Saturday 4 December 2021

జంబుద్వీపం:

 

జంబుద్వీపం:

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post_4.html

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబువులు అంటే నేరడు పళ్ళు. బహుశా ఈ ప్రదేశమంతా నేరేడు చెట్ల మాయమై ఉండేదేమో!

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించినారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. ఇవి మొత్తము 9 ద్వీపములు.

అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కిం పురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం, ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతము అబద్ధమని అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని సృష్టించినారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరూ దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. ఇందుకు ఉదాహరణ సుగ్రీవుడు సీతమ్మను వెదకుటకు గానూ మొత్తము భూగోళమును గూర్చి రామాయణము నందు వానర మూకకు చెప్పటమే!

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టింనది కాదని అదంతా  తప్పుడు ప్రచారమని తెలియవస్తూ ఉన్నది. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

ప్రాచీన భారతదేశ చరిత్రకు ఉపయుక్తంగా ఉన్న విషయాలెన్నో పురాణ వాఙ్మయంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భౌగోళిక శాస్త్రమును గురించి ఎంతో విశధముగా కూడా వ్రాయబడి ఉన్నది. మన ప్రాచీనులు భూభాగాన్ని ఏడు ద్వీపాలు గాను, ఏడు సముద్రాలుగానూ విభజించినారు. 'సప్త ద్వీపావసుమతీ' (జంబు,ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర) అని మార్కండేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపవతీ మహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి పోతున్నది. ఈ జంబూ ద్వీపంలో మొదటి పదం నేటి జమ్ము కాశ్మీర్ అను రాష్ట్రంలోని జమ్మూగా ఉన్నది అన్నది నాలో కలుగు సందేహము.

 జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలుగా విభజింపబడింది. ఈ జంబూ ద్వీపంలో ఏడు కుల పర్వతాలు న్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషధం, మేరువు, నీలగిరి, శ్వేతాచలం, శ్రుంగవంతం అనేవి. ఈ కులపర్వతాల నంటుకొని ఏడు వర్షములున్నాయి. అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కింపురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. హిమవన్నగానికి దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా భరత వర్షమున్నదని, ఈ భరత వర్షమునకు తూర్పున కిరాతులు, పశ్చిమాన యవనులు, మధ్యన బ్రాహ్మణ, క్షత్రి య, వైశ్య, శూద్రులు ఉన్నారని వాయుపురాణంలో రాయబడినది. ఈ భరత వర్షాంతర భాగమే నేటి భరత ఖండం, హిందూ దేశమని మన రాజ్యాంగ శాసనంలో ఉన్నది.

భరతవర్షము పురాణాల ప్రకారం ఇంద్ర, కేతుమంత, తామ్ర వర్ణ, గభస్తిమంత, నాగ, సౌమ్య, గాంధర్వ, వారుణ, కుమారికా అను తొమ్మిది ద్వీపాలుగా విభజించబడింది. నాటి కుమారికా ద్వీపమే నేటి హిందూ దేశం తో సరిపోవును. ఈ కుమారీ ఖండము హిందూ దేశమును ఆఫ్రికాతో కలిపి యున్చేదిదని, కాలాంతరమున ఇది సముద్రములో కలిసిపోయినదని కూడా కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఈ కుమారికా ద్వీపము మరలా ఏడు విషయాలుగా విభజించబడింది. అవి మధ్య, ఉదీచ్య, ప్రాచ్య, దక్షిణాపథ, అపరాంత, వింధ్య, హిమాలయ ప్రదేశములు. ఇందలి దక్షిణాపాతమే నేటి దక్కన్ పీఠ భూమి. ఈ దక్షిణాపథ దేశాలలో పాండ్య, కేరళ, చోళ, కూల్య, మహారాష్ట్ర, మహిష, కళింగ, విదర్భ, కుండల, ఆంధ్ర దేశములు తెలుపబడినవి. మార్కండేయ పురాణాదులలో ఆంధ్ర దేశము దక్షిణాపథములలో చెప్పబడి నది. కానీ నాటి దేశముల యెల్లలు పురాణములలో వివరింపబడలేదు. స్థల నిర్దేశాన్ననుసరించి ఆంధ్రదేశం కళింగ దేశానికి దక్షిణం గాను, ద్రావిడ దేశానికి ఉత్తరం గాను, కర్ణాటక మహారాష్ట్ర దేశాలకు పశ్చి మాన ఉన్నట్లు మాత్రం చెప్పవచ్చును. ఈ స్థలనిర్దేశం సంస్కృత కావ్యయుగం  తర్వాతి  శిలాశాసనాలలో స్పష్టం చేయబడినది. అసలు దీనిని బట్టి ఆంధ్రదేశము వారి భాష యగు ఆంధ్రము ఎప్పటినున్దియో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదని తెలియవచ్చుచున్నది.

 

          నేటికిని మన సంకల్పంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఉత్తర, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతముల ఉనికిని చాటుటలో కృష్ణాగోదావరీ మధ్య దేశే అని కలిపి చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని ప్రాంతాలవారు శ్రీకృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని చెప్పుకొనుట కూడా కద్దు. నేటి ఆంధ్రదేశం సగం భాగం దండకారణ్యంలోనూ, సగం భాగం కిష్కింధరాజ్యం లోనూ ఇమిడి ఉన్నది అని పెద్దలు చెబుతారు. వింధ్య పర్వతానికి దక్షిణంగా, కృష్ణాస్రవంతికి ఉత్తరంగా, మలయా,మహేంద్ర పర్వ తాలకు మధ్యగా దండకారణ్య మున్నది. దానిలో తూర్పు భాగం జనస్థానం, కృష్ణకు దక్షిణంగా కిష్కింధా రాజ్యముండెను. రామాయణ కాలమున రావణుని సోదరుడగు ఖరుడు ఈ జనస్థానానికి అధిపతి. ఈ జన స్థానమందే పంచవటి కలదు. శ్రీ రామభద్రుడు సీతా సౌమిత్రి సమేతుడై ఈ పంచవటి యందే కొంతకాలం కాపు రముండెను. ఇచ్చటనే సీతాపహరణం జరిగినది. ఈ పంచవటి ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరీ మండలంలోని భద్రాచల క్షేత్రానికి ఉత్తరంగా ఇరవై రెండు మైళ్ళు దూరంలో ఉన్నది. శ్రీమద్రామాయణం, కిష్కింధాకాండలో హనుమదాదులను సీతను వెదకటానికి దక్షిణ దిక్కుకు పోయి, దండ కార ణ్యానికి వెళ్ళి అక్కడ గిరివన దుర్గముల, గోదావరీ తీరముల నండ్ర, పుండ్ర, కేరళ, కురుదేశముల పరికించి రండని ఆజ్ఞాపించినట్లు గలదు.

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

స్వస్తి.

 

Thursday 2 December 2021

పుష్పగిరి

 

పుష్పగిరి

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post.html

‘హంస వింశతి’ కావ్యములోని ఈ పద్యమును గమనించండి.

తిరుమల కంచి పుష్పగిరి తీర్థములన్ జని కొంగుముళ్ళతో

వరములు దంపతుల్  వడయ వారికి కాన్కలు వైచి యంతటన్

బరికలు దృష్టి దీపములు పన్నిన గద్దెలు బెట్టి ఏమిటన్

గరమగు పుత్ర వంఛితము గానగ లేక విచార ఖిన్నులై 

తిరుమల , కంచితో ఒకానొకనాడు  సమానమైన, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. 

పుష్పగిరి ఒక అద్వైతపీఠము, పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప కర్నూల్ రహదారిలో కడపకు 16 కిలోమీటర్ల  వద్ద ఎడమవైపు తిరిగి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దక్షిణ భారతదేశం లోని మొట్టమొదటి “ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి” పీఠం , ప్రస్తుతం వైభవం కోల్పోయింది గాని ఈ ప్రాంతానికి “ పుష్పగిరి” అన్న పేరుకి గల కొన్ని పురాణ గాథలు ఇక్కడ ప్రచారం లో ఉన్నాయి.

తల్లి దాస్య విమోచనకోసం నాగులకోరిక మేరకు స్వర్గలోకం నుండి అమృతం తెస్తున్న గరత్మంతుడిని ఇంద్రుడు ఆ ప్రాంతం లో అడ్డగించినాడని, వారిద్దరు పెనుగులాటలో అమృతభాండం తొణికి అందులోని కొన్ని బిందువులు చింది ఇచట గల కొలనులో పడినట్లు, నాటి నుండి ఈ కొలనులో స్నానం చేసిన మానవులు అమరత్వం పొందుతున్నట్లు, ముసలి వారు యవ్వనవంతులుగాను, అనారోగ్యముతో బాదపడుతున్నవారు  ఈ కొలనులొ స్నానం ఆచరించిన పిదప ఆరోగ్యవంతులుగాను అవుతుండడం తో మనుషుల భారాన్ని మోయలేక భూమాత   త్రిమూర్తులతో మొరబెట్టుకోవడం తో  ఆ త్రిమూర్తులు వాయుదేవుని ద్వార ఒక పెద్ద కొండను తెప్పించి కొలను కప్పించారని, ఆ కొలనుపై కొండ తేలియాడగా విష్ణువు ఒక పాదం తోనూ, మహేశ్వరుడు మరొక పాదం తోను తొక్కిపట్టారని, కొండ సరస్సుపై పుష్పము వలే తేలియాడినందున ఆ కొండకు పుష్పగిరి  పేరు వచ్చినదని స్థానికుల కథనం.

పుష్పగిరి సమీపం లో పెన్న, పాపాఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవ్య నదులు కలుసుకొనుట చేత ఈ ప్రాంతం పంచనది క్షేత్రమని ప్రసిద్దికెక్కింది, క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని  నిర్మించట్లు ఉన్నది,  రాష్ట్ర కూట రాజు కృష్ణ వల్లభుడు  ఇక్కడి వైద్యనాధేశ్వర స్వామికి పూజల నిమిత్తం కొంత భూమి దానమిచ్చినట్లు, పల్లవ చిద్దణ దేవరాజు, వైదంబి సోమదేవ, కేశ మహారాజు యాదవ సింగవ, కాకతీయ సామంతుడు కాయస్థ గంగయ సాహిణి, విజయనగర ప్రభువులు, వారి సామంతులు అనేకులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అనేక దానములు ఇచ్చినట్లు ఇక్కడి శాసనములు తెలుపుచున్నవి. ఇక్కడి వైద్యనాధేశ్వర అలయాన్ని కరికాచోళుడు కట్టించాడని చరిత్ర కారులు చెబుతున్నారు,  కాకతీయ ప్రభువు గణపతిదేవులు పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీశివయోగింధ్రుల శిష్యులుగా ఉన్నట్లు ఆంధ్రుల చరిత్ర చాటుతున్నది.

పెన్నా నది ( పినాకిని) పుష్పగిరి గ్రామాన్ని చుట్టి తూర్పుకు ఉత్తరముకు ప్రవహిస్తున్నది, సందర్శకులు పుష్పగిరి గ్రామం నుండి పెన్నానదిని దాటి పుష్పగిరి కొండ చేరుకోవాలి, ఇక్కడ ఒక విశిష్టత ఉన్నది, నాకు తెలిసి శివకేశువులు ఒకే ప్రాంగణము ఉన్న ఆలయం లో ఉండడం అన్నది ఈ దేశం చాలా అరదు, ఇక్కడి విశిష్టత అదే…! ఒకే ఆలయ ప్రాంగణం లో శివకేశవులున్నారు పూజలందుకున్నారు కూడ, శైవులు, వైష్ణవులు చే పూజించబడినారు, మరో విశేషము ఎక్కడ కనపడనీ బ్రహ్మదేవుని విగ్రహం కూడ ఇక్కడ చూడవచ్చు, ఇంకా సంతాన మల్లేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మీ, సుబ్రమన్యస్వామి, గదాధరుడు, యోగాంజనేయులు దర్శనమిస్తారు. మరో విశేషము ఇక్కడి ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడల మీద ఖాళీ లేకుండా  పూర్తిగా  శిల్పాకళాకారులు మొలిచిన , కుడ్య శిల్పాలచిత్రాలు ఉన్నాయి, అంత్యంత మనోహరంగా ఉన్నాయి, రామాయణ, మహాభారత , భాగవత ఇతిహాసాల లోని ముఖ్య ఘట్టాలన్ని  ఈ గర్భగుడి గోడల చుట్టు చూడచ్చును ఈ  అద్భుతం.

ఆస్తికుడివా..? లేక నాస్తికుడివా అన్న బావనతో సంబందం లేకుండ  ప్రతి ఒక్కరు ఈ కళారూపాలను చూస్తూ..ఆస్వాదించవచ్చు, శిల్పకళల పట్ల మక్కువ, ఆసక్తి ఉన్న వారికి ఇక్కడికొస్తే పండగే,  మనకున్న చారిత్రిక సంపదయగుఈ అపురూప కళారూపాలను చూస్తూ మైమరుస్తాము. ఆంధ్ర శిల్పుల నేర్పరితనం అణువణువున కనిపిస్తుంది.  శివకేశవాలయముల చుట్టూ ఉన్న కుడ్య శిల్పకళాఖండాలు,  అందులో నటరాజనృత్యము,కిరుతార్జునీయగాధ, ఏనుగుల వరుసలు, అశ్వరోహకులు, వీరుల విన్యాసాలు చూపరలను రంజింపచేస్తాయి.

ఆలయ విమానం నాగర పద్దతి శిఖరము కలిగి ఉన్నది. విమానమునకు నాలుగు దిక్కులు నంది విగ్రహములున్నవి.   గజాసుర సంహారమూర్తి, కార్తికేయ, వినాయక, భిక్షాటన మూర్తులు గోడలపై చిత్రములైఉన్నవి.  శ్రీచెన్నకేశవస్వామి ఆలయానికి నైరుతి దశలో రుద్రుని పాదము, దానికి రెండుకిలోమీటర్ల దూరములో విష్ణు పాదము కనిపిస్తాయి,  శివకేశవు లిరువురు ఇచట పాదము మోపినారనటకు అవి దృష్టాంతారములు.  పౌరాణిక సంబంధమైన సర్వదేవత ఆలయములు ఇచట కనిపిస్తాయి, మరో విశేషము.. రతీమన్మధుల రతీ భంగిమల శిల్పాలు  నిశితంగా పరశీలిస్తే ఈ గోపురం మీద  కనపడుతాయి.

ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీన మైనది, శ్రీశైలఖండమందును, స్కంధ పురాణమందును,సత్యనాధుని రసరత్నాకరమందును, పుష్పగిరి క్షేత్రమును గూర్చి విశేషములు ఎన్నో ఉన్నవి, ఇక్ష్వాకులు నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణ ద్వారముగా ఈ క్షేత్రము పేర్కనబడింది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామిశ్రీచక్రాన్ని ప్రతిష్టించినారు.వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠము. మిగతవి వారు స్థాపించినవి కావు.

కాశీ యాత్ర గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతం నందు విడిది చేసినారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాసినారు:

పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా

రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది,

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లోని బ్రహ్మాండ పురాణం, వాయు పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. శ్రీ శైల మహా సంకల్పంలో ‘...ఏలేశ్వర, స్కంద సోమేశ్వర, ప్రసూనాచల సంగమేశ్వరాద్యుపద్వార శోభితే..’  అని చెప్పడాన్ని బట్టి  పుష్పగిరి క్షేత్రమే శ్రీశైల నైరుతీ ద్వారమని తెలుస్తోంది (ప్రసూనాచలము అంటే పుష్పగిరి అనియె అర్థము). అంతేకాక ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది.

ఇన్నివిధముల ప్రశస్తికెక్కిన పుష్పగిరిని నేడు తాకి తలచేవాడు లేడు.

ఏ నాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మాపని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగం భోట్టూ!

అన్నట్లు తయారయ్యింది నేటి పుష్పగిరి పరిస్థితి.

స్వస్తి.

 

Monday 1 November 2021

తంబాకు – పొగాకు - Tobacco

 

తంబాకు పొగాకు -Tobacco

https://cherukuramamohan.blogspot.com/2021/11/blog-post.html

కాచే వారు కాపులు. అంటే కాపాడే వారు కాపులు. ఇది 'క్షత్రియ శబ్దమునకు తెనుగు 

అనుబంధ పదమని నా ఉద్దేశ్యము. ఈ 'కాపు' అన్నది ఒక విస్తారమైన వర్గము. 

ఇందులో 'రెడ్డి' 'కమ్మ' బలిజ' అన్న మూడు తేగలూ వస్తాయని నా ఉద్దేశ్యము. రాయలసీమలో రెడ్లను కాపులు అనుట కద్దు. 'కాపు'లనిఉత్తరాంధ్రలో 'బలిజ' అని రాయలసీమలో అనబడు తెగను 'కాపులు' అంటారు. ప్రకాశము లోని 'గుండ్లకమ్మ' మరియు గుంటూరు లోని 'పేరకమ్మ' ప్రాంతమును 'కమ్మనాడు' అన్నారు. ఇచ్చట ఎక్కువగా నివసించుచుండిన ఉన్న యుద్ధవీరులను కమ్మ వీరులు అన్నారు. కర్మ అనే సంస్కృత పదము యొక్క వికృతియే  పాళీలో కమ్మ. 'కర్మ' లేక 'కమ్మ' యనగా 'విధి' 'బాధ్యత' లేక 'కర్తవ్యము'. ప్రజారక్షణ వారి కర్తవ్యము. అందుకు కమ్మవారైనారు.  ‘కమ్మ’ అన్న పదమునకు చిన్నపాటి ఏరు’ అన్న అర్థము కూడా కలదు. అందువల్ల కూడా రెండు ‘కమ్మ’ల నడుమ ఉండుటచే కమ్మవారయినారు. అదేవిధముగా శ్రీకృష్ణదేవరాయల అత్యున్నత సైనికోద్యోగులు ‘నాయక రాజు’ లై పాలకులైనారు. 'నాయక రాజులు' రాను రానూ 'నాయుళ్ళు' అయినారు, రేనాటి చోళులుగా ప్రసిద్ధిగన్న యోధులు రాను రానూ 

'రట్టడులై' 'రెడ్లు' అయినారు. వీరందరి వృత్తి యుద్ధమే కాబట్టి, వీరు తమలో 

ఒకవిధమగు వేడి పుట్టుటకు ఆ గుణమును కలిగిన 'పొగాకును వాడ దొడగి 

యుంటారు.

భారత దేశము చంద్రగుప్త మౌర్యుడు (పాలనాకాలం 322BC - 298BC), ఆపైన విక్రమాదిత్యుడు (ఇంచుమించు క్రీ.పూ.5౦ 

క్రీశ 5౦) తరువాత అఖండముగా పాలింపబడలేదు. అన్నీ చిన్న చిన్న రాజ్యాలే! ఆ 

కారణముగా ఆధ్రదేశములోని ఈ వీరులకు తమ సంస్థానములలో పెద్ద పెద్ద 

సైనికోద్యోగులుగా ఉద్యోగములనిచ్చి రప్పించుకొని యుంటారు. ఈ విషయమై నేను 

వ్రాసిన ‘సరసరస’ అన్న వ్యాస సంపుటిలో వివరముగా చూడగలరు. ఈ విధముగా 

ఎందఱో వీరులు హిందూదేశ ఉత్తరార్ధమునకు వెడలుట జరిగినది. వారంతా నేటికీ 

ఆంధ్రుల పండగలను ఎంతో ఆరాధనతో జరుపుకొంటారు.

ఇక అసలు విషయమునకు వద్దాము.’ఆకు’ అన్నది అచ్చమైన తెలుగు పదము. తెనుగు 

నుండి అనేక పదములను అనేక భాషల వారు తీసుకొన్నా ఈ పదములు తెలుగునుండి 

తీసుకొనబడినవి అన్న కృతజ్ఞత వారు తెలియజేసిన దాఖలాలు నాకు కనిపించలేదు. 

అదే తెలుగు నిఘంటువులను పరికించితే మనము ప్రతి శబ్దము యొక్క మూలమును తెలుసుకొనవచ్చును. రెండు భిన్నప్రాంతముల ప్రజలు కలిసినపుడు తప్పక వారి వారి భాషలలో ఆదాన ప్రదానములు జరుగుతాయి. అది అందరూ జ్ఞాపకము ఉంచుకొనవలసిన విషయము.

నిజానికి ఆ పదము ‘ఆకు’ కాదు, ‘ఆఁకు’ అని వ్రాయవలెను. నేడు, తెలుగువాడయిన 

ప్రతియొకడూ ఒక భాషా నియంతయే! అందుకే మనము ఋ, , , , , , , 

అను 7 అక్షరములను శిగ్మాగుచేటనుకోకుండా, మాయము చేసినాము. ఇక్కడ ఒక్క విషయము తెలియజేస్తాను. నేటి బ్రిటిష్ ప్రధాని భారతీయ మూలములు కలిగినవాడు. ఆయన పేరును ఆంగ్లములో 'Rishi Sunak' గా వ్రాస్తారు. 'Rushi' అని వ్రాయరు. కారణం ఆ శబ్దము పలుకుటకు వ్రాయవలసిన'ఋ' అన్న అక్షరము వారికి లేదు. వారి పేరులో 'ఈ 'ఋ' నే  వాడవలెను. దీనిని పలుకునపుడు మన 'చెంపలు' లేక దవడలు' లేక గవదలు' కదిలించకుండా 'ఋ' నును పలికితే వచ్చే ధ్వనిని 'ఋ' కలిగియుంటుంది. మన కర్మ ఏమిటంటే 'RISHI  అని Type చేస్తే 'రిషి' ని వస్తుంది, నిజానికది 'ఋషి' అని రాయాలి. కన్నడములో 'ಋಷಿ(R̥ṣi)', మళయాలములో  ഋഷി( r̥ṣi) హిందీ సంస్కృతములలో ऋषि '(rishi) అని  అని సాంప్రదాయబద్ధముగా వ్రాస్తారు. ఒక 'telugu'లో మాత్రమీ ఈ 'తెగులు' కనిపించుతుంది. ఈ విధముగా telugu అపశబ్ద భూయిష్టమపోతే మనకు 'గొరగంగా మిగిలిన జుట్టే!'  దయతో నా ఆవేదన అర్థము చేసుకొండి. 

ఇక శ,ష,స ల విషయమునకు వస్తే ఆ అక్షరములన్నింటికి లుగా మనకు 

సులభముగా నోరుతిరిగే ఒక అక్షరమును పలుకుతాము, అది ఆ నాలుగింటిలో ఏదయినా కావచ్చు.

 సరే, తిరిగీ ఆఁకు వద్దకు వస్తే, ఈపదము’ఆనుకు’  నుండి పుట్టినది. ‘ఆనుకు’ ‘అంకు’ అయి ఆపై ‘ఆఁకు’ అయి అటుపిమ్మట ‘ఆకు అన్న రూపమును ధరించినది.

‘ఆనుకు’ లేక ‘ఆను’ అన్న మాటకు అర్థము, తినుట లేక త్రావుట అని. మోదుగ ఆకులు, మర్రియాకులు, బాదాము ఆకులు, తడాకులు మొదలగునవి కుట్టి, మరియు అరటి ఆకులు నేరుగానూ భుజించుటకు వాడుతాము. దాహము ఎక్కువై అందుబాటులో లోటాలు చెంబులు లేనపుడు, ఒక సెలయేటిలో నీరు ట్రావ వలసి వస్తే దగ్గరలో ఉన్న పెద్ద ఆకులు గల ఒక చెట్టుయొక్క ఆకును త్రుంచి  దానిని శంఖాకారములో మడచి దాహము తీర్చుకొంటాము. ఈవిధముగా అనుకు-ఆఁకు-ఆకు ఉత్పత్తి జరిగినది.

మరి ఇది తెలుగుపదమా కాదా అంటే ఈ పదముతో ఒక పద కుటుంబము ఏదయినా 

కలదా అన్నది చూడ వలసియుంటుంది. మొదట పరభాషలలో చూసి ఈ పద 

కుటుంబము లేదని నిర్ధారించుకొన్న పిదప తెలుగులో చూస్తె, సుమారుగానే ఉన్నాయి. 

అవి, ఆఁకు కూర, ఆఁకుటిల్లు, ఆఁకుఱాయి, ఆఁకుపచ్చ, మారాఁకు, పారుటాకు, ఉల్లాఁకు

కిల్లాఁకు, ఓలాఁకు, పరాఁకు, చిరాఁకు మొదలయినవి. అసలు అన్నీ ఉన్న ‘ఆకు’ అణిగి 

ఉంటుందన్న సామెత కూడా ఒకటి ఉన్నది. బతికి ఉంటె బలుసాకు తినవచ్చునన్న 

సామెత కూడా కద్దు. కావున వీటిని బట్టి ‘ఆకు’ అప్పటమైన ఆంధ్ర పదమని మనము 

నిర్ధారణ చేసుకొనవచ్చును.

ఇక పొగాకును గూర్చి తంబాకు ను గూర్చి ఆలోచిద్దాము. పోఆకు అనగా కాల్చితే 

పొగవచ్చు ఆకు కావున అది పొగాకు అయి ఉంటుంది. మరి అంతకు ముందు ఒక 

పేరు ఉండవలెను కదా! అది ఏమిటో చూద్దాము. పూర్వము ‘తమ్మ’ అను శబ్దమును తెలుగులో ‘ఉమ్మి’కి వాడేవారు. ఉమియుటకు వాడేవారు. ‘తమ్మలపు+ఆకు’ తమలపాకు అయినదేమో! ఇందులో పొగాకు కూడా వాడుట కద్దు. ఇదికాక తమలపాకు లేకుండానే ‘పొగాకు’ వాడుట కద్దు. అప్పుడిది ‘తమ్మ+ఆకు’=‘తమ్మాకు’ ఔతుంది. అదే కాలాంతరములో తంబాకు గా మారినది. మన వీర వర్గము ఉత్తర దేశములలో విస్తరించుట వల్ల వారి ద్వారా ఈ ‘తమ్మాకు’ తంబాకు’ యై వారి నోట నానుచున్నది. బాగా నమిలి నమిలి రసమంతా పీల్చి ఉమిసేదే కదా! ఇంతటి తో ఆగక ఇది ఐరోపాదేశములు చేరుసరికి ‘Tobaco’ అయి కూర్చున్నది. కావున ఆ పంట, ఆ పేరు తెలుగు వారిదే కానీ అన్యథా కాదు.

(ఈ వ్యాసములో భాషను గూర్చి తెలిపినాను తప్పించి పొగాకు గొప్పదనమును గూర్చి కాదు.)

స్వస్తి.

 

Monday 18 October 2021

సమస్య మనది-సలహా గీతది-43

సమస్య మనది సలహా గీతది 43

https://cherukuramamohan.blogspot.com/2021/10/37.html


త్రికరణ శుద్ధిగా నేను ఒక్క పని కూడా చేయలేదు. స్వార్థము నా కనులుగప్పి యున్నది. 'చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష' అన్నదే నా మనస్తత్వము. చేయుచున్నది పాపమని తెలుసు, మరి నిష్కృతి లేదా!

 

సలహా: త్రికరణముల గూర్చి నీకు తెలుసునో లేదో నాకు తెలియదు. ఈ ‘త్రికరణము’ అన్న  పదమును యాదృచ్ఛికముగా వాడినావని భావించి  దానిని గూర్చి ముందు నాలుగు మాటలు చెబుతాను.

త్రికరణములు అనగా మనసు వాక్కు మరియు చేయు కార్యము. ఈ మూడు ఒకటిగా కలిపి చేసేపనిని త్రికరణశుద్ధిగా చేసిన పని అంటారు.

ఈ మాట ఎందుకు చెబుతున్నాడు అని అనుకోకుండా కాస్త ఓర్పుతో గమనించు. శ్రీమద్ వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ 34వ సర్గ లో 12 వ శ్లోకము  కృతఘ్నతా లక్షణమును గురించి ఈ విధముగా చెబుతుంది.

బ్రహ్మఘ్నేచ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా!

నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతిః!!

బ్రహ్మ హత్య చేసిన వానికి, సురాపానము చేసిన వానికి, దొంగతనము చేసిన వానికి, ఒక వ్రతము చేయబూని మధ్యలో ఆపిన వానికి ప్రాయశ్చిత్తము ఉన్నది కానీ, కృతఘ్నునకు  ప్రాయశ్చిత్తము లేదు.

అనగా నీవు చేసిన పాపములలో కృతఘ్నత లేనంతవరకూ నీవు ప్రాయశ్చిత్తమునకై ప్రయత్నించివచ్చును కానీ, నీకు మేలుచేసిన వానికి కీడు తలపెట్టనంతవరకు, నీకు స్వార్థము ఎంతవున్నా,  చిత్త శుద్ధితో దానినుండి విముక్తి పొందవచ్చును. దీనికి నీ నియము నిష్ఠ మిక్కిలి అవసరము. నియమము నిష్ఠ అన్నవి భగవదారాధనతో సమానము. భగవంతుని పూజలో త్రికరణములు ఏకీకృతం అయితేనే ఆ ఉపచారం అయినట్లు. నోటితో చెప్పిన మంత్రం, చేతితో చేసిన ఉపచారం, ఈ రెండింటినీ దర్శనం చేసిన మనస్సు  ఈ మూడూ ఏకీకృతం కావాలి. లేకుంటే పూజాపత్రి దండుగే! కావున నేను చెప్పవచ్చేదేమిటంటే నీ స్వార్థ ప్రయోజనముల కొరకు చేసిన నీ పాప కార్య ఫలమునుండి విడుదల పొందవలెనంటే  ముందు ఆత్మ విమర్శ ఆపై అన్యుల యందు ఆరాధనా భావము అత్యవసరము. నీ మేలు కొరకు ఎదుటి వానికి కీడు తలపెట్టకు.

 

వేలాది విధముల జన్మల సత్కర్మల ఫలితంగా లభించిన ఉత్కృష్ట జన్మ మానవ జన్మ. కానీ ఆ జన్మ తన కర్మ ఫలితము అనుభవించక తప్పదు. నీవు చేసిన పుణ్యకర్మ ఫలము ఎక్కువ మరియు పాప కర్మ ఫలము అంతకన్నా తక్కువ ఉండుటచే నీవు మానవునిగా నైతే పుట్టినావు. కానీ ఈ జన్మలో ఆ పాప ఫలితమును తగ్గించుకోవలసిన బాధ్యత నీదే! అందుకే మంచి వైపు మరలు. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయి. జన్మ పావనం కావాలంటే ఆత్మసాధన అవసరం. ఆ సాధన సదాచరణతో సిద్ధిస్తుంది. సత్సాంగత్యముతో వృద్ధిపొందుతుంది. దానినే ధర్మమార్గంలో సత్యాచరణ, సత్కార్య, ఆధ్యాత్మిక, అహింసాచరణగా అనేక విధాలుగా ఆచరించి విమలంగా వెలయించి మహాత్ములైనారు ఎందఱో నాటి మానవులు. మానవుడి జీవన సంపూర్ణ వికాస సద్గతికి, పునీత బుద్ధికి ప్రమాణమైన భగవద్గీతను లోకానికి అందించి మానవులను తరింపచేసినారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడే సర్వాన్నిభరిస్తు సంసారమనే సమద్రాన్ని దాటించే ముక్తి దాత. పరమాత్మ ఈ సందర్భములో 3వ అధ్యాయమయిన కర్మయోగాములో ఒక మాట అంటాడు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |

కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||               7-3

జ్ఞాపకముంచుము జ్ఞానేంద్రియముల

తోడుగమనసును దొరకబుచ్చుకొని

నిష్కామునివై నిలచితివంటే

నీదేజయమగు నిక్కము అర్జున

అర్జునా ! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. ఎంత గొప్ప మాటో గమనించు.

నీవుచేసే పనిలో, నీ పనికి సంబంధించిన సిబ్బందిని, చిన్న పెద్ద తారతమ్యములేక, బాధ్యతలప్పగించు. వారిలో నన్ను ఈపనికి తీసుకోనలేదే అన్న బాధ కలగకుండా చూచుకోవలసిన బాధ్యత నీదే!

ఇటుక ఇటుక కలిస్తే ఇల్లు తయారౌతుంది

నీటిచుక్కలొకటైతే నిండు సంద్రమౌతుంది

చేయి చేయి ఒకటైతే చేయలేనిదేముంది

అందరు ఒకటైనచో ఆనందం పండుతుంది

ఇది మనసులో ఉంచు. నీవు బాగు పడు, నిను నమ్మినవారి బాగుకు పాటుపడు. నీ మనసుకు వద్దన్నా ప్రశాంతత చేకూరుతుంది. నీవు జ్ఞానార్జనకు అడుగు ముందుకు వేసినట్లే! ఈ విషయములో భగవంతుదేమంతున్నాడో గమనించు:

అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః l

సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి l l  36-4 

Even if you are the most sinful of all the sinners you shall verily cross over all sin by the raft of knowledge.

 

పాపపు పనులకె పరిమితమైనా

పరిమితి గానక పాపము చేసిన

పశ్చాత్తాపమె ప్రాయశ్చిత్తము

బ్రహ్మ జ్ఞానమె పరమౌషధము   36-4 

తెలిసినది కదా! ఇటువంటి పనులలో ఆలస్యము కూడదు. ఈ వేదవాక్కు నీ మేజా పై ఉన్న గాజు ఫలకము క్రింద వుంచుకో!

సర్వేపి సుఖినస్సంతు

సర్వేసంతు నిరామయా

సర్వే భద్రాణి పశ్యంతు

మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్

 అంతా సుఖించాలి, అంతా వ్యాధిరహితులు కావాలి, అందరూ శుభాలను చూడాలి,  ఏ ఒక్కడూ దుఃఖముచే బాధించబడరాదు. ఇంతకన్నా మంచిమాట వేరొకటి ఉండదు ఇది పాటించు. అంటా నీకు జయమే!

స్వస్తి.

Sunday 17 October 2021

భారతీయ శాస్త్ర విజ్ఞానము

భారతీయ శాస్త్ర విజ్ఞానము

https://cherukuramamohan.blogspot.com/2021/10/blog-post.html

Comments (July 2015) comments for the first episode.

Jyothiprakasan Sambasivapillai: Callahan visadheekkarinchi selavichinadhulKu dhanyavadhamulu

హంస గీతి: nice post sir

S Ramu Srinivasulu: Chaala. Bagundi

Subrahmanyam Karoor : Dhanyosmi. For the last 15 to 20 days, I was not active on FB. What a tremendous ocean of information is give by you Sir. Many many thanks. We are enlightened by such information. Thanks once again. I will be reading the other parts also now. Very interesting.

Reply7y

ఉపోద్ఘాతము

‘భారతీయ శాస్త్ర విజ్ఞానము’ అన్న పేర నేను ఒక 8 సంవత్సరముల క్రితము నాకు తెలిసిన మేరకు వివరముగా ఋషులు మనకు అందించిన శాస్త్ర విజ్ఞాన సంపదను ‘ఆస్యగ్రంధి’ లో ఉంచియుంటిని. అప్పుడు చదివినవారెందరో చదువని౯ వారెందరో నాకు తెలియదు. దానిని అవసరమైన చోట్ల విస్తృత పరచుచూ తిరిగీ మీముందు ఉంచుచున్నాను. ఉత్సాహముతో చదివెదరన్నది నా ఆశ. శృంఖల రేపటినుండి ప్రారంభించుతాను.

తల్లిని భారతిన్ మదిన తత్పరత న్నుపవిష్ఠ జేయుచున్

వల్లెయనంగ ప్రేమమున వారువ కంఠుడు నోట నిల్వగన్

ఎల్లలు లేనిరీతి నను ఎల్ల విధమ్ముల సవ్య మూర్తి నా

ఉల్లము నిల్వ, తెల్పెదను ఓర్మి తపోభృత జ్ఞాన సంపదల్ 

చదువుల తల్లియగు సరస్వతీ దేవిని మదిలో స్థిరాసనముపై కూర్చుండజేసి, ఎంతో ఆదరముతో కూడిన హయగ్రీవుని ఆశీస్సులను పొంది, ఎల్లలు లేని రీతిగా ఆ దక్షిణామూర్తి దయను చూపించగా, మనసును కుదుటపరచుకొని, నేను విన్న, చదివిన,  తెలుసుకొన్న మేరకు తెలుప ప్రయత్నించెదను. చదువుటచే ఇటు మీకు అటు  దేశానికి కూడా లాభము.

'జ్ఞ' అంటే ఎరుక అని అర్థము,నాకు తెలిసినంత వరకు. జ్ఞానము ఇందు నుండి పుట్టినదే. 'విజ్ఞానము అన్న మాటకు ఒకవిధంగా సంపూర్ణ అవగాహన అని చెప్పుకోవచ్చు. 'Science' అన్నది విజ్ఞానమునకు సమానార్థకము కాదు అన్నది నా ఉద్దేశ్యము. విజ్ఞానము అంటే ఆంగ్లములో Worldly or profane knowledge, knowledge derived from worldly experience. Monier Williams (1899; rev. 2008) provides the following definition:

To distinguish, discern, observe, investigate, recognize ascertain, know, understand - Rig Veda (RV.), etc., etc. (with na and inf.: 'to know not how to');

To have right knowledge - Katha Upanishad (KahUp.)

To become wise or learned - Mn. IV, 20;

To hear or learn from (gen.) - Chandogya Upanishad (ChUp.); Mahabharata (MBh.);

To recognize in (loc.) - Panchatantra (Pañcat.);

To look upon or regard or consider as (two acc.), Mn; MBh, etc.; Kāv, etc.

To explain, declare - BhP.

ఇక్కడ ఎక్కడా విజ్ఞానము అంటే science అని చెప్పలేదు. విజ్ఞత అన్నది తనకు వస్తువునకు కల అనుభవాన్ని అనుబంధాన్ని తెస్తుంది. ఇది తనకు తాను సహజీవనము చేసే సకల చరాచర వస్తు ప్రపంచానికి పరస్పర హితకరమైన మైత్రిని కలుగజేస్తుంది. ఇక ‘science’ అన్నది ఆధునిక విజ్ఞానమన్న పేరుతో ప్రపంచమున ప్రబలమై యున్నది. దీనికి, కొన్ని ఆధునిక ఆవిష్కరణలను తప్పించి, ప్రకృతిని తన బానిసగా చేసుకొని ప్రకృతికి ముప్పు తెప్పించడం తప్పించి లోక కళ్యాణము లోక హితమును గూర్చి తలచినదే లేదు.  

ఐన్ స్టీన్ గారి ఈ సంభాషణ గమనించండి:

“Student: Dr. Einstein, Aren’t these the same questions as last year’s [physics] final exam?

Dr. Einstein: Yes; But this year the answers are different.”  

Albert Einstein

ఈ మాట చాలదా నేటి విజ్ఞాన శాస్త్రము ఎంత శీఘ్రముగా మార్పులకు గురియౌతూ వుంటుందో తెలుసుకొనుటకు  ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. బట్టలు ఉతుకుటకు గానీ పాత్రలు తోముటకుగానీ వివిధ  నామావళితో ‘detergents’ వస్తున్నాయి . ‘Plastic scrubbers’ వస్తున్నాయి. వీటివల్ల చర్మ సంబంధమైన వ్యాధులు రావని ఏ శాస్త్రజ్ఞుడు అయినా చెప్పగలడా! మనము గతములో వాడుచుండిన మెత్తటి మన్ను బొగ్గుల బూడిద,  చింతపండు పిప్పి, ఉప్పు , శ్రేయస్కరములుకావని చెప్పగలరా! ఇప్పుడు ప్రాచుర్యములో వుండే పిజ్జాలు బర్గర్ల వంటి తిను బండారములు, కోకాకోల పెప్సీ వంటి పానీయములు మంచి చేస్తాయని గానీ చెడుపు చేయవనిగానీ వారు చెప్ప గలరా! Trade secret పేరు తో వానిలో ఉపయోగించే మూలకములను మూసిపెట్టుటేగానీ ధైర్యముగా లోకమునకు చాటగలరా! లొగుట్టు ఇద్దరికే ఎరుక. 1.చేసేవానికి 2. వానిని చేసేవానికి అంటే ఆ భగవంతునికి.

మనిషిలో సంతృప్తి సమసిపోయింది. సంపాదనే సర్వస్వమైపోయింది. ఇటువంటి స్థితిలో తీరుబడి ఎక్కడిది. దేవుణ్ణి తలచుకొనుటకు కూడా సమయము లేదు. తిరుమల కొండకు flight లోపోయి దేవుని దర్శనానికి special ticket' తీసుకొని దానికి recommendation జోడించి 15 నిముషాలు దైవ సన్నిధిలో యుండి తిరిగి flight లో వూరు చేరి భగవంతుడే నేరుగా వచ్చి దర్శనమిచ్చినాడని గొప్పలు చెప్పుకొనే ఈ భాగవతోత్తముల భక్తిని ఏమని పొగడవలె. ఆడంబరాలే భక్తి అనుకునేటంత అమాయకుడా భగవంతుడు. మన ఆత్మను తనకు ఎంతవరకు అనుసంధానము చేసినాము అన్న విషయము తెలుసుకోలేడా ఆ పరమాత్ముడు. లేక ఈ భక్తాగ్రేసరులు భగవంతుని కూడా నమ్మించినామనే భ్రమలో ఉన్నారా! ఇదీ మన ప్రగతి. ఇది నమ్మితే కలిగేది అధోగతి. వదిలేదెప్పుడు మనలనీ దుర్గతి. దీనికి పరిష్కారము నివ్వగలిగినది యువత ధర్మ నిరతి.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాl

సర్వే బద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ll

కాసింత కూడా దుఃఖము లేని సౌఖ్యమును సకల జీవరాశికీ కోరిన వేదభూమి మనది.

వేద చోదితమైన మన యంత్ర, తంత్ర, మంత్ర నిర్మాణమంతా విశ్వ శ్రేయస్సుకే మన పూర్వీకులు వినియోగించినారు గానీ విశ్వ వినాశనమునకు గాదు. 5,౦౦౦ సంవత్సరముల క్రితము జరిగినదని నిర్ధారింపబడిన భారత యుద్ధము ముగిసిన వెంటనే వివిధ విధములుగా సంపాదించిన తమ అస్త్రములను అనగా మారణాయుధములనెల్లా పాండవులు సముద్రములో పడవేయుటే ఇందుకు తార్కాణము. పెద్ద దేశములకే పెద్దదయిన అమెరికా తన మారణాయుధాలను పారవేయ గలుగుతుందా! చేయలేదు. ఎందుకంటే దేశాలమీద యుద్ధాలు రుద్ది ఆయుధాలు అమ్ముకొనుటే వారి గుణము. ఆ దేశములో, వేరు పరిశ్రమలు ఏవైనా వున్నా దీని తరువాతనే.

ఏతావాతా నేను చెప్పదలచుకోన్నదేమిటంటే మన విజ్ఞానము కోరేది 'లోక హిత'మైతే వారి science కోరేది 'లోక హతము’. ఈ దృక్పథముతో భారత శాస్త్రీయ వినీలా కాశములో కనిపించే కొన్ని తారకలను చూస్తాము.

        ప్రాచీన భారతము అంటేనే, ఇప్పుడు కుంచించుకు పోయిన మన ఎల్లలను, సుదూర తీరాలకు విస్తరించవలె. పాకిస్తాన్ ,ఆఫ్ఘనిస్తాన్,ఉజ్బెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ మరియు రష్యాలోని కొన్ని భాగాలు ఇరాన్, సౌదిఅరేబియా, టర్కీదేశాలు,సింగపూర్ ,మలేసియా, థాయిలాండ్,మయాన్మార్ మొదలగు దేశాలు ఈ భారత ఖండములోని భాగములుగా ఉండేవి.(Indian Kshatriyas Once Ruled from Bali to Baltic & Korea to Kaba (1966)-By P.N.Oak) నేటికీ మన సంస్కృతికి ప్రతీకలైన గుళ్ళు, గోపురాలు,విగ్రహాలు, శిలలు,శిల్పాలు ఈ దేశాలలోనే కాక జపాన్,చైనా లాంటి దేశాలలో కూడా చూడవచ్చు. మక్కా ఒకప్పుడు మఖేశ్వరాలయము. మఖము అంటే యజ్ఞము. అంటే ఇక్కడ విరివిగా యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉండుటవల్ల ఆపేరు వచ్చియుండవచ్చు. అరబ్బీ భాషలో ఈ పేరునకు మూలము దొరకదు. పైగా ఈ ఆలయమును మహమ్మదు ప్రవక్త మరియు వారి అనుచరులు విద్వంసము చేయక మునుపు 'సాయిర్-ఉల్-ఓకుల్' అన్న పద్య సముదాయము అరబ్బీ భాషలో బంగారు ఫలకముపై వ్రాసి ఆ ఆలయము లోపల కుడ్యమునకు వ్రేలాడదీయబడి యుండెడిదట. దానిని నేటికినీ 'మాక్క్తాబ్-ఎ-సుల్తానియా' అన్న, టర్కీ కి రాజధానియైన 'ఇస్తాంబుల్' నగరములోని ప్రభుత్వ గ్రంథాలయములో చూడవచ్చునని చదివినట్లు గుర్తు. ఇది 'అల్లాహ్ యొక్క దూత   (ప్రవక్త అని ఖురాన్ లో ఎక్కడా చెప్పలేదని ఒక గొప్ప అరబ్బీ పండితుడు చెప్పగా విన్నాను.) గారి uncle అయినటువంటి 'ఉమర్-బిన్-అస్నాం' ఉర్ఫ్'అబల్-హికం' అనునతడు, మన 'భేతాళ కథలకు' పరిమితమైన, నిజముగానే మనదేశమునేలి తదనంతర హిందూదేశ పాలకులకు 'విక్రమార్క' విక్రమాదిత్య' అన్న తన స్వకీయ నామమును 'బిరుదుగా' ఏర్పరచిన ప్రభావశాలి, ప్రగతి శీలి, అత్యంత పరాక్రమవంతుడు. ఎవేయన పాలించిన కాలము ఇంచుమించు క్రీస్తుకు 50 సంవత్సరములు ముందు నుండి క్రీ.శ. 50 సంవత్సరములవరకు. ఈయన కాలములోని ఆయన సభలోనే ' నవరత్నములు' వెలసినది. అనేక కావ్య నాటకములు వ్రాసిన కాళీదాసు - 1, మరియు అత్యంత ప్రతిభాశాలియగు జ్యోతిష మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు. 

ఈ 'అబల్-హికం'విక్రమార్కుని'గురించిఆయన దక్షతను గురించి అత్యున్నతముగా వ్రాసినాడు. ఆ కవి, ప్రవక్త గారి మతములో చేరలేదన్నకారణానికి ప్రవక్త గారి మతావలంబకులచే హతమార్చ బడినాడట. బ్రిటీషు చారిత్రికులు వారి హిందూదేశ అనుయాయులు వ్రాసిన చరిత్రలో మహాపురుషుడైన ఈ 'విక్రమార్కునికి' చరిత్రలో స్థానమే లేకుండాపోయింది. అసలు 'అర్వము' అంటే గుఱ్ఱము. 'వ బ యోరభేదః' అన్న సూత్రము ప్రకారము ఆ దేశము కాలానుక్రమణములో 'అరేబియా' అయినదని 'P.N.Oak' గారు నిర్ధారించినారు. అరేబియా గుఱ్ఱములకు ప్రసిద్ది యన్న విషయము మనకు తెలిసినదే కదా !

అసలు విషయానికొస్తే ప్రాచీన భారత దేశములో, భౌతిక ఉపయోగములకై, అనేక యంత్రాలను వాడినట్లు సప్రమాణముగా మన వాఙ్మయము ద్వారా తెలియ వచ్చు చున్నది. భోజరాజు చె వ్రాయబడిన 'యంత్రార్ణవము' 'సమరాంగణ సూత్రధార' ఇత్యాది గ్రంథ పరిశీలనము చేసిన మనకు వాస్తవాలు గోచరిస్తాయి. వీని మూలములను మనము అధర్వణ వేదములోనే చూడ వచ్చు. ఈ గ్రంథాలు గృహోపయోగములకు, వ్యవసాయానికి, యుద్ధ ఆయుధములకు,రోబో లకు సంబంధించిన ఎన్నో విషయములను గూర్చిన వివరాలనందిస్తాయని విజ్ఞులు చెప్పగా విన్నాను. కానీ ఈ ఆవిష్కరణలేవీ అటు ధ్యేయాన్ని ఇటు ప్రకృతి పై ధ్యాసను ఏమరలేదు. ఇవి నేటి కొన్ని యంత్రములవలె దారుణ మారణ హోమములను సృష్టించవు. 'jaguar naught' అన్న పేరుతో పిలువబడుతూ మారణ హోమమును సృష్టించే అతి పెద్ద 'tanker' కు ఆ పేరును 'జగనాథ' రథము నుండి తీసుకోన్నారంటే ఆ జగన్నాథుని పాదాశ్రితులమైన మన మనసెంత నొచ్చుకొంటుందో గమనించండి. ఆపేరు, చాలా పెద్దదైన ఆ రథము లాగుటలో చక్రముల కింద పడి మరణించు వారిని జూచి, ఆ రథము పేరు పెట్టినారు. మనమో, అలా జరిగితే ఆ భక్తుడు వైకుంఠ గతుడౌతాడని నమ్ముతాము.

8 వ శతాబ్దమునకు చెందిన ఒక వాస్తవమును మీకు తెలుప ప్రయత్నించుతాను. 8వ శతాబ్దమునకు చెందిన హరిభద్ర అను  జైన మతావలంబి రచయిత మరియు అతని మేనల్లుళ్ళు హంస పరమ హంస అను వారలు తమ ‘ప్రభావక చరిత్ర’ అన్న గ్రంథములో తాము బౌద్ధ మత సార సంగ్రహమును గ్రహింప ఒక బౌద్ధ విద్యాలయమున ప్రచ్చన్న బౌద్ధ విద్యార్థులై ఉండగా దానిని గ్రహించి వారి బౌద్ధాచార్యుడు తక్కిన బౌద్ధుల సహాయముతో భవనము యొక్క ఎత్తయిన రెండవ అంతస్తులో బంధించగా వారు గొడుగులవంటి రెండు సాధనాలతో క్రిందికి దిగినారట. మరి ఈ గొడుగులు గాలిగుమ్మటములను (parachutes) గుర్తు చేయుట లేదా! (Ibid Chapter IX, Verse 87-89). ఇటువంటి విషయములనెన్నింటినో మనము Indian Historical Quarterly, “Astronomical Instruments of the Hindus “Volume IV pp 256-269”  లో చూడవచ్చు.

మిగిలినది మరొకమారు...........

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 2

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 2

దయతో మొదట ఈ నాలుగు మాటలు మనసుపెట్టి చదవండి. నిన్న ఒక ప్రచురణపై వచ్చిన సామూహిక స్పందనకు ఆనందించి నాకు Typing కష్టమైనా నా తెలివికి తెలిసిన నాలుగు మాటలు మన పూర్వుల విజ్ఞనాన్ని గూర్చి వ్రాయట నిన్నటితోనే మొదలుపెట్టినాను. మనసు పెట్టి చదివి మన పూర్వుల గొప్పదనమును గుర్తించండి. పేరుకు ప్రాకులాడకుండా ప్రజా ప్రయోజనమే ప్రాతిపాదికగా ప్రపంచానికి విజ్ఞానమును చాటిన ఆ మహనీయులను గుర్తించండి. భారతదేశ ప్రతిష్ఠను లోకానికి చాటండి. మీకున్న బాధ్యతలలో ఇది ప్రధానమైనదిగా స్వీకరించండి. లేకుంటే దేశాన్ని వాటికన్ కు అప్పగించినట్లే. మన ఆడపిల్లలను, సోదరీమణులను. మన సంస్క్కృతి, పూర్వుల ప్రాభావమును గూర్చి చెప్పక పోతే Love Jihad కు సమిధెలను సమకూర్చిన వారమౌతామేమో ఆలోచించండి. ఈ వ్యాసమునకు అనుబంధములగు చిత్రములు (image) మిమ్ము ఆకర్షంచుటకే! అవి బాగున్నాయని likes కొట్టవద్దు.

 

క్రీస్తుకు 2000 సంవత్సరములకు పూర్వము బొత్తములను అలంకారముకొరకు వాడిన సాక్ష్యాలు మొహెంజోదారో-హరప్పా నాగరికతలలో లభించినవి. చదరంగము (chess) అన్న క్రీడ ఈ దేశములో కనుగొనబడినదే. గుప్తులకాలమని అంటారుకానీ పాశ్చాత్యులు అసలు గుప్తుల కాలమునే తప్పుగా నిర్ణయించినారన్న విషయము మహనీయులైన కోట వెంకటాచలము గారి "భారతీయ రాజవంశముల చరిత్రలు" చదివితే వాస్తవాలు తెలియ వస్తాయి. వారు చరిత్రను ఎంత సాధికారంగా నిరూపించినారో మరియు పాశ్చాత్యులు వారి పాద దాసులు చరిత్రను ఎంత చిత్రహింస జేసినారో తేటతెల్లమౌతుంది.

ఈ చతురంగ  క్రీడ ఎప్పటిది, ఎంత పురాతనమైనది అన్న మాటకు ఆధారము లేకపోవచ్చు. కానీ ఇది ఎప్పటి నుండియో వుండివుంటుంది. చతురంగ మనగా రథ గజ తురగ అంటే గుర్రములు, పదాతి అంటే కాల్బల దళములు అని వివరణ. రానురానూ ఇదే చదరంగమైనది. ప్రపంచములోనే అతిపురాతనమైన సింధునాగరీకత, పాశ్చాత్య  నాగరికత కళ్ళు తెరువక పూర్వమే ఆ నాగరికత లో దశాంశస్థానములతో కూడిన కొలమాని (Scale) ని ఉపయోగించినట్లు త్రవ్వకాలలో బయలు పడింది. అంటే ఇది కూడా వారి క్రీస్తు జననమునకు ముందే! కలకత్తా నవాబుల దొరతనములో తలంటుకు వాడు చుండిన ‘చంపా తైల’ మే 'షాంపూ' అన్న నామ పరివర్తన చెందినది. క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దమునుండి వాడబడుతున్నట్లు ఆనవాళ్ళు కనిపించే 'పరమపద సోపాన పటము (snakes and ladders)  మనదేశమునుండి ఇంగ్లండుకు అక్కడినుండి అమెరికాకు చెరినవి. నవ్య క్రీడా నిర్మాతగా పేరు గాంచిన 'Milton Bradley’ దీనిని

విశ్వవ్యాప్తముగా పరిచయము చేసి మిలియన్ల డాలర్లను సంపాదించినాడు.అసలు ‘పులి జూద’మని, ‘బేరి ఆట’ అని, ‘బారాకట్ట’ యని ‘శోబిళీకట్ట’ యని, చైనీయులు కనిపెట్టినారను అపోహను కల్పించిన ‘చీట్ల పేక’ మున్నగునవి ఇంటిపట్టున వుండి ఆడుకోగలిగిన ఆటలు. ‘అచ్చనగాయలు’ లేక అచ్చందరాళ్ళు’ అన్న ఆట స్త్రీలకూ అత్యంత ప్రీతిపాత్రమైనది.

పురాతన నాగరికత కలిగినవారని చెప్పబడే గ్రీకులు చర్మములను మాత్రమే వస్త్రములుగా ధరించే కాలములో అలెక్జాండరు దండయాత్రల పుణ్యమా యని నూలు వస్త్రముల వాడకము నేర్చుకొన్నారు. ఇవి చలికాలము వెచ్చగానూ విసవిలో చల్లగానూ వుంటాయని మనకు తెలిసినదే. ఈ వివరము India in Greece అన్న తన పుస్తకములో ప్రసిద్ధ చారిత్రికుడైన Edward Pococke తన పరిశొధనా ఫలాన్ని గ్రంధస్థము చేసినారు. 

ఈ నూలు వస్త్రముల వాడుక మన దేశములో క్రీస్తుకు పూర్వము 4,5 శతాబ్దములనుండియే వాడకములో వున్నట్లు శాస్త్రాధారములున్నవన్నది నేటి చరిత్రకారుల మాట. ఒకవేళ అదే నిజమనుకొంటే స సీతాలక్ష్మణ శ్రీరామచంద్రులు, అడవుల బోవుటకు, తమ పట్టు పీతాంబరములను వదిలి నార చీరలు ధరించినారని వ్రాయుటకు, వాల్మీకి మహర్షికి, అగత్యమేమున్నది.

 గణితమునందు Fibonacci numbers అన్న పేరుతో ఆ పాశ్చాత్యుని ఆవిష్కరణగా పేర్కొనబడుతున్న ఈ విషయమును విరహంక, గొపాల హేమచంద్రులు పింగళుని ‘చేడా పత్రములన్న’ పేరుతో Playing Cards మన దేశమునుండి చైనాకు అక్కడినుండి వివిధములగు విదేశములకు ప్రాకగా అవి తమకు చైనా నుండి వచ్చుటచే వారవి ‘చైనీయుల’ ఆవిష్కరణ’ అని లోకానికి చాటినారు.

మన దేశమును గూర్చి ఒక చైనా మేధావియే,తన Wisdom Of India అన్న గ్రంధములో   ఏమి చెప్పినాడోక్రింద అనుబంధముగా ఉంచిన చిత్రపటమున చూడండి:

 

కంటి శుక్లములు తీయుట మొట్ట మొదటిగా జగతికి తెలిపినది శుశ్రుతుడు. ఈవిద్య ముందు చైనాకు తరువాత ప్రపంచమునకు ప్రాకింది. గ్రీకులు ఈ విద్య లోతుపాతులు తెలుసుకొన భారతదేశమునకు వచ్చేవారట. కృత్రిమావయవ నిర్మాణము (Artificial Limbs) మరియు వాటిని అతికించుటను గూర్చి ఋగ్వేదములోనే చెప్పబడినది. వజ్రముల ఘనత ,విలువ తెలుసుకొనుటయే కాక క్రీస్తుకు పూర్వమే 5000 సంవత్సరముల క్రితము మధ్య భారతములో గనులు కలిగి యుండినవారు భారతీయులు. మన నైజాము నవాబులు గుంటూరు. కడప అనంతపురము లలోని వజ్రపుగనులను మన్ను వచ్చేవరకు త్రవ్వి తీసుకొని తమ వద్ద వుంచుకొన్నవి వుంచుకోగా మిగతవి తమ విధేయతను తెలియ జేయుచూ ఆంగ్లేయులకు ధారాదత్తము జేసినారు.

జలవనరులనుపయోగించుట , flush Toilets అన్నపేరుతో నేడు మనము ఉపయోగించే ప్రసాధనలు (Toilets),ఆ మలినజలము పోవుటకు భూగర్భ జలమార్గములు సింధూనాగరికతలో బయల్వెడలినవని జిజ్ఞాసవున్న ప్రతి చదువరికీ తెలుసు. ఇప్పుడు కలన యంత్రము (Computer) భాషకు వుపకరించే (Binary Numbers) శతాబ్దాల క్రితము పింగళుదు కనుగొన్నవే! సిరా(ink) తయారు చేసేప్రయత్నములో అన్నిదేశాలకన్నా ముందంజవేసి మశి తో మంచి సిరా ను తయారు చేసినది మనవారే. నీరు పడుట లేక వేరే విధములుగా వ్రాత చెరిగిపోకుండా వుండుటకు సిరాలో కరక్కాయపొడిని వాడిన మొదటి దేశము మనదే. నేటికి కూడా Indian Ink లో కరక్కాయను వాడుతూనే వున్నారన్నది నేను విన్న మాట.

ఇక అధునాతన ఆవిష్కరణలకొస్తే, 1909 లో మర్కోనీ Wireless కనుగొని భౌతిక శాస్త్రములో నొబెల్ పురస్కారమును పొందక మునుపు 2 సంవత్సరముల క్రిందటే జగదీశ్ చంద్రబోస్ గారు కనుగొన్నా పాశ్చాత్య పక్షపాత విధానమునకు గురియై ఆ బహుమతినందుకోలేక పోయినాడు. ఆ గుర్తింపును ఆయన మరణించిన ఒక శతాబ్దము తరువాత పొందినాడు. మొక్కలలో ప్రాణమున్నదని కనుగొన్న ఆయన ఆవిష్కరణకు అధర్వణ వేదము మూలమని ఆయనే తెలియబరచుకొన్న వినయ శీలి.చంద్రగ్రహములో నీటిఉనికిని కనుగొన్నది చంద్రయాన్--1 ద్వారా మన ISRO సంస్థ.

Named as one of the 7 ‘Unsung Heroes’ by Fortune Magazine, Dr. Narinder Singh Kapany, is widely recognized as the ‘Father of Fiber Optics’ for his pioneering work in Fiber Optics technology. Watch him speak eloquently on his entrepreneurial journey.

 మళ్ళీ కలుస్తాము......

భారతీయ విజ్ఞానము --3

 యంత్రార్ణవము లో యంత్రాన్ని గూర్చిన ఈ నిర్వచనము చూడండి :

 దండచక్రైశ్చదంతైశ్చసరణిర్భ్రమణాధిభిః

శక్తిరుత్పాదనం కింవా చలనం యంత్రముచ్యతే

 ఇప్పటి వాడుక భాషలో చెప్పవలసివస్తే 'rods' 'wheels' 'teeth' ల అనుసంధాన భ్రమణముతో శక్తిని ఉత్పాదించే పరికరమే యంత్రము.

 కస్య చిత్కాక్రియా సాధ్యా కాలః సాధ్యస్తు కస్య చిత్

........

......

......

......

గమనే శరణం పాతః ఇతి భేదా క్రియోద్భావాః

 ఈ మూడు శ్లోకములు సమరాంగణ సూత్రధారలోని 31వ అధ్యాయములో వున్నవి. వీని సారాంశమేమిటంటే

1. కొన్ని కొన్ని యంత్రములు ఒకే పనిని పదేపదే చేయ పనికి వచ్చేవి.

2. కొన్ని ప్రత్యెక సమయములలో పనికి వచ్చేవి .

3.కొన్ని ఛాయా, రూప స్పర్శ సంబంధములైనవి.

4.కొన్ని క్రిందికి పైకి,ముందుకు వెనక్కు ప్రక్కలకు కూడా కదల గలిగినవి.

ఇవియన్నియు గూడా ఎన్నో విధములైన కార్యములను నిర్వహించేవి.

 'యావద్బీజ సంయోగ........పునః సమ్యక్త్వ సంవృతిః' ఈ మూడు శ్లోకములు యంత్రముల యొక్క గుణగణములు తెల్పుచున్నవి. పై శ్లోకముల అర్థము ఈ విధముగా వున్నది.'అవి చక్కని ఉత్పాదకత గలిగి సరియైన సమన్వయముతో మృదువుగా సాగుతూ నిరంతర పర్యవేక్షణ లేకుండా యుండునని తెలుపుచున్నవి.ఇవి ఘర్షణకు గురి కాకుండా పనిచేస్తాయి. తక్కువ శబ్దముతో పని చేస్తూకూడా అవసరమైతే ఎక్కువ శబ్దము చేయగల శక్తి కలిగియుంటాయి.ఎదో అడ్డు పడటం ఆగి పోవటం అన్న లోపాలు వుండవు. ఉపయోగించడానికి తేలికగా చిరకాలం మన్నేవిగా వుంటాయి. ఇవన్నీ పరిశీలించితే మన యంత్ర నిర్మాణ సామర్థ్యమెంతదో మనకర్థమౌతుంది.

2.

ఇక ఘటములు మరియు విద్యుత్తును గూర్చి. 11 వ తరగతి వరకు తెలుగు భాషలో పాఠ్యాంశాలు చదివినవారి ఘటము అంటే cell అని తెలిసే వుంటుంది.

అసలు ఘటమును గూర్చి అగస్త్యులవారు వారి అగస్త్య సంహిత లో ఏమి చెప్పినారో చూస్తాము .

సంస్థాప్యే మృణ్మయేపాత్రే తామ్రపర్ణం సుసంస్కృతం

చ్చాదయే చ్చిఖిగ్రీవేన్ ఛార్ద్రార్భిః కాష్టపాంసుభిః

దస్తాలొష్టో నిధాత్వాయః ఫారదాచ్ఛాది తస్తతః

సంయొగాజ్జాయతే తేజో మిత్రావరుణసంచితం

ఒక శుభ్రపరచిన మట్టి కుండను గ్రహించి అందులో తళతళ లాడే రాగిరేకును మరియు సిఖిగ్రీవము అంటే నెమలి మెడ అని అర్థము దీనినే మనము మైలు తుత్తము అంటాము . అసలు మైలము అంటే నెమలి అని. తమిళూలు నెమలిని 'మయీళ్ అనే అంటారు.దీనినిని ఆంగ్లములో cupric sulfate or copper sulphate, is the chemical compound with the chemical formula CuSO4. ఆంగ్లములో దీనికున్న పేరు ఇదే నని మాత్రమే నాకు తెలుసు.ఈ మైలుతుత్తమును ఆ కుండలోవేయాలి. ఆతరువాత పాదరసపు పూత గలిగి రంపపు పొట్టునంటించబడిన యశదపు రేకును (Mercuru amalgameted zinc sheet) అందులో వుంచవలెను. ఆపై రాగి తీగలను అనుసంధిచుట ద్వారా విద్యుత్తు ఉద్భవించుతుంది. మిత్రావరుణము అంటె విద్యుత్తు(మెరుపు తీగ)( మిత్రావరుణుడు అంటే ఇంద్రుడు ఆయన ఆయుధమగు వజ్రము వంకరటింకరయగు మెరుపు తీగయే కదా!) దీనిని కొందరుIIT విద్యార్థులు సాధికారముగా నిరూపించినారని చాలా చాలా కాలము క్రితము ఏదో దినపత్రికలో చదివిన గుర్తు.

'శాతకుంభం' అన్న పదము మనకు 'అగస్త్య సంహిత'లో కనిపిస్తుంది.

ఆనేన జలభంగొస్తి ప్రాణో దానేషు వాయుషు

ఏవం శతానాం కుంభానాం సమ్యోగః కర్యకృత్ స్మృతాః

ఇందులో వంద పైన చెప్పిన ఘటములను ఒకేసారిగా ఈ ప్రక్రియకు ఉపయోగించితే ప్రాణవాయువు (Oxygen) గానూ ఉదజని (Hydrogen) గాను విడి పడుతుందని చెప్పినారు. నీరు అంటే H2O అనే కదా మనకు ఆంగ్లేయులు నేర్పించింది. ఈ విధముగా 100 కుంభములను జత చేస్తే Direct Current Open Circute Voltage 1.138 Volts వుంటుందని మన యువ శాస్త్రజ్ఞులు నిరూపించినారు అన్నది నేను తెలుసుకొన్నది.

ఈ విషయములో ఇంకొక మాట విందాము. 1870 సంవత్సరములో Samuel Mateer అనే ఒక British missionary తనకు అన్య మతస్తుడైనందువల్ల ఆలయ ప్రవేశము అధికారులు కలిగించలేదని చెబుతూ ఈ విషయాన్ని చెప్పినాడు. “It is said that there is a deep well inside the temple, into which immense riches are thrown year by year; and in another place, in a hollow covered by a stone, a great golden lamp, which was lit over 120 years ago and still continues burning.”

 శక్తిని ఒకటిగా చేసి విద్యుతుత్పాదన చేయగలదు.విద్యుచ్ఛక్తి  నాడే వినియోగములో ఉండేదంటే గొప్ప విషయము కాదా మరి. ఈ పరికరము నేడు కూడా 'ఈజిప్టు జాతీయ ప్రదర్శన శాల'లో గాంచవచ్చునని విన్నాను, చదివినాను, మరియు ఆ చిత్రమును గూడా చూసినాను .

 ఘనులైన మన పూర్వులు విద్యుత్తును 6 విధాలుగా విభజించినారు. అవి ఏవంటే

 1.తాడితము: by friction from leather or silk

 2.సౌదామిని: by friction from gems or glass

 3.విద్యుత్: Production from clouds and water falls

 4.హ్రాదిని: from a storage cell

 5. శతకుంభి: from a battery (narrated earlier)

 6. అశని: The one emanating from a magnetized rod.

 రామాయణ ఇతిహాసములోని సుందరాకాండ లో లంకా నగరాన్ని గూర్చిచెబుతూ 'వాల్మీకి మహర్షి' ఆ మహానగరము అనేక శాతకుంభాలతో నిండియున్నాడని వర్ణిస్తారు. ఈ మాటకు అర్ధముగా ఎత్తయిని కొండలు గుట్టలు అని కొందరు చెప్పినారు గానీ సునిశితముగా పరిశీలన చేస్తే , అందులో, రామ లక్ష్మణులు కందకాలపై తమకు తామే తెరుచుకొని మూసుకొనే యాంత్రికమైన కవాటములు తిలకించినారని ఉన్నది. మరి ఇవి పని చేయవలేనంటే శాతకుంభములు కావలసినదేకదా!

ఈ విషయమై తిరిగీ కలుస్తాము...

భారతీయ విజ్ఞానము -- 4

సమరాంగణ సూత్రదారలో ఈ విధముగా చెప్పబడినది:

స్థితి స్థాపక సంస్కారః క్షితః క్వచిచ్ఛ తు ర్ష్యపి l

అతీంద్రియో సోవిజ్ఞేయః కవచిత్ స్పందే పి కారణమ్ ll

దీని అర్థం ఏమిటంటే, దృఢమైన లేదా ఇతర రకాలుగా ఉత్పన్నమైన అదృశ్యశక్తి (బలము)యే స్పందనము కలుగుటకు కారణమగుచున్నది. సూర్య సిద్ధాంతంలోని యంత్రాధ్యాయంలోని 53 నుండి 56 వరకు గల శ్లోకాలలో జల చక్రం (వాటర్ వీల్) యొక్క వర్ణన ఉంది. ఈ సమరాంగణ సూత్రధారను  1150లో భోజరాజు రచించినట్లు చెబుతారు. దీనిలో ఇవ్వబడిన యంత్ర శాస్త్ర పరిజ్ఞానం ఒక సువికసిత యంత్రజ్ఞాన కల్పనను తెలియజేయుచున్నది. ఈ గ్రంథము అన్ని రకాల యంత్రాలకు సంబంధించిన కొన్ని మౌలిక, మూలాధార విషయాల్ని చర్చించింది. యంత్రాల యొక్క ముఖ్యసాధనాల వర్ణన యంత్రార్ణవము అనే గ్రంథములో చేయబడినది. ఏ యంత్రానికి ఏయే ముఖ్య లక్షణాలు ఉండవలెనన్నది సమరాంగణ సూత్రధారలో వివరించబడింది. యంత్ర భాగాల పరస్పర సంబంధము, చలనములో సహజత, ప్రత్యేక శక్తిని వినియోగించి తక్కువ ఇంధనముతో జరిగే చలనము, తక్కువ ధ్వనిని కలిగించే చలనము, యంత్ర భాగాలు డీలాపడకుండా ఉండటము, చలనము ఎక్కువ తక్కువలు కాకుండా ఉండటము, వివిధ కార్యాలలో సమయం కచ్చితతత్వము, మరియు దీర్ఘకాలము చక్కగా పనిచేసే సమర్థత మొదలగు ఇరవై లక్షణములు చర్చించబడినవి. ఆ గ్రంథంలో ఇంకా ఇలా చెప్పబడినది.

చిరకాల సహత్వం చయంత్ర స్యైతే మహాగుణాః స్మృతాః ll

-సమరాంగణ సూత్రధార- అధ్యాయం 31

జలశక్తి ఉత్పాదక యంత్రము (హైడ్రాలిక్ మెషీన్)- జలశక్తి (Water Power) ఉత్పత్తి చేయటంలో జలధారను ఉపయోగించే సందర్భంలో సమరాంగణ సూత్రధార 31వ అధ్యాయంలో ఈవిధముగా చెప్పినారు.

ధారాచ జల భారశ్చ పయసో భ్రమణం తథా l

యథోచ్ఛ్రాయో యథాధిక్యం యథా నీరంధ్రతాపి చ l

ఏవమా దీని భూజస్య జలజాని ప్రచక్షతే ll

అంటే ప్రవహిస్తున్న జలధార యొక్క భారము, వేగములను, శక్తి (పవర్) ఉత్పాదన కొరకు హైడ్రాలిక్ మెషీనులో ఉపయోగిస్తారు. ఈ శక్తి జలధార యంత్రమును త్రిప్పుతుంది. జలధార పైనుండి పడుతున్నపుడు దాని ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. భారము, వేగము యొక్క అనుపాదముననుసరించి యంత్రము తిరుగుతూ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సంఙ్గహీతశ్చ దతశ్చ పూరితః ప్రతినోదితః

మరూద్ బీజత్వ మాయాతి యంత్రేషు జల జన్మసు

-సమరాంగణ సూత్రధార- అధ్యాయము 31

నీటిని సేకరించటం, ప్రవహింపజేయటం, మరల క్రియ కొరకు ఉపయోగించటం- ఇలా చేయడం ద్వారా జలాన్ని శక్తి ఉత్పాదనకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ చాలా విస్తారంగా ఇదే అధ్యాయంలో వర్ణించబడింది. యంత్ర విజ్ఞానానికి సంబంధించిన మరికొన్ని వివరాలు.

చాళుక్యుల రాజ్యపాలనాకాలంలో, ఒక తోటలోని నీటి కొలనులో నుండి నీరు బయటకు వచ్చే స్వయం సంచాలిత వ్యవస్థ ఉన్నట్లు జర్నల్ ఆఫ్ అనంతాచార్య ఇనిస్టిట్యూట్, ముంబై వర్ణించింది.

భరద్వాజ మహర్షి విమానశాస్త్రంలో అనేక యంత్రాల వర్ణన ఉంది. దీనిని విమానశాస్త్రం అనే అధ్యాయంలో వివరంగా చర్చించుకొందాము.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలను, సూత్రాలను మన మహర్షులు అనేక గ్రంథాలలో రచించినారు. మన పూర్వీకులు రచించిన మరియు పేర్కొన్న ఎన్నో అమూల్యమైన విషయాలను మనమే తెలుసుకోకపోవటం చాలా బాధపడవలసిన విషయము. మన గొప్పదనము మనము తెలుసుకొనక పోగా పరాయి దేశస్థులు వీనిని తస్కరించి వారి పేర్లతో తిరిగీ మనకు చేరవేస్తే అవి చదివి మనకెందుకు అంత తెలివిలేదని ఆశ్చర్యపడుచున్నాము.

జి.ఆర్. జోస్యర్ రచించిన "Diamonds, Mechanisms, Weapons of War, Yoga Sutras" అన్న గ్రంథము లో ఎన్నో విధములగు ఇంధనములతో నడుపబడు యంత్రముల గూర్చి వివరిచ బడినది. అసలు వీరు 'యంత్రార్ణవము సమరాంగణ సూత్రధార వంటి అనేక పుస్తకముల మూలమున సేకరించిన జ్ఞానమును ఈ గ్రంథములో క్రోఢీకరించినట్లు తెలియవచ్చుచున్నది. కణాద మహర్షి తన 'వైశేషిక దర్శనము'లో 5 విధములగు క్రియల గూర్చి తెలిపినారు.ఇవి అన్నీ కూడా ఆధునిక యంత్రపరికర ఆవిష్కరణమునకు దోహదము చేసినవే!

'వైశేషిక దర్శనము' నకు ప్రశస్త పాదుడు వ్రాసిన భాష్యమున కొన్ని గతి సూత్రములను తెలియజేసినాడు. ఈ రచన 'గతి సూత్రములను లోకానికి తెలిపినాననుకొనుచున్న Newton మహాశయుని కాలము నాటికి వెయ్యి సంవత్సరముల పూర్వమే వెలుగు చూసినది.

ఎంతో విజ్ఞానము వెల్లివిరిసిన భారతావనిని ఒక ప్రక్క తురుష్కులు, మరొకపక్క చాప క్రింద నీటిని బోలిన ఐరోపీయులు మన విజ్ఞానమును ధ్వంసము చేసినారు, దొంగిలించినారు.

ఖగోళ శాస్త్ర విషయములలో మనవారి ముందంజ ఎంతన్నది తెలుసుకొనుటకు పూర్వము పాశ్చాత్యులు 16వ శతాబ్దము వరకు ఏంతవెనుకబడియుండినారో చూద్దాము.

భూమి చుట్టూ సూర్యచంద్రులే కాక, ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని, విశ్వానికి కేంద్రం మనిషికి జన్మనిచ్చిన ఈ భూమేనని ఒక పక్క క్రైస్తవ మతం బోధిస్తుంటే, ఆ భావనని ఖండిస్తూ భూమి, తదితర గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించినవాడు కొపర్నికస్. అయితే కోపర్నికస్ వాదనలో బలహీనత దానికి తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడం. తరువాత వచ్చిన కెప్లర్ కూడా కోపర్నికస్ చెప్పిన ఈ విషయాన్ని బలపరచినాడు. ఇవి అన్నీ 16 వ శతాబ్దము నాటి మాటలు. ఇన్ని ఆధారాలు పోగవుతున్నా వారి మతం మాత్రం తన బోధనలని, భావనలని మార్చుకోలేదు. దేవుడు మనిషిని అపురూపముగా సృష్టించినాడు. అలాంటి మనిషి జీవించే ఈ భూమికి విశ్వంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కనుక గ్రహాలు, సూర్యచంద్రులు, తారలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కాదన్న వాడు వట్టి అజ్ఞాని, లేదా దైవ ద్రోహి. ఇదీ వరస! ప్రొటస్టెంట్ క్రైస్తవమునకు ఆద్యుడైన మార్టిన్ లూథర్" ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చేస్తున్న మూర్ఖుడు కోపర్నికస్" అని దూషించినాడు కూడా!

అంతిమ దశలో తాను సేకరించిన,తెలుసుకున్న వివరాలన్నింటిని గ్రంధంగా అచ్చు వేయించి పోప్ గా ఉన్న మూడవ పాల్ కు అంకితం ఇచ్చినా చర్చి సానుభూతిని పొందలేక పొయినాడు. కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా గెలీలియో ప్రయోగాలున్నాయన్న కారణానికి చర్చి గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించినారు. క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడైనాడు. శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించినాడు.

 

ప్రాచీనసూర్యసిద్ధాంత ఆధారంగా ఆర్యసిధ్ధాంతమనే ఖగోళశాస్త్ర గ్రంధాన్ని కూడా ఆర్యభట రచించినట్లు ఆయన తరువాతివాడైన వరాహమిహిరుడి రచనలద్వారానూ, ఆతరువాతికాలంవారైన బ్రహ్మగుప్తుడు, మొదటి భాస్కరాచార్యులు మొదలౌన వారి ఉటంకింపుల ద్వారానూ తెలుస్తున్నది. కాని ఇప్పుడు కొన్ని అలభ్యం.

ఖగోళపరిశోధనకు ఉపయోగించే శంఖుయంత్రము, ఛాయాయంత్రము, ధనుర్యంత్రము, చక్రయంత్రము, యష్టియంత్రము వగైరా పరికరాలగురించీ, కాలగణనానికి ఉపయోగించే నీటితో నడిచే గడియారాల గురించీ యీ గ్రంధంలో ఆర్యభట మహాశయుడు వివరించినాడట. అల్-బిరూనీ అనే పర్షియాదేశపు విద్వాంసుడు ఈ ఆర్యభటీయమును అరబిక్ భాషలోనికి అనువదించినాడు.

అండము పిండము బ్రహ్మండము అన్నవి మనకు తెలిసిన పేర్లు .అండము భూమి, మనము భూగోళము అనికూడా వేనకువేల సంవత్సరాలనుండి వింటూనేవున్నాము. పిండము. అదే ఆకృతిలో అంతకన్నా పెద్దది. మన సౌర కుటుంబము. బ్రహ్మాండము అనగా ఈ విశ్వము. ఎప్పటి మాటలివి. ఎంత గొప్ప నిజాన్ని ఎంత చిన్న మాటలలో చెప్పినారు చూడండి. అసలు జగతి అన్న మాటను భూమి, ప్రపంచము విశ్వము అన్న వివిధములైన అర్థములలో వాడుతాము. అసలు గతి అంటె ఆంగ్లములో That which moves అని అర్థము.

ఎంత సులభమైన మాటలో. జగతి నిరంతరమూ సాగుతూనే వుండేది అన్నది ఈ మాట యొక్క అర్థము. ఆ చిన్నపేరులోనే అసలు అర్థమును ఇమిడించిన మన పూర్వుల మేధస్సును ఎంత పొగడినా తక్కువే!

ఈ విషయమొకసారి గమనించండి. ఆకాశములో Antares అన్న Roman నామము తో ఒక నక్షత్రముంది. Ares అంటె మనము ఆంగ్లములో వాడే గ్రీకు పదము Mars కు సమానాంతరము. Antares అంటే Mars వంటిది అని. ఇది అంగార వర్ణములోనే వుంటుంది. ఇది విశ్వములోని అతిపెద్ద నక్షత్రములలో 15 వది అని నేటి శాస్త్రజ్ఞులు గుర్తించినారు. ఈ నక్షత్రాన్ని మనము సంస్కృతములో జేష్ఠ అని పిలుస్తాము . జేష్ఠ అంటే పెద్దది మరియు ముందు జన్మించినది అన్న అర్థములో వాడుతాము. ఇది మనకు తెలిసిన సూర్య 'నక్షత్రమునకు 40,000 వేల రెట్లు పెద్దదని నేటి శాస్త్రజ్ఞులు తెలియబరచినారు. ఇది విశ్వములోని అతిపెద్ద నక్షత్రములలో 15 వది అని నేటి శాస్త్రజ్ఞులు గుర్తించినారు. ఈ నక్షత్రాన్ని మనము సంస్కృతములో జేష్ఠ అని పిలుస్తాము . జేష్ఠ అంటే పెద్దది మరియు ముందు జన్మించినది అన్న అర్థములో వాడుతాము. ఇది మనకు తెలిసిన సూర్య ''నక్షత్రము' నకు 40,000 వేల రెట్లు పెద్దదని నేటి శాస్త్రజ్ఞులు తెలియబరచినారు. పెద్దదే కాకుండా అంతరిక్షములో ఇది వయసులోనూ పెద్దదని చెబుతున్నారు..మరి కేవలము చర్మచక్షువులతోనే మన ఋషులు కనుగొన్నారు కదా. ఇది సమాధి స్తితిలోనే వారికి సాధ్యమై వుంటుందన్నది మనలోని ప్రతియొక్కరికీ తెలిసిన విషయము. ఈ జెష్ఠా నక్షత్రము మన నక్షత్ర మండలములోని 27 నక్షత్రములలో ఒకటి.

ఋగ్వేద మంత్రము ఇలా చెబుతుంది.

చక్రాణసః పరీణహం పృథివ్యా హిరణ్యేన మణినా శుభమానాః l

నహిన్వా నాసస్తి తిరుస్త ఇంద్రం పరిస్పర్శ ఉదగాత్ సూర్యేణ ll

భూమి గోళాకృతి లో యుండుట యే గాక ఏకాలంలోనైనా సగము వెలుతులో లో నుండి సగము చీకటి లో యుంటుందని తెలుపుతుంది.అంతేకాదు సూర్యుని ఆకర్షణ శక్తివల్ల భూమి అంతరిక్షములో నియమ బద్ధముగా తన కక్ష్యలో తిరుగుతుందని కూడా ఈ క్రింది ఋగ్వేద మంత్రము తెలుపుతుంది.

 'సవితా యంత్రైః పృథివీ మరమ్నాన్ అస్కంభవే సవితద్వామదృహంత’

 17 వ శతాబ్దములో గెలీలియో కనిపెట్టే వరకు మనకు 'దూరదర్శని'(Telescope)ని గురించి తెలియదనుకోవడము పొరబాటు . 'శిల్ప సంహిత' అన్న ప్రాచీన గ్రంథములో దీనిని గూర్చి విశధముగా వివరించబడినది. ఈ క్రింది శ్లోకముతో మొదలయ్యే వర్ణన ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తుంది.

 మనోర్వాక్యం సమాధాయ తేన శిల్పీంద్ర శశ్వతః l

యంత్రం చ కార సహసా దృష్టర్థ దూర దర్శనం ll

 ఈ మొత్తము శ్లోకాల తాత్పర్యము 'దూరదర్శిని'ని తయారు చేయు విధానమును తెలుపుటయే గాక దీనికి 'తురీయంత్రము' అన్న నామకరణ కూడా చేసింది..

ఋగ్వేదము (1.50) లోని ఒక మంత్రము సూర్యకాతి అర నిముసములో 2,202 యోజనములు పయనించుతుందని చెప్పబడినది. దీనికి సాయణ (c.1315-1387 AD) భాష్యము ఈ విధంగా వుంది.

ఒకయోజనము = ఇంచుమించు 9 మైళ్ళు అర్థ శాస్త్రము ప్రకారము.

మన పురాణముల ప్రకారము

15 నిమిషములు = 1 కాష్ట

30కాష్టలు= 1 కల

30 కలలు = 1 ముహుర్తము

30 ముహుర్తములు = 1 దివారాత్రము

కాబట్టి ఈ నిమిషము ఇప్పటి 16/75 సెకనులకు సమానము . ఆవిధముగా గుణించితే కాంతి వేగము 185 793.75 అవుతుంది. నేటి శాస్త్రము 1,86,000 అని తెలుపుచున్నది. ఈ కొలమానము ఎంత దగ్గరిగా ఉన్నదో చూడండి.

 క్రీస్తు పూర్వము 1000 సంవత్సరముల క్రింద సంస్కరింపబడిన 3000 సంవత్సరముల నాటి 'సూర్య సిద్ధాంత గ్రంధము ప్రకారము భూమి వ్యాసము 7,840 మైళ్ళు. దీనికి ఆధునిక శాస్త్రీయ నిర్ధారణ యగు 7,926.7 మైళ్ళు ఎంత చేరువలో వుందో చూడండి.

ఇదే గ్రంథము భూమికి చంద్రునికి 2,53,000 మైళ్ళని చెప్పగా నేటి శాస్త్రము ఆ దూరమును 2,52,710 మైళ్ళు అని చెప్పి సూర్య సిద్ధంత గ్రంథమునే బలపరుచుచున్నది.

భూమ్యాది గ్రహములు సూర్యుని చుట్టూ నిర్ణీతమైన కక్ష్యలో తిరుగుచున్నాయని కోపర్నికస్ కన్నా 1000 సంవత్సరములకు పూర్వమే ఆర్య భటుడు శెలవిచ్చినారు.

భాస్కరాచార్యులు -- 1 (5 వ శతాబ్దము ) సూర్యుని కక్ష్యలో భూమి తిరుగుటకు 365.258756484 రోజుల సమయము పడుతుందని తెలిపినారు.

భాస్కరాచార్య -- 2 తమ సిద్ధాంత శిరోమణిలో న్యూటన్ గారికి 400 సంవత్సరములకు పూర్వమే తమ సిద్ధాంత శిరోమణి (భువన కోశము --6) లో భూమ్యాకర్షణ శక్తిని గూర్చి వివరించినారు.

బ్రహ్మ గుప్తుడు క్రీ|||| 630 లోనే భూమికి ఆకర్షణ శక్తి ఎంత సహజమని వర్ణించినారంటే నీరు పల్లమునకు పయనించినంత స్వాభావికమని చెప్పినారు. ఈవిషయమును 17 వ శతాబ్దము వాడయిన న్యూటన్ కనుగొన్నట్లు మనము పాఠ్యాంశాలలో చదువుకొంటూ వున్నాము.

మన పూర్వీకుల ఆవిష్కరణలను గూర్చి చెప్పుకొంటూ పోతే ఎంతైనా వుంది . అంతా చెప్పగలిగే శక్తి నాకు లేదు, అందు చేత ఈ ఒక్క విషయాని చెప్పి వేరొక విభాగమునకు దారి తీయ ప్రయత్నించెదము.

పెళ్ళిళ్ళలో వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించే ఆనవాయితీ ని గూర్చి అందరికీ తెలిసినదే. మరి యెందుకు చూపిస్తారు అంటే అది ఒక ఆచారమని చెబుతారు. కానీ దీని వెనుక గూడా ఒక గమ్మత్తైన కారణముంది. మనకు గ్రహాలు ,ఉపగ్రహాలు, నక్షత్రాలను గూర్చి తెలుసు. భూమికి చంద్రుడు ఉపగ్రహము. భూమిచుట్టూ తిరుగుతూ వుంటాడు. ఇది మనకు తెలిసినదే. ఇపుడు ఒక క్రొత్త విషయము తెలుసుకొందాము. సప్తర్షి మండలములోని వశిష్ట నక్షత్రమును ఆనుకొని అరుంధతి, అతి చిన్న నక్షత్రముగా మనకు రాత్రిపూట జాగ్రత్తగా చూస్తే అగుపిస్తుంది. ఆ రెండు నక్షత్రములను భార్య భర్తలుగా కూడా మనము పరిగణించుతాము. ఆ రెంటినీ రాత్రి పూట నిర్మలమైన ఆకాశము వున్నపుడు ఒక దూరదర్శిని (Telescope) సహాయముతో చూస్తే ఆరెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ వుంటాయి. భూమిపైని ఈ క్రొత్తదంపతులు గూడా ఆవిధముగా వుండవలెనని గామోసు నూతన వధూవరులకు అరుంధతీ దర్శనము చేయిస్తారు. కేవలము తమ తపశ్శక్తి తో ఇటువంటి వివరములు తెలియజేయుట ఎంత ఆశ్చర్యమైన విషయమో చూడండి.

వాల్మీకి రామ లక్ష్మణులను, భారత శత్రుఘ్నులను ఎంత చక్కగా పోల్చినాడో మరొకమారు తెలుసుకొందాము.

తిరిగీ కలుద్దాము.

భారతీయ శాస్త్ర విజ్ఞానము - 5 

వాల్మీకి శాస్త్రజ్ఞత

వాల్మీకి ఆదికావ్య కర్త, అందుచే ఆదికవి అని మాత్రమే మనకు తెలుసు. రామాయణమంటే రాముడు సీత, లక్ష్మణుడు, భరతశత్రుఘ్నులు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు విభీషణుడు, రావణ కుంభకర్ణులు, కట్టె, కొట్టె, తెచ్చె   అని మాత్రమే అనుకొంటాము. ఇందులో ఎన్నో శాస్త్ర రహస్యములు దాగివున్నవని ఆలోచించము. ఆ దిశగా మనకు చెప్పేవారు కూడా తక్కువే. ఇప్పుడు అటువంటి ఒక ఖగోళ రహస్యమునకు సంబంధించిన విషయమును వాల్మీకి మహర్షి ఎంత నిగూఢముగా మనకు తెలియబరచినాడో తెలుసుకొందాము. అందుకే కాలిదాసువంటి మహాకవులు వాల్మీకి వారిని ఈ విధముగా పొగిడినారు.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం 
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కొకిలం

రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది.

వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణా
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతిం

కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' యని గర్జించుతూ వుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు. ఇక అసలు విషయమునకు వద్దాము.

బాలకాండ 18 వ సర్గము. 16 వ శ్లోకము ఈ విధముగా వుంది.

గుణవంతో సురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః

జగుః కలం చ  గంధర్వా ననృతుశ్చాప్సారో గణాః

దశరథుని నలుగురు పుత్రులూ రూపములోనూ గుణములోనూ నిరుపమానులు. వారు ప్రోష్ఠపద నక్షత్రమువలె అన్యోన్యత కలిగి వుండినారు. వీరి జనన కాలమున గంధర్వులు గానము చేసినారు. అప్సరసలు నాట్యము సల్పినారు. దేవదుందుభులు మ్రోగినాయి. ఇందు మనకు కావలసింది ‘రుచ్యా ప్రోష్ఠపదోపమాః’ అన్న పదము మరియు దాని విశ్లేషణ. రుచి అన్న మాటకు ప్రకాశము అన్నది ఒక అర్థము. మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కదా! మరి ఒక నక్షత్రము పేరు చెప్పి, దానివలె ప్రకాశించుచున్నారు  అంటే కొంత ఎబ్బెట్టుగా వున్నట్లు తోచకమానదు. నలుగురు స్త్రీలను ఉద్దేశించి చెబుతూ, ఆ నలుగురి ముఖములూ చంద్రబింబములవలె వున్నాయి అని అంటే మనసుకు రుచించదు కదా! మరి ఇది ఎలా సరిపోతుంది, అన్నది సమస్య. అది ఇపుడు కాస్త ఈ పదప్రయోగను గూర్చి తెలుసుకొనే ప్రయత్నమూ చేస్తాము. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రములు రెంటినీ కలిపి  ‘ప్రోష్ఠపద’ అని అంటారు. మరి ఇప్పుడు కూడా రెండేకదా అయినది, వారు అన్నదమ్ములు నలుగురు కదా! అన్న సందేహము వస్తుంది. అక్కడే వున్నది అసలు రహస్యము. పూర్వాభాద్ర రెండు ప్రకాశవంతమగు నక్షత్రములను కలిగియుంది. అదేవిధముగా ఉత్తరాభాద్ర కూడా రెండు తేజోవంతమైన నక్షత్రములను కలిగియుంది. ఈ నాలుగూ నాలుగు చుక్కలు (Points) గా గ్రహించి అవి A,B,C,D అన్న బిందువులుగా భావించి కలిపినట్లు ఊహించితే ఇంచుమించుగా ఒక చతురస్రము (Square) ఏర్పడుతుంది,  అంటే AC, BD ల దూరములో సూక్షమైన తారతమ్యాలు వుంటాయిగానీ AB, CD లు ఒకే దూరాన్ని కలిగివుంటాయి. ఇది మనకు A,C మరియు B,D ల అంటే రామ లక్ష్మణ, భారత శత్రుఘ్నుల అన్యోన్యతను తెలుపుతాయి. ఇదీ వాల్మీకి మహర్షి ఒకే పదములో  ఖగోళ శాస్త్రమును ఆధారము చేసుకొని అన్నదమ్ముల అన్యోన్యతను ఎంతో నిర్దుష్ఠముగా తెలియజేసిన విధానము.

నిరంతర భక్తితత్పరులు భగవంతుని అవిరళానుగ్రహ ప్రాప్తులగు ఆ మహానీయులకే అట్టి కావ్యములు వ్రాయుట, వానిని ఆచంద్రార్కము నిలిపివుంచుట సాధ్యము. వాల్మీకి మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు.

చెప్పినది కలియుగములోనే అయినా అంత స్పష్టముగా తులసీదాసు ‘హనుమాన్ చాలీసా’లో ఎట్లు చెప్పగలిగినాడు అన్నది పెద్ద విజ్ఞాన వేత్తలు, Scintists కు కూడా నేటికీ ఊహకందని విషయము. Google లో ఒకపరి పరికించితే ఎందఱో స్వోద్ఘాటిత ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ విషయమును గూర్చి తెలిపినారు. కానీ ఏక్కడ విశదీకరణ అవసరమో అదిమాత్రము విడిచిపెట్టినారు. కారణముతో మనకు పనిలేదు. నేను ఖగోళ శాస్త్రాధ్యయనము చేయలేదు కానీ తులసీదాసు గారు వ్రాసిన విషయమును మాత్రము వివరణాత్మకముగా మీ ముందుంచ ప్రయత్నించుతాను.

హనుమాన్ చాలీసాలో ...

"యుగ సహస్ర యోజన పర భాను,

లీల్యో తాహి మధుర ఫల జాను" అని ఒక దోహాలో చెప్పబడి ఉంది.

హనుమాన్ చాలీసా వచ్చిన వారికి పై పంక్తులు అవగతమే! అర్థమును ఒకపరి పరిశీలించుదాము.

 భానుడు అంటే సూర్యుడు.  సహస్ర యుగ యోజన దూరమున భానుడు ఉన్నట్లు ఇందు తెలుపబడినది.

లీల్యో తాహి మధుర ఫల జాను అంటే.. సూర్యుని లీలా మాత్రముగా కనిపించే కలమాగిన  మధుర ఫలముగా భ్రాంతిజెందినాడు, బాల హనుమంతుడు.

మనకు కావలసినది తులసీ దాసులవారు ఆ దూరమును తెలిపిన విధానము.

ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు. ఈ దూరాన్ని విశ్లేషించుకుందాము.

ఒక మానవ సంవత్సరము ఒక దైవ దినము. ఆ విధముగా 360 దైవదినములు ఒక దైవ సంవత్సరము.

ఆయుర్ధాయము    యుగము            కాలము     దైవ సంవత్సరములు

 1 పాదము        కలియుగము       4, 32, 000          1200

 2 పాదములు  ద్వాపరయుగము   8, 64, 000         2400

3 పాదములు    త్రేతాయుగము    12, 96, 000         3600

4 పాదములు  కృతయుగము       17, 28, 000        4800

10 పాదములు మహాయుగము    43,20, 000      12, 000

కావున పైన తెల్పిన ‘యుగ’ అను మాటకు దైవ సంవత్సరము అని అర్థము.

సహస్ర -1000

యోజనము- 8 మైళ్ళు

యుగ X సహస్ర X యోజనము

12000X1000X8 =9,60,00,000

12000000X8 = 96000000 మైళ్ళు

ఈ మైళ్లను కిలోమీటర్లలోనికి మారిస్తే....

96000000X1.6 = 153600000 కి .మీ. (ఒక మైలు = 1.6 కి .మీ.)

ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం. 

(గూగుల్ లో గమనించిన ఎడల పై దూరమును149,600,000 సుమారు, అని చూడనగును.) ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగినారో, దానిని తులసీదాసు వారు ఏ విధముగా గ్రహించినారో బాలోచించండి. ఆలోచించండి.

కేవలం వారి తప్పశ్శక్తి, జ్ఞాన నేత్రంతో చూడగలిగే గొప్పదనము ఈ వైదిక ధర్మముది.

ప్రాచీన మహర్షులు ఏకాగ్రతతో తపస్సులు చేస్తూ ఉండుటచే, మనోనిశ్చలత, వాక్శుద్ధి, దివ్యదృష్టి వంటి అద్భుత శక్తులను సంపాదించేవారు. యజ్ఞ యాగాలనే ప్రయోగాలతో ప్రకృతి శక్తులను కైవసం చేసుకోవడం తెలుసుకున్నారు. దుష్టులను సంహరించటానికి అస్త్రాలను కూడా రూపొందించినారు. లోక కళ్యాణానికి ఎన్నో - ఎన్నెన్నో మార్గాలను చూపించినారు. వారికి ఇవన్నీ సాధ్యపడుతకు దోహదము చేసినది శ్రుతులే!

గ్రహగతులకు మానవుని భవిష్యత్తుకు అవినాభావ సంభంధమున్నదని సాదికారకముగా తెలియజేసినవారు వారు. అసలు ఋగ్వేదము  ఖగోళశాస్త్ర విజ్ఞాన భరితము.

దీనిని మనకందించిన వేద ఋషుల యొక్క ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఎంత అపారమైనదో తెలుస్తుంది. నక్షత్ర సమూహాలైన గెలాక్సీ గురించి, రాశిచక్రాన్ని గురించి, విషువత్తుల గురించి, ధ్రువతార మార్పులను గురించి, సౌరశక్తిని గురించి, గ్రహాల గురించి, భూమి వర్ణన...దాని చలనములను గురించి, ధృవములను గూర్చి, ఋతువుల గూర్చి, ఈ విధముగా ఎన్నెన్నో అంతరిక్ష ఖగోళ విజ్ఞానాంశములను తమ అపార తపశ్శక్తితో ఋగ్వేదము నుండి వెలికి తీసి లోకానికి చాటినారు. భూలోక వాసులకు నింగిలోని తారకలు గ్రహములు, జ్యోతులవలె అగుపించుటచే వానికి సంబంధించిన శాస్త్రమునకు జ్యోతిశ్శాస్త్రమన్న పేరు వచ్చినది.

ఈ జ్యోతిషము కొరకు గ్రహగతులను లెక్కించవలసి వచ్చినది. కనుక జ్యోతిషముతో పాటు గణితము కూడా సర్వతోముఖ అభివృద్ధిని గాంచినది. యజ్న యాగాదులకు జ్యామితి(Geometry) రేఖాగణిత, త్రికోణమితుల (Trigonometry) ల  ఆవశ్యకత యుండుటచే మన పూర్వులు వానిని గూర్చి పరిశోధించి మనకందించినారు. అటు జ్యోతిషంలోను ఇటు గణితం లోను ఆరితేరిన మేదావులైన పరాశరుడు, ఆర్యభట, వరాహమిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాదులు 1,2 లాంటివారు అతి ప్రాచీన కాలంలోనే తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో మన హిందూ జాతిని ముందుకు నడిపించిన మేధావులు. ఇట్టివారిని మనం మననం చేసుకుంటూ, నిత్యం నమస్కరించుకోవాలి

ప్రాచీన మహర్షులు అనేక జంతు వస్తు, భావనా సముదాయములకు మానవాకృతిని ఒసగినట్లే, కాలమును కూడా కాలపురుషునిగా గ్రహించినారు. కొన్ని సంఘటనలు గ్రహప్రభావములచే. మానవుని సాంఘిక జీవితలో వివిధ విధములగు ప్రయోజనమును కల్గించే శాస్త్రములలో అత్యంత ప్రాధాన్యత కల్గిన శాస్త్రముగా జ్యోతిశ్శాస్త్రం నిలబడిపోయింది.

మిగిలినది మరొక మారు.......

 వేదములకు జ్యోతిషము కంటి చూపు అన్నది పెద్దల మాట. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నది ఆర్య వాక్కు. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని.

 

ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది.

ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడము ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పటము జరిగినది. మరొక మంత్రములో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపినారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది.’ అని చెప్పబడినది.

యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పినారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు.

ఇక్కడ ఒక చిన్న మాటను చెప్పవలసి వస్తుంది. వేదములు అనాది అనంతము అని మన ఋషుల ఉవాచ. 2,000, 1,500సంవత్సరముల క్రితము వెలసిన రెండు అతి పెద్ద మతముల యొక్క దైవ గ్రంధములు, NASA చేత ధృవీకరింపబడిన పై వాస్తవాలను ధృవీకరించలేక పోయినాయి. దీనిని బట్టి మన వేదం ప్రామాణ్యత ప్రాధాన్యత అర్థము చేసుకొండి. 

 వేదములకు జ్యోతిషము కంటి చూపు అన్నది పెద్దల మాట. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నది ఆర్య వాక్కు. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని.

 

ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది.

ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడము ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పటము జరిగినది. మరొక మంత్రములో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపినారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది.’ అని చెప్పబడినది.

యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పినారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు.

ఇక్కడ ఒక చిన్న మాటను చెప్పవలసి వస్తుంది. వేదములు అనాది అనంతము అని మన ఋషుల ఉవాచ. 2,000, 1,500సంవత్సరముల క్రితము వెలసిన రెండు అతి పెద్ద మతముల యొక్క దైవ గ్రంధములు, NASA చేత ధృవీకరింపబడిన పై వాస్తవాలను ధృవీకరించలేక పోయినాయి. దీనిని బట్టి మన వేదం ప్రామాణ్యత ప్రాధాన్యత అర్థము చేసుకొండి. 

 భారతీయ విజ్ఞానము – 6

భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 5, విమాన విభాగ ప్రచురణను విస్తరించి వ్రాయుటకు 5 రోజుల సమయము పట్టినది. ఈ దినము 5 వ భాగమును మీ ముందుంచుతున్నాను. ఇంత ఆలస్యము ఎందుకంటే నేను తృప్తి చెందితేగాని తెలియబరచలేను. ముఖ్యముగా శివకర్ బాపూజి తల్పాడే గారిని గూర్చి కొన్ని సందేహాలు ముందే నివృత్తి చేసుకొన్నా మిగిలినవి కూడా నివృత్తి చేసుకొని ఈ నాడాయన వివరము మీ ముందుంచుచున్నాను. నాసందేహాలనెన్ని తీర్చుకొన్నా ఆయన మొదటి విమాన ఆవిష్కర్తయైనా patent మాత్రము right సోదరులదే!

 

శివకర్ బాపూజి తల్పాడే

 

భారతీయ విమాన శాస్త్రమును గురించి వ్రాసేముందు నాటి మహనీయులగొప్పదనమునకు తన 'విమాన ఆవిష్కరణ' చే నివాళులర్పించిన 'ప్రపంచ ప్రథమ విమాన స్రష్ట శ్రీ శివకర్ బాపూజి తల్పాడే గారిని గూర్చి తెలుసుకొని మన నివాళులనర్పించుకొందాము.

డిసెంబరు 17,1903 లో ఉత్తర కరోలిన (USA) లో మొదటి విమానమును రైట్ సోదరులు ఎగిరించినారని నాటి నుండి నేటి వరకు మన సాంఘీక శాస్త్రము (SOCIAL STUDIES) లో పాఠ్యాంశముగా చదువుతూనే వస్తున్నాము. కానీ అంతకు 8 సంవత్సరముల పూర్వమే అంటే 1895 లోనే శివకర్ బాపూజి తల్పాడే అన్న మహాఆరాష్త్ర సంస్కృతపండితుడు విమానాన్ని 'మరుత్సఖ' అన్న పేరుతో మానవ రహితముగా 1500 అడుగుల ఎత్తునకు ఎగిరించగలిగినాడు. కొందరు దీని పేరు మరుత్ శక్తి అనికూడా అన్నారు గానీ మరుత్సఖి అనే ఆ పండితుడు పెట్టివుంటాడని నా మనసుకు తోచుతుంది. వాయు మిత్ర అని మరుత్ సఖి అంటే. వాయుశక్తి అంటే అంత పొందికగా వుండదేమో! రైటు సోదరులు ఎగిరించగలిగినది 120 అడుగులు మాత్రమే. ఆర్విల్ మరియు విల్బర్ట్ మొదటి విమాన వైజ్ఞానికులైనారు. ఆర్విల్ రైటు మొదటి వైమానికుడై పోయినాడు. Patent వారిదైనది కానీ శివకర్ బాపూజి గారి పేరే మనకు అపరిచితమై పోయింది.ఈ మహత్కార్యానికి స్పూర్తి ఆయన గురువైన చిరంజిలాల్ గారు ఒక కారణమైతే రెండవ కారణము వారు ఆదేశించిన స్వామీ దయానంద సరస్వతి గారి ౠగ్వేద భాష్య భూమిక లోని విమాన ప్రకరణము చదవటము.

 

తిరిగీ అసలు విషయానికొస్తే తల్పాడే గారు ఈ ఆవిష్కరణ ముంబాయిలోని అరేబియా సముద్రపు చౌపాటి ‘సముద్ర’ తీరములో ఈ మహత్కార్యమును సాధించుటకు భరద్వాజుని బృహద్విమాన శాస్త్రము,నారాయణముని గారి విమాన చంద్రిక ,శౌనకుని విమాన యంత్రము, గర్గముని యొక్క యంత్ర కల్పము, ఆచార్య వాచస్పతి యొక్క విమానబిందు, మహర్షి డూండిరాజ్ గారి విమాన జ్ఞానార్క ప్రకాశిక దోహదము చేసినాయని రత్నాకర్ మహాజన్ అన్న తల్పాడే గారి కాలము నాటి పండితుని లేఖనము ద్వారా తెలియవచ్చు చున్నది. వీనినుండి గ్రహించిన జ్ఞానముతో అయస్కాంత శక్తినుపయోగించి తల్పాడే గారు నాటి హికోర్టు జడ్జి మరియు దేశ స్వాతంత్ర్య సమరవాదియైన మహదేవ గోవింద రానడే మరియు బరోడా మహరాజు శాయాజీ రావు గైక్వాడ్ గారి సమక్షములో 1500 అడుగుల ఎత్తులో నడిపినారు. (Cited in "Annals of the Bhandarkar Oriental Research Institute") ఆతరువాత అది ఏదో యాంత్రిక లోపమువల్ల భూపతనమైనది.

ఈ మహా కార్యమును జీర్ణించుకోలేని బ్రిటీషు ప్రభుత్వము తమ విధేయుడైన రాజుగారికి ఈ

ప్రయోగమునకు ఆర్థిక సహాయము నిలిపివేయ ఉత్తరువులు జారీ చేసినారు. తల్పాడే గారు మతిస్థితము తప్పి జీవచ్ఛవమై మరణించగా, ఆపరిశోధనాంశములను విమానముతోకూడా పాశ్చాత్యులుకొని పట్టుకుపోయినారట. ఈ విమాన యంత్రము పనిచేయుటకు తగిన అయస్కాంత అణుసముదాయమును ఉత్తేజమొనరించుటకు సౌరశక్తిని ఉపయోగించినారు తల్పాడే గారు. నేడు NASA ఈ ప్రక్రియనే ఉపయోగించుచున్నదని చదివినాను. ఈ పరిశోధనకు అధికముగా ఆర్థిక సహాయమొనరించిన సాయాజి గయక్వాడ్ మహారాజు గారు బ్రిటీషువారి ముందు వంగి, వారి ఆదేశాములకు లొంగి, నిగికేగారవలసిన భారతీయ బావుటాను నేలను తాకజేసినారు. ఒక మహనీయుని నేలకొరగాజేసినారు. ఈ విమాన వాయుగమనమును చరిత్రకారుడు ఈవాన్ కోష్ట్క ( Evan Koshtka) ప్రశంసలతో ముంచుతూ, తల్పాడె ను (first creator of an aircraft) మొదటి విమాన సృష్టికర్తగా వర్ణించినాడు. పూణే నుండి వెలువడే 'కేసరి' అన్న పత్రికలో ఈ విషయాన్ని ప్రచురించినారట గానీ విమానమును ఎగురవేసిన తేదీ అందులో లేదట.

శిథిల మనస్కుడైన తల్పాడే జీవచ్చవమై 1916 లో తనువు చాలించినాడు. నాడంటె ఆంగ్లేయుల దురాగతములతో ఈయన గరిమను గానము చేయనీకున్నా నేడయినా ఈయన కీర్తికి కిరీటమును మనము ఆయనకు ధరింపజేస్తే ఆయన వారసులుగా, ఆయనకు కృతజ్ఞులుగా,మనలను మనము గుర్తించుకొన్నట్లవుతుందని నా నమ్మకము.

 తిరిగీ కలుద్దాము ......

భారతీయ శాస్త్ర విజ్ఞానము – 7

విమానముల గూర్చిన వివరములలోనికి పోయే ముందు మన సాంప్రదాయ సాహితీ మహామేరువులగు విశ్వ విద్యాలయములను అదలి గ్రంధాలయములను నాశనముచేసి విజ్ఞానమునకు మనల దూరము చేసిన విదేశీ రక్కసుల రాద్ధాంతమును చూద్దాము.

 

తక్షశిల

శ్రీరామచంద్రుని తమ్ముడగు భరతుని కుమారుడు నిర్మించిన నగరమైనందువల్ల ఈ నగరమునకు తక్క్షశిల అన్న పేరు వచ్చినదన్నది పురాణ ప్రసిద్ధము. తక్షుడు పునాదిరాయిని ఈ నగరానికి వేసినాడు కాబట్టి ఈ నగరము ఆ పేరు కలిగి యుండవచ్చు. ఈ నగరపు ప్రస్తాపన మస్త్య పురాణములో కనబడుతుంది. ధర్మజుని పురోహితుడు ధౌమ్యుడు ఇచ్చట ఆచార్యునిగా వుండినాడని వ్యాస భారతము తెలుపుతుంది. నేటి శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము క్రీ.పూ. 2550-2288 నకే ఈ నగరము వున్నదని నిర్ధారించినారు. శంఖున పడనిదే తీర్థము కాదుగదా!క్రీ.శ. 5 వ శతాబ్దము వరకు దేశీయ విదేశీయ రాజుల చేతులు మారినా ఈ నగరము సజావుగానే వుండినది.

క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో అలెగ్జాండర్ తన సైనిక పటాలములతో భారత దేశంలోని తక్షిలకు వచ్చినప్పుడు వారు అక్కడ గ్రీస్‌లో చూడని విశ్వవిద్యాలయాన్ని కనుగొన్నారు, ఇచట మూడు వేదాలు మరియు అష్టాదశ పురాణాలను, శడ్దర్శనాలను బోధించే వారు అని అలెగ్జాండర్ తెలుసుకొన్నాడు.   చైనీస్ యాత్రికుడు ఫా-హియాన్ దాదాపు AD 400లో అక్కడికి వెళ్ళినపుడు కూడా ఆవిశ్వవిద్యాలయము  ఉనికిలో ఉండేది".

క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.

ఇక ఇక్కడి గ్రంథములు బహుశ లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.

అసలింకొక ముఖ్యమైన విషయమున్నది. క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అల గ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన పశొధన ఫలితాన్ని బహిర్గతము చేయకుండియుంటే భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్న విషయము పుక్కిటి పురాణము ఆని తృణీకరించేవారు. ఎందువల్లనంటే అంతకు ముందువరకూ తృణీకరించినారు కాబట్టీ! దోచుకొన్న వారిని నమ్మినంతగా దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.

 

నలందా

నలందా తక్షసిల తరువాత అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయము. ఉన్నత విద్యార్జనకు దేశవాసులేకాక చైనా టిబెట్టూ,గ్రీసు, పర్షియా మొదలగు ఎన్నో విదేశములనుండి కూడా విద్యార్థులు వచ్చేవారు. 5వ శతాబ్దము మొదలు 12వ శతాబ్దము వరకు ఇది మత, సాంస్కృతిక, ఉన్నత విద్యార్జన కేంద్రము. దీని విస్తారము 14 హెక్టేరులు ( One Hectare = 100 acres or 10,000^2 mtrs). దాదాపు 7 శతాబ్దముల కాలము ఇది మెధోనిలయము. ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దిన్ ఐబాక్ యొక్క సైన్యాధిపతియైన భక్తియార్ ఖిల్జి నలందా మరియు విక్రమశిల విశ్వవిద్యాలయములను అగ్నికీలలకు ఆహుతి చేసిన దుర్మార్గుడు. వేనకువేల. అన్ని నెలలూ ప్రళయకాల మందు కళ్ళు పొడుచుకొన్నా కనిపించని కరి మబ్బులు కమ్ముకొన్నట్లు బీహారు ప్రాంతము వుండిపోయిందట. ఎన్ని లక్షల గ్రంథములు అగ్నికి సమిధలైనాయో చెప్పుట కష్టము. ఇవి కట్టు కథలు కావు చారిత్రిక సత్యములు. బౌద్ధ చైత్యములు,ఆరామములు ఎన్ని నాశనము చేసినాడో చెప్పుట కష్టము. ఈ విషయములను మనము సాంఘీక శాస్త్రములో పాఠ్యాంశముగా విన్నామా !

చారిత్రక ఆధారాల ప్రకారం నలందా విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీ.శ. 450 లో నిర్మించబడింది.

నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలము అనిఅర్ధం, కమలం జ్ఞానికి చిహ్నం) మరియూ ద (అంటే ఇవ్వడం) అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టింది. చైనా యాత్రీకుడైన హ్యూయన్ త్సాంగ్ నలందా పదానికి వివిధ వివరణలు ఇవ్వటము జరిగినది. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్ త్సాంగ్ రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు. కానీ ఈ రెండు వివరణలలో ‘నలంద’ అన్న పసము యొక్క వ్యుత్పత్తి తెలిసిరావటము లేదు.

తారానాధుడను చరిత్రకారుడీ స్థలమున శారిపుత్తుడను భిక్షువు జన్మించెననియు, నాతని చైతన్యమును జేరి అశోకుడు చక్రవర్తి యొక ఆలయమును నిర్మించెనని వ్రాసి యున్నాడు. హ్యూన్ ష్వాంగ్ అనునాతడు శక్రాదిత్యుడను రాజు నాలందాసంఘారామమును నిర్మించెననియు, ఆతనికి పిమ్మట రాజ్యమేలిన బుధగుప్త, తధాగతగుప్త, బాలాదిత్య, వజ్ర అనువారు లిచట అనేక భవనములను నిర్మించినారని వ్రాసియున్నాడు. అటుపై నింకొకరాజు ఈ ఆరామములచుట్టు నొక గోడను గట్టించి అందొక ద్వారమును నిలిపినాడట. ఇచ్చటి ఆచార్యులలో నాగార్జున, అశ్వఘోష, వసుబంధ, దిజ్ఞాగ, కమలశీల, సంఘభద్ర, శాంతరక్షిత, వీరదేవ, మంజుశ్రీదేవ మున్నగువారల పేరులు వినవచ్చుచున్నవి.

 క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీ ఆధ్వర్యంలో తురుష్కుల దోపిడీ సైన్యము అమానుషులు, క్రూరులు, విచక్షణా రహితముగా నలందను దోచుకున్నారు. వేలాది మంది సన్యాసులను సజీవ దహనం చేసినారు అంతేకాక  వేల మంది శిరచ్ఛేదము చేసిన నరరూప రాక్షసులు. అంతటి అతి గొప్ప గ్రంథాలయమునకు నిప్పు పెట్టినారు. అది పూర్తిగా పుస్తక సమేతముగా కాలి బూడిద అయ్యేవరకు అన్ని జాగ్రతలూ తీసుకొని సర్వనాశనము చేసినాడు. నలందాకు దగ్గరగా ఇప్పటికీ ఆ ఆటతాయినిని పేరుతో భక్తియార్ పూర్ అన్న పొగబండి నిలయము ఉన్నది. ఇది బీహారుకు సంబంద్ధించినది అగుటచేత ఆప్రభుత్వమునకు ఆ నికృష్ఠుని పేరుమార్చ ఆలోచన కలుగలేదు. అదే యోగీ ఆదిత్యనాథ్ గారయివుంటే ఈ పాటికి ఆపేరు మారియుండేదేమో!

ఇది చాలా క్లుప్తమైన వివరణ. అసలీ విషయముల నెందుకు చెబుతున్నానా అన్న సందేహము జిజ్ఞాసువు శ్రద్ధాళువు అయిన పాఠకునికి తప్పక కలుగుతుంది. నేను ఈ విషయాలను ఎందుకు చెప్పుకొచ్చినానంటే ఇటువంటి మహత్తర విజ్ఞానము, సంస్కృతి, సంస్కృత సంపద కలిగిన  పుస్తక మేరువు అగు గ్రంథాలయము మనకు ఉంది ఉంటే ఎన్ని క్రొత్త ఆవిష్కరణలు మన శాస్త్రజ్ఞులు చేసియుండేవారో! ఈ విధము చరిత్రకందకుండా వుండిపోయినవి ఎన్ని పోగొట్టుకొన్నామో,  ఎంత పోగొట్టుకున్నామో!

 ఈ విధంగా విద్యాలయాలనేకాక, గ్రంథములు గ్రంథాలయములను కుప్పలు తెప్పలుగా కాల్చి పారవేసినారు.కొందరు మహనీయులు ప్రాణాలకు తెగించి కాపాడిన గ్రంథములే ఇప్పుడు అందుబాటులోవుండేవి. అయినా ఈ సంస్కృత సాహిత్యము ఆంగ్ల సాహిత్యముకన్నా నేటికీ ఎక్కువే!

 

"సమరాంగణ సూత్రధార’ ‘యంత్రార్ణవము’ నాటి ఆవిష్కరణల యదార్థ దర్పణము. ఇందులో వాయుయాన విశేషములను అన్నికోణములలో పరిశీలించి విశ్లేషింపబడినది. ఒకవేళ దీనిని కల్పితగాధగా భావించితే ఇంతవరకు ఇంతకుమించిన కాల్పనిక గాధ ఎవరూ వ్రాయలేదు." అన్నాడు పాశ్చాత్య చరిత్ర కారుడు అండ్రూ థామస్.

ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944 “, లో " ఈ సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు. అసలు భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.

భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.

ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles Berlitz p. 123-124).

 మన ప్రియతమ నాయకుడైన అబ్దుల్ కలాం గారే ఈవిధంగా అంటున్నారు" ఆధునిక ఆవిష్కరణలకొరకు మన భారతీయ సాహిత్యము యువకులు తప్పనిసరిగా చదివి తీరవలెను."

ఈ విషయములన్నీ ఎందు వలన చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.

రామాయణ భారత భాగవతాది ఇతిహాస పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా! ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటే మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ బైబిల్ కాలములో ‘ఖురాన్’ వున్నదని గ్రంథాధారములతో చూపించగలరా!

మతాతీతంగా మనమంతా భారతీయులమే ! మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు అర్థమౌతుంది. అడిమనలో లేదు. నేటికీ గాంధీగారి సందేశమగు ‘ఈశ్వర్ అల్లా తేరో నామ్’ అన్న మాటను ముస్లీములు నేటి వరకూ ఉచ్చరించినది లేదు.

అసలు వేదములు వ్రాయబడనందువల్ల, మౌఖికముగా ఉదాత్త అనుదాత్త, స్వరిత యుతముగా పారంపరీకముగా అభ్యసించుటవలననే దుష్టుల బారిన బడక క్షేమముగా ఉండగలిగినవి. అనంతమైన వేదములనుడి ఎన్నో ఆవిష్కరణలలో ఎంతో స్పూర్తిని పొంది ఎన్నెన్నో శాస్త్ర గ్రంథములు రచించినారు మన పూర్వులు. ఇందులో సందేహము లేదు. అందులోని ఒక భాగమే పలువురు శాస్త్రజ్ఞుల కృషి ఈ విమాన శాస్త్ర గ్రంథాలు.

వారి మీద ఆ నమ్మకముతో నాకు తెలిసిన ,చదివిన,తెలుసులొన్న మేరకు మనవారి విమాన శాస్త్ర విజ్ఞానమును మీ ముందు వుంచుచున్నాను.

మిగిలినది మరొక మారు.....

భారతీయ శాస్త్ర విజ్ఞానము – 8

 గగన యానము

నిప్పు లేనిదే పొగరాదు కానీ పొగలేకున్నా నిప్పు వుండవచ్చు.ఈ దృష్టాంతము ఎందుకు చెబుతున్నానంటే హిమాలయము అన్న ఒక పేరును తీసుకొందాము. ఆ పేరు వింటూనే ఇంకా ఆ పర్వతమాలను చూడని శిశువు మనసులో పెద్ద పెద్ద మంచురాళ్ళు కలిగిన అపరిమితమైన ఎత్తుగల ఒక పర్వతమును వూహించుకొంటాడు . ఇక్కడ హిమాలయము వాస్తవము కానీ ఆ శిశువు వూహించిన విధముగా మంచురాళ్ళు వుండవు గానీ మంచు తో కప్పబడిన రాళ్ళు వుంటాయి. అది తాను వెళ్ళి చూసినవెంటనే వాస్తవము గ్రహించగలుగుతాడు. కాబట్టి విమానముల గూర్చి విననిదే విపరీతమైన ఊహలతో మన పూర్వులు భాగవత ,భారత, రామాయణాలలో , పురాణాలలో, శాస్త్రాలలో విమానముల గూర్చిన ప్రస్తాపన తెచ్చియుండరు. అందులోకూడా ఎన్నో విధములైన విమానములను గూర్చి విశధ పరచియుండరు. ఇందులోని నిజానిజాలను పరికించి, పరిశీలించి, పరీక్షించి, పరిశోధించితే వాస్తవము మనకు తెలుస్తుంది. భారతములో ధృతరాష్ట్రుని యొక్క సంతాన వ్యామోహాన్నిగూర్చి మనమెంతో ఈసడించుకొంటాము. కానీ మహాభారతములో ధృతరాష్ట్రుడు తనది తప్పని తెలిసినా తన సుతులపై వ్యామోహము చంపుకోలేక పోతున్నానంటాడు. అదేవిధంగా దుర్యోధనుడు తనకు దాయాది మాత్సర్యము తప్పని తెలిసినా తానది మానుకోలేనని చెబుతాడు. ఈ మాట ఎందుకు చెప్పుకువచ్చినానంటే మన పూర్వులు తప్పో ఒప్పో నిజానికే ప్రాధాన్యమునిచ్చేవారు అని తెలియ బరచుటకు. ఇంకొక విషయము గమనించండి.

ప్రసిద్ధ ఆధునిక గణిత శాస్త్రవేత్త యగు శ్రీనివాస రామానుజన్ తనచే తెలియబరుపబడిన ఎన్నో గణిత సూత్రములు, నామక్క ల్ నరశింహస్వామి దేవేరి నామగిరి తాయరు (లక్ష్మీ దేవి) తనకు నిద్రావస్థలో తెలిపినవే యని స్వయముగా తెలియబరచినారు.ఆ విషయమును వారి మాటలలోనే చదవండి "While asleep, I had an unusual experience. There was a red screen formed by flowing blood, as it were. I was observing it. Suddenly a hand began to write on the screen. I became all attention. That hand wrote a number of elliptic integrals. They stuck to my mind. As soon as I woke up, I committed them to writing."

 అనేకల్ అన్న ఊరికి చెందిన సుబ్బరాయ శాస్త్రి అన్న ఒక మహా పండితుడు భరద్వాజుని 'విమాన శాస్త్రాన్ని శ్రీ G.వెకటాచల శర్మ అను పండితునిద్వారా, తాను చెబుతూవుంటే, వ్రాయించినాడు కానీ ఆయన చెబుతూ పోయిన ఆ శాస్త్రము ఏకాలమునకు చెందినదన్న ఆధారము లేదని కొందరు పాశ్చాత్య అనుయాయులు పనికట్టుకొని ప్రచారము చేసినారు. రామానుజన్ గారు చెప్పినది నమ్మక తప్పలేదు ఎందుకంటె అవి గణిత పరముగా సాధింపబడినవి (ఇప్పటికీ సాధింపబడనివి కూడా వున్నాయనుకోండి). వైమానిక శాస్త్రములోని ఇబ్బంది ఏమిటంటే ఈ పాశ్చాత్య వ్యామొహకులకు సంస్కృతము క్షుణ్ణముగా తెలియదు. శాస్త్రములలో తెలిపిన సాంకేతిక పదముల తమ అనువాదమును యదార్థమునకు అనుసంధించుకోలేరు.ఈ సందేహాలన్నీ అందుకే!

 

అసలు విమానముల ప్రస్తాపన వేదములలోనే వస్తుంది.ఈ విషయము పరిశీలించండి.

యజుర్వేదము, 10:19

 ఓ నిపుణవంతుడైన అభియంత (Engineer)! శ్రేష్ఠులగు నిపుణులు నడపగల నావలను నిర్మించును. మేఘములు దాటి గగన తలము పై విహరించు విమానముల నిర్మించును. అటు నీటిలోనూ ఇటు గాలిలోను పయనించగల సాధనములను నిర్మించును. అవి మెరుపుల నడుమ కూడా పయనించగల శక్తిని ప్రసాదించు.ఏఏ భగవత్సృష్టిలో మమ్ము కీర్తివర్ధనుల గావించును.

వేదములలో

1. విమాన నిర్మాణ యానముల గూర్చిన ప్రస్తాపన వున్నది.

2. ఆధునిక సాంకెతిక విజ్ఞాన సంబంధిత విషయములెన్నో మనకు వానిలో కనిపించుతాయి.

3. భూమ్యాకాశ యుద్ధముల గూర్చిన వివరణ విశ్లేషణలెన్నో వానిలో అగుపించుతాయి.

4. నేడు మన శాస్త్రజ్ఞులు ప్రయత్నించేఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానసిక మరియు తాపసిక శక్తుల గూర్చిన వివరణలందులో ఎన్నో వున్నాయి.

5.గ్రహాంతర వాసులు.

6. గ్రహాంతర యానము.

7. గ్రహాంతర యానమునకు తాపసిక,వైజ్ఞానిక శక్తుల వినియోగము.

వంటి ఎన్నో విషయములు మనకు తెలుస్తాయి.

 వ్యాస భాగవతము 3.23.11 నుండి 3.23.41 ఒకసారి పరికించితే తన అర్ధాంగి దేవహూతి  కోరిక మేరకు కర్దమ ప్రజాపతి, ఆకాశ హర్మ్యమును తన తపో బలముతో నిర్మించి మేరు పర్వతమునందేకాక, వైశ్రంభక,సురాసన,నందన,పుష్పభద్రక,చైత్రరథ్య,మానస సరోవర ప్రాంతములన్నియును విహరించి ఆమెకు తృప్తిని కలిగించి అత్యుత్తమ సంతతిని పొందుతాడు.ఆమెతో గ్రహాంతర, లోకాంతర యానము గావించినాడు. ఆ విమానము యొక్క గుణములేవి యని పరిశీలించుదాము.

భ్రాజిష్ణున విమానేన

కామజ్ఞేన మహీయస

వైమానికాన్ అత్యాసేత్ l

చరన్ లోకాన్ యధానిలః ll

తాను కోరిన దిక్కునకు తన నియంత్రణలోని విమానమును పలు దిశల వీచు గాలివలె ఎన్నో లోకములు అంటే గ్రహములు, భార్యా సమేతుడై తిరిగినాడు.

ఇటువంటి విషయాన్నే త్రిపురాసురుల యందు కూడా గమనించుతాము. ఇక రామాయణమునందలి పుష్పక విమానమును గూర్చి మనకు తెలిసినదే. లంకకు సీతాన్వేషణమునకు వెడలిన హనుమంతుడు నవరత్న ఖచితమయమైన, ఇది భవనమా అన్నట్లున్న, పుష్పకమును చూసినట్లు వివరింపబడినది.

వైమానిక శాస్త్రములోని మొదటి ప్రకరణములో భరద్వాజుడు తన రచనకు ముందు వున్న, తాను పరిశీలించిన గ్రంధముల పట్టిక ఇచ్చినారు. అందులోని ముఖ్యమైన కొన్ని ఈ క్రింద ఉటంకించడమైనది. 1. అగస్త్య కృతాశక్తి సూత్రములు, ఈశ్వర (ఎవరన్నది నాకు తెలియదు)'సౌదామిని కలా, భరద్వాజుడే రచించిన అంశుబోధిని,శాక్తాయన కృతమగు 'వాయుతత్వ ప్రకరణమూ,నారదకృతమైన వైస్వానర తంత్రము మొదలైనవి.విమాన శాస్త్రమునకు టీక టిప్పణి వ్రాసిన బొధానంద్ గారు ఈ విధముగా తెలిపినారు:

నిర్మాత్య తద్వేదాంబుధిం భరద్వాజో మహామునిఃl

నవనీతం సముధ్గృత్య యంత్ర సర్వస్వ రూపకం ll

నానా విమాన వైచిత్ర్య రచనాక్రమ బోధకంl

అష్టాధ్యాయౌర్విభజితం శతాధికరణౌర్యుతంll

సూత్రిః పంచశతైర్యుక్తం వ్యోమయాన ప్రధానకం l

వైమానికాధికరణాత్సర్వం ముక్తంభగవతాత్స్వయం ll

'వేద సముద్ర మంథనము చేసి సామాన్య మానవునికి సులభముగా ఉపయుక్తమౌ రీతిన, యంత్రసర్వస్వమన్న వెన్నను అందునుండితీసి అందించినారు భరద్వాజులవారు. ఆ గ్రంథమునదలి 40 అధికరణమందున విమాన సంబంధిత విషయ ప్రస్తాపన జరిగినది. ఇది 8 అధ్యాయములుగా విభజింపబడినది.అందులో 100 అధికరణములు,500 శ్లోకములు విమానవిషయ ప్రధానమైనవే!

భారతీయ వైమానుక శాస్త్రమును గూర్చి ప్రాక్పశ్చిమ శాస్త్రజ్ఞులేమన్నారో చూడండి.

Johannes Adrianus Bernardus van Buitenen (21 May 1928 – 21 September 1979) was anIndologist at the University of Chicago where he was the Professor of Sanskrit in the Department of South Asian Languages and Civilizations. తన mahaa bhaarata Volume--3 లో The Razing of Soubha మరియు The War of The Yakshas ఈ క్రింది విధముగా రచయిత చేతనే వివరించ బడినది : "The areal city is nothing but an armed camp of flame throwers and thundering canon, no doubt a space ship అందులొనే నివత కవచములు అన్నపదమునకు space suits తప్ప అన్యము కాదని ఆయనే చెప్పినారు.

It is in the study of creativity that Indian science continues to be relevant .If students had access to authoritative narratives of Indian Science in the University, they would not pay attention to outlandish claims of ancient flying machines.

 -- Subhash Kak, Regents Professor of Electrical and Computer Engineering at Oklahoma State University and a Vedic Scholar

 మనస్పూర్తిగా మనపూర్వులను, వారి సత్య నిష్ఠను, వారి శక్తి సామర్థ్యాలను నమ్ముతున్నాను కాబట్టి నా శక్తికి మించిన ప్రయాసపడి ఈ పూర్వీక వైమానిక జ్ఞానాన్ని గూర్చి మరియు పూర్వుల గొప్పదనమునుగూర్చి నేటి తరానికి తెలియజేయవలెనన్న తపనతో వ్రాస్తున్నాను.సమయము వెచ్చించి చదివేది. విషయము 10 మందికి పంచితే ఏ ఒక్క విశేషజ్ఞుడైనా ఒక అడుగు ముందుకు వేసి పరిశోధించితే మన పూర్వుల జ్ఞాన సంపదనుగూర్చి లొకానికి చాటిన వారవుతారు.భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 9 లో విమాన శాస్త్రాన్ని గూర్చి ఇంకాస్త తెలుసుకొందాము....

మరికొంత మరొకమారు.........

భారతీయ శాస్త్ర విజ్ఞానము ...9

వైమానిక శాస్త్రము

 బొధానంద వృత్తి,శౌనక సూత్రములు. మణిభద్ర కారిక ఇత్యాది గ్రంథములలో 25 విధాల విమానాలున్నయని తెలిపినారు. ఇవి 'రాజ లోహ'మన్న లోహవిశేషము తో తయారు చేస్తారట. సౌమ సుందల మార్ధిక మన్న లొహములను 3:8:2 నిష్పత్తిలో కలిపి ప్రత్యేకమన శ్రద్ధతో అగ్ని కుండములో (Furnace) 272 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కాచి ఈ లోహమును తయారు చేస్తారట. ఈవిషయాలలో దేశవిదేశాలలో ఎన్నో ప్రయోగములు గుప్తముగా జరుగుచున్నవని తెలియవచ్చుచున్నది.

విమానపీఠమును రాజ లోహముతో తయారుచేయవలెన్నది పై శాస్త్రములందు చెప్పిన మాట. ఈ పీఠము యొక్క బరువు మొత్తము విమానపు బరువులో 1/100 వుండవలెనట. వెడల్పు విమానపు ఎత్తులో సగము వుండవలెని యున్నది. ఈ విమాన స్తంభమును హటకాస్య లోహముతో చేయవలెనని లల్లడు తన యంత్ర కల్పతరువులో వ్రాసినట్లు చెప్పబడివుంది. లోహతంత్రమను గ్రంథములో ఏ ఏ లోహ మూలకములకు నేవేవి మిశ్రణము చేయవలెనో ఇందుకు వాడవలసిన ప్రత్యేకమైన కొలిమి (Special Furnace) మరియు ఎంత ఉష్ణోగ్రత అవసరము అన్న విషయమును గూర్చి తెలుపబడినదట. ఇవికాక విమాన నిర్మాణమునకు వలయు విషయములెన్నో వివిధ గ్రంథములలో వివరించబడినది. కాబట్టి విమాన నిర్మాణము మన పూర్వులకు విశధముగా తెలియునని తెలియవచ్చుచున్నది.

ఇక విమానములలోని వివిధ విధములను పరిశీలించుదాము. విమానాలను పూర్వులు రెండు విధములుగా విభజించినారు.1. మాంతికము :ఇందులో 25 విధములగు విమానములున్నాయి అని సౌనక సూత్రములు చెబుతూవుంటే మణిభద్ర కారికలో 32 అని తెలుప బడింది. ఇక తాంత్రిక విమానములు భైరవాది 57 విధములు గలవని భరద్వాజులవారు చెప్పడము జరిగింది. నేను ఎక్కువ వ్రాసేకొద్దీ చదువరులకు శ్రద్ధ తగ్గుతుందని వ్రాయుట లేదు. ఒక మూడు నాలుగు తాంత్రిక విమానముల గూర్చి అతి క్లుప్తముగా వివరించుతాను.

1. శకునము: ఈ విమానమునకు 28 భాగములు గలవని విమాన శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏవన

 పీఠము(Floor Board) ; బోలు కంభము (Shallo Mast) ; మూడు చక్రములు కలిగి రంధ్రాలతో కూడుకొన్న కీలకములు ( hree wheeled keelakas,may be joints, with holes) ; 4 తాపకములు (Heaters) , వాయు చూషక నాళములు (air-suction pipes), జలావరణము (Water Jacket) , తైల భాండము (Oil Tank), వాయు తాపకము (Air Heater) , దాహకము (chhullee or Heater) , ఆవిరి భట్టీ(Steam Boiler), విద్యుదుత్పాదక యంత్రము( electric generator) , వాయు ప్రేరక యంత్రము (air propelling machine) , వాతపా యంత్రము లేదా వాయు చూషక నాళము (Air Succsion Pipe) , దిక్ప్రదర్శక ధ్వజము ( direction indicating banner), శకున యంత్రము (Sakuna Yantra, May be the main engine) , రెండు రెక్కలు( two wings ) , విమానము ఎగురుటకు వలయు తోక భాగము( tail portion for helping vimaana to rise), ఔష్మ్యక యంత్రము ( Thermodynamic mechanism ) సూర్య కిరణాకర్షణ యంత్రము ( sun-ray attracting bead)  ఈ 28 శకున విమానము యొక్క భాగములు.

2. సుందర విమానము: ఇది 8 భాగములను కలిగియుంటుంది. అవి

 పీఠము (ground plate), ధూమ్ర నాళము లేక ధూమోద్గత యంత్రము (smoke chimney),5 వాయు యంత్రములు( 5 gas-engines), భుజ్య లోహ (ప్రత్యేక పద్ధతిలో వివిధ మూల లోహ మిశ్రణముతో తయారు చేయబడుతుంది)నాళము (bhujya metal pipe), వాయు ఉత్పాదకము లేక కొలిమితిత్తి (wind blower), విద్యుతుద్పాదక యంత్రము (Electricity Generator) చతుర్ముఖ తాపోత్పాదన యంత్రము (four-faced heater) మరియు విమాన నిర్ణయము (outer cover). వీని పొడవెడల్పులనే కాక ఎత్తూ ఎంత వుండవలసినది తెలుపుతూ ఏదేది ఎక్కడెక్కడ ఏవిధముగా వుంచవలెనన్నది కూడా ముందుతెలిపిన గ్రంథములలో వివరించినారు.

3. రుక్మ విమానము

 పీఠ రుక్మ విమానస్య కూర్మాకారం ప్రకల్పయేత్

వితస్తిహసాయామం గాత్రమె కవితస్తికం

రుక్మము అనగా బంగారు. బంగారు ప్ధానముగ ఇంకా మరికొన్ని లోహ మిశ్రణములతో ఒక లోహమును తయారుచేసి దానిని రుక్మము యొక్క తయారీకి వుపయోగించుతారు. ఈ లోహమును రాజ లోహమన్నారు. రుక్మము అంతరీక్ష నౌక. ఇది స్తూపాకారము కలిగియుంటూ అండమును బోలియుంటుంది. మానవ చోదితము. తారాజువ్వ వలె ఆకాశమునకెగుస్తుంది. రష్యనులు మనిషి లేకుండా మన శాస్త్ర గ్రంథ సహాయముతో తయారు చేసి విజయము సాధించినారట. అతిపెద్ద అంతరీక్ష నౌకగా దీనిని తయారుచేస్తే ప్రయాణీకులను గ్రహాంతరసీమలకు తీసుకు పోగలుగుతుంది. మనుష్య రహితముగా చిన్నదిగా తయారుచేస్తే అస్త్ర వాహకముగా వుపయోగ పడుతుంది. ఆర్థిక సహాయము ప్రభుత్వ ప్రోత్సాహము లేక మన దేశమున మన పూర్వుల విజ్ఞానము అడవిగాచిన వెన్నెలయిపోయినది.

 త్రిపుర విమానము

మస్త్య పురాణము లో త్రిపుర విమానమును గూర్చి కూడా వర్ణించినారు. అంటే త్రిపురాసురులు ఆకాశములో హర్మ్యములు నిర్మించినారు శివుదు వారి పురములను యుద్ధములో కూల్చినాడు అని చదివియుంటాము. ఈశ్వరుడు ప్రయోగించిన అస్త్రములను నేడు మనము missiles అన్న పేరుతో పిలుస్తాము. ఇది ఒక అతిపెద్ద అంతరిక్ష నౌక. గగనములో చలనము లేకుండా నిలబదగలదు.ఏదిశలో పయనించవలెనంటే ఆ దిశలో ప్రయాణము చేయగలదు.

సౌభకము:

 ఈ సౌభక విమానము యొక్క ప్రస్తాపన సంస్కృత వ్యాస భారతములొవస్తుంది. భక్తి వేదాంత ప్రభురిల స్వామి వారు భాగవత పురాణమును ఉటంకించుతూ సౌభకమును గూర్చి ఈ విధముగా చెప్పినారు .

" సాళ్వుని యొక్క సౌభక విమానము , తపస్సు చే శంకరుని మెప్పించి, మయుని చే తయారు చేయబడి సాళ్వునిచే పొందబడినది. ఇది కొన్నిసార్లు అనేక విమానాలు గానూ కొన్ని సమయములసలేమీ లేనట్లుగానూ ఆకాశంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత అసాధారణ మైనది. కొన్నిసార్లుభూమిపై, కొన్నిసార్లు నీటి మీద తేలుతూ కొన్నిసార్లు ఆకాశంలోఎగురుతూ,కొన్నిసార్లు ఒక కొండ శిఖరం మీద విడిది చేసినట్లు యాదవులు చూసి భయభ్రాంతులైనారట. అద్భుతమైన ఈ విమానం ఆకాశము నుండి ఉల్కా పాతములను సృష్టించగలదట. అత్యంత చంచలమైన ఈ విమానము యాదవులలో అలజడి సృష్టించినదట."  (భక్తివేదాంత , 1986)

 పుష్పక విమానము:

దీనిని గూర్చి మనము రామాయణములో వింటాము. ఇది సుదూర ప్రయాణములు చేయగలిగినది. పుష్పకము అంటే పూలవలె బహు తేలికైనది అని అర్థము.అంటే దీనిని బహు తేలికైన లోహమును, వివిధ నిష్పత్తులలో మూల లోహముల కలిపి,తో తయారు చేసినారెమో! బహుశ దీనికి విస్తరించే స్వభావము వుడేదేమో!అంటే ఇది స్థితిస్థాపకత (Elasticity) కలిగియుంటుందన్నమ్మాట. అందుకే ఈ విమానమునెందరు అదిరోహించినా ఇంకా ఒక్కరికి స్థలము వుంటుందని రామాయణమున చెప్పబడినది.

 నాకు తెలిసిన, తెలుసుకొన్న మేరకు తెలియబరచినాను. మన పూర్వుల గొప్పదనము గుర్తించండి. మీరు తెలుసుకొంటే మీ పిల్లలకు చెప్పగలరు. వారిలోనుండి ఏ శాస్త్రజ్ఞుడో బయల్వెడల వచ్చు. దీనిని వ్రాయుటకు నాకు దాదాపు 10 రోజులు పట్టింది. పది నిముసములు వెచ్చించి మన పూర్వ చరిత్రను తెలుసుకొండి. మన అపూర్వ సంపదను గుర్తించండి.

ముక్తాయింపుగా ఈ వాక్యములను చదవండి. ప్రతి దేవాలయములోనూ దేవతా విగ్రహము వుంటుంది. ఆప్రదేశమును గర్భగుడి అంటారు. ఆ గర్భ గుడి గోపురమును విమాన గోపురము అంటారు. మీరు గమనించితే తిరుమల విమానగోపురముపై ఎందరో దేవతల విగ్రహములను చూడవచ్చు. ముఖ్యముగా విమాన వెంకటేశ్వర స్వామిని గుర్తించుటకు వీలుగా బాణపు గుర్తును గూడా వేసియుంటారు. పైన తెలియ బరచిన విమానములలో ముఖ్యముగా 'రుక్మము' ఈ గోపురాకృతిలోనే వుంటుంది. దీనివల్ల  దేవతా  విమానములుండేవని మనకు ఒక ఊహ కలుగుట లేదా!

లేవండి- మేలుకోండి- అపూర్వ ఘనతగల మన పూర్వులను గుర్తించి దేశానికి పునర్వైభవము గొనిరండి.

 కొన్నిరోజుల తరువాత మనపూర్వుల యొక్క వేరొక ఆవిష్కరణను గూర్చి తెలుసుకొందాము.

 దిగువ కనబరచిన చిత్రముల వరుస ఈ ప్రకారముగా వున్నది: పుష్పకము 2. శకునము 3.రుక్మము 4. సౌభకము 5. సుందరము 

మిగిలినది మరొకమారు.......

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 10

  (లోహశాస్త్రము)


[RV=ఋగ్వేదము; AV=అధర్వణ వేదము; VS= వాజసనేయ సంహిత KS = కటక సంహిత TS = తైత్తరీయ సంహిత; SB=
 శతపద బ్రాహ్మణము]  


వేద సమాజం
 సిరిసంపదలతో తులతూగుచుండినారు. వేద కాలపు మహిళలు బంగారు మరియు వెండి ఆభరణాలు ధరించేవారు.  రత్నమయ ఆభరణములు విరివిగా ఉపయోగించేవారు.  సహజంగానే మహిళలు ప్రతి ప్రత్యేక సందర్భములోనూ బంగారు ఆభరణాలు ఇప్పటికీ ధరించుతూనే వున్నారు కదా!.  స్వర్ణాభరణముల ఉనికి వేదకాలమునుండి ఉండినా ఆభరణాలు వివిధ రకాల ఆధారాలు క్రీ.పూ. మూడో శతాబ్ది నుండి అందుబాటులో ఉన్నాయి. ఎంతో ప్రాచీన దేయాలయ కుడ్యములపై గల భారతీయ శిల్పాల యొక్క అంగాగమూ ఆభరణ భరితమైయున్నట్లు మనము చూస్తూనేవున్నాము. కానీ మనము నాటి గ్రీకు దేవతా విగ్రహములను చూస్తే వారి శరీరములపై  ఆభరణములసలు కనిపించవు. సుమేరియన్ మరియు బాబిలోనియన్ విగ్రహాలు చూస్తే ఆభరణాలు వారి మేనిపై ఆభరణాలతి తక్కువగా కనిపిస్తాయి. కేవలం ఈజిప్టు  మహిళలు, హిందువులు వంటి కొన్ని ఆభరణాలు ధరించేవారు. బహుశా వారు ఆభరణాలను బహుశ  భారతదేశం నుండి దిగుమతి చేసుకొని యుంటారు. అదియును గాక భారత చరిత్ర భాస్కరుడు మహావిమర్శకాగ్రేసర బిరుదాంకితులు అయిన కోట వెంకటాచలముగారు తమ గ్రంథములలో మనదేశము నుండి ఎందరో ఈజిప్టు కు వలస వెళ్ళినట్లు బహుళముగా తెలిపియున్నారు. కాబట్టి ఈ స్వర్ణా భరణ కళ మనదేశమునుండి దేశాంతరములు వెళ్ళినట్లు నిశ్చముగా చెప్పవచ్చును. అసలు ‘ఈజిప్టు’ అన్నది ‘అజపథము’ అన్న మాటకు రూపాంతరము. ‘అజుడు’ శ్రీరామునికి పూర్వుడు మరియు ‘అజ మహారాజు’గా సుప్రతిష్ఠితుడు. కావున ఆకాలముననే భారతీయులు ఆదేశమునకు వలస వేల్లియుంటారు అన్న మాటకు ‘అజపథము’ ఎంతో పుష్టిని చేకూర్చుచున్నది.


ఒకసారి వేద మూలాలు ఏమంటున్నాయో తెలుసుకొందాము.

 

ఋగ్వేదము లోని శ్రీసూక్తము బ్రాహ్మణులలో చాలామందికుటుంది. It is one of the oldest extant texts in any Indo-European language (మన సంస్కృతమునకు వారు పెట్టుకొన్న ముద్దుపేరు), అని వికీ పీడియా లో వుంటుంది.అంటే దానిలో చెప్పినవి వేదము బహిర్గతమయ్యే కాలమునకు అందులో ఉటంకించినవి వున్నట్లేకదా! వేదము అపౌరుషేయము మరియు మౌఖిక విధానముననుసరించి వచ్చినది. కాబట్టి అందులో తెలిపిన హిరణ్య,సువర్ణ,చంద్రా, ఇవన్నీ బంగారునకు మారుపేర్లుగా వేదమున ఉటంకించ బడినదని మనకు సులభముగా అర్థమౌతుంది.ఋగ్వేదములో ఇది జాతరూపముగా గూడా వర్ణింపబడింది.


 భూమి నుండి బంగారు ను  వెలికితీయుటను గూర్చి ఋగ్వేదములో విరించ బడినది (RV 1-117-5; AV12-1-6; 12-1-26; 12-1-44). బంగారం శుభ్రపచడమును గురించి  తైత్తిరీయ సంహిత (TS 6-1-71-) మరియు శతపథ  బ్రాహ్మణములో  (SP 2-1-1-5) లో పొందుపరచబడి వున్నాయి. బంగారు  నది ఒడ్డులవద్ద పారంపరిక విధానముతో బంగారును గట్టును ఒరుసుకు పారే నది నుండి గ్రహించేవారు. అందుకే Indus ను హిరణ్మయమని  RV(10-75-8) సరస్వతిని హిరణ్యవర్తిని అని కూడా పిలిచేవారు (AV 6-61-7).ఈ విషయమై స్వానుభవమొకటి చెప్పదలచుకొన్నాను.

నాబాల్యము కడప జిల్లా ప్రొద్దటూరు యందు గడచినది. చరిత్రకు అందని కాలము నుండి ఈ ఊరు బంగారుకు ప్రసిద్ధి. పూర్వము ఊరికి చివర దక్షిణ దిశన ‘గవిని’ అన్న పేరుతో పెద్ద ద్వారబంధముతో ఎత్తుగా ఒక పెద్ద మండపము కట్టించేవారు. దానిని దాటినా తరువాత ‘పంచములు’ ఉండేవారు. ‘పంచములు’ అంటే నేడు మనము తలచే ‘మాల’ ‘మాదిగ’ అన్న వర్ణముల వారు కాదు. బ్రాహ్మణా క్షత్రియ వైశ్య శూద్రులలో వివిధ విధముల పౌనఃపున్యములతో (Permutations and Combinations) పెళ్ళిళ్ళు జరుపుకోన్నవారిని, గ్రామ, ప్రాంత, పట్టాన, దేశ బహిష్కరణలు, నాటి నిబంధనలననుసరించి, శిక్షలుగా విధించేవారు. వారిని ‘పంచములు’  అన్నారు. అట్టివారు ఆ ‘గవిని’కి బయట నివశించేవారు. వారి వృత్తి ధర్మములో ప్రవాహము ఒడ్డున ఉండి అందలి ‘ఒండు’ నుండి బంగారు కణములను వెలికి తీసేడి ఒక భాగము. ఊరిలో బంగారు పనిచేసేవారు తమ నెలవును శుభ్రపరచే విధానములో, ఆ దుమ్మును బయట పారవేస్తే, దానిని ఊరిచివర ప్రవహించి పెద్ద కాలువలో కలిపేవారు. అందువల్ల   ఆ ఊరిని అసలు ‘పేట’ అనేవారు. పేట అన్నది నగరము కన్నా చిన్నది సాధారణమగు ఊరికన్న పెద్దది. నేడు ఇచట ఆ పెద్దదగు పంట కాలువ లేదు, ఆవిధముగా బంగారు తీసేవారూ లేరు.

అంటే పూర్వము ఉన్న ఇటువంటి చిన్న చిన్న నైపుణ్యతలు కలిగి ప్రజలు తమ జీవన భృతిని సంపాదించుకొనే వారు. నేడు అందరికీ ఊడిగము చేయు ఉద్యోగములే శరణము.

 ఆభరణ స్వర్ణమును హిరణ్యము అంటారు(RV 1-122-2; VS 15-50))

కటక  సంహిత  (KV 11.2) మరియు తైత్తిరీయ సంహితలో లో బంగారు తూనిక రాళ్ళను అష్టప్రదలు అని అంటారని తెలిపినారు.

 ఖనిజమును బంగారు చేయబడుతుందని శతపథ బ్రాహ్మణములో (SB 6-1-3-5,12-4-3-1) బంగారును ఖనిజము నుండి తగిన ఉష్చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య పిండములు) బ్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(RV6-47-23)చెప్పబడినది. ఒక్కొక్క ఆవు కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత ప్రతిభాశాలియైన వేదజ్ఞునకు దానముగా ఇవ్వబడినదని   బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినది.

 ఖనిజమును బంగారు నుండి తీయబడుతుందని నుండి శతపథ బ్రాహ్మణములో (SB 6-1-3-5,12-4-3-1) చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య పిండములు) బ్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(ఋవ్6-47-23)చెప్పబడినది. ఆవు కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత ప్రతిభాశాలియైన వేదజ్ఞ/వేదాంతికి ఇవ్వబడేదని   బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినది.దానిని జనకుని నుండి యాజ్ఞవల్క్యుడు గ్రహించినట్లు కూడా చెప్పబడినది.

రామాయణము ఆది కావ్యమన్నది జగమెరిగిన సత్యము. మనము వినే రామాయణము ఈ మన్వంతరములోని 24 వ మహా యుగమునందలి త్రేతాయుగమున రావణుని తపః ఫలము క్షీణదశకు వచ్చినపుడు దశరథాత్మజుడైన రాముని అవతరణము జరిగినట్లు వాయుపురాణము చెప్పుచున్నది.

 త్రేతాయుగే చతుర్వింశే రావణాస్తపసః క్షయాత్ l

రామం దాశరథిం ప్రాప్యా సగణాః క్షయమీయవాన్ ll

 అది కాదు  ఈద్వాపరమునకు ముదటి త్రేతాయుగమని మాటవరుసకు అనుకొన్నననూ 8,64,000 సంవత్సరములు (ద్వాపర యుగ పరిమితి) జరిగి  పోయినట్లే.మరి సీతమ్మ వదిలిన ఆభరణములు స్వర్ణసీత అంతా బంగారు మయమే కదా. ద్వాపరములో జరిగిన భారత ఇతిహాసములోని సభాపర్వములో ధర్మజుని రాజసూయమునకు వచ్చిన ఆహూతులలో దక్షిణాది నుండి వచ్చిన చోళ పాడ్యులు మణిరత్న ఖచిత స్వర్ణాభరణములు కానుకలుగా ఇచ్చినట్లు  చెప్పబడియుంది. ఖడ్గపు ఒరలు బంగారుతో చేయబడి వజ్రముల తాపడము కలిగియుండేవి కానుకలుగా ధర్మజునికి సమర్పించినారట వివిధ దేశాధీశులు. 

కావున  బంగారు వినియోగము ఆభరణ రూపములో ఉపయోగించుట ఈ దేశమున ఎన్ని లక్షల సంవత్సరముల కాలము నుండి వాడుకలో ఉన్నదో గమనించండి. అసలు గ్రీకులు ఈ స్వర్ణాభరణ  విద్యను మనదేశము నుండి స్వర్ణకారులను తమదేశమునకు గొంపోయి వారు నేర్చుకొన్నట్లు 'శ్రీ పోకాక్' గారు వ్రాసిన INDIA IN GREECE అన్న గ్రంథము ద్వారా మనకు తెలియవచ్చుచున్నది. కాల క్రమమున ఈ విధముగా పోయిన వారినే వారు PAGONS అన్నారు.

దేశముపై గౌరవము భక్తి కలిగినవారు మాత్రమే ఇట్టి విషయములను చది తెలుకొన గలుగుతారు.

మిగిలినది మరొకమారు........

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 11

ఇంతే కాకుండా రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన 'ఆర్య నాగార్జునుడు'అనిపించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివసించినాడు.అందుకే ఈ పర్వతానికే ’నాగార్జున కొండ’అనే పేరొచ్చినది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .
కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .


ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించినాడు,
‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’ కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు.
 వేమన కూడా రసవిద్యనెరిగినవాడని అంటారు. కానీ నాగార్జునుడు ఆయనకు చాలా పూర్వీకుడు.


ఫై విషయముల వల్ల మనకేమి తెలుస్తూవున్నదంటే మనవారికి వేదకాలములోనే బంగారు ఖనిజము వెలికితీయుట గానీ, వెలికి తీసిన ముడి బంగారునుండి ఆభరణములు చేయుటగానీ , దానమునందు బనాగారునొసగుటగానీ, ద్రవ్యముగా బంగారు కాసులను ఉపయోగించుటగానీ లక్షల
 ఏంద్ల క్రితమే తెలియునని తెలియవచ్చుచున్నది. కానీ Google పరిశోధనను ఆశ్రయించితే మనకు ఈ విధముగా అర్థముతుంది:

In ancient Egypt, around the time of Seti I (1320 B.C.), we find the creation of the first gold treasure map now known to us. Today, in the Turin Museum is a papyrus and fragments known as the "Carte des mines d'or." It pictures gold mines, miners' quarters, road leading to the mines and gold-bearing mountains, and so on.
The first use of gold as money occurred around 700 B.C., when Lydian merchants produced the first coins.(http://onlygold.com/Info/History-Of-Gold.asp)

కేవలము ఆ కాలమునాటి బంగారు నాణెములు వస్తురూపములో కనిపించని నేరానికి మనదేశమును వెనుకకు నెట్టుటలొ ఎంత ఈర్ష్య దాగుందో గమనించండి. నిజానికి అసలు Egypt కు పూర్వనామము 'అజ పథము'. శ్రీరామచంద్రునకు పూర్వుడగు అజమహారాజు నిర్మించిన నగరమగుటచే ఆ నగరమునకాపేరు సార్థకమైనది. మరి అది మన మహారాజ పరిపాలనలో ఉన్నపుడు ఇచ్చటి వస్తువులు ఆచార వ్యవహారములు లోహములు ఆభరణములు అచటికి చేరుటలో ఆశ్చర్యమేమున్నది.

లోహశాస్త్రము - వెండి

ప్రాచీన కాలపు నాణెములు వెండితో తయారుచేయబడుచుండినవని చారిత్రిక పరిశోధకులు 

కనుగొన్న తరువాత మన దేశమున వెండి ఎంత పురాతన కాలమునుండి అంటే క్రీ.పూ.1 వ 

శతాబ్దము నుండి, ఉపయోగింపబడుచుండినదన్న విషయము మనకు అర్థమౌచున్నది. ఖగోళము 

జోతిషము ఒకటే అన్ని పాశ్చాత్యులు అనుకొనే కాలమునకు ఎన్నో వేల సంవత్సరములకు పూర్వమే 

అవి వేరన్న శాస్త్ర సంపద మనది. గ్రహములను తెలియబరచినది మనవారు. ఆ గ్రహములకు  ఏ ఏ 

లోహములు ప్రీతికరములు అని తెలిపినది మనవారు. ఆ విధముగా వెండి చంద్రునకు ప్రీతికరమని 

తెలిపినారు. ఆయన వెన్నెలరాజు. వెన్నెల వెలుగు వెండివలేనే ఎంతో తెల్లగా ప్రకాశవంతముగా 

వుంటుంది కదా! పైగా వెండికి రజతము అని పేరు. బంగారునకు మహారజతమని పేరు. అంటే 

అసలు వెండిబంగారుకన్నా ముందు పుట్టినదనే కదా! నిగూఢమైన నాటి ఈజిప్టు రాజకళేబరముపై 

కనిపించే వెండి బంగారు నగలు హిందూ లోయ నాగరికతకు చెందినవని చరిత్రకారులు తమ 

పరిశోధనల మూలముగా తెలియబరచుచున్నారు. ఇంతకూ మించిన సాక్ష్యాధారాలు వేరేమి కావలె. 

చాణక్యుని అర్థ శాస్త్రమును పరిశీలించితే మిగత లోహములతో బాటూ వెండివాడకమును  

గురించికూడా మనము తెలుసుకొనగలము.

మిగిలినది మరొకమారు........

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 12

లోహ శాస్త్రము - రాగి (తామ్రము)

కౌటిల్యుని అర్థ శాస్త్రం లోనే రాగి గనులు, రాగి పరిశ్రమల గురించిన ప్రస్తావన ఉంది. ఇది రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్ లలో అధికంగా లభిస్తుంది. అసలు రాగిని గూర్చిన ప్రస్తాపన ఋగ్వేదము లోనే వస్తుంది. మరి రుగ్వేదకాలమును ఎవరు నిర్నయించవలె.కీస్తుకు పూర్వము 6500 నుండి 5500 సంవత్సరములకు మధ్య కాలము లో ఆధార పూర్వకముగా రాగి వాడకమును గూర్చి మనకు తెలియవస్తుంది. బోలన్ కనుమలకు దగ్గరగా దక్షిణ సింధునదీ ప్రాంతములో క్వెట్ట, కళాత్, సిబి ప్రాంతములకు మ్న్డుమన వున్న మేహ్ర్రాఘర్ అన్న వూరిలో 1974 లో 6 దిబ్బలు బయల్పడినాయి. వానినుండి 32000 కళాఖండాలు బయల్వేడలినాయి. అందులో మరీ చిన్నది కానట్టి వ్యాసము కలిగిన స్థూపాకారములో వున్న రాగి కోవు దొరికింది. మరి దానికి ముందే రాగి వాడకమున్నట్లు మనకు ఆయుర్వేదము ద్వారానూ పురాణముల ద్వారానూ తెలియవచ్చినా పాశ్చాత్యులకు చూపుటకు ఆధారములు లేవు. అది మన విధి. అసలు ఈ వస్తువు దొరకకుంటే మనకు అసలు రాగిణి గురించి తెలియనట్లే! అసలు ఇత్తడి, కంచు 

మనదేశములోనే మొదట తయారయినది. కంచు గంటలు పురాతన దేవాలయములలోనివి ఎప్పటివి అన్నది, విదేశములలో ఎప్పటినుండి వున్నాయి ఆనదీ తెలిపితే మన ఆలయాలు అంతకు ముందువైతే , కొన్నయినా ఆ కాలమునకు చెందినవి ఉంటాయికదా . ఇతి ఘంటానాదం కృత్వా' అన్న దేవతార్చన మంత్రమే ఉన్నదికదా!

లోహ శాస్త్రము - సీసము

అసలు మన ఋషులు బంగారు,వెండి. రాగి, సీసము,యసదము, పాదరసము ఆయుర్వేదమునండు ఉపయోగించుట మనకు తెలిసినదే. అవి నేటికీ వాడబడుచున్నవి.మరి ఈ ఆయుర్వేదము ఎన్ని వేల, లక్షల సంవత్సరముల నాటిదని నేటి చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పగలరా! సీసపు నిక్షేపములు  గుంటూరు లోని దూమెట్ట, బండ్లమేట్టులలోనూ, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, మామండూరులలో కలవు.  సీసము turky లో మొదట, క్రీస్తు పూర్వము 6000 లో దొరికినదని చెబుతారు. కానీ ఇది చదవండి.

Historians generally agree that the first Turkic people lived in a region extending from Central Asia to Siberia. Historically they were established after the 6th century BCE. ( wikipedia )

 

మరి దీనిని వాస్తవముగా తీసుకొంటే ఈ దేశమును నివాసముగా ఏర్పరచుకోన్నవారు తమతో బాటు సీసము తెచ్చుకోన్నారనుకోవలేనా! అసలు ఈ విషయము ఎందరికి తెలుసునో నాకుతెలియదు. సీసపు పాత్రల ఖరీదు చాలా ఎక్కువ. ఖాళీ పాత్రను వెలిగించిన పొయ్యి పైన పెడితే పాత్ర కరిగిపోతుంది. ఈ పాత్రలో చారు ( ఆధునికులు రసము అంటారేమో!) పెడితే అమితమైన రుచి వస్తుంది. అనుభవము అధికముగా వుంటేనేగాని ఇటువంటి విషయములు తెలిసిరావు.

 

లోహ శాస్త్రము - యశదము

The metal using cultures appeared in the Indian sub-continent around 6th millennium BCE. Subsequently, copper metallurgy is well attested to at various sites by the 4th millennium. Besides copper-bronze, these ancient societies were also aware of various other metals like gold, silver, tin. Even deliberate production of iron goes beyond the 1st millennium BCE. Compared to the great antiquity of these metals, in a historical perspective, regular production of zinc and brass and distillation of zinc is very late. (  by J.S. Kharakwal, PhD )

దీనిని బట్టి యశదమును వేరుపరచు విదానము మనకు ఎంత పూర్వమునుండి తెలుసునన్నది తెలియుచున్నది. 

యశదమును ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ దేశములలో ఎవరికీ తెలియని కాలములోనే మనకు తెలుసు. యశదము(zinc)ను ఖనిజము నుండి వేరు పరచు విధానము మన వారికి మాత్రమె 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము ఒకసారి గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో ద్రవీభవించుతుంది.అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది. అంటే  ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ పరివర్తన జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి పట్టి లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో, సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని శీతలీకరణ విధానముతో  దానిని యశదముగా మార్చుతారు. ఈ లోహమును శుభ్రపరచు విధానము మన వారలకు తప్ప ప్రపంచములో వేరెవరికీ తెలియదు. మననుండి ఒక చైనీయుడు సంగ్రహిస్తే వానినుండి విలియం ఛాంపియన్ అన్న ఒక ఆంగ్లేయుడు గ్రహించి మొదటి సారిగా 1543 సంవత్సరములో యశద సంబంధ కార్మాగారమును తమ దేశములో నెలకొల్పినాడు. కంచు తయారికి అత్యంత మూల పదార్థము యశదమే. ఇది రాజస్తాన్ లోని జవార్,రాజపుర-దరిబ(375 BC) మరియు రాంపుర-అగుచ (370BCE) ప్రాంతాలలో అధికముగా ఈ నిక్షేపములున్నట్లు చరిత్రకారులు తెలుపుచున్నారు. యశదమును ఉపయోగించకుండా  కంచు (కాంశ్యము) ఇత్తడి (ఋతిక) లను తయారుచేయలేరు. మరి వీనిని మొదట ఎవరు తయారు చేసియుంటారురాజస్థాన్ లోని ఉదయపూర్ కు సమీపమున నున్న Jawar Mines లో మన పూర్వీకపద్ధతిలో ఏవిధముగా యశదమును తీస్తారో చదవండి.

Ancient Zinc Retort Furneces at Jawar mines, Near Udaipur (Rajasthan)

The production of metalic zinc was discribed in the Rasarnava written around 1200 A.D.

The 14th century work Rasaratnasamuchchya describes how the tinlike metal was made.

Calamine was heated indirectly with charcoal to around

1000 degrees Centigrade in a covered cubical fitted with a condenser. Zinc vapou was evolved and the vapour was aircooled inthe condenser located, in the image posated, below the refractory cubicle. 

(Courtesy: https://pt.slideshare.net/prchandna/indian-zinc-metallurgy-2)

మిగిలినది మరొకమారు........ 

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 13

లోహ శాస్త్రము - పాదరసము

 

పాదరసము కూడా లోహము.ఇది చంచల స్వభావము కలది, మనుషుల మనసుల మాదిరి. ఈ ధాతువును ఆయుర్వేదములో ఎంత కాలము నుండి మనము ఉప్యోగించుచున్నామో ఎవరూ లెక్క కట్టలేదు. పాదరసమును గూర్చి మన ఋషులు పరిపూర్ణముగా దాని ఉపయోగాములను గూర్చి కూడా తెలుసుకొని దానిని ఆయుర్వేదములో కూడా ఉపయోగించుతూవుంటే , 17 వ శతాబ్దము వరకు అదేమిటో తెలియదు పాశ్చాత్యులకు. తెలిసిన తరువాత వారు పెట్టుకొన్న పేరు Quick Silver . అంటే వెండి రంగులో భూతలము పై బడితే పారాడుతూవుంటుంది కాబట్టి. ఫ్రాన్సు ప్రభుత్వము భారత దేశము నుండి వచ్చు రస ఔషధములు (Medicins made of Mercury) విరివిగా అవసరమైన వ్యాధులకు వాడమని ఆ కాలములో చట్టమే అమలుచేసి యుండినారు.

మన పూర్వులు అనేక వేల సంవత్సరములనుడి రస విజ్ఞానము కలిగి యున్నారు. దీనిని విమాన నిర్మాణములో కూడా వాడేవారని ముందే చెప్పుకొన్నాము. భోజరాజు కాలములో దీనిని విమాన చోదనమునకు వాడేవారని చెప్పుకొంటారు. ఇక ఆచార్య నాగార్జనుని గూర్చి స్వర్ణమును గూర్చి తెలుపునపుడే తెలియబరచినాను. జటిలమైన Psoriyasis లాంటి వ్యాధులకు రాసౌషధ చికిత్స అత్యంత ఉపయోగకరము.

గొప్ప పండితుడు, బహుభాషా కోవిదుడు అయిన అల్బరూని పర్షియన్ దేశస్తుడు, కానీ ఘజ్నవీ సంస్థానము (ఆఫ్ఘనిస్తానములో ) నిలిచిపోయినాడు, ఈయన భౌతిక , గణిత, ప్రకృతి శాస్త్రములందు దిట్ట. ఈయన 11వ శతాబ్దములో వ్రాసిన  'తారిక్-అల్- హింద్ (History of India ) లో ఈ విధముగా పేర్కొన్నాడు " పాదరసము ఉత్పత్తి, ఉపయోగము లను గూర్చి వీరికి తెలియనిది లేదు" అని మనదేశపు ప్రతిభను ప్రపంచమునకు పరిచయము చేసినాడు.

 ఇనుము-ఉక్కు

 కుతుబ్ మీనారు ప్రక్కలో యుండే గుడి యొక్క ఉక్కు ధ్వజస్థంబము ఎప్పటిదో తెలియని (కొందరు 1600సంవత్సరములంటారు గానీ ఋజువులు నేను చదవ లేదు.) కాలము నుండి నేటివరకు త్రుప్పుపట్టలేదు.నేడు కూడా ఢిల్లీ కాలుష్యము ఎంత ప్రయత్నించినను ఆ స్థంబమును ఏమీ చేసుకొనలేకయున్నది. ఇది ఎక్కువ మందికి తెలిసినదే , కానీ కర్ణాటకలోని కొల్లూరు లో  2400 సంవత్సరముల క్రితము ఆది శంకరాచార్యుల ఆగమన జ్ఞాపికగా,ఆవూరి శాస్త్రజ్ఞులో మేధావులో కాదు, మస్త్యకారులు నిలబెట్టిన స్థంబము , 750 c.m. వర్షము  ఒకసంవత్సరములో 6-8 నెలలు పడుతూ వున్నా చిలుము (త్రుప్పు) పట్టక మనపూర్వీకుల ప్రతిభకు ప్రతీకగా తలఎత్తుకొని నిటారుగా నిలిచియుంది.

కాశీ ఖండమయః పిండం అన్నారు మన పూర్వులు. మరి అయస్ అంటే ఇనుము లేక అందునుండి వచ్చిన ఉక్కే గదా! అయః+కాంతము = అయస్కాంతము అంటే ఇనుమును ఆకర్షించునది అనియే కదా అర్థము. మరి ఈ శబబ్దముల పుట్టుక భారతదేశమున , సంస్కృతమున ఎప్పుడు పుట్టినవో తెలుసుకొంటే ఇనుము ఈ దేశమున ఎంత పురాతనమైనది అన్నది తెలుసుకొనవచ్చును. ఋగ్వేదమున, ఆయుర్వేదమునకు ఆది పురుషులగు అశ్వని దేవతలు కృత్రిమముగా మోకాలును, యుద్ధములో పోగొట్టుకొన్న విస్ఫల అన్న రాజుకు, అమర్చినట్లు మనకు తెలియుచున్నది. మరి ఋగ్వేదము ఎప్పటిది అన్నది ఎవరూ ఇంతవరకు తేల్చలేని విషయము.

RV 1.117.11

Hymned with the reverence of a son, O Asvins ye Swift Ones giving booty to the singer,

Glorified by Agastya with devotion, established Vispala again, Nasatyas.

As legend has it, the Asvin twins appear and help restore Vispala’s leg with an artificial limb perhaps made from iron or copper/bronze. The “operation”, if one can call it that was performed in time that Vispala could move BEFORE the conflict opened (presumably the next morning).

ఖగోళ, భూగోళ,ప్రాకృతిక, భౌతిక, శాసన, వ్రాతమూలక పరిశోధస్నాల ద్వారా భారతయుద్ధము క్రీస్తు పూర్వము 3139 లోనూ  కలియుగము క్రీస్తు పూర్వము 3012 లోను ప్రారంభమైనదని ఘంటా పథముగా నిర్ణయించ బడినది. మరి ఆ యుద్ధములో వాడిన ఆయుధములు అనగా బాణములు బల్లెములు, గదలు మరి ఇనుము ఉక్కు తో కాక దేనితో తయారు చేయబడినట్లు. మరి ఇంతటి పూర్వ చరిత్ర మరి యే ఇతర దేశములకైనా  మతములకైనా ఉన్నదా! మరి లేనపుడు వారెందుకు మన చరిత్ర నంగీకరించారు. శుశ్రుతుడు మొదటి శాస్త్ర చికిత్స నిపునుదని పాశ్చాత్యులు కూడా ఒప్పుకొన్నారు. మరి ఆయన శాస్త్ర సహాయము లేకనే శాస్త్ర చికిత్స నిర్వహించెనా! మరి శాస్త్రములు వాడియుంటే అవి త్రుప్పు పట్టని సాధనములే కావలెను కదా ! మరి ఆయన కాలమునకు  ఇనుము ఉక్కు ఉన్నట్లే కదా! ఇన్ని విధములైన అవకాశాములుండియు మనము మన చరిత్ర, మనపూర్వుల గొప్పదనము తెలుసుకోలేకుండా యున్నాము. నిజానికిది సిగ్గుచేటు కాదా! ఈ క్రింది మాట చదవండి మన ప్రభుత్వ శాఖనే ఏమి చెప్పుచున్నదో?

Indians were familiar with iron and steel during the Vedic age more than 4,000 years ago. ASHOK BASU (PRESS INFORMATION BUREAU -- GOVERNMENT OF INDIA)

Delhi's Iron Pillar This is again a fine example of India's great heritage in iron making. Recent work on the same has shown the presence of a layer of the hydrated iron hydrogen phosphate (FePO4rH3PO4, 4H2O) layer & then an amorphos S-FeOOH layer over the base metal that greatly resisted corrosion / oxidation of the pillar.

 

Prof. Lalit Pandey (16 November 2009) Excavation at Iswal (Rajasthan), under Prof. Lalit Pandey’s supervision during 2001- 2007, has provided the earliest date of iron working in southeast Rajasthan. The C14 date of the iron working is 1053 BC.


The word "wootz" appears to have originated as a mistranscription of
 wook, an anglicised version of ukku, 

 

ప్రతిది , పాశ్చాత్యుల తప్పుడు వాదనను పోద్రోసి మన వాస్తవములను మనమే నిరూపించుకోనవలసి వచ్చుచున్నది. ఇది మన దౌర్భాగ్యము.

భారతీయ శాస్త్ర విజ్ఞానము ..14(లోహశాస్త్రము) తో మళ్ళీ కలుస్తాము.

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 14

మన పూర్వుల ప్రతిభను ఇంకా వివరముగా తెలుసుకోనగోరిన శ్రద్ధాళువులు మరియు మదీయ మిత్రులు అడుగుటచే కొంత నా శక్తికి మించిన పరిశోధనకు గడంగుటచే చాలా సమయము తీసుకొని మీముందుంచున్నాను. గోడపై చూచిన వెంటనే like కొట్టి చేతులు దులుపుకోవద్దు. మనసారా చదివి అభిప్రాయము వ్రాయండి. ఇవి తినుబండారములు తింటూ చదివే విషయములు కావు. ఇవి చదువుటకు శ్రద్ధ భక్తి రెండూ అవసరమే!

గనులు మరియు తత్సంబంధిత సాంకేతిక జ్ఞానము

భారతీయ శాస్ర విజ్ఞానములోణి 13వ భాగములో కొన్ని లోహముల గూర్చి ప్రస్తావించినాను. కొందరు ఔత్సాహికులు ఇంకాకొంత వివరణాత్మకముగా తెలియజేయగలరా! అన్నారు. ఆప్రయత్నములోని భాగమే ఈ వివరణ.

యజుర్వేదము ఈవిధముగా చెబుతూ ఉంది: దీనిని మనము రుద్ర చమకములో మనము చూడగలము.అది ఈ విధముగా ఉన్నది. “హిరణ్యంచమే యయశ్చమే సీసంచమే  త్రపుశ్చమే శ్యామంచమే లోహంచమే “ . భక్తుడు భగవంతుని పైన తెలిపిన లోహములను మానవుని మనుగడకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాడు. వేదకాలమును ఎవ్వరమూ నిర్దుష్టముగా నిర్వచించలేము. అంటే ఈ లోహములు వాటి ఉయోగములు, ఆయాలోహముల గనులు ఈ పవిత్రదేశము మనకు అందజేయగలుగుచున్నదని మనము గ్రహించవచ్చును.పై మంత్రమునందు తెలియబరచిన లోహములు ఏవేవో ముందు తెలుసుకొందాము. అవి, బంగారము యశదము సీసము తగరము వెండి ఇనుము(లోహము అన్నది ఇనుమునకు సంస్కృత పర్యాయ పదము) మొదలగునవి కావలెననుచున్నాడు అంటే ఆయా లోహములు అవసరమని వానిని వాడుట నాటికే తెలుసునని మనము తలపోసి తీరవలెను కదా! అంటే నాటికే ఆయా లోహముల శుభ్రపరచు యంత్రపరికరములు శుభ్రపరచిన పిమ్మట వానిని వివిధ రీతులగు పరికరములను తయారుజేసి ఉపయోగించుకొనుచున్నరనియే కదా! ఇచట మనము గ్రహించవలసిన మరియొక ముఖ్యవిషయము ఉన్నది. మరి ఆయా పర్కరములు లేక పనిముట్లు లేక కొరముట్లను తయారుచేయుటకు ముందు నమూనాను సిద్ధము చేసుకొనవలెను కదా! మరి వారిది ఎంతటి ఊహనో గమనించండి.

ఈరోజు మనము Nail Cutter అన్నపేరుతో వాడే సాధనమును సంస్కృతములో ‘నఖ కృంతనము’ అంటారు. ‘నఖకృంతనేన సర్వాకర్షణ యాసం విజ్ఞాతం కృష్ణాయాసం ఇత్యేవ సత్యం’

(ఛాందోగ్యోపనిషత్తు 6-1-6) .
यथा सोम्यिकेन नखनिकृन्तनेन सर्वं कार्ष्णायसं विज्ञातꣳ

स्याद्वाचारम्भणं विकारो नामधेयं कृष्णायसमित्येव

सत्यमेवꣳसोम्य आदेशो भवतीति..

యథా సోమ్యికేన నఖ నికృంతనేన సర్వం కర్ష్ణా  యసం విజ్ఞాత

స్యాద్వాచరంభణమ్ వికారో నామధేయం కృష్ణాయాసమిత్యేవ సత్యమేవ సోమ్యాస ఆదేశోన్ భవతీతి

ll 6.1.6 ll

ఓ సౌమ్యమగు వ్యక్తిత్వము కలిగినవాడా ఒక గోరుగోలు (Nail Cutter)ను గమనించితే అంటే దానిని తయారుచేయు విదానమునే కాకుండా చేయబడిన లోహమేది అనికూడా తెలుసుకొన్నావంటే, ఈ సందర్భమున ఇనుము, ఆ లోహముతో తయారు చేయబడిన ప్రతి వస్తువునూ, ఆలోహము యొక్క తయారీగా గుర్తించవచ్చు. కేవలము రూపములో మార్పెగానీ ధాతువు మారలేదు. ఇదీ నేను తెలియజేయుచున్న వాస్తవము.

ఇక్కడ పోల్చుటకు 'నఖనికృంతనము'ను తీసుకొనుట జరిగినది. మనకు కావలసినది ఏమిటంటే చరిత్రకందని కాలమునకే గోరుగోలు (Nail Cutter) ఉన్నది అన్నది.

వేరు వేరు ఖనిజముల వివిధ వర్ణములను చాణక్యులవారు (33౦ క్రీ.పూ.) తమ అర్థ శాస్త్రములో ఈ విధముగా తెలియజేయుచున్నారు.

పీతకస్తామ్ర పీతాక భూమి ప్రస్తర ధాతవో

భిన్న నీలరజీమంతో మాషా కృశరవర్ణవా

దధి బిందు పిండ హారిద్ర  హరితకీ పద్మ పత్రకం

శైవలీయ కృతీ ప్లీహానవద్యా భిన్న వర్ణయ ll

పసుపు, పసుపు కలిసిన ఎరుపు, ఎరుపు మొదలగు రంగులలో ఉంటూ వాటిని భిన్నము చేసినపుడు అనగా పగులకొట్టినపుడు నీలము, మినుముల రంగు, పెరుగు, పసుపుకొమ్ము రంగు, తెల్లమద్ది లేక తాండ్ర విత్తనముల రంగు, జంతువుల కాలేయపు రంగు, ప్లీహము (ముదురు ఎరుపు రంగు), ఇసుక, జాజి మొగ్గ మొదలగు వర్ణములలో మనము చూడవచ్చును. కొన్ని లోహములు కాలిన తరువాతకూడ యధావిధిగా ఉండిపోతాయి. కొన్ని పొగ నురగలను కలిగి యుంటాయి. (పైన ఒక శ్లోకమే తెలిపినాను. భావార్థములో రెండవ శ్లోకము కూడా ఇమిడియున్నది).

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన మరియు ఎంతో ఎక్కువగా ఆయా ఖనిజములను త్రవ్వితీసిన గనులు  అనేకములున్నాయి. మచ్చునకు 2,3 ఇచ్చట ముచ్చటించుతాను. అసలు కొన్ని గనులు నాటినుండి నేటికి కూడా ఖనిజములను మనకు అందించుచునే ఉన్నాయి.  కర్బనపు కాలమానము (Carbon Dating) ద్వారా ఈ విషయమును మనము నిర్దుష్టముగా తెలుసుకొనగలుగుచున్నాము.

రాజస్థాన్ లోని రాజపుర దరిబ, ఉదయపుర్ లో గల అత్యంత ప్రాచీనమైన యశదపు (Zinc) గనులు ఇంచుమించు 1230క్రీ.పూ. కాలము నాటివి. క్రీ.పూ. 1130 వరకు దక్షిణ లోడే ప్రాంతములోని గనులు బంగారు, వెండి, రాగి లోహముల నిధులు. కర్నాటక యందలి హట్టి ప్రాంతము పూర్వ కాలమున బంగారు నిల్వలకు పెట్టినది పేరు. నేటికి కూడా ఆ గనులు హిరణ్య దాతలే! ఇంచుమిచు క్రీ. పూ. 760 ప్రాంతములో ఈ గనులలో అత్యధిక ఉత్పాదన ఉండేది. రాజస్థాన్ లోని రాంపురా అగుచ గనులు సీసము యశదమునకు కాణాచి. ఇంచుమించు క్రీ. పూ. 370, 430 ప్రాంతములలో రాజస్థాన్ లోని జవర్మాలా గనులు పై ఖనిజముల ఉత్పత్తి లో ప్రముఖముగా ఉండేవి. క్రీ. పూ. 1200-1000 ప్రాంతములోనే గుల్బర్గా విభాగమునకు చెందిన కల్లూర్  గ్రామము భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని మాన్వి తాలూకాలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశము, కారణము 1930లలో తామ్ర కరవాలముల ఆవిష్కరణతో ఈ ప్రదేశం ప్రాముఖ్యత సంతరించుకుంది, ఇది దక్షిణ భారతదేశంలో రాగి నిక్షేపములు, వాని ప్రయోజన సంస్కృతిని కనుగొన్న మొదటి ఉదాహరణ.

గణేశ్వర్, రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని నీమ్-క-థానా మండలము లోని ఒక గ్రామము. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 4,000 సంవత్సరాల నాటి నాగరికత అవశేషాలు బయటపడినాయి. ఇది రాజస్థాన్‌లోని ఖేత్రీ తామర శృంఖలలో భాగమైన  సికర్-జుంఝును ప్రాంతంలోని రాగి గనుల సమీపంలో ఉంది. చరిత్రకారుడు రత్న చంద్ర అగ్రవాలా 1977లో గణేశ్వరుని త్రవ్వకాలలో త్రవ్వకాలలో బాణపు ములుకులు, ఈటె ములుకులు, శుష్కలములు (చేపల కొక్కీలు), కంకణములు మరియు ఉలి వంటి రాగి వస్తువులు బయటపదినట్లు నిర్ధారించినారు.

ఈవిధముగా చెప్పుకొంటూ పోతే ఎన్నో, ఎన్నెనో ఆశ్చర్యజనకమైన విషయాలు బయలు పడుతాయి.

"హిందూ రాసాయానికి శాస్త్ర చరిత్ర" (ఖండము I) యొక్క సమీక్షలో ప్రాచీన భారతదేశము లో రసాయన శాస్త్రం యొక్క పురోగతి గురించి మాట్లాడుతూ 'రసార్ణవ' గ్రంధము నుండి  రెండు విశేషమైన భాగాలను ఉటంకించింది: " రాగి నీలిరంగు మంటను ఇస్తుంది .... తగరము పావురం రంగు; సీసం లేత రంగులో ఉంటుంది." రసవాద తంత్రాలలో రసర్ణవానికి ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోని ఈ వాక్యములను గమనించండి:

న విస్ఫులింగాః నచ బుద్బుదాశ్చ యదా న రేఖా పటలం న శబ్డాl

మూషాగతం రత్నసమం స్థితశ్చ తాదావిశుద్ధం ప్రవదంతి లోహమ్ ll

శుభ్రపరుపబడిన లోహము మూస నుండి (గొట్టము నుండి) జారునపుడు ఎటువంటి మిణుగురులు గానీ, బుడగలు గానీ, శబ్దము కానీ  ఎటువంటి నురగ కూడా లేక, బంగారము వాలే ప్రకాశవంతమై, క్రిందబడినా జారక నిలిచే చిక్కని ద్రవమై భాసిల్లుతుంది దీనిని బట్టి నాటి లోహవిజ్ఞానము మనకు ఎంతగానో తెలియవస్తుంది.

మిగిలినది మరొకమారు.............

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 15

తామ్ర లోహము (రాగి)

అర్థశాస్త్రములో రాగిణి గూర్చి చాణక్యుడు ఈ విధముగా చెబుతాడు.

భారిక స్నిగ్ధో మ్రుదుశ్చ ప్రస్తార  ధాతుర్  భూమిభాగోవా  తామ్రధాతు |

పింగళో హరిత పాటల లోహితోవా తామ్ర ధాతుll

రాగి ఒక బరువైన లోహము. ఇది ఆకుపచ్చని, చిక్కటి నీలి, లేతపసుపు, పేలవమైన ఎరుపు, ముదురు ఏర్పు రంగులలో లభ్యమౌతుంది.గనులలో దొరుకు ఒక విధమగు దాతువులో 35% రాగి ఉంటుంది. అదేరీతిగా వేరువేరు రంగుల తామ్రధాతు ఖనిజములు వేరువేరు తామ్ర శాతమును కలిగియుంటాయి.

Aichison తన ‘A History of Metals – volume 1 లో క్రీ. పూ. 4300  లో కాస్పియన్ సముద్రము వద్ద Elburz పర్వతములలోనూ, మరియు క్రీ.పూ.4000న ఇరాన్ లోను మొదటిసారిగా రాగిని కనుగొన్నట్లు చెప్పినారు, కానీ ఉత్తర హిందూ దేశమున మేహర్ఘర్ త్రవ్వకాలలో, క్రీ.పూ.7786+\- 120 రాగి కోవులు, గుండ్లు దొరికినాయి . మరి అప్పట్కే రాగి ఉద్రుతముగా వాడుకలో ఉండవలెను కదా! కావున పాశ్చాత్యుదేశాములకంటే ఈ పుణ్యభూమిలో రాగి వాడకము ఎన్నో వేల సంవత్సరముల పూర్వము నుండియే ఉండినదని తెలియచ్చుచున్నది.  అంతే కాక ఖంజము నుండి లోహములను విడదీయు విధానములు కూడా వీరికి తేలియునని తెలియవచ్చుచున్నది. ఎన్నో వేల సంవత్సరముల పూర్వము నుండి త్రవ్వకములు ఉండుటచేతనె మనవారు ఎన్నోవిధములగు పరికరములను తయారు చేయగలిగినారు.

Chakravarthi D.K. తన ‘Mining in Ancient and Msdival India’ లో దారిబ, రాజ్ పురా, తామ్రగనులు 1260+or- 160 B.C. నుండి క్రీశ.250+or-100వరకు రాగి ఉత్పాదన కలిగియుండినదని ఘంతాపతముగా నిరూపించినారు.

భరద్వాజ్ H.C. గారు తన ‘Indian Journal History of Science’ లో సింగ్భుం రాగి గనులు క్రీ.పూ. 1100 నుండి అందుబాటులో ఉన్నాయని నిరూపించినారు.

ఈ గనులు దొరికే ప్రాంతములూర్చి చెప్పుకొంటూ పోతే  కొండవీటి చేంతాడంత అయిపోతుంది. ఆంధ్రప్రదేశము లోని గుంటరు జిల్లా బండ్లమిట్టలో కూడా క్రీ.శ.500 నుండి క్రీ.శ.1215 వరకూ సజావుగా పనిచేసినవి.

భరద్వాజ H.C. గారు తెలిపిన ప్రకారము రాజస్థాన్ లో 19, ఉత్తరప్రదేశ్ లో 11, బీహార్ లో 12, రాగి గనులు ఉత్పాదన శక్తి కలిగియుండినవి. 

బారాగుండా లోని గనులలో అత్యధిక తామ్ర ఖనిజ ఉత్పాదన జరిగినట్లు మనకు తెలియ్కవచ్చుచున్నది. ఇచట ఒక కిలోగ్రాము ఖనిజము నుండి 350 గ్రాముల రాగిని తక్కువలో తక్కువగా తీసియుండవచ్చునని  అంచనా. గొడ్డలి, కత్తి, సుత్తి, చెంబు, స్థాళీ(Tumblers), ముద్రికలు మొదలగు ఎన్నో పరికరములు నాటి కాలమున చేసెడువారని సాక్ష్యాధారములతో నిరూపితమైనది.

ఇక రాగి వాణిజ్యమును గూర్చి చెప్పుకొనవలసి వస్తే, మన దేశము టర్కీ లోని కాలడోనియా రేవుతో అధికముగా వర్తకము జరిపినట్లు సాక్ష్యాధారాలతో, తెలియవస్తూ ఉన్నది. మన దేశము లోని లోథాల్ లో రాగి ఉత్పాదన ఎంతగానో జరిగినట్లు తెలియవచ్చుచున్నది. నాడిది సుప్రసిద్ధమగు వాణిజ్య కేంద్రము,

రాగి తగరముల మిశ్రమమే కంచు.కంచు ఘంటలు, ఘంటములు, పల్లెరములు, లోటాలు మొదలగునవి ఎన్నో నాటి నుండియే ఉపయోగించుచున్నట్లు తెలియవచ్చుచున్నది.

మిగిలినది మరోమారు........ 

భారతీయ శాస్త్ర విజ్ఞానము .. 16

తగరము

తగరమును సంస్కృతము లో ‘త్రపు’ అంటారు. మిశ్రమలోహమగు కంచుకు దీనిని 45% నుండి ౧౩౨%కలుపుతూ విన్దేవారని హరప్పా శితిలములనుండి తెలియవస్తూవున్నది. ఈ విషయమును మన పురావస్తు నిపుణులచే చెప్పబడినది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రములో తగరముసహాయముతో తయారుచేయబడు వివిధ విధములగు మిశ్రమలోహములను గూర్చి విశదముగా తెలియబరుపబడినది.తక్షశిలలో దొరకిన కంచు నమూనాలలో, 20% తగరము కలిపినారన్నది గమనించదగ్గ విశేషము.

తగరము యొక్క పూర్వ స్వరూప స్వభావము అర్థశాస్త్రములో ఈ విధముగా చెప్పబడినది.

ఊషర కర్బుర పక్వ లోష్ట వర్ణవా తరపు ధాతు.

చామనఛాయను కాలిన మట్టి రంగును కలిగియుంటుంది అని చెప్పబదియుంటుంది. ఇది ఒక విధమైన తగరము. స్వచ్చమైన తగరము ఉచ్ఛతరగతికి చెందినది తతేల్లగానూ స్వచ్ఛము గానూ ఉంటుంది.

మాహిష్యాస్తి చూర్ణేనవాపత్తేన మూత్ర సేచనాత్

వంగరుద్ధం భవేదగ్నౌ .....

అనగా అనగా తగరమును శుద్ధి చేయుటకు ఎనుముల ఎముకల పొడిమరియు మూత్రములను వాడుతారు. ఈ విషయమును 11వ శతాబ్దపు రచన యగు రాసార్ణవమున (7.12) న తెలియజేయబడినది.

ఆధునిక రసాయన శాస్త్రపరముగా వివరించవలసివస్తే తగరపు ఖనిజమున నున్న భాస్వరము (Phosphorous)రాసాయనిక పోరాక్రియవల్ల  Phosphorous Oxide గా మారుతుంది. వేడిచేయునపుడు ఈ Oxide మూత్రము లోని నీటిలో కరిగిపోతుంది. ఆ విధముగా భాస్వరీకామ్లము తయారవుతుంది. ఈ తతంగాములో కర్బానము కొరకు కొంత అడవికలప కూడా వాడుతారు.ఇది తగరపు ఆమ్లము (Tin Oxide) తో కలసినపుడు తగరమును వేరుపరచుతుంది. క్రీస్తుకు పూర్వము వెల సంవత్సరములనున్దిన్ ఈ లోహమును గూర్చి పాశ్చాత్యులకు 16వ శతాబ్దమున అగ్రికోలా అను లోహకారుడు తెక్లుపువరకూ వారికి తెలియదు.

13వ శతాబ్దముదని చెప్పబడుచున్న రసోపనిషత్తులోని 13వ ప్రకరణము పూర్తిగా తగరమునకే కేటాయించబడినది.అందుచేత ఈ అధ్యాయమునకు ‘వంగామ్శోధనాధ్యాయము’ అన్నపేరు పెట్టబడినది. Dr. విజయ్ దేశ్ పాండే గారు ఈ విషయమై ఎంతో పరిశోధించి తన నిలువ చేయుట జరుగుతుంది.ప్రయోగఫలితములను ప్రత్యేకముగా ముద్రించి ప్రకటించినారు.ఇంతకూ విషయసారాంశమేమన అతడు తెలిపిన ప్రతి విషయమూ తగరము నుండి ఖనిజమును వేరుచేయుటకు సరియగు సమాచారము నిర్దుష్టముగా ఇవ్వబడినాదని తెలుపుటయే!

అసలు తగరమును ఖనిజము నుండి వేరుపడిన తరువాత ఆ ద్రవమును ఏవిధముగా పాత్రలో భద్రపరచుతారు అన్నది రసరత్నాకరము అన్న గ్రంధములో ఈ విధముగా తెలియజేయ బడినది.

మూష మూకధ్మతం తరలం తన్కనేన సమన్వితంl

సత్వం కుటిల సంకాశం పట్టే నాత్ర సంశయఃll

మూషమూక (Crucible which is specially designed for metal like tin extraction) యొక్క ద్రవము ప్రత్యేకమగు పాత్రలో  నిలువ చేయుట జరుగుతుంది.

రసోపనిషత్తునందు త౬అగరమును ఖనిజము నుండి వేరుచేయు విధానము విశదముగా ఈ క్రింది శ్లోకములో తెలియబరచినది.కుతజార్క విటక్షారే నిర్గుండీ బ్రహ్మ వృక్షయోఃl

గంధ గోక్షురకే బ్రహ్మ్యాం భస్మ తాయాంచ నిశ్చయేత్ll

సన్చూణ్య సర్వాన్యస్థీని విషబీజ సమంచl

ప్రతివాప్య బహూన్ వారాన్ తిలతిలే నిషేచయేత్l

ఎవోసిద్ధం భవేత్ పానకం శంక క్షీరెండు సన్నిభంll  

మిశ్రణము పైన అనగా కరిగిన తగరము యొక్క లోహము పైన కుటజ అను మొక్కను కాల్చిన పిదప్ వచ్చు బూడిద మరియు అర్క విట యొక్క భస్మమును చల్లి దానితో నిర్గుండి , గంధ, గోక్షురక భాస్మముల ద్రావకమును కలుపవలసియుంటుంది. ఎముకల పొడిని, విషబీజ

చూర్ణమును సమాన సమాన నిష్పత్తిలో కలుపవలసియుంటుంది.ఈ సంపూర్ణ మిశ్రణమును పదే పదే బాగా కలిపి తరువాత నువ్వులనూనె దానికి కలుపుతారు. మిశ్రణము తగినంత ఉష్ణోగ్రతను పొందిన తరువాతనే ఈ నూనెతో కలుపుతారు.

ఇక రసరత్న సముచ్చయములో (5.15౩) ఈ విధముగా చెప్పబడినది.

ఖురకం మిశ్రకం చేతి ద్వివిధం వంగాముచ్యతేl

ఖురకం తత్ర గునే శ్రేష్ఠా మిశ్రకం నహితంమతంll   

ధవళం మృదులం స్నిగ్ధం దంతద్రావం సగౌరవం

నిశ్శబ్దం ఖురకం గంశ్యాన్ మిశ్రకం శ్యామ శుభ్రకం

Modern Scientistsతగరము రెండు విభిన్న లోహములలో దొరుకుతుంది. 1. ఖురకము 2. మిశ్రకము.

ఈ రెండింటిలో ఖురకము అత్యంత శ్రేష్ఠమైనది. మిశ్రకము అంతటి ప్రత్యేకత కలిగియుండదు.ఖురకము మిక్కిలి తెల్లగానూ, మేత్తదనముతోనూ, సౌకుమార్యము కలిగి నిశ్శబ్దముగా ఉయ్న్డు లక్షణములను కలిగియుంటుంది. మిశ్రకము నలుపుతో కూడిన తెలుపు (Grey) కలిగియుంటుంది. తగరములో రెండు తెగలున్నట్లు 20 వ శతాబ్దము వరకూ Modern Scientists కు తెలియదు. కానీ మన పూర్వులు ఈ తేడాను ఇంచుమించు 11 వ శాతాబ్దములోనే కనుగొన్నారు.

రసోపనిషత్తు ఇంచుమించు 13వ శతాబ్దమునకు చెందినది.ఇందులోని 13వ అధ్యాయము తగరముయ్ను గూర్చి విశదముగా తెలియేయుచున్నది. విజయ్ దేశ్ పాండే Indian Journal of the History oif Science 121..1992 లో నిష్కర్షగా   పాన తెలియజేసిన రాసోపనిశాత్తులోని వనస్పతులన్నీ తగరము యొక్క శుద్ధికి నిర్ద్వంద్వముగా ఉపయోగ పడుతాయని నిరూపించినాడు.  

*క్రీస్తుపూర్వం 5 నుండి 2వ శతాబ్ది వరకు నందులు మరియు మౌర్యుల పరిపాలనా కాలమును లోహముల, ఖనిజ ఉత్పత్తుల స్వర్ణయుగమని చెప్పవచ్చును

ఈ విషయమును పాణిని కౌటిల్యుడు తమ రచనలలో ధృవపరచుటయే కాకుండా, భారతదేశ పురాతత్వ శాఖ త్రావ్వకముల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ త్రవ్వకములు పాకిస్తాను లోని రావల్పిండికి 22మైళ్ళ దూరములోని తక్షశిల 321 (త్రవ్వకపు సంఖ్య) వద్ద కనుగొనబడినది.

From *Minerals and their Exploitation in Ancient and Pre-modern India

By A.K. Biswas Professor in History of Science, the Asiatic Society, Calcutta, India.

అంటే నందుల పరిపాలనా కాలము  500 BC నుండి గుప్తుల పరిపాలనా కాలము 400 AID వరకు కొనసాగినది. ఒకవేళ ఆయా రాజవంశముల కాల నిర్నయములో పోరాబాతులు ఉన్నా నందుల కాలనుంది గుప్తులకాలము వరకు లోహముల ప్రాధాన్యత అధికముగా ఉన్నది అత్యంత వాస్తవము. 

ఒకప్పటి భారతదేశములో భాగమైన మ్యాన్మార్, ఆఫ్ఘనిస్తాన్ లు తగరమునకు పట్టుకొమ్మలు. మన ప్రస్తుత దేశములో కూడా చత్తీస్ ఘడ్ లోనూ ఒరిస్సాలోని కోరాపుట్ లోనూ తగరము లభ్యము. లోహములను ప్రపంచమునకు పరిచయము చేసికూడా, పలువిధములగు వాని ఉపయోగాములను తెలిపికూడా తనకేమీతెలియనట్లు ఉండిపోయిన భారత మాతకు ఇన్ని విషయములు తెలియజేసినా పేరుకు ప్రాకులాడని నాటి ఆతల్లి ముద్దుబిడ్డలకు శతాధిక నమస్సులు.

మరొకమారు మరొక లోహమును గూర్చి.......