరణములు అంటే కర్మల చేత, కర్మలకొరకు ఏర్పడే శరీరములను బట్టే విద్యుత్తు పని చేస్తుంది. తనలో ఏ విధమగు మార్పూ ఉండదు. అదే ఆత్మ తత్వము సులభముగా చెప్పవలసి వస్తే!

ఇక్కడ గమనించవలసినది ఇంకొకటి ఉంది. నీవు ఇంటిలో అంటే ఇప్పుడు కార్యాలయములో ప్రముఖునివి. నీకు వలసినది వెలుతురు అంటే నీవు తలచిన పనిని జరిపించుట. దీనికి నీవు నీ ఆధీనోద్యోగులను ఆపనిని పూర్తిచేయుటకు భాగస్వాములను చేస్తావు. ఇందులో పనిపై శ్రద్ధ కలిగినవాళ్ళు శ్రద్ధ లేనివాళ్ళు, పని చెడగోట్టేవాళ్ళు కూడా వుంటారు. ఎవరివద్దనుండి ఏమేమి , ఎంతెంత గ్రహించవలెనో అది నీ బాధ్యత అవుతుంది. వారంతా విడివిడిగా పనులుచేస్తూవున్నా వారి మెదడులో నిండియున్నది నీ ఆదేశమే! నీ ఆదేశమే లేకుంటే వారికి పనే లేదుకదా! నీ కార్యమునకు కాల పరిమితి వుంటుంది. నీకూ కాల పరిమితి వుంటుంది కానీ నీసంస్థకు అదిలేదు. నీవు పదవీ విరమణ చేసినా నీబదులు ఎవరో వస్తారు. పని జరుగుతూనే వుంటుంది. ఇదే మాటను రాజ్ కపూర్ యొక్క ‘మేరా నాం జోకర్’ సినిమాలో, జోకర్ ఒక పాటలో ఈ మాటలు చెబుతాడు. ‘కల్ ఖేల్ మేఁ హం హో నాహో గర్దిశ్ మే తారే రహేంగే సదా’ అంటే రేపు నేనున్నా లేకున్నా ఈ ఆకసములో తారలు అట్లే నిలిచి వుంటాయి. అంటే ఈ సృష్టి కార్యము, అంటే పాత పోవడము, క్రొత్త రావడమూ జరుగుతూనే వుంటుంది. నీ మంచే, నీశ్రద్ధే, నీ తదనంతరము కూడా నీపేరు నిలుపుతుంది. శరీరము వదిలిన పిదప కూడా నీకు సత్కర్మ ఫలితము లభించుతుంది. వేదాంత పరముగా ఆత్మ ఒక మంచి దేహమును చూచుకొంటుంది, అదే లౌకిక దృష్టిలో అయితే నీ మంచితనమే నీవు పదవి విరమించిన పిదప కూడా వేరే కంపెనీలో మంచి ఉద్యోగమూ చూపెడుతుంది. నీకు ఉత్సాహముంటే, లేక నీ స్వంత కారణాలవల్ల విరమణ వయసుకు ముందే పదవి వదలినా, నీ మంచి నీకు తిరిగీ మంచి పదవి (చక్కటి వపుషము) వస్తుంది.  ఏవిత్తనము వేస్తే ఆచెట్టేకదా మొలుస్తుంది.
ఇక కర్మల గూర్చి:
శ్రమ లేకుండా, ఆత్మానాత్మ వివేకమను ప్రకరణ గ్రంథములో ఆది శంకరులు ఈ విధముగా వివరించినారు:
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానఅనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. 
ఇక వారి మాటను మీరి వేరేమి చెప్పవలసినది ఉంటుంది.
స్వస్తి. (మరొకసారి మరోసమస్యతో మళ్ళీ కలుద్దాము.)
*******************************************

సమస్య మనది -- సలహా గీతది -- 6



సమస్య :ఈ ఋతువులన్నీ నాకు బాధా కారకాలే. ఎండ వుంటే చల్లగాలి ఉంటె బాగుంటుందనిపిస్తుంది. వాన వుంటే ఎండా కావాలనిపిస్తుంది, గాలి ఎక్కువైతే వానతో ధూళి అణగి పోవాలనిపిస్తుంది . ఏదీ భరించలేను. లౌకికముగా చెప్పవలసివస్తే  బాధనసలు భరించలేను. సంతోషము పెచ్చుమీరితే ప్రాణము పోతుందేమోనని భయము. అనుబంధము పెరిగినా బాధే, తునిగినా బాధే! ఏమిచేయవలేనో తోచదు.



సలహా : ఆంగ్లములో ఈ సామెత వినే ఉంటావు. What ca not be cured is to be endured. పాయలేని బాధను బడయవలసిందే! ఇది ప్రకృతి తత్వము. గంగ హిమాలయములలో పుట్టి చివరకు హిందూ మహాసముద్రము చేరుతూవుంది. ఈ భూలోకము లయమయ్యేవరకూ ఈ ప్రక్రియ జరుగుతూ వుండవలసినదే! తనలో చెత్తనూ చేర్చుకొంటూ వుంది, శవాలనూ చేర్చుకొంటూవుంది అయినా పవిత్ర గంగామాతగా పూజింపబడుతూనూ వుంది. సముద్రములోచేరి తన ఉనికినే కోల్పోతూనూ వుంది. కానీ తన దారి మరల్చుకోలేదు. మంచినీ చేడుగునూ యథాతథముగా స్వీకరిస్తూ వుంది. కావున ఇటు లౌకికముగానైనా అటు పారమార్థికముగానైనా మనకు ప్రాప్తించినది వరించవలసినదే, భరించవలసినదే, తరించవలసినదే. అట్లు కాకుంటే ఏమవుతుందో చూడు

తపస్సు తన సర్వస్వముగా భావించిన విశ్వామిత్రుడు మేనక వగలు చిందించ గానే  మొహములో తగుల్కొన్నాడు. పోనీ ఆ ఇరువురు తల్లిదన్ద్రుఇలుగా తమ కర్తవ్యమును నిర్వహించినారా అంటే అదీ లేదు. పుట్టిన శకుంతలను అనాథను చేసి వెళ్లిపోయినారు.  మరి వ్యాసుని తండ్రి పరాశరుడు  పడవ నడుపుకుంటూ చేపలు పట్టుకునే అమ్మాయి మోజులో పడి  సాక్షాత్తు విష్ణుస్వరూపుడగు కొడుకును కానీ కూడా. తనదారిన తాను పోయినాడు. అంతటి తపోధనులే స్త్రీ వ్యామోహంలో పడిపోయి తమ కోరిక తీరగానే తమ దారిన తాము పోతే మరి అత్యంత సామాన్యులమైన మనమెంత. వారు గొప్పవారు కాబట్టి తమ తమ దారులు తాము చూసుకొన్నారు. మనకు అటువంటి  ఉచ్చులో తగులుకొనుట తటస్థిస్తే తిరిగీ బయటపడే పనే ఉండదు. అందుకే మనము మన ఇంద్రియముల విషయములో అను క్షణము ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలంటే ఆ వస్తువు వాస్తవస్వరూపాన్ని ఆలోచించాలి. స్త్రీని గాని, పురుషుణ్ణి గాని పొందితే మనకొచ్చేదేమిటి? ధనం గాని, బంగారం గాని, వస్తువు గాని పొందితే మనకొచ్చేదేమిటి? అని ఆలోచించాలి. ధన కనక కామినీ వస్తు వాహనాలలో దేనిపైన వ్యామోహం కలిగినా ఒక్కసారికి బదులు వందసార్లు  ఆలోచించి వాటి నుండి మనము బయటపడవలసి వుంటుంది.
 ఇక మూడవ విధము ఒకసారి గమనించు.  నీవు ఎంత జాగ్రత్తగా ఉన్నా నీ వెనుక గోతులు తవ్వే వాళ్లు ఎప్పటికీ ఉండనే ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయములో  నీవు ఎంతో అప్రమత్తుడవై మెలగవలసి వుంటుంది. మనది నాటి సమాజము కాదు, నేటి సమాజము. ఆధునిక జీవనం గడపాలంటే ఈజాగ్రట్టలు తీసుకొని తీరవలసినదే! నేటి సమాజమునకు కూడా ఎంతో చక్కగా అన్వయించుకొనగలిగిన రెండువేల సంవత్సరములకు పూర్వమయినడిగా భావింపబడే ఈ భర్తృహరి సుభాషితమును చూద్దాము.

మృగమీన సజ్జనానాం తృణజలసన్తోష విహితవృత్తీనామ్l

లుబ్ధకధీవరపిశునా నిష్కారణమేవ వైరిణో జగతిll

దానినే ఏనుగు లక్ష్మణకవి తేట తెలుగులో అందిస్తూ ఇలా అన్నాడు.

 కసవుచే నీటిచే మోదకలన చేత

బతుకు మృగ మీన సజ్జన ప్రకరమునకు

శబర కైవర్త సూచకజనులు

జగతి కారణములేని పగవారు గాదె తలప

ఎవ్వరికీ ఎటువంటి హాని తలపెట్టక, ఏవో దొరికిన నాలుగు గడ్డి పరకలు మేస్తూ జీవించే జింకలకు  బోయవాళ్ళు అకారణ విరోధులు. నీటిలో దొరికే తిండితో  బతికే చేపలకు అకారణ వైరులు జాలరులు. ఇతరుల జోలికి పోక , తమమానాన తాము బ్రతికే సజ్జనులను నిష్కారణంగా పీడించేవారు కారణములేని పగవారే కదా! ఇది నేటి లోకరీతి అన్న విషయమును అనుక్షణమూ గుర్తుంచుకోవలసిన బాధ్యత మనది. సజ్జనులు చల్లగా ఉంటే కూడా సహించని వాళ్లు కూడా ఉంటారు అన్న వాస్తవాన్ని అర్థము చేసుకోవలసి వుంటుంది.

నీవు ఇన్ని విధములైన వైరుధ్యముల మధ్య జీవివించుతూ వున్నపుడు ఎంత అప్రమత్తతతో వుండవలెనో గమనించు.

ఇవి కాకుండా నీలో ఎక్కడలేని చపలత చోటో చేసుకొని వుంది. ఒకటి ఉంటె ఇంకొకటి కావాలనే మనస్తత్వము నీది. నీ బుద్ధి ఒక కోరికల పుట్ట. అందులోని మంచిచెడ్డలనరసిచూచే చాకచక్యము ముందు నీవు పొందవలసి వుంటుంది.

కోరిక కోతిని బోలును

కోరిక గుఱ్ఱమును బోలు కువలయమందున్

కోరిక కొరివికి సమమగు

కోరికలవి  నిజము ఊబి గుంతలు రామా!

నీ బలహీనత భగవంతునికి తెలుసు. అందుకే నిశ్చలముగా  ఒకే కోరికపైన నీ బుద్ధిని ఉంచుట లేదు.  దానికి తోడుగా  నీ స్వార్థము ఎల్లపుడూ ఒకటి వుంటే వేరొకటి కావాలన్న తలంపులను నీలో రేకెత్తిస్తూనే ఉంటున్నాయి. ఆయనకు నీ గురించి, నీ సంచిత ప్రారబ్ధ కర్మలగూర్చి తెలుసును కాబట్టే నీకా చాంచల్యమును కలుగాజేసినాడు. శీతోష్ణ స్థితుల విషయములో కూడా ఏ ఋతువు శాశ్వతము కాకుండా ఏర్పాటు చేయ బడినాయి. నీకు విసుగు కలిగినపుడు కాస్త ఓపిక పడితే వేరే ఋతువు వస్తుంది కదా. ఓర్పు అన్నది  మంచిని కలిగించే మార్పు. అదిలేకుంటే  మిగిలేది ఓదార్పే. ఈ విషయముగా గీత ఏమంటూవుందో చూతమా !

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః

ఆగమాపాయినో 'నిత్యాస్తాం తితిక్షస్వ భారత 14--2



చితికే వరకూ శీతోష్ణమ్ములు

సుఖదుఃఖమ్ములు చుట్టపు చూపులు

వచ్చిపోవుననివార్యము లయ్యవి

తితీక్ష కల్గుట తెలియుము భారత 14 -- 2



భరతుని వంశజుడైనందువల్ల భారతుడైనాడనే కాకుండా అభివ్రుద్ధియందు కోరిక గలవాడు అని కూడా అన్వయించుకొనవచ్చును. తితీక్ష అంటే సహనము, ఓర్పు, క్షమ. ఆదికవి వాల్మీకి, అపర హరి యైన వ్యాసుడు ' క్షమయా నిష్ఠితాం జగత్' అనే నుడివినారు. జీవితమే ద్వన్ద్వాత్మకము. చివరి వరకు చేరదీయవలసినదే. కానీ చివరకు మనము చేరేది ఒక్కటే. అది అక్షయము అవ్యయము. కావున నీ బాధ్యతలను గుర్తెరిగి, నీ కోరికలను అదుపులోనుంచుకొని నీవు చేసే పనులను బాధ్యతగా స్వీకశ్రించుకొని ప్రవర్తించితే నీ భారములు పూవుఇల హారములౌతాయి. ఇది ఎన్నటికీ మరువకు. శిశిరము వచ్చింది అంటే వసంతము వెంబడే వస్తున్నట్లే కదా!

స్వస్తి.
*******************************************
సమస్య మనది -- సలహా గీతది -- 7

సమస్య : ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలకు గురికానివారెవరైనా ఉంటారా? వారికి మోక్షమబ్బుతుందంటారా ? పరిస్థితుల ప్రభావముచే, లేక చంచలమైన మనోవృత్తిచే మంచిని గ్రహించలేక, మంచివానిని గుర్తించలేకపోయే అవకాశము వున్నదా?

సలహా : మొదటి ప్రశ్నను ముందు చర్చించుదాము. అవును. ఉంటారు. గురికానివారుంటారు. వారు ఆవిధముగా ఉండుటకొరకు అకుంఠిత మైన సాధన చేసినవారు.  ఉదాహరణకు సత్య హరిశ్చంద్రుని తీసుకొందాము. చెప్పలేని కష్టములకు ఆయనను గురిచేసినా కూడా ఆయన తన ధర్మమును, సత్యసంధతను విడువలేదు. రాముడు తన ధర్మ మార్గమును వీడి చరించలేదు. కర్ణుడు దుర్యోధనుని సాంగత్యము కలిగియు తాను చేబూనిన దాన గుణమును వీడలేదు. నీవు ఆ దీక్ష వహించితే నీకూ మోక్షపదము తప్పదు.  నిజము చెప్పవలసి వస్తే ఈ బలహీనతలు  లేనివారెవ్వరు. ఇవి ప్రకృతి జన్య గుణంబులు. కానీ తేడా అంతా అవి సహించడములోనే. లోహములు అనేవి అంతా ఒక వర్గముగా తీసుకొంటే ఒక్కొక్క లోహము ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవించుతుంది లేక ఘనీభవించుతుంది . అంటే సహన శక్తి మారుతూ వుంటుంది ఒక్కొక్క లోహానికి. అవి నిర్జీవాలు . వాని లక్షణములు లేక గుణములు మారవు . మనము జీవులము మనలో వయసు పెరిగే కొద్దీ శారీరిక మానసిక మార్పులు కుప్పలు తెప్పలు. మన పురోగమనము పరమాత్ముని వైపే అయితే మన సహన సౌశీల్యములను పెంచుకొంటేనే కదా, ఆ దారిన పోగలిగేది. కాబట్టి కార్య ఫలితములకు పొంగక క్రుంగక ఉండటమే ధీర లక్షణము . అదే అమృతత్వపు దారిని జేర్చేది క్షణక్షణము. మరియొక విషయమును గమనించు. అరేబియా దేశవాసులకు ఎండలు తప్ప వానలు తెలియవు. వారి అనుభవములో అధిక ఉష్ణము అధిక శీతలము రెండే వుంటాయి. కాదు కూడదు అంటే అధిక వాయువు కూడా అప్పుడప్పుడు తెలియ వస్తుంది. అది చెప్పలేనంత ఇసుకను మనుషులపై చిమ్ముతుంది. అక్కడివారు ఆ శీతోష్ణ స్థితులకు అలవాటు పడినవారు కాబట్టి ‘అబయ’ అనే తెల్లని పొడవాటి వస్త్రమును తల వీపు పిక్కలను కప్పుకొనుటకు వాడుతారు. అది శరీరానికి ఇసుక తాకనివ్వకుండా ఒక కవచముగా పనిచేస్తుంది. అదేవిధముగా తెల్లటి నూలు  పైజమా లాంటిది మరియు బాగా పొడవైన జుబ్బా లాంటిది ‘కందురా,తవబ్’ అన్న వదులైన, మెడిమల వరకు వచ్చే వస్త్రధారణ చేస్తారు. ఇట్లు చేయుటచే వారు శీతోష్ణవాయువుల విపరీతములను ఎదుర్కొంటున్నారు. మనము ఇక్కడ గ్రహించేది ఏమిటంటే మన బుద్ధిని ఉపయోగించినామంటే ప్రాకృతిక కష్టములన్నింటికీ తగిన పరిష్కారమును కనుగొనగలుగుతాము. తటాలున ఎవరయినా మన చెంప మీద కొట్టబోతే మనచేయి అడ్డుపెట్టుకొంటాము. అంటే ఒక అవాంతరము అనుకోకుండా సంభవించినపుడు తగిన జాగ్రత్త బుద్ధి తీసుకొంటూ వుంది. ఒకవేళ ప్రళయము వంటిదే సంభవించితే ఎవరుచేయగలిగినదీ ఏమీ ఉండదు. ఇన్ని వసతులు దగ్గర పెట్టుకొనికూడా బుద్ధిని పెడత్రోవ పట్టించుచున్నాము. బంగారము యొక్క స్వచ్ఛ త ఒరపురాయికే తెలుస్తుంది. కష్టము వల్లనే నీ స్థైర్యము తెలిసివస్తుంది. అందులో నెగ్గితే నీవు మోక్ష సాధనలో అడుగు ముందునకు వేసినట్లే!
భగవానుడైన శ్రీ కృష్ణుడు ఈ విషయమై ఏమంటున్నాడో గమనించండి :
యంహినః వ్యతయన్త్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖ సుఖం ధీరం సో'మృతత్వాయ కల్పతే   15 - 2

సుఖ దుఃఖమ్ములు సోదర జాతలు
స్థిరములు కావవి స్థిమితము పొందుము
సమ దృక్పథమే  సాధన సుపధము
 దివ్యత్వమ్మును  ధీరుడు పొందగ     15 - 2

కృష్ణుడు ద్వంద్వా తీతముగా, అంటే సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, శీతోష్ణాలు, మమకారవికారాలు, బంధ విబంధాలు మొదలయిన దేనికీ అతీతముగా వుండమనుట లేదు. వానిని అనుభవించుతూనే నీటిపై తేలే నేతిచుక్క లా ఉండమని ఉపదేశము. నేతిచుక్కే ఎందుకు అంటే కరిగిన నేతిబొట్టు నీటిలో పడుతూనే నీటితో కలిసినట్లుంటుంది. కాసేపటి తరువాత ఘనీభవించి  అంటియుంటూ కూడా అంటనట్లే వుంటుంది. మనము కూడా నేర్చుకోవలసినది అదే.  అందుకే నీ కార్యాలయములోకూడా నీవు ఇష్టపడిన ఇష్టపడని వారితో కలిసి తీరవలసిందే! అందరితో కలిసినట్లుండవలసిందే, వారితో ఏగనూ వలసిందే. కానీ ఆపదలో నిన్నాదుకొనే నీవారు కూడా కనీసము ఒకరో ఇద్దరినో నీవు తప్పక వుంచుకోవలసిందే! నీ ఆలోచన నీవరకే పరిమితము కానీ సిబ్బందికి పెద్దగా నీ అభిప్రాయమును చెప్పవలసిన బాధ్యత నీకుంది. . వేరే వారి అభిప్రాయముపై ఆధారపడితే అందులో పొరబాటు కూడా దొరలవచ్చును. పరాయి అభిప్రాయమును నీవు ఆమోదించుటచే బాధ్యత నాయకునిగా నీపైకే వస్తుంది. అందువల్ల బాగా యోచించు.
నొప్పించక ఒప్పించుము
తప్పించుక తిరుగబోకు తామస వృత్తిన్
చెప్పంగ జంకబోకుము
ముప్పందేగలదు నిజము మోహన రామా!
అందకే పనిలోనైనా, పరమార్థములోనైనా 'కృషితో నాస్తి దుర్భక్షం' 'సాధనమున పనులు సమకూరు ధర లోన' అన్న పెద్దల మాట గుర్తు పెట్టుకొని నీ బాటను సుగమము చేసుకో!
శుభస్య శీఘ్రం.
*******************************************
సమస్య మనది -- సలహా గీతది --  8
 సమస్య : లోకములో ఒకడు వేరోకడిని చంపుతూ వున్నట్లు వ్యవహారము వుంది.ఇది నిజమా ? ఆత్మకు చావు లేదంటారు కదా ? అసలు నేడు ధర్మము అధర్మము అన్న విచికిత్స ఎప్పుడు చేయగలము.
సలహా : ఆత్మకు చావు వున్నదని ఎవరన్నారు? ఆత్మే పరమాత్మ యని అందరిలో అదే వుండేదియని గ్రహిస్తే ఈ కక్షలు కార్పణ్యాలు వైషమ్యాలు వైరుధ్యాలు ద్వేషానురాగాలు అన్న ద్వంద్వాలకు అతీతమై శాంతియుత సహజీవనము కొనసాగించరా ! ఆత్మ దేహి నుండి విడిపడటానికి కారణము కావలె కదా! నిందె లేనిదే బొందె పోదంటారు కదా ! కర్మ ఫలితముల ననుభవించుతూ ఏర్పడిన బొందె తదనుగుణముగానే ఆత్మను విడుదల చేస్తుంది. అసలు అందరిలో వుండేది అదే ఆత్మ అన్న  ఒక్క నిర్ధారణ ఈ విశ్వాన్నే ఎంతో సురక్షితముగా ఉంచ గలుగుతుంది. ఇది లౌకికమైన ఆలోచన. నీటిలో ఏర్పడే నీటి బుడగలు ఒక్కొక్కసారి ఒకదానితో నొకటి తగిలి పగిలి పోవుట గమనించుతాము. పగలనంత వరకు అవి విడి విడిగానే వుంటాయి. విడిగా ఉంటూ కూడా పగిలి పోతాయి. పగిలిన పిదప ఎక్కడికి పోతున్నాయి . తిరిగీ నీళ్ళలో నికే గదా . వేరు వేరు అనుకొనే  ఈ ఆత్మలు కూడా అంతే. గాజు పట్టకము గుండా పోయే వెలుగు రేఖ ఒకటే . కానీ అదే ఏడు రంగులుగా మారుతూ వుంది. మరి పట్టకము తీసివేస్తే  వెలుగు రేఖ ఒకటే. ఆత్మ కూడా అంతే. ఇంకా ఈ మాట విను. తులసీదాసు తన రామచరిత మానస్ లో ఈ విధముగా చెబుతున్నాడు.
జో సపనే సిర కాటఇ కోయి, బిను జాగే న దూరి దుఃఖ హోయి.
 మనలను మనము ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కల్పింపబడింది. భ్రాంతినుండి బయట పడితే స్వార్థము ఉండదు. మనము మన మనసులో ఏమి తలచుతామో వస్తువులో అదే కనిపించుతుంది.
యద్భావం తద్భవతి ఒకసారి రామకృష్ణ పరమహంస ప్రయాణము చేయుచున్న పల్లకీని బోయలు ఆయనను త్వరగా గమ్యము  చేర్చే ఉద్దేశ్యంతో వేశ్యావాటికగుండా వెళ్తున్నారు. ఒక వేశ్య ఆయనను చూసి తన పైట తొలిగించి శృంగారమునొలకబోసింది. ఆయన చిన్నపిల్లవానివలే అమ్మా కాళీమాతా నీవు ఇక్కడ ఉన్నావా? అన్నారట! దాంతో తన తప్పు తెలుసుకొన్న ఆ వేశ్య స్వామికి నమస్కరించి లోనికి వెళ్లిపోయింది. అదే ఏ విటుడో చూసియుంటే అతడికి ఆ వేశ్య ఒక ఆటవస్తువు గా కనబడేదేతప్ప కాళికామాతగా మాత్రము గాదు! అందుకే సంస్కారస్తుప్రవర్తతే అంటారు పెద్దలు. పై వాస్తవమునొక్కదానిని గ్రహించగల్గితే మనము ఏమి చేస్తున్నాము అన్న ఎరుక మనకు ఏర్పడుతుంది. అసలు శంకరులు అద్వైతము పారలౌకికమునకే కాకుండా లౌకికమునకు, సర్వ మానవ సౌభ్రాతృత్వమునకు, విశ్వమానవ శ్రేయస్సుకు ఎంత ఉపయోగ పడునో చెప్పుటకు నా మాటలు చాలవు.

ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఈ విధముగా చెబుతున్నాడు:
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మాన్యతే హతం
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే    19 - 2

చచ్చేదెవ్వరు చంపేదెవ్వరు
ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన
ఆత్మయె కాదా అందున వున్నది
అది తెలియుము అపుడంతా సుఖమే                   19 - 2
తనను హతునిగా నొకడు భావించితే తనను హంతకునిగా వేరొకడు భావించుచున్నాడు. రెండూ అసమంజస భావనలే. రెండు శరీరలనుండి ఆత్మ విడి పడుతూ వుంది. కక్షలు కాయమునకే గానీ కనిపించని ఆత్మకు కాదు. ఆ ఆత్మను గుర్తించితే అంతకు మించిన ఆనందమేముంటుంది. అప్పుడు ధర్మమును విడువనవసరము ఉండదు.
అర్జనుని విషయములో యుద్ధము ధర్మము. యుద్ధములో చంపుట ధర్మము. అంద్ఫ్హుచేత శ్రీకృష్ణుడు అట్లు చెప్పుట ధర్మము. మరి నేటి పరిస్థితి అదికాదు. నేటి ధర్మమును మనో ధర్మము అంటే బాగుంటుందేమో! తన బసగుకు ఏది మచిదని తోచితే అదే ధర్మము. అప్పుడు మనసు ఒక bulldozer గా పనిచేస్తుంది. దేనినయినా పెకలించుతూవెళ్ళిపోయి చివరకు అయ్యో! నాకు అత్యంత అవసరమైనదానిని కూడా నాతొందరలో పెకలించినానే అని బాధ పడటము చేత ప్రయోజనము ఉండదు కదా! కావున ఇక్కడ విచక్షణకు ఎక్కువ అవకాశమును ఇవ్వవలసి వుంటుంది. ఈ కాలమున భారత యుద్ధములు వుండవు. అన్నీ Cold Wars మాత్రమే! అందువల్ల ఆవేశము పనికిరాదు. అది ఆఫీసయనా అన్యథా అయినా ఆలోచన అవసరము.
పై గీతా శ్లోకమును అన్వయించుతూ నేను చెప్పే ఈ కథను విను.
ఒక రాజు తన వద్ద ఎంతో తెలివిగల ఇద్దరు మంత్రులను పెట్టుకొన్నాడు. ఇద్దరిలో ఒకడు రాజు బాగు తన బాగులో చూసుకొనువాడు. రెండవ వాడు తానూ, తనబాగు, తన ప్రాముఖ్యతలకు ప్రాధాన్యత ఇస్తాడు. అంటే అతనికి EGO మూత పెట్టుటకు వీలులేనంత మూతి వరకూ వుంది.
అతను రెండవ వ్యక్తి తనకు సమానముగా ఉండుట ఇష్టపడడు. అందుచే రాను రానూ రాజు చెప్పిన వెంటనే, ముందువెనుక చూడకుండా పని పూర్తిచేసి మెప్పును పొంద సాగినాడు. ఇతను స్వార్థమతి. రెండవ వాడు మాత్రము ఏపని కూడా పర్యవసానము ఆలోచించకుండా చేసేవాడు కాదు. అతను దీర్ఘదర్శి. ఒకనాడు రాజ్యములో పడిన అతి పెద్ద దొంగల ముఠాను ఎట్లు పట్టుకొనవలెనని, స్వార్తమతి లేనందువల్ల, రాజు దీర్ఘదర్శితో యోచించి తమ సైన్యాద్యక్షునికి ఆ పనినొసగినారు. ఆతను దొంగలను పారద్రోలినాడుకానీ  నాయకుని పట్టుకోలేక పోయినాడు.
స్వార్థమతి వచ్చిన పిదప అతడు రాజుకు దీర్ఘదర్శిపై అవాకులు చవాకులు చెప్పి రాజు మనసు విరుచుటయే గాక అత్యంత శౌర్య ప్రతాపములను కలిగి రాజునకు విధేయుడైన సైన్యాధ్యక్షుని కూడా తొలగింపజేసినాడు. దీర్ఘదర్శి తనకు తానుగా పదవి వదలుకొంటూ రాజునకు ఒక లేఖ ఇచ్చి తనకు భరింపరాని కష్టము వచ్చినపుడు మాత్రమే చూచుకొమ్మని అన్నాడు.
ఇక స్వార్థమతి కత్తికి ఎదురులేదు. దోపిడీలు ఆ దొంగల నాయకుని చేత చేయించుతూ ఆ సమయములో తాను ఉండకూడదను పథకము ప్రకారమే లేకుండా పోయినాడు. దొంగల నాయకుని తప్పించిందీ తానే. ఇప్పుడు వానితోనే కుమ్మక్కయి రాజును చంపబూనుటకు సిద్ధపడినాడు. దీర్ఘదర్శి అందుకే స్వార్థమతికి ఏమాత్రమూ తెలియకుండా  తన ముఖ్యానుచరుని రాజుకు అంగరక్షకునిగా నియమించినాడు. ఆటను విషయమును రాజునకు ఎంతో రహస్యముగా చెప్పి నమ్మిన్చాగాలిగినాడు. ప్రాణము మీదికి వచ్చినది కాబట్టి దీర్ఘదర్శి లేఖను రాజు తెరచి చూసినాడు. అందులో స్వార్థమతి ఎంత దుర్మార్గుడో వివరించబడి వుంది. రాజు తన నమ్మినా బంట్లతో స్వార్థమతి ని దొంగల నాయకుని పట్టుకొని ఉరి తీయించి తిరిగీ దీర్ఘదర్శిని తన మంత్రిగా ఉంచుకొన్నాడు.
ఇక్కడ రాజధర్మమునకు కట్టుబడిన దీర్ఘదర్శి మనకు ఆదర్శము. బుద్ధి బలహీనతచే దారి తప్పినా తిరిగీ తనను తాను నిలువరించుకొనగలిగిన రాజు మనకొక ఉదాహరణము. దుష్టుడు స్వార్థమతి పరిత్యజింపవలసినవాడు. దీర్ఘదర్శి తానువేరు రాజు వేరు అనుకోలేదు. తలోని ఆత్మ రాజులోని ఆత్మ పరమాత్మగా తలపోయుటచేత తాను దూరమున్నా రాజును కాపాడుతూనే వచ్చినాడు. ధర్మ బద్ధుడగుటచే తనను, రాజును, రాజ్యమును కాపాడినాడు. శ్రీకృష్ణుడు చెప్పినది కూడా ఇదే! ధర్మము చాలా సూక్ష్మమైనది. ఒకనాటి ధర్మము నేడధర్మము కావచ్చును. అందుకే పరమాత్మ 'యద్యదాచరతి శ్రేష్ఠః.....లోకస్తదనువర్తతే' అని చెప్పి మనకు ఒక సులువైన ధర్మ మార్గమును చూపించినాడు. ఆదర్శపురుషులు ఆచరించు మార్గమున నడువమన్నాడు పరమాత్మ. అదే ధర్మము.
ఇంకా సులభమైన మార్గమేమిటంటే అందరిలోని ఆత్మ ఒకటే అన్న ఆ పరమాత్మ మాటను అమలులో ఉంచితే ఈ విశ్వము వసుధైవ కుటుంబకమై విలసిల్లుతుంది.
స్వస్తి.
*******************************************************************************
సమస్య మనది -- సలహా గీతది -- 9
సమస్య  : మానవునికి చావు పుట్టుకలున్నాయికదా ! మరి మానవుని ఆశ్రయించి వున్న ఆత్మకు చావు లేదంటారెందుకు? నేను తప్పు చేస్తే దానిని నేను నా అంతముగా భావించ వలసినదేనా?
సలహా : ఆత్మకు చావు లేదని ముందే చెప్పుకొన్నాము. ఇంకా సందేహము వీడలేదు కాబట్టి కొంచెము విస్తృతముగా చెప్పుకొంటాము. ఆత్మ ఒక బంగారు ఆభరణ మనుకొందాము. శరీరమునకు ధరింప జేసితే అది శరీరమునంటియుంటుంది. మరి locker లో ఉంచితే అక్కడే వుంటుంది. మరి దానిని చెరిచి వేరే ఆభరణము చేయించితే అందులోనే వుంటుంది. అది నీవు గుర్తించినావు కాబట్టి ఆ రహస్యము నీకు మాత్రమె తెలుసు. అది తెలియనివారు ఇది వేరే ఆభరణమనే అనుకొంటారు. అసలు, సొమ్ములు వేరువేరయినా బంగారము అదే కదా. తెలుసుకొంటే 'వడ్లగింజ లోనిది బియ్యపుగింజఅని అర్థమౌతుంది. తెలుసుకోకుంటే వడ్లగింజ వడ్లగింజ గానే వుంటుంది. అసలు వడ్లగింజ అంటే గుర్తుకొచ్చింది. అసలు వేదములో ‘ నీవార శూక మట్టన్వీ పీతాభా స్వస్త్యణూపమా తస్యా శికహాయై మధ్యే పరమాత్మా వ్యవస్థితః’’ అని చెప్పినదిగుండెకు దగ్గరగా వడ్లగింజ యొక్క ముల్లు పరిమాణములో జ్వలించే నీల కాంతి యొక్క శిఖకు మధ్యలో ప్రతి మనిషియందూ,పరమాత్మ నివశించుచున్నాడు. నీలి శిఖ వరకు ఆధునిక NASA Scientists ఒప్పుకొంటున్నారు. ఈ Scientists ఆధిభౌతిక శాస్త్రము (Metaphysics) తమ Research ఇంకా కొనసాగించితే పరమాత్మ జీవాత్మ రూపములో ప్రతి జీవిలో కూడా ఉన్నాడని లోకానికి తెలియజేసి Nobel Prize అందుకొంటారు. పైన తెలిపిన వెదోక్తి మనకు మనుచరిత్రలో కూడా తెలియవస్తుంది. మనుచరిత్ర అంటే మనకు గుర్తుకొచ్చే పద్యాలు రెండు. ఒకటి నాలుక తిరుగని
 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
అన్న పద్యము మరియు శృంగార రసాత్మకమై యౌవకులకు చవులూరించుతుంది
ప్రాంచిద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై
యంచుల్ మోవగ కౌగలించి అధరంబాసింప హా! శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణు డోరమో మిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్ ద్రోచె  కలంచునే సతుల మాయల్ ధీరచిత్తంబులన్. 
అన్న పద్యము.
కానీ వేదాంతపరమైన, పరమాత్మను నిర్వచించుతూ వరూధిని చెప్పినట్లుగా పెద్దన్న గారు అన్న మాటలను ఒకసారి గమనించుదాము.
ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా
రతిసమయంలో మనసు కుండలో పెట్టిన దీపంలా  గాలి తాకిడికి నిరంతరం కదిలే దీపంలా క్షణక్షణం రకరకాల చిత్రవృత్తులకు లోను కాకుండా  సుఖం పొందుతుంది అని చెబుతుంది. ఈ విధముగనే మనము అన్వయించుకొనవలసి వస్తుంది వరూధిని చెప్పింది కాబట్టి. కానీ ఈ పద్యములోని అర్థమును తాత్వికముగా ఆలోచించుదాము.
రహి= ఆనందము డెందము= మనసు, ఆత్మ గా కూడా తీసుకొనవచ్చుకందళించు= పుట్టు
ఇంద్రియ సుఖము అన్న మాటకు వరూధిని అర్థము వేరు. ఒక తాత్వికునికి ఇంద్రియసుఖము పరమాత్మ దర్శనమునందే ఉంటుంది. దానికి చేయవలసినదల్లా స్థిరముగా గాజు చిమ్నీలో దీపమును వెలిగించియుంచినట్లు మనసును నిలకడగా ఉంచుట. అప్పుడు ఆ అంతరాత్మే పరబ్రహ్మ. ఆ వెలుగునే కదా పైన వేదోక్తిగా చెప్పుకొన్నాము.  దీనిని బట్టి ఏమి తెలుస్తుందంటే హిందీ లో ‘ పసంద్ అప్నా అప్నా ఖయాల్ అప్నా అప్నా’ అని చెప్పినట్లుంటుంది. దానినే సంస్కృతములో ‘యద్భావం తద్భవతి’ అని అంటారు. నీకు ఇప్పటికి కొంత అర్తమయివుందవచ్చు. మిగిలినది పరమాత్మ ఏమి చేపిఇనాడో వింటే నీకు పూర్తిగా అవగతమౌతుంది. ఈ ఆత్మ అన్న జ్యోతి ఆరిందా పరమాత్మ అన్న వెలుగులో కలుస్తుంది. ఈ విషయమును గమనించు
ఘటాకాశ మహాకాశ మివాత్మానం పరాత్మని|
విలాప్యాఖణ్డభావేన తూష్ణీం భవ సదా మునే|| || అధ్యాత్మోపనిషత్‌

ఇక్కడ ఘటాకాశము అన్నది ఒక నియమిత ఆకృతిలో ఇమిడి ఉన్న ఆకాశం అని. ఆకాశము యొక్క ప్రతిబింబము ఘటములో ఇమిడినంత మేరకు మనకు కనిపిస్తుంది. ఘటము పాంచభౌతికమైనది.  దానిరూపంలో కొంత ఆకాశం (space) బద్ధమై ఉన్నది. అంటే ఈ ఆకాశము ఘటము  ఉన్నంతకాలమూ ఛాయారూపముగా ఆక్రమించి వుంటుంది. మహాకాశము అన్నది ఏ విధమైన పరిమితులకూ  లోనుకాకుండా తానుగా ఉన్న నిత్యస్వరూపము. ఘటానికి ఈ నిత్యత్వము లేదు. ఈ ఘటం అనేది  ఒకప్పుడు  ఉనికిలో లేనేలేదు. ఉనికి లోనికి రానతవరకూ అది మట్టే!
యదార్థము ఏమిటంటే ఉనికి లోనికి వచ్చినది ఎదైనా ఒకనాటికి ఆ ఉనికి కోల్పోయి తీరవలసినదే. ఎందుకంటే సృష్టి ధర్మమును అతిక్రమించలేము కదా!
శాశ్వతత్వము అన్నది పరమాత్మ గుణము. మహాకాశము ఘటాకాశము ఒక ఉదాహరణ కాబట్టి  ప్రకృతిలోని భాగమైన మహాకాశముతో పోలిస్తే తాత్కాలిక ఉపాధి గల ఘటమునకు కాల వ్యవధి తక్కువ.
మరి ఈ  ఉనికి కోల్పోయిన ఒక ఘటం ఏమైపోతోందిదానికి ఆకృతిని ఇచ్చిన పంచభూతాల్లోనే  లీనమై పోతోంది.  ఆ ఘటరూపంలో ఉన్న పంచభూతాల అంశలన్నీ ఎక్కడికి పోతున్నాయి?  అవి ప్రకృతిలోనే ఉంటూవున్నాయి.
  ప్రకృతి మాత్రం అఖండంగా అలాగే ఉంటుూవుంది కానీ ఈ పంచ భూతాలలో కలిసిన ఘటములు వేరేదయినా మృణ్మయపాత్ర రూపములో ద్యోతకము కావచ్చును .
మహా తపస్వులు ఈ తత్వమును ఆకళింపు చేసుకోన్నవారై ఈ శరీరము పట్ల ఎంతో నిరామయముగా వుంటారు. సరియైన సమయములో బ్రహ్మ రంధ్రము ద్వారా ఆత్మను పరమాత్మలో కలుపుతారు. శృంగేరి చంద్రశేఖర భారతీ స్వాములవారు ఆ విధముగా పరమాత్మ సాయుజ్యమును పొందినవారు. ఆ ఆత్మా భూమిపయికి తిరిగీ రాదు.
కావున నీకు నాకూ ఈ 'పునరపి జననంపునరపి మరణంతప్పదు. ఆత్మ లయమయ్యేది పరమాత్మ లోనే. అంతవరకూ మనమింతే!
 ఇప్పుడు ఈ విషయాన్ని శ్రీ కృష్ణపరమాత్మ ఏవిధముగా చెప్పినాడో చూద్దాము:
న జాయతే మ్రియతే వా కదాచి త్రాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతో'యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే  20 -- 2
 పుట్టుట లేదది గిట్టుటలేనిది
ఇప్పటి కప్పటి కెప్పటి కైనా
ఆత్మ శాశ్వతము అవ్యయమైనది
మట్టి కలియునది కట్టెయొక్కటే   ( స్వేచ్ఛాను వాదము  20 -- 2 )
ఇది పుట్టినదీ లేదు చావబోయేదీ లేదు. ఇదిఆగదు. కేవలము మజిలీలు మారుస్తూవుంటుంది.ఇది నిత్యము,శాశ్వతము, నశ్వరముసనాతనముఅభంగము మరియు అవినాశము. శరీరమునకే మరణము . కట్టె కాలిందని బాధ పడే దానికంటే కట్టె కాలుటకే ఉండేదని తెలుసుకో. అప్పుడు చింత కాసింత కూడా నీ చెంతకు రాదు. ఇదే విషయాన్నే కఠోపనిషత్తు లో లోని  ద్వితీయ వల్లి లోని 18 వ శ్లోకము ఇంచుమించు ఇదేవిధంగా వుంటుంది. భావము ఒకటే అయినపుడు  భాషలో పోలిక ఉండుట సహజమని నా తలంపు. కఠోపనిషత్తు లోని శ్లోకము :
న జాయతే మ్రియతే వా విపశ్చి ననయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ 
అజో నిత్యః శాశ్వతో'యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే 
 
( కఠోపనిషత్తు -- ద్వితీయ వల్లి -- 18 )
ఆత్మ పుట్టదు చావదు అది దేనినుండీ పరిణమించదు. దానినుండీ కూడా ఏదీ పరిణామము పొందదు.శరీరము నశిస్తూ వున్నపుడు కూడా జన్మ రహితమూ అనశ్వరము, శాశ్వతముసనాతనము అయిన ఈ ఆత్మకు నాశమనేది లేదు. 
పరమాత్మ చెప్పినమాటనే దార్శనికులు మనకు ముందే తెలిపియున్నారు. ఉద్వేగము వదిలి ఉత్సాహము ప్రదర్శించినచో మనము ఎన్నోవిషయములను ఎంతో చక్కగా తెలుసుకొని నడచుకొన వచ్చును. 
దీనినే లౌకికముగా పోల్చిచేప్పి చాలించుతాను. నీవు పనిని తీసుకొని ఫలితము చూపించ లేకుంటే పర్యవసానమును మాత్రము ముందుగా యోచించు. దేనినయినా చేతికి తీసుకొని చింతించుటకంటే చింతించి చేతికి తీసుకొనుట మేలు. ఒక పనిని మనకు అప్పగించినపుడు సాధించితే, అబ్బ వీడు సాధించినాడురా! GREAT అంటారు. అదే అతని ప్రయత్నమూ నిష్ఫలమయితే చచ్చినాడురా! అంటాము. కావున చచ్చినాడు అన్న మాటను మనము ఈ అర్థములో తీసుకొని అన్వయించుకొందాము. అదేవిధముగా చతికలబడినవాడు లేచి నిలబడుటను తిరిగీ పుట్టినట్లుగా భావించ వచ్చును. కానీ చేసిన తప్పునకు కూడా ఫలితము అనుభవించవలసి వలసి వస్తుంది. జన్మకు జీవితానికి ఒకేఒక తేడా ఏమిటంటే క్రొత్తజన్మలో  మన కర్మఫల అనుభవమును బట్టి గతములో మనము చేసినది మంచో చెడో నిర్ణయించుకొంటాము. జీవితములో ఆ కష్టము లేదు. మనకు గతములో చేసిన తప్పొప్పులు మన ఎరుకలో వుంటాయి. కావున మన తప్పులు, పొరబాట్లు ఎక్కడెక్కడ దొరలినాయి అని తెలుసుకొని క్రొత్త పనిలో అవి దొరలకుండానూ ఇంకా జాగరూకత తోనూ చేస్తే సత్ఫలితస్ము సాధించుతాము. నలుగురూ ప్రశంసించుతారు. 'పదుగురాడు మాట పాడియై ధరయిల్లు' అన్నారు పెద్దలు. అందరిచేతా మంచి అనిపించుకొంటే దేవుని వద్ద కూడా నీవు మంచివాడవైనట్లేకదా! నీవు మంచికి అలవాటు పడినావు అంటే ఒకవేళ వేరొక జన్మనెత్తినా నీ కర్మఫలము నిన్ను సన్మార్గములో నడిపిస్తుంది. నీకంతా మంచే జరుగుతుంది. పట్టుదల, నిశిత పరిశీలన, విషయ పరిజ్ఞానము సత్పురుష సాంగత్యము, అలవరచుకొంటే చాలు. అంతా మంచే జరుగుతుంది.
స్వస్తి.
*******************************************
సమస్య మనది -- సలహా గీతది -- 10


సమస్య : ఆత్మ నశ్వరమని ఎంత సమాధాన పరచుకొన్నా , నాకత్యంత ఆప్తులు, అది నా తల్లిదండ్రులో, బావమరుదులో, బంధుమిత్రులో, పరమపదిస్తే వారి ప్రేమాభిమానాలను మరచి పోలేక పోవుచున్నాను ?

సలహా : వెర్రి వాడా .
చెలగ జలధి నీ జీవిత రంగము
కన నీవేమో కడలి తరంగము
పైకెగసినచో పడక తప్పదు
కడలి తోడనే కలువక తప్పదు
నీదగు పుట్టుక నిమిత్త మాత్రము
నీట కలుపుమా నీదగు ఆత్రము
నీ మెయి నీదగు కర్మల పాత్రము
నిజము నెరుగు మిది నిశ్చల సూత్రము
మనిషికి మూడు శరీరాలునాయి. అవి స్థూల, సూక్ష్మ , కారణ శరీరాలు. స్థూల శరీరము రక్తమాంసాది ధాతు నిర్మితము. సూక్ష్మ దేహము సూక్ష్మేంద్రియ అంతఃకరణ సమన్వితము . కారణ శరీరము వాసనా భరితము. ఈ మూడు శరీరాలకు ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యము చెందదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా స్వ ప్రకాశ రూప రూపమై కర్తగా కానీ , భోక్తగా కానీ కాకుండా అన్నింటికీ చైతన్యాన్నిచ్చే ఆత్మ యే మహా కారణ
శరీరంగా చెప్పబడింది. ఇది గాఢ నిద్రలో అనుభవానికి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ. జ్ఞాన శక్తి, ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి స్థూల  శరీర ధర్మాలు. స్థూల శరీరం - క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడినాయి . ఇది ఎంతో శ్రద్ధ తో  ఆకళింపు చేసుకోవలసిన విషయము. చాలా సులభమైన ఒక ఉదాహరణ తీసుకొందాము.
ఒక క్రొవ్వొత్తి  వుంది. పైకి అది ఒకటిగానే కనబడుతూ వుంది కానీ అందులో మూడు విషయాలు ఇమిడి వున్నాయి. ఒకటి బయటికి కనిపించే క్రొవ్వు పదార్థము. రెండవది అందులో ఆసాంతము వున్న వత్తి. మూడవది కనిపించని వెలిగే శక్తి. ఎప్పుడయితే పెనుగాలి వీచిందో, వెలిగే శక్తి అక్కడ అంతరించి వేరొక చోట వేరొక రూపములో ప్రకటితమౌతుంది. స్థూల సూక్ష్మ రూపాలు అంతరించి పోతున్నాయి.
భగవానుడైన శ్రీ కృష్ణుడు ఇదే విషయాన్ని నా వంటి అజ్ఞానికి అనువైన రీతిలో అర్థము చేయించుచున్నాడు.
వాసాంసి జీర్ణాని యథా నిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ   22 -- 2
అంగవస్త్ర మది భంగ మైనచో
వేరుబట్ట కొని వేసుకొందుము
ఆత్మ కైననూ అదే విధముగా
వేరొక దేహము విడిదిగ కందుము  (స్వేచ్చానువాదము 22--2 )
ఆత్మ అవినాశి, అవ్యయము, అజము, అగోచరము, అవిభాజ్యము. ఒక చొక్కా చినిగితే వేరొక చొక్కా వేసుకొన్నంత సులభమయిన పని దానిది. మరి అది బ్రతికే వుండగా బాధ ఎందులకు అని ఎంతో విశదముగా వివరముగా విపులముగా చెబుతున్నాడు పరమాత్ముడు.
‘నేను’ అన్న మాటకు నీవు సరియైన అర్థము తెలుసుకొనగలిగిన రోజు ఎవరిమీదా మమకార వికారాలు వుండవు. విషయలోలులమై క్షణిక మొహావేశాలకు గురియై పోయే మనము ఆత్మజ్ఞానము కలిగించుకొను కనీసమగు తలపయినా కలుగుట లేదు. పరమాత్మ అందుకే శరీరము నీవు తొడుగుకొనే ఒక చొక్కా అని అంటున్నాడు. శరీరమును చొక్కాతో పోల్చినపుడు శరీరమునకు కొంత శాశ్వతత్వము ఎక్కువ. అందుకే పై శ్లోకమున శరీరమును ఆత్మకు చొక్కాను శరీరమునకు పోల్చినాడు పరమాత్ముడు.
కాబట్టి ఇప్పుడు మనకు అర్థమయినది ఏమిటంటే శరీరము శాశ్వతము కాదు. కావున అది వదలిపోయినండులకు చింతించ పని లేదు. ఆత్మకు చావు లేదు కాబట్టి అప్పుడూ చింతించ పనిలేదు.
చింత అన్నది లేనపుడు  చిన్తకై వెదకుట ఎందుకు? చింత వీడి చేయవలసిన పనిని చిత్త శుద్ధితో నిర్ణయించుకొని ఆచరించితే ఆ కర్మే లేక ఆకర్మ ఫలమే నీ విచక్షణకు ఆలంబన.
సమస్య మనది -సలహా గీతది - 10 -- అనుబంధము (annex)
ఒక పాఠకురాలు 'సమస్య మనది -సలహా గీతది -- 10' అన్న విషయమును చదివి ఒక సందేహము వెలిబుచ్చినది. ఆత్మ ఒక చొక్కా విడిచి వేరొక చొక్కా తోడుగుకొనేటపుడు ఈ కర్మ కాండ అవసరము లేదుకదా అని. నాకు తెలిసినమేరకు , అందుకు సమాధానముగా ఈ మాట వ్రాస్తూ వున్నాను. నాలోని అజ్ఞత ఏదయినా వుంటే మన్నిప వేడ్కోలు.
అమ్మా చాలాకాలం పాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు.
ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం. చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపులనుంచి ముడుచుకుపోయి మస్తిష్కంలో ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ,మనస్సునూ, బుద్ధిని కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" అది వాయువులో లీనమానది కావున దేనినీ ఆశ్రయించకుండా కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది . అటుపిమ్మట దాన్ని నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వుంటుంది. కొందరు పుణ్య పురుషులు మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకపు ఆత్మను మరణించకముందే చూడగలుగుతారు.
పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది .మొదటినుంచే ఈ శరీరాన్ని ఒక ఆవరణ కప్పియుంచి వుంటుంది. అది తేజోమయ శరీరము. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరముగా కూడా 'కిర్లియన్ ఫోటోగ్రఫి' లో చూడ వచ్చును.'రేకీ' ని అనుసరిఉంచువారు కూడా ఈ 'ఔరా(aura)' ను చూడగలుగుతారు. దానికి స్థూలశరీరంతో సంబంధం ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి.ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి ఈ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జన్మకు నాకా అదృష్టము లేదు.లోకాలు పైకి ఏడు క్రిందికి ఏడున్నాయి. అతల,వితల, సుతల, తలాతల, రాసాతల , మహాతల పాతాళముములని, భూ,భువ,సువ,మహత్, జన, తప,సత్య లోకములని వాని పేర్లు. మన కర్మ ఫలాలు వానికి వేసే దారులు.
ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి 'స్థర'లు(పొరలు అని అనుకొందాము)ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళి కర్మానుసారంగా ఒక విశేష స్థరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయిన తరువాత కొత్త స్థరంలో కొత్త భోగ శరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ నెత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడేడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుండి ఆత్మ పైకి లేవనూ వచ్చు క్రిందకు పడనూ వచ్చు. అందుకే యమ నియమ నిష్ఠల నేర్పరచినారు పెద్దలు. మహర్లోకంలో అనుభవించవలసిన కారణము ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమ ముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది. వీటికి కూడా పైన ఒకలోకం ఉంటుంది. ఇన్ని అవరోధాలు అధిగమించిన పిదపనే పునర్జన్మ. కావున మనము చేసే కర్మ కాండ ‘ప్రేతాత్మ’ కు ఉపశమనము తృప్తి కలిగించుతుంది. కావున శ్రాద్ధ కర్మలు అత్యవసరము. మనసున మంచి నింపుట కూడా అంతే అవసరము.
శ్రాద్ధ కర్మలు పలుకారణములచే చేయలేని ఈ రోజులలో బ్రతికి ఉండగానే మనము మన మనసును సత్కర్మలవైపునకు మరలించి ఆచరించి తరించుట సులభము.
నేను, నాకు తెలిసిన మేరకు విషయమును అతి క్లుప్తముగా చెప్పినాను.
స్వస్తి
**************************************
సమస్య మనది -- సలహా గీతది -- 11 

సమస్య : పంచ భూతాలయిన  పృథివ్యాపస్తేజో యురాకాశములు విజృంభించితే మన పని అంతే ! 
సలహా   : అదే మూర్ఖత్వమంటే ఇంత వరకూ విన్నదంతా పొట్టులా గాలికి కొట్టుకు పోతే , రెడ్డి గారొచ్చినారు మళ్ళీ మొదలెట్టం డన్న చందము అయినది.
ఒక చిన్న కథ గుర్తుకు వస్తూవుంది. ఒక పల్లెటూరిలో ఇద్దరు ప్రక్క ప్రక్క ఇంటి స్నేహితులు రోజూ పశువుల మేపను ప్రొద్దుటే పోయి చీకటి ప్రోద్దుకు తిరిగి వచ్చే వారు. ఇంటికి వచ్చి సేద తీర్చుకొని స్నానము చేసి భోజనము చేసి నిదురించేవారు. వీరి చేతిలో ఎప్పుడూ ఒక పొడవాటి కట్టె శరీరము పై కప్పుకోనేందుకు ఒక కంబడి వెంబడి ఉండేది. ఒకరోజు రాత్రి  ఇద్దరూ తమ కట్టె కంబడి సమేతముగా  భోజనాదులు ముగించుకొని వచ్చి పడుకొన్నారు, ఇంటిబయట వేసిన మంచాలపై. రెండవానికి నిదుర పట్టింది కానీ మొదటివాడు తన యింటికి చాలా దగ్గరలో ఎదో హడావిడి గమనించినాడు . తన కట్టె కంబళితో లేచినాడు . ఎవరో పండితుడు రామాయణము చెబుతున్నట్లు దగ్గరికి చేరగా చేరగా గమనించినాడు,  కానీ తానూ కూర్చుంటే చెప్పే వ్యక్తి కనబడడు కాబట్టి తన కట్టె ఊతగా కంబడి గలిగిన వీపును వంచి నిలబడినాడు. కాసేపు గడిచిన పిమ్మట ఒక ఆకతాయి అతనిపైకి వెనకాల నుండి వురికి గుర్రముపైకి లంఘించిన చలన చిత్ర కథా నాయకుని మాదిరి కూర్చున్నాడు. కథలో అప్పుడే వాలీ సుగ్రీవ యుద్ధ ఘట్టములో వాలి సుగ్రీవుని గదతో బలంగా మోదే  ఘట్టము  జరుగుతూ వుంది. అప్పుడు పౌరాణికుడు వాలి గదాఘాతపు మోత 'ధన్' మని వినిపించడము, కుర్రవాడు కూర్చోవడము ఒక్కసారి జరుగుటతో అతడు కేవలమది అనుభూతిగా భావించి ఆసాంతము అదే భంగిమలో ఉండిపొయినాడు. తెలతెల వారగా కథ ముగిసింది. అతనికి వీపు పైన బరువు అప్పుడు తగ్గినట్లు అయినది. తన మంచము వద్దకు చేరుకోగానే అప్పుడే లేచిన మిత్రుడు ఎరా ఎక్కడికి పోయివుందినావు అని అడిగినాడు. రామాయణము వినుటకని ఇతడు చెప్పినాడు. బాగుగా వుండినదా అన్నది అతని ప్రశ్న. ఇతని జవాబు " బాగో ఓగో నాకు అర్థము కాలేదు గానీ కథ ముగిసేవరకు ఎదో బరువుగానే వుండినదన్నాడు." 
ఇపుడు మన పరిస్థితీ అదే ! 
పట్టు వదలని విక్రమార్కుడు మన కాదర్శము.
ఈ దేహమే పంచ భూతాత్మకము. పాదములు కాళ్ళవరకు భూమి, ఆపై కడుపు వరకు నీరు (ద్రవములు ) ( ఈ రెంటిని అర్థము చేసుకోగలము ) , గుండె వద్ద తేజస్సు  (నీవార శూక మత్తన్వి పీతాభా స్వస్త్యణూపమా అన్నది వేదవాక్కు. తిరగబడ్డ  పద్మపు మొగ్గ వద్ద వడ్లగింజకున్నంత ముల్లులా నీ లి రంగులో ప్రకాశించుతూ వుంది .   దీనిని sinus node అని అంటారు.) ఆపైన  ఊపిరితిత్తులనుండి నాసము (ముక్కు) వరకు వాయువు, ఆతరువాత
 మిగిలింది ఆకాశము . ఆకాశమునకు అంతము లేదు ,ఆలోచనలకూ అంతము లేదు ,అది శిరస్సు( ఆజ్ఞ మరియు సహస్రార స్థానము.) కాబట్టి ఏదయినా దానిలో కలిసి పోవలసిందే. ఈ విషయములో పరమాత్ముడు ఏమి చెప్పినాడంటే 
నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః     23 -- 2
శస్త్ర మ్మాత్మను చంపగలేదు
అగ్నియు దానిని అంటగ లేదు
 
పయస్సు పవనము ప్రభావ హీనము
ఆత్మ యనంతము అజరామరము  23 -- 2

అచ్ఛైద్యో 2యమదాహ్యో 2యమక్లేద్యో 2శోష్య ఏనచ
నిత్యః సర్వగతః స్తాణు రచలో యం సనాతనః    24 -- 2

చిరిగి పోవదది చిచ్చుయు నంటదు
తడిసి పోవదది తపనము చెందదు
ఎల్ల వేళలా  ఎక్కడనైనా 
స్థాణువు అచలము సనాతనమ్మది      24 -- 2

ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, నిప్పు తాకలేదు, నీరు ముంచలేదు గాలి తన ప్రభావమును అణుమాత్రము కూడా
 చూపించలేదు. చిరిగి పోదు చిచ్చు అంటే నిప్పు కాల్చలేదు, తడిసి పోదు తాపము చెందదు, అది కదలదు మెదలదు  ఆకాలమీకాలమనక సర్వకాల సర్వావస్థలయందును అది యుండును. మరి ఉన్నదానిని గూర్చి ఏడవ పనిలేదు కదా  అట్లే పోయేది వాస్తవమైనపుడు దానిని గూర్చి కూడా ఏడవ పని లేదు. 
కాలము గడవక ముందే కర్తవ్యము పూర్తిచేయ నాలోచించు. 
ఇదే ప్రశ్నను నీ కార్యాలయ జీవితమ్మునకు అనుసంధించుకొన్నా ఎంత చక్కగా అతుకుతుందో చూడు. నీరాత , నీ చేత, నీగుణము, నీభ యము నీ భక్తి నిన్నావహించిన పంచగుణాలు. నీవువిధానము పై అధికారికి నివేదించు, భాష భావము కలిగిన, note వ్రాసే విధానము, నీవు కార్యాలయములో కానీ నీ పై అధికారులతో కస్నీ నీవు ప్రవర్తించే తీరు, నీ కార్యకలాపములచే బహిర్గతమయ్యే నీ గుణము, ఒప్పదచిన పనిని సక్రమముగా నిర్వర్తించవలెనను భయము, నీ కార్యాలయమును దేవాలయముగా భావించే నీలోని భక్తి నిన్నావహించు పంచ భూతములుగా భావించవచ్చు. వాణి ప్రభావము నీపై సక్రమముగా వుంటే కార్యాలయమునందు నీ దక్షతకు ఎదురులేదు. అందుకు వ్యతిరేకమయితే నీవు శివుని ముందు దక్షుడే! ఈ గునములన్నింటినీ కలిపి శీలము అంటారు. శీలము లేక మానము అన్నది స్త్రీపురుషులిరువురికీ వుండవలసినదే! అందుకే నీతి శాస్త్రము చెబుతుంది :
ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతుl
అనిత్యోర్భవతి ప్రాణః మానమాచంద్ర తారకమ్l
 ప్రాణాన్ని వదలిపెట్టి అయినా సరే సౌశీల్యాన్ని సంరక్షించుకోవడం అన్నది భారత జాతి సనాతన స్వభావం. , ప్రాణం తాత్కాలికం, సౌశీల్యము కలకాలమూ నిలిచి ఉంటుంది. ఇందు ఆడ మగ తేడా లేదు.
ఇక కార్యాలయములో బాహ్యముగా నీపై ప్రభావము చూపే పంచాభూతాలన్ము ఒకమారు గమనించుదాము. అవి 1. కుళ్ళు 2. కుట్ర, 3. కుతంత్రము, 4. అహంకారము 5. ఆభిజాత్యము. ఒక్కొక్కటి బహు క్లుప్తముగా విశ్లేషించుకొందాము.
1.నీకు మంచి పేరు వస్తూవుంటే కుళ్ళు. 2.ఆ మంచి పేరు రానీకుండా చేయు శతవిధ ప్రయత్నములే నీపై కుట్ర. 3.నీకు చెడు జరుగు విధముగా యోచించి దెబ్బతీయుట కుతంత్రము. 4.నేను గొప్ప హోదాలో వున్నాను కాబట్టి నా కార్యాలయ పరివారమును హీనముగా చూచుటలో తప్పులేదు అనుకొనుట అహంకారము. దీని ప్రభావము ఒక నిమ్న ఉద్యోగిగా నీపై వుంటుంది.
5.ఆకారవికారములు అధికాధమ సామాజిక వర్గాతారతమ్యములు నీపై పని చేస్తాయి. మూర్ఖులు పై విధముగా ఆలోచన చేస్తారు. కావున చాకచక్యము ఎంతో అవసరము. దుష్టునికి దగ్గరవున్నా వాణి గుణము నీకు తెలుసును కాబట్టి జాగ్రత్త పడగలవు. మూర్ఖునికి దగ్గరగా వుంటే వాడు ఏ నిముసానికి ఏమి చేస్తాడో వానికే తెలియదు. అందుకే జాగ్రత్త అవసరము. అందుకే నీకు ఇంకా సులభముగా అర్థము కావలెనని సుమతి శతక పద్యమును యతి ప్రాసలను పక్కనుంచి నీ కొరకు వ్రాసినాను.
ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికాటాకుటాకి అన్యుల హార్టుల్
హర్తింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగువాడు ఎక్స్ పర్ట్ సుమతీ!
అని. ఇందులో నీకు అర్థము కానిది ఏమీ లేదు కాబట్టి నిలుపూనిదానముగా ఒలుపూ వైనముగా అల్పూఆయాసము లేకుండా ఆలోచించుకో!
స్వస్తి.
**************************************
సమస్య మనది -- సలహా గీతది -- 12 
సమస్య: అధర్మం పెరిగిపొతూంది. అకారణ వైరాలు పెరిగిపోతున్నాయి. తాము చీకాకు పడి లోకాన్ని కూడా చీకాకు పెడుతున్నారు. బాధ్యతను భరించి నిలువడమా  లేక బాధ్యతకు భయపడి పారిపోవడమా ?

సలహా : దేనికయినా ఒక స్థితిస్థాపకత (Extreme Elastic Nature, Breaking Stress) వుంటుంది. పరిస్థితులు  ఆ తటమును చేరినపుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుటకు తానె పుడతానన్నాడు పరమాత్మ. కావున ఆభారము ఆయనపైన వేసేస్తే సరిపోతుంది. ఇక చీకాకు విషయమునకొస్తే రాత్రి సమయములో వెలిగే వీధి దీపాలు గుర్తుకు వస్తాయి నాకు. ఎందుకంటే పగలు ముగియగానే చీకటి రాను రానూ దట్టముగా అలముకోనుట ప్రారంభామవుతూ వస్తుందిఆ సమయములో వీధి దీపములు వెలుగుట ప్రారంభమౌతుంది. అన్నీ వెలిగినాయనుకో వీధి మొత్తము వెలుగుతో నిండి నడచుటకు ఆటంకము లేకుండా చేస్తుంది. చెదురు మదురుగా కొన్ని దీపములు వెలుగలేదనుకో  ఆ ప్రదేశము న మసక చీకటి ఆవహించుతుంది. నడచేవాని నడక వేగమూ తగ్గుతుంది. దీనివలన మనకు ఏమి తెలియవస్తూవుంది? మనము లేక మనకుతుమ్బము ఒక Light Pole అనుకొంటే, మన Light వెలిగితే ఆ వెలుతురు చేరగలిగిన పర్ది వరకు వెలుగు నిమ్పినట్లవుతుంది. దానివలన Light Pole యొక్క ఉనికి తెలుస్తూ వుంది, బాటసారులకు వెలుగూ పంచుతూవుంది. నేను చెప్పదలచుకొన్నది ఏమిటో అర్థమైనదా! నిన్ను నీవు చక్కబెట్టుకొంటే సమాజము దానికదే చక్కబడుతుంది. ‘తనకంపు తనకింపు, పరుల కంపు పాపిష్టి కంపు’ అనుకొంటేనే  ఇబ్బంది వచ్చేది. మనకు కావలసినది చెప్పే నేత కాదు, చేసే చేత కావలసినది.
ఈ విషయమును ఒకసారి గమనించు.ఈ జగమనేది ఒక సర్కసు అందులో ఎవరి సన్నివేశము వారిదే . అందులోనూ ఎవరి పాత్ర వారిదే. నీ ప్రమేయము అందులో వచ్చే వరకు నీవు కూడా ప్రేక్షకునివే. నీ పాత్ర ప్రకటమయ్యేవరకు నీవు చేస్తూవుండేదేమీ లేదు. చూస్తూ వుండేది తప్ప. మరి నీ ప్రమేయము కల్గినపుడు నీవు పారిపోతానంటే సమంజసమా ! నీపని నీవు చేస్తే ఈ జగానికే వన్నె తెచ్చిన వాడివౌతావు .  అది నీకూ పేరు ప్రఖ్యాతిని అజరామర కీర్తిని తెచ్చి పెడుతుంది. ‘నీ బాధ్యత నీ ధర్మం’ అదే విధంగా ‘నీ ధర్మం నీ బాధ్యత’.
బాధ్యతకు భయపడి ఎంతదూరమని పారిపోగలవు. ఒకబాధ్యతను వదలి పారిపోతే అక్కడ వేరొక బాధ్యత తగులుకొంతుంది. ప్రాణము ఉన్నంతవరకు బాధ్యత తప్పదు. నీదగు బాధ్యత నీవు స్వీకరించు. అదే నీ ధర్మము. నీ ప్రయోజకత్వమును నిరూపించుటకు తనకు తానుగా నీకు దొరకిన మార్గమని దానిని భావించు. ఈ సందర్భములో నేను వ్రాసిన ఈ పద్య భావమును ఆకళింపు చేసుకొన్నావంటే నీ భయము బరువు రెండూ తీరుతాయి.
చేతను బూనియున్నపని చిన్నదియైనను పెద్దదైనయున్
రాతను దూరబోకు కన రాదని దానిని  చేయు మార్గమున్
ఊతమునిచ్చితాను హరి ఊరట గూర్చును నీదు బుద్ధికిన్
చేతులు మోడ్చి నీ మనసు చేర్చిన ఆయన పాదదోయిపై
ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడు అర్జనునకు ఏమి చెబుతున్నాడో చూస్తాము.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి
ధర్మ్యాద్ధి యుద్ధాచ్రేయో 'న్యత్ క్షత్రియస్య న విద్యతే  31- 2 ఉన్నది

ఉన్నది స్వధర్మ మన్నది నీకడ
భయము చెందకది బాధ్యత నీయది
ధర్మ యుద్ధమే ధర క్షత్రియునకు
శ్రీవిలసన్మయ శ్రేయోమార్గము     31- 2
ఆత్మను గూర్చి దాని అమృతత్వమును గూర్చి మొదట తెలిపి అర్జనుని కది అర్థమైన పిదప అతనిని కార్యోన్ముఖుని చేయ మొదలిడినాడు శ్రీ కృష్ణుడు. దీనినే సంభాషణా చాతుర్యము అంటారు.ఇంగ్లీషులో Conversational Skills అంటారు . విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః ।
యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనామ్‌ ॥

మహానీయుడు భర్తృహరి వ్రాసిన పై సుభాషిత భావముమునకు 'తెనుగుసేతచేసిన ఏనుగు లక్ష్మణకవి గారి మాటల్లో
ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్
భూప సభాన్తరాళమున పుష్కల వాక్చాతురత్వమాజి బా
హాపటుశక్తియున్  యశమునం దనురక్తియు విద్యా యందు వాం
ఛాపరి వృత్తియున్ ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్

 ఆపదల యందు ధైర్యముకలిమి కలిగినపుడు ఓర్పు అంటే డబ్బు చేతికొచ్చినదనే అహంకారము మహా సభలు సదస్సుల యందు వాక్చాతుర్యముయుద్ధము నందు పరాక్రమముకీర్తి యందు అనురక్తియువేదశాస్త్ర అధ్యయనమున ఆసక్తియు కలిగి యుండుట అనునవి సజ్జనులకు సహజ గుణములు.
పరమాత్ముడైన శ్రీ కృష్ణునిలో ఈ గుణాలన్నీ చూస్తాము. అందుకే ఆయన భగవంతుడు. ఇప్పుడు అర్జనునికి తన ధర్మమూవిధిబాధ్యత ,కర్తవ్యమును బోధజేసి యుద్ధోన్ముఖుని చేస్తున్నాడు.
ఇక్కడ ధర్మము బాధ్యత వాక్చతురత అన్న మూడు విషయములను శ్రద్ధతో మనము గ్రహించితే పరిస్థితులకు భయపడి పారిపోయే అవసరముండదు. నీకిచ్చిన బాధ్యతను మనసుతో గ్రహించు. అదే నీ కర్తవ్యము. దానిని పరిపూర్తి చేయుటకు నీ మాట ముఖ్యమని గ్రహించు.
నాలుక వైరుల కూర్చును
నాలుకయే సన్నిహితుల నయముగ చేర్చున్
నాలుక నదుపున నుంచిన
నాలుగు దిక్కులును  నీవె నాయక రామా!
కావున నీ నాలుకను అదుపున ఉంచుకొని అవసరమైనపుడు అవసరమైన రీతిలో అవసరమైనంత మాటలాడినావంటే అందరూ నీ ఆప్తులే. నీ చేరువ కాలేకపోయినారంటే తప్పక వారు మూర్ఖులని గ్రహించు. వారు నీ చెంతనుండీ ఉపయోగముండదు. వదిలిపెట్టు.
He who knows not and knows not he knows not is a fool, shun him. అన్నది ఒక ఆంగ్ల సామెత. దానిని అమలుచేయి అంతే!
స్వస్తి.

Venkata Ravisundar Komandur Sir very nicely clubbing Githa for the PSYCOLOGY&MANAGERIAL &ADMINISTRATIVE NEEDY WORDS OF "CONVERSATIONAL SKILLS" IS REALLY GIVING TIMELY COUNSELLING/motivating 
COUNTERING TIMELY. SUPER SIR. 

******************************************************************************************************************************************

సమస్య మనది -- సలహా గీతది -- 13



నేను ఆదర్శవాదిని. సమాజమునకు నిజమైన సేవకునిగా కొంత గుర్తింపు 

లభించింది. ఈర్ష్యతో నన్ను వేలెత్తిచూపేవారు ఎక్కువైనారు.ఈ అప్రతిష్ఠ 

భరించలేకున్నాను. కిం కర్తవ్యమ్ ?




నీ మనసు నీ  కర్మలకు కోర్కెలకు కర్మాగారము. బుద్ధి దాని బంటు. ఆత్మ కేవలము 

సాక్షి . త్రవ్వదు , బూడ్చదు కానీ అనవరతము మనసు చేసే మంచిచెడులకు సాక్షీభూతమై ఉంటుంది. అంటే మన కరణమునకు అంటే చేసే పనికి 

అది  ప్రత్యక్ష సాక్షి. దానికి తెలియకుండా ఏదీ జరుగదు. నీ పనిలో నిజాయితీ 


ఉందన్న నమ్మకము నీ బుద్ధికి కలిగినపుడు నీవు వెనుకంజ వేయనవసరములేదు. 

నీ చేష్ఠ సమాజ శ్రేయస్సుకు ఉపకరించేదైతే  నీవు మెడిమె త్రిప్పనవసరమే లేదు. ఆ విధమైన జ్ఞానమే  నీ బాటకు వెలుగు . గాఢాంధకారము 

అలముకొన్నా సరే అడుగు ముందునకు మాత్రమే వేయి. అట్లని' కళ్ళుమూసుకొని ' అని మాత్రము కాదు ఆచి తూచి అడుగు వెయ్యమని 

అర్థము. భర్తృహరి సుభాషితము ఏనుగు లక్ష్మణ కవి మాటలలో :

ఆరంభింపరు  నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై 

ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్ 

ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ద్రుత్యోన్నతోత్సాహులై 

ప్రారభ్దార్థము నుజ్జగించరు సుమీ ప్రాజ్ఞానిదుల్ గావునన్

ధీరుడు ఏమైయితే అది గానీ (come what may ) అని తన పని కొనసాగించుట


యేగాక దానిని పూర్తి చేయువరకు  వదలడు.

తిండి నలుసు బట్టి తిరముగ గోడపై 

పడుచు లేచి చీమ ప్రాకుచుండు

అట్టి చీమ నెప్పు డాదర్శముగా  నెంచు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

ఇంకొక విషయము. నీపైన ఈర్ష్య వున్నవారు ఎందరయినా ఉండనీ.  నీలో ఈర్ష్య 

లేకుంటే చాలు. ఈర్ష్య చింతలది విడదీయరాని బంధము. ఒకసారి ఈ మాటను ఆలకించు. చింతకు ఈర్ష్య చేరితే ఏ విధముగా వుంటుంది అన్న ఈ పద్యమును శ్రీనాథులవారు వింధ్యేంద్రుని ద్వారా చెప్పించిన ఈ పద్యము వింటే ఇది భారతములో పరాభవము చెందిన దుర్యోధనుడు కదా ఇది చెప్పినది అనిపిస్తుంది.  ఈర్ష్య ఎంతగా వ్యక్తిని వ్యాకులపరుచుతుందో చూడండి.
కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటకమిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యునకెట్టి వానికిన్
గంటకుఁ డైన శాత్రవుఁడొకండు దనంతటి వాఁడుగల్గినన్.
కంటికి నిద్ర రాదట, రతికేళి కూడా సుఖమును కూర్చదట, ఎంత రుచికరమయిన వంట కూడా నోటికి ఇంపితము కాదట, అవి పదివేల విధములగు వైభవములే కానీగాక మనసు ఇష్టపడదట, ఎవరికి, ఎటువంటివానికి అంటే మానవత గల్గిన మనిషికి ఎవనికైనా తనంతటి శత్రువు ఒకడు ఏర్పడినాడంటే వాడు ‘చెప్పులోని రాయి, చెవిలోనిజోరీగ, కంటిలోని నలుసు, కాలిముల్లు కదా’! 
ఇది ఈర్ష్య తో కూడిన చింత. ఇది ఇంకా భయంకరమైనది. చూచినావు కదా!
ఈ కథను ఒకసారి గమనించు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరి సంపద చూసి ఇంకొకరికి ఈర్ష్య.  దానిచే ఒకనికన్నా ఇంకొకడు అమిత ధనవంతుడు కావలెనను చింత.  ఎంతో యోచించి పెద్దవాడు, తపస్సు చేస్తే తనకోరిక సాధించుకోనవంచును అన్న ఆలోచన కలుగుటచేత ఒక కొండగుట్ట చేరి తపమాచరించ మొదలుపెట్టినాడు. ఇది తెలిసిన తమ్ముడు తానూ కూడా అదే పని అదే కొండపై అన్నకు కాస్త దూరములో మొదలుపెట్టినాడు. ఎత్లయితేనేమి దేవుడు ముందు తపస్సు మొదలుపెట్టిన పెద్దవానికి ప్రత్యక్షమై వారము కోరుకొమ్మన్నాడు. వాడు కళ్ళు తెరువగానే దేవునికన్నా ముందు తమ్ముడు తపస్సు చేయుట చూసినవాడై, దేవుని ‘స్వామీ! నీవు ఎటూ ఆ తపస్సు చేసుకొనే వానికి కూడా ప్రత్యక్షమౌతావు కదా! వాడు కోరిన దానికి నాకు రెండితలివ్వు.’ అన్నాడు. పనిలో పనిగా దేవుడు తమ్ముని ఎదుట నిలిచి వారము కోరుకొమ్మన్నాడు. వానికి ‘అన్న’ చింత కదా! ‘వాడేమి కోరినాడ’ని అడిగినాడు. అబద్ధామంటే తెలియని దేవుడు ఉన్నమాట చెప్పినాడు. తమ్ముడు వెంటనే “స్వామీ అట్లయితే నాది ఒక కన్ను గుడ్డి చేయి” అన్నాడు. తక్షణం వీడికి ఒక కన్ను వాడికి రెండుకళ్ళు పోయినాయి. ఈర్ష్య చింత కలిస్తే ఇంత అనర్థము దాపురించుతుంది.
ఈ సందర్భముగా నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.

ఎంతటి  వానికైన  మది  నేర్పడు చింతకు  ఊపిరూదుచున్
చెంతన  ఈర్ష్య  వున్న  ఇక  చింత  దవానలమౌచు  రేగి  ఏ
పొంతన  లేని  దుష్టగుణ  పూత విపత్తి విషాద మూకలన్
సంతతముంచి చిత్తమును సాంతము గాల్చును రామమోహనా!
పూతము= చిక్కనయిన
అందుకే చింత అన్నది luggage తో పోల్చుకొంటే నాకు ఒకకాలమునాటి Railway Slogan గుర్తుకు వస్తుంది.
Less luggage More Comfort Make Travel A Pleasure.
ఈ విషయమై భగవాను డేమి చెబుతున్నాడో చూస్తాము : 

అకీర్తించాపిభూతాని కథయిష్యంతి  తే'వ్యయాం

సంభావితస్య చాకీర్తి ర్మరణాదతిరిచ్యతే         34-2 


పొందిన కీర్తిని పొంగే పాలుగ

పోనీ కయ్యది పొయ్యి పాలుగా 

మాన్యత పొందిన మనుజున కెప్పుడు 

మరణము కన్నా మారణ మయ్యది  34 - 2


అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః

నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం న కిం  36-2 


లోకులెప్పుడూ కాకుల పోలిక

అపవాదుల నీకంకిత మిచ్చి

అప్రతిష్ఠ నీ కంటగట్టుదురు
మాన్యున కయ్యది మరణమే కదా  36 -- 2 

ఒకసారి పరమాత్ముని సంభాషణా చాతుర్యమును (conversational skill ) 


తిలకించు . ఇంతవరకు వేదాంత పరముగా మాట్లాడిన ఆయన ఇంకా అదే మూసలో మాట్లాడితే పరిపక్వత చెందవలసిన నరుడికి అర్థము కాదని తెలిసి ప్రాపంచిక విషయముల పైకి ఆతని దృష్టి మరల్చినాడు. తిరిగీ దీనిని ఎప్పుడో దానికి తగిలించుతాడు. అది ఆయన నేర్పరితనము. మనకు ఎంత తెలుసునన్నది , ఎంతసేపు అనర్గళంగా చెబుతున్నామన్నది ముఖ్యము కాదు. ఎదుటివానికి  ఎంత అర్థమైనది అన్నది . ఇది grinder యుగము. ఎవరైనా వచ్చి switch off చేస్తే కాని అది రుబ్బుట మానదు. ఇట్లు చేయుట యేవిధమైనటువంటిదంటే నిగనిగలాడే మామిడి పండును రేపు ఇంకా ఎక్కువ ధర కమ్మవచ్చులే అని నాల్గు రోజులు 

తనవద్దనే వుంచుకొన్నాడట ఒకడు. ఐదవరోజు అది కుల్లిపోయింది. Pain killers పది ఒకేసారి వేసుకొంటే ఇక నొప్పి రాదనుకొనుట తెలివికి తార్కాణము కాదుగదా ! పైపెచ్చు భగవానుడు అర్జనుని భరతర్షభ అని సంబోధించుట కూడా కద్దు. అంటే అతని గొప్పదనమును గుర్తుజేసి కార్యోన్ముఖుని జేసే ప్రయత్నము చేస్తున్నాడు. ఈ కాలము లేని విశేషణాలనుకూడా అంటగట్టి ఎదుటివారిని అవసరమున్నా లేకున్నా పొగుడుతూ ఉంటాము.

ఆయన ఎంతో విశధముగా " అర్జునా ! నీవు కీర్తి కిరీటివి. కీర్తికే కిరీటము 


వంటివాడివి లేక కీర్తిని కిరీటముగా కలిగిన వాడివి. ఇప్పుడు నీ బాధ్యత విస్మరించ 

తగదు. నీవు ఎన్నుకొన్న దారిన ఎంతోదూరము నడచిన పిదప ఇక వెనుదిరగ 

వీలుకాదు. నీవింతవరకూ అవలంబించినది క్షత్రియ ధర్మ మార్గము. నీవు 

ముందునకు సాగావలసిందే అని హెచ్చరిక తో కూడిన మాటను ఎంతో మృదువుగా 

చెప్పుచున్నాడు. కాబట్టి దారి ఎంచుకొనుటలో ఆలస్యము వుండచ్చును గానీ ఆచరించుటకు రంగము సిద్ధమైన తరువాత అమీ తుమీ తెలవలసిందే!
అసందర్భము కాదని తలచుతూ నేను ఆంగ్లములో వ్రాసిన ఈ పంక్తులను పరికించేది.
It was a day on which I felt 
I am hapless and hopeless
Never had an iota of hope
That I have in life lot of scope
It was you, my God, flashed in my heart
clearing all the obstacles that thwart
filling my heart with all courage
hallowing my heart with all virtual storage
chilling my mind which was in summer May
I say now with stretched heart come what may

Oh God Never knew I could feel like this
Like I´ve never seen the sky before
I love you and live with dignity till the end
My season changed fro autumn to spring
My temper swelled up with enormous upswing
I can make all impediments wobbling
Come what may and come what may
I can say now come what may
స్వస్తి.


సమస్య మనది -- సలహా గీతది -- 14

నేను కొత్తగా ఒక పరిశ్రమను ఏర్పాటుచేయ దలచుకొన్నాను. ఎన్నో ఆలోచనలు ఎన్నో భయాలు. అసలు మొదలు పెడదామా వద్దా అన్న సందేహాలు. ఎటూ తోచని స్థితి. ఏమి చేయవలెనన్నది నా ఆందోళన.
 సలహా : ‘శ్రేయాంసి బహువిఘ్నాని’ అన్నమాట సామాన్యముగా నీవు వినే ఉంటావు. ఆ వాక్యమును కలిగిన శ్లోకము యొక్క పూర్తి పాఠము ఇది.
శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహాతామపి
అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాన్తి వినాయకాః
మంచి వారు మంచి పనినే తలపెడుతారు. తలపెట్టిన పని మంచిదయితే దానికి ఆటంకాలు కోకొల్లలు. అదే దుష్టులు తలపెట్టే దుష్కార్యములు నిరాటంకముగా జరిగి పోతాయి. దుష్కార్యము తలపెట్టేవాడు దుష్టుడు కాక మరేమౌతాడు. నాటి కాలములో పల్లెటూరి వాతావరణము కలిగిన చలన చిత్రాలలో ANR లాంటి హీరోలు జనాన్ని కలుపుకొని తమ పొలాలకు నీరు వచ్చేలాగు కష్టపడి ఏర్పాటు చేసుకొంటే ఏ రౌడి రాజనాలో వచ్చి ఆ జలాశయానికి   గండి కొడతాడు. కథ ఇక్కడ ఆపేద్దాము. ఒక మంచి పని చేయుటకు ఎంతోమంది చేయూతతోకూడిన  ఎంతో మంది దేహ కష్టము ఒక్కటయితే తప్ప నీటిని పొలాలకు తరలించే పని జరుగలేదు. అదే ఆ జలాశాయానికి గండి రాజనాల ఒకడే కొట్టినట్లు చూపుతారు. అంటే పని మంచిదయితే పాట్లు ఎక్కువగా వుంటాయి. చెడ్డదయితే ఒక్క క్షణము. అంతే.
అందుకే పెద్దలు ‘కుమ్మరికొక ఏడు గుదెకొకనాడు’ అంటారు.
బంకమట్టి తెచ్చి, తడిపి, గుదె   (అంటే అంచులు కూచిగాలేని కొయ్య తో చేయబడిన ఒక దీర్ఘ చతురస్ర సాధనము. కుమ్మరి దానిని పట్టుకొనుటకు వీలుగా పిడి వుంటుంది.), సారె అంటే తాను చేసే మట్టి వస్తువులను అందముగా తీర్చుటకు కుమ్మరి ఉపయోగించే చక్రము, అయిన తరువాత ఆవము (అంటే ఒక అగ్నిగుండము. వెలిగించుటకు ముందే కాల్చవలసిన మట్టిపాత్రాలను ఆ గుండములో పేరుస్తారు. తరువాతి రోజు అవి కాలి గుండములోని కట్టెలు బూడిద అయి చల్లారిన తరువాత వానిని ఒకగోడకు చేరువగా వరుసగా చాలా ఎత్తుగా పేరుస్తారు.)లో  పెట్టి కాల్చి సంవత్సరము పొడవునా దొంతరగా చాలా ఎత్తుగా పెర్చుకొంటూ వస్తారు. ఇది ఒక సంవత్సర ఫలము. కానీ ఏ బుద్ధిలేనివాడో, దుర్మార్గుడో గుదె తో కిందివరుసను కొడితే చాలు, సంవత్సరము పొడవున పడిన శ్రమ అంతా బూడిద పాలే!
కావున మనము తలపెట్టిన మానవ ప్రయత్నముగా ఈ విధమగు అవాంతరములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసిన స్థలము చట్టబద్ధమైన పట్టా, తగిన కట్టడము, నీటి మరియు విద్యుత్ వసతి, వీటి కావలసిన పెట్టుబడి, పెట్టుబడికి ఋణసహాయము చేసే BANK చూసుకోవాలి . తగిన ముడి సరుకు నీవు పరిశ్రమ తలపెట్టిన ప్రాంతములో సులభముగా దొరుకుతూ ఉందా లేదా చూసుకోవాలి. సులభ రవాణా సౌకర్యము నీవు పరిశ్రమ తలపెట్టిన ప్రాంతములో ఉన్నదా లేదా అన్నది ఎంతో ముఖ్యము. మానవ వనరులు (Labor and other human resources) చక్కగా అందుబాటులో ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఏదీ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నిర్దుష్టముగా ఒక పథకము ప్రకారము నీవు పనిని ప్రారంభించవలసి వుంటుంది. ఏతావాతా నేను చెప్పవచ్చింది ఏమిటంటే నీవు అన్నివిధాలా సిద్ధమయినావంటే ఆలోచించవలసినది ఏమీ ఉండదు. భయపడవలసినదీ ఏమీ ఉండదు. నీలో చిత్తశుద్ధివుంటే చాలు. నిర్భయముగా నీపని చేయి. ఫలితము భగవంతునిపై వదులు. నీవు ఏపని చేయుటకైనా ముందే కష్ట సుఖాలు లాభనష్టాలు జయాపజయాలు బేరీజు వేసుకో ! ఆలోచించుటకు కాలము వెచ్చించు కానీ ఆచరణకు మాత్రం  ఆలస్యము చేయవద్దు. ఫలితము నీ చేతిలో లేదు గానీ పట్టుదల నీవద్ద వుంది. దీక్షతో చేసే ఎపనినైనా దేవుడు మెచ్చుతాడు. ఫలితమునకు కర్త ఆయనే . నీవాశించిన ఫలితము వచ్చినంతమాత్రాన నీకు మేలు ఒనగూరక పోవచ్చు. ఫలితము నీ ఊహకు అనుకూలముగా రానందువల్ల మేలు సమకూరనూ వచ్చు. అత్యంత అవసరమైన పనికి నీవు ఒక flight పట్టుకోవాలనుకొన్నావు. అడ్డంకులు అనుమతించక నీవు పోలేక పోయినావు. ఆ flight crash అయింది. మరి అది నీవనుకొన్నట్లు జరుగకున్నా  నీకు జరిగినది మేలే కదా ! నీకు చెందే ప్రతి గింజ మీదా నీ పేరుంటుంది . అందుకే చింతకు వంత పాడకు. అందుకే వాసుదేవుడు భగవద్గీతలో అర్జునునికి ఈ విధముగా సలహా ఇస్తాడు:
సుఖదుఃఖేసమే కృత్వాలాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్య సి      38-2

సుఖదుఃఖములను చూడుము సమముగ
లాభాలాభమలగ్నము జేయుము
జయాపజయముల చలించబోకుము
యుద్ధముకొరకై సిద్ధము కమ్ము                        38-2
ఇదే భావాన్నే ఈవిధముగా కూడా తెలుగులో తెలిపినాను.
సుఖదుఃఖములను చూడుము సమముగ
లాభనష్టముల లంపట మానుము
జయాపజయముల చపలత విడువుము
యుద్ధ మొక్కటే యుక్తమనెరుగుము
సుఖ దుఃఖాలు , లాభనష్టాలు, జయాపజయాలు అన్న ద్వంద్వముల జోలికి పోక నీ ధర్మము నీవు నెరవేర్చు. ధర్మయుద్ధము క్షత్రియ విధి. దానినుండి దూరము పోకు. యుద్ధము పాపమనుకొనే అర్జనుణ్ణి యుద్ధము చేయుటే ధర్మమని నొప్పించకనే ఒప్పించుతాడు. అది ఆయన సామర్థ్యము.  ఇక్కడ నీ విషయములో క్రొత్త పరిశ్రమ స్తాపించుటయే నీ వనరులతో వసతులను ఆయుధములుగా చేసుకొని  నీవు చేసే యుద్ధము. నీ ఆత్మా స్థైర్యమే నీ కృష్ణుడు. కాబట్టి దానిని సడలించకు. ఈ దిగువ తెలియబరచినది నీకు సంబంధించినా, ఇది  ఆయన మాటలోని సారాంశమే!
కార్యశూరుడెప్పుడునూ కాజాలడు భీరుడు
ముళ్ళతోటలో కూడా పళ్ళకొరకు వెదకుతాడు.
కష్టాలకు కడగళ్ళకు కలనైనా తావివ్వడు
ఫలితమెప్పుడూ  కోరక  పైవానికి వదులుతాడు.

నీవు పరిశ్రమ స్థాపించడము, యుద్ధము చేయడము వేరువేరు అనుకొంటున్నావేమో! ఏమాత్రమూ కాదు. అదయినా పూర్తిగా ప్రణాలికా బద్ధమే ఇదయినా అంతే! బాణము, విల్లు, లక్ష్యము, దీక్ష, నీ నైపుణ్యము అన్నీ వున్నపుడు ఆలోచించనవసరము లేదు. షాణ్మాసిక సమీక్ష(Half yearly review) వంటివి ఏర్పాటుచేసుకొంటే పరిశ్రమ తీరు తెన్నూ తెలిసివస్తాయి. అదే యుద్ధములోనైతే ప్రతిరోజూ యుద్ధము ముగిసిన పిదప సమీక్షించుకొని తరువాతి రోజుకు వలసిన ప్రణాళిక సిద్ధము చేసుకొనవలసి వస్తుంది.
పట్టుదలకు పట్టం గట్టు
పనిపైనే చూపును పెట్టు
పనివారలతో జత కట్టు
భవితకదే ఆయువు పట్టు
స్వస్తి.
**************************************
సమస్య మనది -- సలహా గీతది -- 15
సమస్య : నేను, తలచినదే జరిగినదా తలకు మించు ఆనందము, పడిన శ్రమలు ఫలించకుంటే నీరసము నిర్వేదము. దారేమిటి?
సలహా : జవాబు వినుటకు ముందు ఈ కథ విను.  ( ఇది నాచే వ్రాయబడినదే )
అనగా అనగా ఒక రాజు ఉండేవాడు . ప్రజలకు ఎదో చేయవలెనన్న తపన . చేసేవాడుకూడా . కానీ ఒక్కొకసారి తన ప్రయత్నము ఫలింంంంచేది కాదు . ఎంతో కృంగిపోయేవాడు. ఒక సారి ఒక సాదువు ఆ నగరానికి వచ్చినాడు. అతడు చాలా మహిమాన్వితుడని రాజు విన్నాడు. తన సభకు ఆయనను సాదరముగా ఆహ్వానించి తనచింత తీర్చమన్నాడు రవ్వంత. అందుకు సాధువు " నేను నీకొక సాయము చేయగలను . నీవనుకొన్న పనిని తెలిపితే అది జరిగేదా జరగనిదా అని తెలియబరచి జరిగేదానిని నా మహిమతో జరిపించేస్తాను, నీప్రమేయము లేకుండానే !" రాజు మిక్కిలి సంతసించినాడు. అదిమొదలు పనులు తానూ చెప్పిన 4,5 జరుగవు అనే మాట రాకుండా జరిగిపొయినాయి. రాజు అది మొదలు పని సాదువుకు తెలియబరచుటతో తన చేతులు దులుపుకోనేవాడు . 
అక్కడ సాధువూ సుఖాలలో తేలుతూ రాజుగారి ఉత్తరువులు పట్టించుకోలేదు. తమ గూఢచారుల మూలముగా పోరుగురాజులు గ్రహించి రాజును నిర్జించి ఆతని రాజ్యాన్ని కైవసము చేసుకొన్నారు. అంతకు మునుపే వ్యసనాలకు బానిసయన సాధువు తన దివ్యత్వమును పోగొట్టుకొనుటే గాక స్వర్గవాసియో నరకవాసియో  కూడా అయినాడు.
ఈ కథలో మనము గమనింపవలసిన విషయములు :
1. రాజు తన కర్తవ్యము తెలియజేసే కర్మలను చేయుట చాలించినాడు.
2. రాజు చెప్పే ప్రతిపనినీ తానూ చేయలేనని సాధువు ముందేచేప్పినా రాజు పట్టించుకోలేదు.
౩. రాజు తన బాధ్యతగా చేయవలసిన కర్మలు  సాధువు ద్వారా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకొనుట కూడా          విడిచిపెట్టినాడు.
4. ఇక సాధువు వివిషయానికొస్తే అతడు తుచ్ఛమైన సుఖాల కోసం తన సాధన వదిలిపెట్టినాడు. తనకూ మేలు                 చేసుకోలేక పోయినాడు రాజుకూ మేలు చేయలేక పోయినాడు.  
5. తనకై ఏర్పరచబడిన కర్మ, ఫలితమాశించకుండా చేస్తూ పోయివుంటే పరిస్థితి ఇట్లు వుండేదే కాదు.
నీతి ఏమంటే ఫలితమాశించకుండా పని చేసుకొంటూ పోవడమే మన బాధ్యత. భగవంతుడు ఈ మాటను నరులము మరియు కలియుగ వాసులమైన మనకొరకు భగవానుడు ద్వాపర యుగాంతములోనే చెప్పినాడు . అదీ ఎవరితో నరునితోనే , ఎవరికొరకు అదీ నరునికోరకే. ఆయన ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాము.

కర్మణ్యేవాధిగారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి 47--2 

కర్మకు నీవే కర్తవు గానీ 
ఫలమాశించకు పట్టు వదలకు
కర్మల జేసెడు కష్టమెందుకని 
నిష్కర్మలబడి నీరసించకు                             47--2 

భగవానుడు ఫలము ఎందుకు ఆశించ వద్దంటున్నాడు అన్న మాటకు ఒక చిన్న ఉదాహరణ . ( ఈ ఉదాహరణలు 
లౌకిక దృష్టి తోనే వ్రాస్తున్నాను తప్పితే పార లౌకిక దృష్టి తో కాదు.( The explanation comes as a part of managerial ability.) ఏ అమెరికాకో పోవలెనని air ticket తీసుకొన్నావు. నీకు అనుకొనని అవాంతరాలవల్ల ఆ flight తప్పింది. అందులో నీ తప్పులేదు. Ticket నెక్స్ట్ flight కు మార్చుకోన్నావు. అంతలోనే నీవు కలువవలసిన వ్యక్తి incoming flight లో దిగి నీకొరకు వస్తూ కనిపించినాడు. నీవు ఎక్క వలసిన flight crash అయింది. ఇక్కడ నీ తప్పేమీ లేదు. నీవు మనసారా నీ ప్రయత్నమూ చేసినావు. జరుగలేదన్నది దైవనిర్దేశము. మరి నీకు అంతా మేలే జరిగినది కదా ! ఫలితము నీ కోరిక మేరకు అయివుంటే air crash తో ముగిసేది. అందుకే నీ ప్రయత్న లోపము లేకుండా నీవు చిత్తశుద్ధితో పనిచేస్తే నీకు మంచి జరుగు తుంది ఆశించినదానికంటే ఎక్కువగ! 
అదేవిధంగా ముక్కు మూసుకొని తమకేమీ పట్టనట్లు మన ఋషులు కూర్చోనివుంటే వేదాలలో తెలిపిన ఎన్నో ఆవిష్కరణలు వెలికి తీయుట జరిగేదా! 1 నుండి 9వరకు మరియు 0 ను గురించి లోకానికి తెలుపకుంటే, ఈ రోజు మనలను మనదేశమును మన విజ్ఞానమును ప్రపంచదేశాలు పొగిడేవా! వారంతా కర్మ చేస్తూనే యోగము సాధన చేసినవారు. అంతేగానీ వారు కర్మను వదలలేదు.
స్వోత్కర్ష అనుకోకుంటే నా జీవితములో, నేను భారతీయ స్టేట్ బ్యాంక్ లో పనిచేసే కాలములో జరిగిన ఒక వాస్తవమును మీతో పంచుకొంటాను.  అవి నేను ఒక పెద్ద భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖలో Accounts Manager గా పనిచేస్తున్న రోజులు. హటాత్తుగా, నన్ను పెంచిన, తల్లికన్నా మిన్నయైన, 93 సంవత్సరాల మా అమ్మమ్మ అనారోగ్య కారణముగా ప్రాణాపాయస్థితిలో ఉన్నదని నా శ్రీమతి Phone చేసింది. ఆఘమేఘాలమీద నా చేతనున్న Chest Keys Branch Manager అనుమతి మేరకు Next Officer కు ఇచ్చి బయటికి పరుగెత్తబోయినాను. అప్పుడు ఒక యువతి నావద్దకు ఎంతో ఆత్రముగా వచ్చి తన బంధువులు జబల్పూరు లో తానూ పంపిన 50వేల రూపాయల Draft పోగోట్టుకొన్నారని Duplicate కావలెనని, ఆ Formalities తెలుపమని అడిగింది. ఆమెలో కనిపించిన ఆదుర్దా, ఆమె చెప్పేది, చెప్పకనే నిజమని చెప్పింది. వెంటనే నేను, (ఆ రోజుల్లో Telegram ద్వారా వార్తలు తరువాత రోజు చేరే విధముగా దూర ప్రాంతాలకు పంపేవారు) ఆ Branch కి Telegram వ్రాసి ఇచ్చిరమ్మని, నేను నమ్మిన Messenger కు ఇచ్చిపంపి, ఆమెతో అప్పుడు నేను ఎందుకు తొందరలో వున్నానో తెలియజేసి ఆమె వద్ద శెలవు తీసుకొని మా అమ్మమ్మను చేర్చిన Hospital కు బయలుదేరినాను.
నా పరిస్థితి 2,3 రోజులలో కుదుటపడిన తరువాత నేను తిరిగీ Charge తీసుకొన్నాను.ఆ తరువాతి రోజు ఆ Draft పోగొట్టుకొన్న ఆవిడ వచ్చింది. ఆ సమయానికి నేనూ వున్నపని ముగించుకొని ఉండినాను. ఆమెను కూర్చొమ్మని, బాధ్యతగా కుశల ప్రశ్నలు వేసినాను. అప్పుడు తెలిసింది ఆమె MD చేసిన Doctor అని. మాటల మధ్యలో ఆమె ఒక్క విషయము చెప్పి ఎంతో నొచ్చుకొనింది. ఆ విషయము ఏమిటంటే అదే Branch లో వున్న ఒక Officer గారి వద్దకు పోయి ఆవిడ చెబితే, ఆయన 'ఇది నాకు సంబంధించినదికాదు. అదో ఆ వేల్లిపోవుటకు సిద్ధముగా వున్నాడే ఆయన పని, అయినా ఆయన వాడకు పోవుట వృధా, పనిచేసేవాడు కాదు అని చెప్పి మరీ పంపినాడు. అప్పుడు ఆ సమయములో అవేవీ చెప్పకుండా ఆమె తనకు కావలసిన పనిని గూర్చి మాత్రమే చెప్పింది. నేను కేవలము శ్రోతనై వింటూ వుండిపోయినాను. నేను బాధ్యతాయుతముగా వ్యవహరించి ఆమెకు Duplicate Draft Issue చేసి ఇచ్చినాను. ఆమె కన్నులలో కనిపించిన సంతోషము ఈనాటికీ తలచుకొంటే నాకన్నులలో మెదలుతూనే వుంటుంది.
ఆతరువాత ఆమె తనను నా కుమార్తె గా భావించుకొనమని చెప్పుటయేగాక ప్రాణాపాయ స్థితిలో వున్న నా శ్రీమతిని బ్రతికించి, నాకు ప్రాణము పోసినది. నేడు ఆమె విశాఖ లో పేరుమోసిన Neuro Physician. ఆమె పేరు Dr. లలిత.
అర్తమైనదికదా! ఆరోజు నాకు తొందర ఉన్నా, బాధ్యతను నేను నిర్వహించి నా పనికై బయలుదేరినాను, నా సహోద్యోగికి నాపై గల అభిప్రాయమునకు వ్యతిరేకముగా ! అదే అంటే నేను చేసిన ఆచిన్నపనే నాపాలితి వారమయ్యింది. ఈ విషయములో మనసారా సహాయముచేసిణ నా సహోద్యోగిని నేను మరువనగునా! కాబట్టి కర్మ ఫలమును నీవు ఊహించలేవు. అది దేవునిపై వదిలిపెట్టి నీవు చేయవలసిన పనిని నీ బాధ్యతగా స్వీకరించు.

మరి ఇక సందేహించక మన కర్మ మనము ఆచరించుదామా! ( సంభాషణలలో మనము వాడే 'ఖర్మ' మనము పుట్టించుకొన్నది. ఈ కర్మతో సంబంధము లేనిది.)
స్వస్తి