Thursday 12 March 2020

చంద్రమోహనా
సూర్యకాంతి చవి చూడని చంద్రమోహనా
 సహనమన్నదే ఎరుగని సదాతప్త సూర్యగుణా
సంతత నాసార్ద్రతప్త సారస సుర వదనా
ఎంజీయార్ నగరేశా వెంపటి గృహ స్థిరవాసా
రామ లక్ష్మి ప్రాణేశా బంధుమిత్ర మనోక్లేశ
గజ మదనా గజ వదనా గజ శరీర గజగమనా
గతము మరచిపోయినట్టి గతిగల్గిన ఓ సుమనా 
రస రాజా రుచి భోజా సుషుప్తిలో రవితేజా
అసూయనే అమృతమును అనవరతము గల కూజా 
మకుట నాస్తి మహరాజ మరులుగొల్పు మాకాజా
ఆపుతాను ఇక బాజా హాయిహాయిగా సోజా

Sunday 8 March 2020

సమస్య మనది – సలహా గీతది – 19-25



సమస్య మనది -- సలహా గీతది -- 19  

సమస్య : నేను ఒక వ్యక్తి చేత ఆకర్షితుడ నైనాను. ఆ వ్యక్తీ నాకే చెందాలన్న తపన. ఆ వ్యక్తి వేరెవరినైనా చూస్తే ఓర్వలేను. వేరెవరైనా ఆ వ్యక్తిని చూస్తే నాకు మితి మీరిన కోపము. నేనేమి చేయాలి ?
సలహా : సమాధానానికి ముందు సంస్కారాన్ని గూర్చి ఒక మాట చెబుతాను.
నీవు గుడిలోకి పోబోతూ గుడి ముంగిట నిలిచినట్లు ఊహించుకో ! ఆ వాతావరణములో ఏమి కనిపిస్తాయిపసుపు కుంకుమకొబ్బరికాయలుకర్పూరముఅగరు వత్తులుదేవుని చిత్ర పటాలుభక్తి పుస్తకాలు తమలపాకులువక్కలుఅరటిపళ్ళు మొదలైనవి మాత్రమె వుంటాయి. KFC, పిజ్జాలు మొదలైనవి దొరకవు . ఎందుకు. అది పరిసరపు ప్రభావము. దీనివల్ల మనకు ఏమి అర్థమౌతుంది. తలపునకు తగినట్టే తగిన వస్తు సముదాయమును తల సమకూర్చుతుంది. అందుకే బాల్యములోనే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకొని సంస్కారాన్ని నేర్పిస్తే  సన్మార్గాన పోయే అవకాశము వుంటుంది. అసలు నీ బుద్ధి అనేది బాల్యములో సామాను చేర్చని కొత్త ఇల్లు లాంటిది. మరి ఆ ఇంటిలో వుండదలచినవారు తగిన సామాను ఉంచితే అందంగా ఉండడమే గాక చూచే వారందరికీ ఆనందాన్ని కూడా సమకూర్చుతుంది. అసలు ఇంటికే ప్రాణముంటే నలుగురి మెచ్చుకోళ్ళు విని ఎంత ఆనందించుతుందో ! మనము చేయవలసినది అదే ! అదే ఇంటిని పెంటకుప్ప జేసి కంటికి నచ్చిందని మనమనుకొంటే ప్రయోజనముండదు. 
నలుగురు నచ్చేవిధమున
నలుగురిచే మెప్పుపొంది నాణ్యత మీరన్ 
నలువ దయ కల్గి మెలగుము
నలుతెరగుల నిన్ను మెచ్చ నడువుము రామా!
 ఒకసారి నీవుసన్మార్గము దుర్మార్గము అన్న ఆరెండు మాటలు ప్రక్కన వుంచినీకు కలిగిన కోరిక వల్ల నీకు మానసికంగా కలిగే గ్లాని ఎంతఅన్నది ఒకసారి బేరీజు వేయి! ఆ గ్లానిని గూర్చి  ఆలోచించుతూ వుంటే ఆరోగ్య మేమవుతుంది అన్న  చింత మనసుకు కొంతయినా వచ్చిందా! నీ కోరిక తీరుతుందో లేదో తెలియదు. తెలిసే వరకు నీ మనసుకు నిలకడ లేదు. నిలకడ లేకుంటే పడిపోవుట తథ్యము కాదా!   నీ మనసులో ఒక విధమైన తాత్వికత నీ తలిదండ్రి గురువులు కలిగించినారంటే నీ ఆలోచనలు అన్యథా పోవు. ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా!  
ఒకసారి 'బాహుబలిసినిమా ను గూర్చి ఊహించుకో ! ఇప్పటికది మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అవుతూ ఉందేమో అది చూడాలని నీకు ఆకాంక్ష . అది తీరేవరకు మనసులో క్షోభ . ఎవరైనా నెగెటివ్ గా చెబితే వారిపై కోపము. చివరికి అది ఒకానొక రోజు విడుదల కానేఅయ్యింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి టికెట్ కొన్నావు. కారులో సంసారముతో  వెళ్ళుతూ వుంటే నీ మిత్రుడు నీకోసమేనీ 50 లక్షల బాకీ చెల్లించడానికి వస్తున్నట్లు తెలిపినాడు. ఒక్క క్షణము మెదడు మొద్దుబారి పోయింది. ముందుకు పోలేవు వెనక్కు రాలేవు. సరే అతనితో మాటలాడిఒక సంకేతమును ఏర్అపరచుకొనిఅనుకొన్న ప్రకారముగా దారిలో కలిసి డబ్బు తీసుకొని కారులో పెట్టుకొని థియేటర్ చేరినావు. ఆలస్యమైంది. సినిమా మొదలైంది. ఆ హడావుడిలో కారు తాళాలు మరచినావు. సినిమా చాలా బాగుందని అందరూ అనందించుతుంటే  నీకు కారు తాళాలు గుర్తుకొచ్చి సినిమా వదిలి పార్కింగ్ ప్లేస్ కు పోయినావు. కారు లేదుడబ్బు కారుతోబాటే పోయింది నీ కుటుంబము ధియేటర్ లో వుంది. సమస్య పరిష్కారమైనదాలేదా లేదా ఇప్పుడు అప్రస్తుతము. నీకోరిక తీరినట్లా లేనట్లా చెప్పు  ఆనందము పొందినట్లా లేనట్లాఅందుకే ఆశను ఆకాశమునకు అంటించ వద్దు. నీకు రక్ష నీ నడవడిక.నీ దైవ చింతన. నీ ధర్మ బుద్ధి. నాకు పలుకుటకు వీనికి ప్రానముందా అనవచ్చు. ప్రాణమున్న పులి నిన్ను చంపుతుంది. అదే ప్రాణమున్న నిన్నే అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన వ్యాఘ్రమాహరిణమా అన్నది నీ విచక్షణకు సంబంధించినది. 'యద్ భావం తద్ భవతిఅన్నారు ఆర్యులు. కావున నీ ఆలోచనలు హరిణములై ఉన్నంతవరకునీ పరిసరాలునీవు నీ మనసు అంతా ఆనందమే! 
ఈసు సుయోధనుండగు  ఎంచగ నూర్గురనుంగు సోదరుల్
దోసము కుళ్ళు కుట్రలకు మూల విరాట్టులు కర్ణ మాతులుల్
మోసము లెల్ల దాయలకు  దుస్సహ రీతిని జేసి వారిచే
దూసర రీతినిన్ ప్రళయ ధూళిని జేరిరి దుష్ట వాంఛలన్
అవసరములేని అనాయాచితమైనఆలోచనలు అత్యంత అనర్థదాయకములు. 'ధర్మం చరఅన్నది వేదము. నీ ధర్మమూ నీ సంస్కారముచే నిర్ణయింప బడుతుంది. చెడు తలంపులు ఎంత చెడ్డవని పరమాత్మ చెబుతున్నాడో తెలుసుకో! 
ఇక ఈ విషయములో శ్రీకృష్ణుడు ఏమని ఉపదేశించినాడో చూద్దాము.                                                                       ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే 62 -- 2  

మనసున తలపే మరులను గూర్చును 
మరులుగొన్నచో మమతలు పెరుగును
మమతలు పెరిగిన మతికంపించును
మతి కంపించిన  మసగును కోపము  62 -- 2 (మసగుట=విజృంభించుట)

క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి 6౩ -- 2 

కోపమన్నదొక కొరివి చూడమది
సమ్మోహాగ్నిని సంతరించును
సమ్మోహముచే స్మృతి గతి తప్పును
స్మృతి గతి తప్పిన మతియె నశించును 63--2

మయ సభను చూచినది మొదలు తన వధ వరకు దుర్యోధనుడు తన మనసున అది తనకు కావలె నాన్న కోరికతో మొదలుపెట్టి తన మరణము కొనితెచ్చుకొనే వరకు పై మానసిక ప్రకంపనలన్నీ పొందుట గమనించవచ్చు.(దుర్యోధనుడు మయసభలో స్థలమని భ్రమించి నీటి గుంటలో పడినపుడు ద్రౌపది నవ్విన వారిలో లేదని సభాపర్వము 47 - అధ్యాయము లో చూడనగును.) ఇంకొక ఉదాహరణము తీసుకొందాము.
ఒక చక్కటి అమ్మాయిని చూడటము అనుకోకుండా తటస్తి స్తే  ఆ అమ్మాయి తల్లిదండ్రులెవరు  ఆమెను  చూచుటకు లేక ఆకర్షించుటకు మనలో పాత్రత యున్నదా సాంఘీక పరమైన కట్టుబాట్ల పరిధిలో వున్నామా అతిశయించిన మన మనో  వాంఛ వల్ల జరుగబోవు విపరీత విపత్కర పరిణామాలేమిటి   అన్న ఇత్యాది విషయములు ఆలోచించక పోగా  ఆమె ఇల్లు ఎక్కడకాలేజి ఎక్కడ ఇంటినుండి కాలేజీ కి ఎప్పుడు బయలుదేరుతుంది అన్న మొదలైన విషయాల గూర్చి ఆలోచిస్తాము. ఆమెను అనుసరించుటే కాక వేరెవరైనా ఆమె వైపు చూసినా సహించలేక విచక్షణా రహితంగా అతనితో యుద్ధానికి సిద్ధమై తన్నులు కూడా తినవచ్చు నెమోఈ వ్యాకులతకు పర్యవసానమేమిఇది సముచితమా !ఇది సంస్కారమా! అన్నది తరువాత ఆలోచిస్తాము.
ఇపుడు 
 మనసులో కలిగిన ప్రకంపనలు ఏమిటి అన్నది చూస్తాము.  అమ్మాయిని చూస్తూనే మనసులో ఈమె బాగుంది అన్న తలంపు కలిగింది. తలంపు పదే  పదే  అదే అదే మనసులో మసలుతూనే ఉండుటకు దారి తీసింది. దానితో ఆమె పై మమత  
ఏర్పడింది. అంటే ఈమె నాది అన్న బలమైన భావన మనసులో పాదు చేసుకోనింది. మతి గతి తప్పింది. అన్ని ఆలోచనలు మాని అమెను గూర్చి మాత్రమే ఆలోచించ దొడిగింది. మహా భారతములో శంతనుడు సత్యవతి విషయములో ఇదే కదా జరిగినది. ఇది జరుగకుంటే భారత యుద్ధము వచ్చేదే కాదు. సత్యవ్రతునికి 'భీష్ముడుఅన్న పేరు వచ్చేది కాదు. ఆయన అవివాహితునిగా ఉండిపోయేవాడు కాదు. కౌరవ పాండవులు జన్మించేవారు కారు. భారతయుద్ధము జరిగియుండేది కాదు. చూచినారా ఎవరు చేసిన పనికి ఎవరు బలి అయినారోఈ విధముగా మతి కంపించడము వలన కోపము వస్తుంది. అది తన చేతగాని తనముపై కావచ్చు లేక  పరులపై కావచ్చు. కోపము ఒక విపరీతమైన మోహమును అంటే ఎవిధముగానైనా నాదే అనే  పట్టుదల  మర్రిచ్ట్టాయి మనసులో నిలుస్తుంది. అది విచక్షణా జ్ఞానాన్ని రూపు మాపుతుంది.  మరి విచక్షణే లేకుంటే బుద్ధి పోయినట్లే కదా ! బుద్దే లేకపోతే మరి మనుషులమెట్లవుతాము.  మనుషులము కాదు విచాల్క్షణ లేదు . అంటే మనము గుడ్డి ఎద్దులమైనాము. 'గుడ్డెద్దు చేనులో పడితే చేనుకూ నష్టమే ఎద్దుకూ నష్టమే. చేనుకు పంట చేటు ఎద్దుకు వంటి చేటు. మరి ఆక్రోశముతో దానిని కొడతాడుకదా పంటమాలి.                                                                                                       
మరి ఒక్క సారి ఆలోచిస్తే మనకు అర్థమౌతుంది దీనంతటికీ కారణము తగిన సంస్కారము లేకపోవుటేయని. అందుకే ఆదిశంకరులు అన్నారు
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జేవన్ముక్తిః

కాబట్టి బాల్యమునుంది కూడా బాలునికి శ్రద్ధ వహిచి పెద్దలు సత్సాంగత్యము ఏర్పరచినారంటే మిగతా విషయాలన్నీ తానె చూసుకొని సమాజములో చక్కని పౌరునిగా తీర్చిదిద్దుటే కాకుండా జీవన్ముక్తి కూడా కలిగిస్తుంది. 
    

ఈ 
 సలహా ముఖ్యముగా యువకులు మనసు పెట్టి చదివి తమలో ఎవిధమన బలహీనతలున్నా సవరించుకొని సరియైన జీవన మార్గమునే నమ్ముకొంటారని నమ్ముతూ మీ ముందుంచున్నాను.

స్వస్తి.

******************************************************

సమస్య మనది -- సలహా గీతది -- 20
సమస్య : పాదరస సాదృశమైన నా మనసుకు నిలకడేదీ ?
సలహా : ఎంత సులభముగా అడిగినావు. ఇదేమీ అంగడికిపోయి అరటిపండు కొనటము కాదు. భలే రాముడు సినిమాలో రేలంగి 'బంగారు బొమ్మా ! బలే జోరుగా పదవే పోదాము పై దేశం చూదాము ' అంటూ ఇంకా "కలకత్తా బొయి కారులేక్కుదాం, బొంబాయి వెళ్లి బోటులేక్కుదాం, ఢిల్లీ వెళ్లి విమానమెక్కి మళ్ళీ తిరిగి మన వూరొద్దాం" అని అంటాడు. గమనించితే అంతా అరచేతిలో వైకుంఠమే . ఎందుకంటే అది మూడు నిముసములలో పాట పాడినంత సులభముగాదు,ఎంతో పాటు పడవలసినది వుంది. మరి అంత వేగముతో పయనించే మనసు అనే బండిని మనము కట్టుబాటులో ఉంచాలంటే ఎంత కష్టమో గమనించు. కానీ ,కష్టపడితే కానిదేమీ లేదు. ఈ సందర్భములో నేను వ్రాసిన ఒక చిన్న పద్యము గమనించు :
పచ్చిమిరప బజ్జి బల్ కమ్మగా నుండు
మితము మీరి తినుట హితము కాదు 
ఇష్టమొకటి కాదు ఇంగితమును జూడు 
రామమోహనుక్తి రమ్య సూక్తి
అతి ముఖ్యమైన విషయమేమంటే, అవసరము లేనివి చూసినా, అవసరము లేకుండా తిరిగినా, అవసరము లేని వారితో సావాసము చేసినా అనర్థమే ఆఖరుకు జరిగేది. ఎంతవరకో అంతే . దీనికి జనక మహారాజు మనకు ఆదర్శము. అందుకే ఆయనను జనక మహర్షి అన్నారు . అదే రాముని తండ్రియైన దశరథుని అనలేదు.
ఇక ఈ విషయమి పరమాత్మ ఏమన్నాడో పరిశీలిద్దాము.
రాగద్వేష విముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్
ఆత్మా వశ్యైః విధేయాత్మా ప్రసాద మదిగచ్ఛతి 64-- 2
విషయ వాంఛ వీధులలో
ఇంద్రియమ్ములెటు దిరిగిన
రాగద్వేష రహితమైన
ఆత్మ నిగ్రహత గల్గుము 64 -- 2
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్న చేతసోహ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి 65 -- 2
శాంతము బాధల సాంతమడంచగ
ప్రసన్న చిత్తము ప్రముఖ సాధనము
ఆత్మ నిశ్చలత నందుకొన్నచో 
అంతకు మించిన ఆనందంబెది 64-- 3
ఆత్మ నిగ్రహత కు ఆలంబనము విషయ వాంఛలు బాహ్యేంద్రియములు వానిపై పెత్తనము చేసే మనసు. మన చపలతను మన పెద్దలు ఆరు భాగములుగా విభజించినారు. అవి: శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము .ఈ ఆరింటిని శమాది షట్క సంపత్తి అంటారు. నిజ జీవితములో వీనిని అనుసరించినట్లైతే అశాంతికి అవకాశమూ ఉండదు ప్రశాంతికి అంతరాయమూ ఉండదు..
శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. శమ,దమమూలన్న ఇవి ద్వంద్వములే కానీ పరస్పర వ్యతిరిక్తములు కావు. మనసు వాసనా రహితము చేసుకొనుట శమము. ఇంద్రియ నిగ్రహము దమము. ఒక చిన్న ఉదాహరణతో ఈ రెంటిన విపులీకరించే ప్రయత్నము చేస్తాను. మామిడి పళ్ళు అంటే మీకిష్టం. ఎందుకో అవి ఇక పై తినకూడదనుకొన్నారు. మామిడి పళ్ళ పై ఆలోచనను మనసునుండి చేరిపేస్తే అది శమము. మీకాళ్ళను కళ్ళను కట్టివేసి మీ బాహ్యేంద్రియములను నియంత్రించుకొంటే పండు పై కోరిక రాను రానూ మాసిపోతుంది.అది దమము.ఈ శమదమాల సాన్నిహిత్యము మిమ్ము ద్వంద్వాతీతులను చేయగలదు
ఇంద్రియములు విషయాలను ఆశిస్తాయి. విషయాలు ఇంద్రియాలను ఆశ్రయిస్తాయి. కనుక ఈ రెంటిదీ పరస్పరము విడదీయరాని బంధము.ఈ శరీరమనే కోటకు ఇంద్రియములు ద్వారముల వంటివి. ఈ ద్వారాల నియంత్రణ మన చేతిలో వుంటే మనకు మించిన ఆనందముననుభవించేవాడు లేడు. అది నీవు ఇంద్రియములపై ఆధిపత్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంద్రియములపై నీవు ఆధిపత్యం కలిగి ఉండాలి అంటే మనస్సు నీకు స్వాధీనమై ఉండాలి. మనస్సు స్వాధీనమై ఉండవలెనంటే వస్తువుల పై, వైరాగ్య భావన పెంచుకోవాలి.
అసలు, ఆనందము = తీరిన కోర్కెలు/ మొత్తము కోర్కెలు. నీవు చేయ వలసిన పని ఏమిటంటే తీరిన కోర్కెల సంఖ్య పెంచుకొంటూ , అదనపు కోర్కెలను మొత్తము కోర్కె లలోనికి చేర్చకుండా ఉండగలిగితే రాను రాను ఆనందము అందివస్తుంది.
కాబట్టి ఒకప్రక్క ఉన్న కోరికలను తగ్గించు, ఇంకొక ప్రక్క ధర్మబద్ధమైన బలమైన కోర్కెలు తీర్చుకో. తీరిన కోర్కెను తిరిగీ తెచ్చుకోకు. నీకు ఆనందము మిగలక ఏమౌతుంది. ఈ పద్యము విను.

తిండి నలుసు పట్టి తిరముగ గోడపై
ప్రాకుచుండు చీమ పడుచు లేచి 
పట్టుదలకు జయమె ఫలితమ్మురా ఇది 
రామ మొహనుక్తి రమ్యసూక్తి

విజయోస్తు.


*************************************************************

సమస్య మనది  సలహా గీతది  21

సమస్య : నాకు ఆలోచన నాస్తి ఆవేశం జాస్తి. పని మొదలు పెడతాను కానీ పర్యవసానము గోచరించదు లేక నాపాలిటి అనర్థ దాయకమౌతుంది.
అందువల్ల శాంతి లేదు. సుఖములేదు. కర్తవ్యము తెలియలేదు.

సలహా : మొదలు ఈ మాటకు అర్థము తెలుసుకో ! కర్త ఆలోచించి ఆచరించ దలచిన పనికి కర్తవ్యమని పేరు.
ఆలోచన నాస్తి అని నీవే అంటున్నావు. దానికి తోడూ ఆవేశము జాస్తీ అంటున్నావు . మనిషి యొక్క మనసును కోతితో పోల్చవచ్చును.ఆవేశము దానికి తోడైతే  అదే యావతో అది పిచ్చిదై పోతుంది. మరి పిచ్చిదైతే దాని పరిస్థితి ఎట్లుంటుందనేది నాలో కలిగిన భావానికి ఈ అక్షర రూపాన్నిచ్చినాను. ఒకసారి గమనించు, నీకే అర్థమౌతుంది.

మొదలే తానొక పిచ్చికోతి యగుటన్   ముల్ ద్రొక్కె, మైమర్వగా 
మదిరా మత్తపు చిత్తయై దుముకగా మంటల్ పదాలంటగా
కదిలెన్ కందుక రీతిలో, నభమునన్ కన్పింప నాట్యాంగనల్
వదిలెన్ తాళము పక్వమైన ఫలమున్ వైనమ్ముగా నెత్తిపై
ఇప్పుడు నీకు అర్థమై వుంటుంది, ఎంత అనర్థ మౌతుందో, కోతి పిచ్చిదైతే! అదే కోతిని సరియైన దారిలో వుంచితే మనిషి అయినా కాకపోయినా మనిషి ఆడించే విధముగా ఆడుతుంది. కాబట్టి ఏపనికైనా నిబ్బరము అంటే నిర్భరత అవసరము.   
ఇందుకు ఉదాహరణా ఇదేవిధముగా ఆవేశపూరితుడైన అశ్వత్థామ కథ క్లుప్తముగా తెలియజేస్తాను. అశ్వత్థామ ద్రోణుని కుమారుడని తెలియనివారుండరు. ఇతని తల్లి కృపి. ఇతడు సప్తచిరంజీవులగు.
1.    అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు, లలో ఒకడు.
కురుక్షేత్ర సంగ్రామములో దుర్యోధనుని తొడలు విరుగగొట్టబడిన తరువాత కౌరవ పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. మహా శూరుడు.
 అశ్వత్థామ తొడలు విరిగిన దుర్యోధనుని చూసి ఆరాత్రికి అత్యంత అక్రమమైన రీతిలోనైనా  పాండవుల చంపుతానని మాట ఇచ్చికృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళినాడు. కానీ అక్కడ దుష్టద్యుమ్నుని  పాండవులనుకొని ఉపపాండవులను కుత్తుకలు కోసి దారుణముగా చంపుతాడు. కారణం పాండవులను శ్రీకృష్ణుడు రక్షించడమే!
అది తెలుసుకొని పాండవులు శ్రీకృష్ణుని తోడుత వెళ్లి  అశ్వత్థామను కనుగొని, అతనితో అర్జనుని యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు చెప్పగా, అర్జనుని ధాటికి శరీరము జల్లెడ చిల్లులవలె అయిపోగా   పాండవ వంశమే లేకుండాచేసే తలంపుతో  అపాండవం అగు గాక అని మంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించూతాడు. దానిని అర్జునుడు అదే అస్త్త్రంతో ఎదుర్కొంటాడు. రెండు మహాస్త్రాలు ఒకదానిని ఒకటి ఎదుర్కొనడంతో అది విశ్వ వినాశమునకు దారితీయునని ఎరింగినవారయిన  వ్యాస, నారదాదుల వంటివారు వారి ఆయుధములను ఉపసంహరించుకొన కోరగా  అర్జునుడు ఉపసంహరించగలిగినాడు కానీ  అశ్వత్థామకు ఉప సంహారం తెలియదన్నాడు. ఆ మంత్రాన్ని అతను తండ్రి నుండి ఉపదేశం పొంద లేదు కాబట్టి. కృష్ణుడు దానిని పాండవ వంశాంకురమగు ఉత్తర గర్భము నందలి శిశువు వైపు మరల్చమన్నాడు . దాని ప్రభావం వల్ల పరీక్షిత్తు మరణించడం, అతనిని కృష్ణుడు బతికించడం తెలిసిందే. అంతట శ్రీకృష్ణుడు అశ్వత్థామను   మూడు వేల సంవత్సరములపాటు అనామకుడిగా, వ్యాధులు బాధలతో దేశదిమ్మరివి కమ్మని శపించినాడు. దానితో అహం అణిగిన అశ్వత్థామ తన శక్తికి కారణమైన తన శిఖలోని మణిని పాండవులకిచ్చి తపస్సుకై వ్యాసుల వారి వెంట అడవులకు వెళ్ళాడు.
ఈకథలో అశ్వత్థామ ఆవేశానికి అద్దమై, ధర్మమును విడిచి అనవసర ఆగ్రహమునకు పాత్రుడై శాపదష్టుడై చిరంజీవియై కూడా పడరాని పాట్లు పడినాడు.
ఆవేశమునకు ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇవ్వగల పరిధి నాకు లేదు.
శివ సహస్ర నామములలోన ఆయనకు అతంద్రితః  = తొట్రుపాటు లేనివాడు, మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు , సుసహః = మిక్కిలి సహనము కలవాడు అన్న పేర్లను మనం చూస్తాము. అంటే సహనము అన్నది పరమేశ్వర గుణము, పరమేశ్వర తత్వము, పరమేశ్వర రూపము. సహనమే ఆత్మ నిర్భరత. దానిని పొందుటకు విచక్షణ అవసరము. విచక్షణ వుంది అంటే బుద్ధి వున్నదనే కదా అర్థము. మరి బుద్ది లేమితో ఎన్ని అనర్థా లొస్తాయో , అసలు ఈ విషయములో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూస్తాము :
 నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన  
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖం  66  2
ఎవడయుక్తుడో వానికి  ఎరుక పడదు బుద్ధి ఉనికి
పావనమౌ బుద్ధి లేక భావనయు రాదు పనికి
భావహీనమైన ఎడల   పలుకరించబోదు శాంతి
శాంతి కానరాని చోట సౌఖ్యమన్న దొక భ్రాంతి   66  2
నీలో సమబుద్ది లేదు. కర్మ కౌశలమూ లేదు . దానివల్ల నీకు కార్య సిద్ధి కలిగినా కలుగకున్నా, సమ భావము, అఫలాపేక్ష,లేదు. అది కావాలంటే  నీలో సుకృత దుష్కృత విచక్షణ పెరుగవలె. అది నిరంతరాభ్యాసము వల్లగాని రాదు. ఆబుద్ధి కలుగకుంటే సదాలోచన ,సద్భావనా పరంపర సమీపమునకు రా సాధ్యముగాదు.  సద్భావనా వీచికలు లేని మనసుకు శాంతి చేరువ కాదు. శాంతి చేరకుండా సౌఖ్యము లేదు. నాద బ్రహ్మ త్యాగయ్య కూడా ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అనేకదా అనుభవ పూర్వకముగా శెలవిచ్చినారు.
కాబట్టి మనశ్శాంతిని చూరగొన్న వాడే సదాలోచానాపరుడై కార్యసాధకుడనిపించుకొంటాడు.
ఆదివేదమగు ఋగ్వేదములో ఈ మంత్రమును గమనించు.
ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతోదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃI
దేవానోయథా సదమిద్ వృధే ఆసన్నప్రాయువో రక్షితారో దివేదివేII (ఋగ్వేదము)
దశదిశలనుండి నిరంతర కళ్యాణకారకమగు ఆలోచనలే లేక భావనలే మాలో ప్రసరించుగాక. అట్టి భావనలకు ఎటువంటి అవరోధము వుండకుండుగాక. మంగళకరమగు అజ్ఞాత విషయములు కూడా మా కర్ణ శ్రావ్యమగుగాక. నిరంతరమూ సకల దేవతలూ మమ్ము రక్షించుతూ మా ప్రగతికి కారణభూతులగుచుందురుగాక. ఈ ఒక్క శ్లోకము చాలు మనము పరిదినతిక్రమించి ఆవేశము పాలు కాకుండుటకు.
అడుగడుగునా, ప్రతి నుడుగునా, దారి పొడుగునా మంచిని మాత్రమే తెలిపే మన వేదశాస్త్ర పురాణములు వాని సారమైన ఉపనిషత్తులు, వానిసారమైన భగవద్గీత మన ధర్మమునకు పట్టుకొమ్మలు. వీనిలో ఉండేది వేరు ఏ మత గ్రంధముననైనా ఉండవచ్చు కానీ ఇందులో లేకుంటే వేరెక్కడా లేనట్లే!
శాంతి సుఖ సౌభాగ్య ప్రాప్తిరస్తు.

స్వస్తి.

******************************************************

సమస్య మనది  సలహా గీతది  22
బాహ్యేంద్రియాలనే గుర్రాలపై నా కోర్కెలు సవారీ చేస్తున్నాయి.వాటి కళ్ళెములు లాగే శక్తి నాకు గోచరము అగుట లేదు. నాగతి ఏమిటి ?

గాలిబుడగ (Balloon
 )ను చూసివుంటావు. దానిని సాధారణమైన గాలితో నింపవచ్చు లేదా ఉదజని ( hydrogen ) తో కూడా నింపవచ్చు. గాలిబుడగ సాధారణ వాయువుతో నిండియున్నంతసేపూ నీతోనే వుంటుందిదానికి బదులుగా ఉదజనితో నింపినావనుకో అది ఎప్పుడైనా నీచేయి దాటి పోయేదే! ఇందులో నీకేమి అర్థమౌతూవుంది. సాధారణమైన కోరికలు అంటే సహజమైన గాలి తో సంతృప్తి చెందే వరకూ జీవితమనే గాలిబుడగ నీతోనే వుంటుంది. నీ ఆశ పెరిగి పెను కోరికలకు మరిగిఉదజని కొరకు తిరిగి బుడగ నింపితే అది ఎప్పుడైనా నీ చేయి జారేదే ! ఈ వాస్తవము గుర్తెరుగు. వెనుకటికి ఒకడు తన స్నేహితునికి ఒక చెట్టు చూపించి "ఈ చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ విద్యార్థినులు అందరూ కనిపించుతా"రన్నాడటట. స్నేహితుడు వెంటనే " అవును చేతులు వదిలితే మెడికల్ కాలేజి విద్యార్థినులు కూడా కనిపించుతా"రన్నాడట. కాబట్టిఎంత చెట్టుకంత గాలి . దురాశ దుఃఖమునకు చేటు అన్న నానుడులు వినలేదా ! వినియుండవేమో ! అవి ఇంగ్లీషు బళ్ళలో నేర్పించరు కదా!
సాత్త్విక గుణ సంపన్నులు ఆధ్యాత్మిక పురోగతిని అభిలషించితేరాజసిక గునపోషకులు భౌతిక వస్తువిషయ సంపద కొరకు అత్యంత ఆసక్తిని  కనబరచుతారు. ఈ భూమిపై నీవు కోరుకోనేదేదయినా తాత్కాలికమైనదే!  మరియు ఇహపరమగు ఆ వాసనలు అనుభవాలు ఆస్తులు అన్నీ  ఇక్కడ ఎదో ఒకరోజు వదిలి వేయవలసినదేనని అని అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో ఉద్వేగపూరితులై  పవిత్రత అన్న పదమును దరిజేరనీయరు. అందుకేవారికి అందిన దానితో తృప్తి చెందకఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూఎక్కువ సంపాదిస్తూఎక్కువ భోగిస్తూ ఉంటే వారు ఈర్ష్యతో హింసాప్రవృత్తులైసాటి మనిషి అన్న జాలినివీడిప్రాణము తీయుటకు కూడా వెనుకాడరు. క్షణికమగు  కోరికలు తీరినప్పుడు అతి సంతోష పడతారుఅవి తీరకపోతే నిరాశ చెందుతారు. ఈ విధంగావారి జీవితములకు నిశాలత ఉండదు. ఎప్పుడూ డోలాయమానమే. ఆకారణముచే ఆరోగ్యము చెడుతుందిఅనర్థము జరుగుతుంది. నీవు నాటుకొన్న విషయ వాంఛా బీజములు విష బీజములై వయసు ఉడిగేకొద్దీ ప్రకోపించి నిన్ను నిర్వీర్యుని చేస్తాయి. సంతృప్తి సంతోషములు స్వర్గసమములు. క్రింద కనబరచిన ఆ అద్వితీయమైన ఆలోచనను ఒకసారి చదువు:
సత్వము సత్యమార్గమును సాధన చేసిన పొందజేయు నా
తత్వము నీవెరింగి రజ తామస రీతుల వీడనాడి యం
ధత్వము నుండి బైట పడి ధర్మము తప్పక సంచరించుచో
సత్వర మీవు చేరనగు సంతత రీతిని చక్రి పాదముల్
ఇక అసలు విషయానికి వస్తాము . నీ సమస్యకు పరమాత్మ ఏమి సలహా చెబుతున్నాడో చూస్తాము.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి     67-2

బాహ్యేంద్రియముల వశ వర్తినియౌ
 
మది  పెనుగాలిగ  మారుచు బుద్ధిని
నడిసంద్రములో నావజేయుచును 
తీసుకపోవును తెలియని దారుల                      67 - 2

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
               68 - 2 
ఇంద్ర్యాణీంద్రియార్థేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా

అందుకేనయా అర్జున! తెలియుము
నీ బాహ్యేంద్రియ నిగ్రహమ్ముతో
బాహ్య విషయముల పరికించనిచో 
నీ వివేకమును నిలువరించెదవు                             68 -2

నీ బాహ్యేంద్రియములు కోరినవి నీమనసుకు చేరవేస్తున్నాయి. నీ మనసు బుద్ధిని కోరిక తీర్చుకొనుటకు వుశిగొల్పుతూవుంది.
మరి నీ బుద్ధికి కళ్ళెం వేస్తే అది మనసుకుమనసు ఇంద్రియాలకు వేయగలుగుతుంది. పరమాత్మునిచే చెప్పబడిన ఈ ఉపమానమును గమనించు. భగవానుడు చెప్పిన నావ నీవు.సముద్రము నీ చుట్టూవుందే ప్రపంచము. గాలులే నీ కోరికలు.నావను నియంత్రించే సరంగు నీ వివేకము. ఇక ఆ నావికుని దిక్సూచియే వేదశాస్త్రాలు. చేరవలసిన తీరమే ప్రశాంతి. అక్కడ ఏ చీకూ చింతాలేదు . రాగం ద్వేషం లేదు. ఈర్ష్యాసూయలు లేవు. అంతా ప్రశాంతము. ఎటువంటిపోలికో చూడండి. ఇటువంటి పోలిక ఇచ్చుట వ్యాసులవారికే చెల్లుతుంది. చెప్పుటకు భగవంతునికే ఒప్పుతుంది. ఆయన ఈయన ద్వారా చెప్పినాడా లేక ఈయన చెప్పినది ఆయన మనకు తెలియబరచినాడా అన్నది మనకు అప్రస్తుతము. ఆమాట మనకు శిలాశాసనము. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమయితే అర్జనునికి చెప్పినాడో నీవు నేను చేయవలసినది కూడా అదే! కాబట్టి నీ బాహఎంద్రియముల నిగ్రహించు. అప్పుడు నీవు బాహ్య విషయముల జోలికి పోవు. అప్పుడు నీ మనసుకు తటస్థత పోయి నిశ్చలత సమకూరుతుంది. మనసు నిశ్చలమైతే  బుద్ధిబుద్ధిగా కుదుతబడుతుంది. అర్థమైనదికదా మరి ఆచరణలో పెట్టు.
మనోబల ప్రాప్తిరస్తు.


******************************************************
సమస్య మనది  సలహా గీతది   23

సమస్య: ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని నా కోరిక . అది సాధ్యమౌతుందా?

సలహా: పనీ పాట లేకుండాజీవితము గడచిపోవలెనన్న మాటతోనే, నీకు కష్టమనిపించే అడ్డంకులు ఏవీ లేకుండా 
‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అన్నట్లు జరిగిపోవలెనన్నది నీ అత్యాశ. నీ ప్రశ్న వింటూవుంటే నాకొక కథ గుర్తుకు వస్తూవుంది.

గ్రీష్మఋతువు రోహిణీ కార్తె లోనిఎర్రటి ఎండలో చెట్టు చేమ కనిపించని బీడుమార్గములోనురగలుకక్కుకుంటూ పరుగెత్తలేక పరుగెత్తుతున్న గుర్రముపైనెక్కి అమితమైన దాహముతో వస్తూ వున్నాడు.
అమితముగా అలసిపోయిన అతనికి అనుకోకుండా అక్కడ ఒక అల్లనేరెడు చెట్టు  అగుపించింది. చెట్టు నీడకు చేరి అశ్వమును అవరోహించి అటు ప్రక్కగా చెట్టు నీడలో,ఒకచేతివ్రేళ్ళ సందులలో మరియొక చేతి వ్రేళ్ళను దూర్చి  తలక్రింద ఆ కలగలిసిన చేతులను చేర్చి  వెల్లకిలా ఆకాశము వంక జూస్తూ పడుకున్న ఒక బవిరి గడ్డము  సాహెబుగారిని గమనించినాడారౌతు.  తదేకముగా అతనిని చూడటముతో రౌతుకు సాహేబుగారి గడ్డముపైకలమాగిన అల్లనేరెడు పండు పడియుండుటను గమనించినాడు. కాసేపు అలాగే చూసిన పిదప తన ఉత్సుకతను ఆపుకోలేక సాహెబుగారినిఆపండు నోటిలోఎందుకు వేసుకోలేదోఅడిగినాడు. దానికతను “నేను, నీలాగా ఎవరో ఒకరు రాకపోతారా నేనడిగితే నోట్లో వెయ్యకపోతారా” అనివేచియున్నా నన్నాడు. వళ్ళుమండిన రౌతు తన నడుముకు వ్రేలాడుతున్న ఒర నుండి వ్రేలాడుతున్న కత్తిని తీసి సాహెబుగారి గొంతుమీద  పెట్టి“పండునోట్లో వేసుకొంటావా లేదా “ అని ఒక్క సారి హూంకరించిన వెంటనే నోట్లో వేసుకొన్నాడు. కాబట్టి ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే కర్మ నుండి నీవు తప్పించుకొనలేవు.

అసలు కర్మ చేయకుండానే ఉండగలుగుట మనిషికి సాధ్యమే కాదు. నీవు దగ్గడము ,తుమ్మడము,  తినడము, త్రాగడము, నిదురించడము ఇవన్నీ కర్మలే. కాకపోతే నీవు చేయదలచు కొంటున్నావు కాబట్టి చేస్తూ వున్నావు. నీ కన్నా బిడ్డ చిన్న బిడ్డగా వున్నపుడు ముక్కున చీమిడి వస్తే  తీయకుండా అట్లే వుంచినావా! తీయడము నీ బాధ్యత, తీసివుంటావు.ఒకసారి ఒక మంచుగడ్డ రాతిగుండుతోఅనిందట
“ మనమిరువురమూ గట్టిపిండాలమే గానీ నాలోవున్న గొప్పదనము నీలో లేదు. వెలుగు నాపై బడితే తళతళ మెరుస్తాను నేను. నీవు అలా కాదు. నాలో సౌకుమార్యము ఎక్కువ. ఎండలోనిలుస్తే చెమటలు విపరీతంగా పట్టేస్తాయ్తి. ఏ మంచుకొండ లోనో, శీతకరండము (Rrefrigerator ) లోనో నా జీవితము గడిచి పోతుంది. అప్పుడు రాతిగుండు ఈ విధంగా అనింది."నీ వుండే చోటనే కలకాలమూ వుండిపోలేవు. నీవు వున్న చోటునుండి బయట పడకనూ తప్పదు ఏవిధముగానయినా ఆవిరి కాకనూ తప్పదు ఆపై వానగా మారి ఏ మురికి గుంటలోనన్నా పడవచ్చు మహా సముద్రమునైనాచేరవచ్చు. ఏది ఎట్లయినా నీవు నీవుగా వుండలేవు. నిరంతరము జనన మరణ చక్రపు పరిధి పై బిందువై తిరుగుతూ వుండవలసినదే. కానీ నేను నా అకారమును తగ్గించుకొంటూ సూక్ష్మరూపమైన ఇసుకరేణువునై శర్వేశ్వరునితో పోల్పబడే సాగరతోనే వుండిపోతాను.నాకు నియమింపబడిన కర్మ నేను చేయకుండా వుండిపోను.జీవికి పరమాత్మ సంగమమే పరమావధి. మరి నాపరిస్థితి ఎప్పటికీ అంతేనా అన్నది మంచు. లేదు అంటూ రాయి ఈ విధంగా చెప్పింది." ఒక్కసారి నీవు వానరూపములో ఒక చెట్టును చేరినావనుకో అంతే ఏదో ఒకరోజు నీవు ఏ విత్తనము రూపములోనో సాగరము చేరిపోతావు. ఇక ఆప్రాంతమే నీ నివాసము. కాబట్టి కర్మల
 చేయకనూ తప్పదు పరమాత్ముని చేరుటకు అవి సత్కర్మలై యుండకనూ తప్పదు.
అసలు అచ్యుతుడౌ కృష్ణ భగవానుడీ విషయములో ఏమంటున్నాడో చూస్తాము.     
  నహి కశ్చిత్ క్షణమపి  జాతు తిష్టత్య కర్మ కృత .
  కార్యతే హ్యనశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః            5--3
                                                                               
కర్మలటక నెక్కించి కనులు మూసి కూర్చొనడం
కానేరదు కడు సులభం కాదది హస్తామలకం 
ప్రకృతి తనదు త్రిగుణాలను ప్రసరించుచు నీమీదికి
కర్మకారకుని జేయును కాసింతయు వ్యవధినీక         5--3


అనగా ఎ మనిషైనా ఎ కాలంలో నైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా వుండలేడు .దీనిలో ఎలాంటి సందేహం లేదు . ఎందుకంటేమనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకి లోబడి కర్మలని చేయవలసిందే .

మరి కర్మ అంటే అసలేమిటి ?

క్రియతే ఆనేన ఇతి కర్మ ---చేయబడేది ఏదైనా కర్మయే . కర్మ అనగా మానసికంగా గాని శారీరికంగా గాని చేయబడేది .. పూర్తి అయిన పనిని కర్మ అని, ఇంకా జరుగుతున్న పనికి క్రియ అని అన్నారు .అనగా కర్మ తాలూకు భీజం క్రియ లోనే వుంటుంది . కర్మ మంచి కావచ్చు చెడు కావచ్చు .లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు .

నిర్మల‌మైన‌దియుప్రకాశింప‌జేయున‌దియుఏ దోష‌ములేనిదియు న‌గు స‌త్వగుణ‌ము . తృష్ణచేత‌నుఆస‌క్తిచేత‌నుపుట్టి మానవులను ఐహికర్మలపై అనురాగమును కలిగించునది ర‌జోగుణ‌ము . జ్ఞాన‌మునావ‌రించి ప్రమాద‌మునుక‌ర్తవ్య మూఢ‌త‌యందాస‌క్తిని క‌లుగ‌జేయునది త‌మోగుణ‌ము. ఈ త్రిగుణముల పౌనఃపున్యములే మానవులను వివిధ సత్కర్మల లేక దుష్కర్మలయన్ దనురక్తుల ఝేయుచున్నది.
               
  నీతు భోగాద్రుతే  పుణ్యం కిమ్చిద్వా కర్మ మానవం 
  పావకం నా పునాత్యాషు క్షయో భోగా త్ప్రజాయతే 
                                                               --కర్మ విపాక సంహిత
అనగా సుఖ దుఃఖ  రూపాలైన కర్మలని అంటే పాప పుణ్యాలని అనుభవించక మానవుడు వాటి నుండి విముక్తుడు కాలేడు   అంటే పరమాత్మను శాశ్వతముగా అందుకోలేడు.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విథ్యాచారఃస ఉచ్యతే     6--3

వాగ్వపుషమ్ముల వనరుగ వంచుచు
మునివేషములో మురియగ తలవకు
మనసునుకోర్కెల మబ్బులు ముసిరిన
కపటవేషమే కనబడు మరువకు                               6--3


బాహ్యేంద్రియ నిగ్రహాన్ని "దమము"అంటాము. అంతరేంద్రియమయిన   మనోనియంత్రణను "శమము" అంటాము. "దమము" వుండి శమము   లేకపోతే  కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే వుంటాయి; అలాంటి మానవుడు తన అలవాట్లకు బానిసౌతాడు అంటే దుష్కర్మల బానిసైపోతాడు.
అట్లని భాహిరముగా ఇంద్రియ నిగ్రహత చూపుతూ ఆంతర్యములో అన్నీ అనుభవించవలెనను కపటి కలకాలమూ గౌరవము పొందలేడు. జీవితంలో సహజంగా బ్రతకాలి.

"దమము
"తో ప్రారంభమయి,"శమము"నకు చేరుకోవాలి. కాబట్టి మనసును మంచి కర్మలపైకి మరలిచు.అప్పుడు బుద్ధి నీ కర్మలకు అనుగుణముగా వుంటుంది. ఎందుకంటే 'బుద్ధిః కర్మానుసారిణీ అన్నారు కదా! 
ఏపనీ చేయకుండా ఏదో విధంగా జీవితము గడచిపోవాలని ఎప్పటికీ కోరుకోవద్దు. సత్కర్మలనాచరించు. సత్వమునాశ్రయిచు. సత్సమాజమును స్థాపించు.

శుభం భూయాత్

******************************************************
సమస్య మనది  సలహా గీతది   24

సమస్య : నా జీవితము వూరకున్నా జరిగిపోతుంది. పురుగులు తొలిస్తే ఏదో ఒక పని చేస్తాను లేకుంటే వూరకనే 

వుంటాను. చేసే పనులలోకూడా ఆలోచన తక్కువ ఆవేశము ఎక్కువ. అంతా నా కర్మ, నాతలరాత.

సలహా :మొదట నీప్రశ్న లోనే తప్పువుంది. అదేమిటంటే కర్మ, తలరాత అన్నవి క్రైస్తవ ఇస్లాం మతములలో అవి 

ఒకటిగా పరిగణింపవచ్చు గానీ మన వైదిక ధర్మములో అవి వేరు వేరు. పై రెండు ధర్మములలోనూ  దేవుడు జీవి 

చేసే మంచి చెడ్డలను ముందే నుదుట వ్రాసి పంపుతాడని నమ్ముతారు  మన ధర్మము ఆ విధముగా చెప్పదు. 

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక మనలో కూడా కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.

మానవుడు చిత్త చాంచల్యముతో కానీ చిత్త స్థైర్యముతో కానీ తాను చెడ్డ మంచి కర్మలను ఆచరించుతాడు. కాబట్టి కర్మ  మనచేత నుంటుంది కానీ కర్మఫలము పైవాని చేతిలో వుంటుంది.  తలరాత అంటూ తల పట్టుకొని కూర్చుంటే పనులౌతాయా. గాలిలో దీపము పెట్టి దేవుడా నీవే దిక్కంటే అవుతుందా ! దేవుడే 'పనిచేయి ఫలితము నాకొదిలిపెట్టు అన్నాడు. కాబట్టి ఆలోచన వుండవలసిందే అచరణా వుండవలసిందేఅప్పుడే అనుగ్రహము దేవునిది వుంటుంది.
జీవితము నాటకము భూతలము నాటక రంగము మనము పాత్ర ధారులము పైవాడు సూత్ర ధారి అన్నది అందరకూ తెలిసినవిషయమే. మరి నీ పాత్రకు నీవే కర్తవు కదా !కర్తవు నీవైతే కార్యము నీ కొరకు సిద్ధముగా వున్నట్లేకదా ! కార్యము సిద్ధముగా వుంటే నీ క్రియ మొదలు కావలసినదే! క్రియ ముగుసినది అంటే ఆ కర్మ ముగిసినట్లే ! తిరిగీ వేరొకటి మొదలు.నీ కర్మకు ఫలితము పాపము పుణ్యము. కట్టె కాలిన తరువాత నీ వెంట నడిచేది ఈ కర్మ ఫలితాలే అంటే పాపపుణ్యాలే. ఈ విషయాన్నే పెద్దలు ఈ విధంగా అన్నారు

ధనాని భౌమౌ పశవశ్చ గోష్టే
నారీ గృహద్వారె జనః స్మశానే
దేహాశ్చితాయా పరలోక మార్గే
కర్మానుగోగచ్చతి ఏకమాత్రాః
నీధనము దార దాయలు  దేహము అన్నింటికీ తాము నీతో సహగమించుటకు కట్టుబాట్లున్నాయి కానీ నీ కర్మము మాత్రము నీతోబాటే వుంటుంది. అందుకే ఆచరించేవి సత్కర్మలైతే తనువు బాసిన తరువాతకూడా నీకు బాసటగా నిలిచి మేలు చేస్తాయి. ఇక పరమాత్మ ఈ విషయములో ఎమంటున్నాడో చూస్తాము.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యరకర్మణః !
 
శరీరయాత్రాపాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః !  8 - 3 

చేయవలసినది చేయ మానకుము
చేర్చు కర్మమే జీవన గమ్యము
నిష్క్రియత్వమును నిజముగ జేర్చదు
నీదు వపుషమిది నిక్కము నమ్ముము  8 - 3
నీకు విధించిన కర్మలు నీవు చేయక తప్పదు. అకర్మ కన్నా సకర్మ సర్వస్రేష్ఠము. అసలు నిష్కర్ముడవైతే నీ శరీరమునే 

కాపాడుకోలేవు. విస్త్రుతముగా దిన కర్మలను మూడు . అవి 1. నిత్యకర్మ 2. నైమిత్తిక కర్మ 3.కామ్య కర్మ. వాతిని గూర్చి ఒక్క 

మాట మాట్లాడుకొందాము.

      నిత్యం   :   ప్రతిరోజూ చెయ్యాల్సినవి 
      నైమిత్తికం :      ఒక కారణము కొరకు చేసేవి

      కామ్యం :   ఫలితాన్ని ఆశించి చేసేవి

1996 Atlanta Olympics లో 18 సంవత్సరాల Kerri Allyson Strug అన్న అమెరికా అమ్మాయి Pole Vault లో తన కాలు విరిగినాఆ క్రీడలో నిపుణులైన రష్యా దేశస్థులను అధిగమించి, గెలిచింది. అది కాదు గొప్ప అసలు ఆమె గొప్పదనము ఏమిటంటే ఆ క్రీడ మొదటి round లోనే  ఆమె కాలి  ముణుకు దగ్గర బెణికింది. దానిని ఆమెCoach Béla Károlyi గుర్తించడము జరిగింది.ఇంక ఒక్క round లో పాల్గొంటే ఆమె గెలుస్తుంది. అప్పుడు Károlyi ఆమె "చెంతకుపోయి నీ బాధ నేను గుర్తించినాను. ఈ రాబోయే round లో పాల్గొనేది నీవు కాదు నీ దేశము అన్న ఒక్కమాట గుర్తు పెట్టుకొని పాల్గొను"మన్నాడు. అంతే ఆ ఒక్క మాట లోని స్పూర్తితో ఆమె విజయాన్ని సాధించి కుప్ప కూలిపోయింది. Károlyi ఆమెను medals podium వద్దకు మోసుకుపోయినాడు. తరువాత అంతా సుఖాంతమే.White House కు ఆహ్వానింపబడిన ఆమెనుఅప్పటి President Bill Clinton ఎంతగానో ప్రశంసించినాడు.
ఈ ఉదంతమును  పై మూడు కర్మలకు ఉదాహరణ గా తీసుకొందాము.
ఆమె ప్రతిరోజూ ఆ క్రీడలో ప్రావీణ్యత కొరకు పరిశ్రమించుట నిత్యకర్మ. తన పరిశ్రమను ఇంకా  ఏ అంతస్తువరకు పెంచవలెన్న ఆలోచనతో లేక క్రీడా స్పూర్తి కొరకో చిన్నచిన్న  క్రీడా స్పర్దలలో (ఆటల పోటీలు ) పాల్గొనడము నైమిత్తికము. Olympics లో పాల్గొనుట కామ్య కర్మము మరియు కాంచన పథకము సాధించుట కామితము.
ఇప్పుడు ఆమె కర్మాచరణను  ఒకాసారి తలపుకు తెచ్చుకో. వడలు గగుర్పొడిచితే కర్మచేయుటకు వలయు చిత్తశుద్ధికి నీవు స్పందించినట్లే. 
పైమూడూ ఈ జన్మలో నీవు ఆచరించే కర్మలు. ఇవి కాకుండా నీ జీవి ఆచరించే కర్మలు మూడున్నాయి. అవి జీవిని జన్మ జన్మలకూ వెంటాడుతూనేవుంటాయి. అవి :సంచితం (భూతకాలానికి సంబంధించినది), ప్రారబ్ధం
 (వర్తమానానికి సంబంధించినది) ఆగామి (భవిష్యత్తునకు సంబంధించినది.)  ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు.


అబద్ధం, కపటం, చౌర్యం, హింస,మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసేవి దుష్కర్మలు.  అందుకే వేత్తలు వీటిని వదిలి జీవించుటను ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. పునర్జన్మల పై నమ్మకం, స్వర్గప్రాప్తి, నరకభీతి లాంటివి కూడా ఈకర్మవాదం కిందకి వస్తాయి. ఈ స్పృహ నీకు కలిగితే కర్మలు మాని కాళ్ళు ముడుచుకొని కళ్ళు మూసుకొని కూర్చోవు. త్రివిధ కరమలను సత్సంకల్పముతో ఆచరించి శ్రేష్ఠునివనిపించుకొంటావు.



శుభం భూయత్ 

************************************************

సమస్య మనది
  సలహా గీతది   25.

సమస్య : 
 దేవతలు వారికి ప్రీతి గలిగించుటకు యజ్ఞ యాగాలు అర్థవంతముగా నాకగుపించవు మనకు అందుబాటులో వున్నది మన మనుభవించుటలో తప్పేమున్నది దేవతలు మనకగుపించుట లేదు కదా ?

సలహా : చర్మ చక్షువులకిది అక్షరాలా నిజము. ఒక సారి పంచ భూతములను గుర్తు చేసుకో ! భూమికి శబ్దస్పర్శరూపరసగంధములైదూ ఉంటాయి . మరి రెండవదైన నీటి విషయములోనో  శబ్దస్పర్శరూపరసములు మాత్రమే ఉంటాయి . ఇక వెలుగు విషయములొ  శబ్దస్పర్శరూపములే వుంటాయి .వాయువుకంటేనో శబ్దస్పర్శలు మాత్రమే. ఇక మిగిలిపోయింది ఆకాశము ( Ether ). ఆది కేవలము శబ్దాత్మకము.దేవతలకు పంచభూతములకు ఏమిటి సంబంధము అని తలచుతున్నావేమో చెబుతాను విను. పైన తెలిపిన ఈ ఐదు  గుణాలను భూతములలో గమనించితే భూమికి ఐదు గుణాలూ వుంటే నీటికి నాలుగే తరువాత మూడే. ఆపై రెండూఒకటి . మరి గుణాలు తగ్గుతూ వస్తూవున్నా భూతాలు ఐదు అని నమ్ముతున్నావు. ఎందుకంటే ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రాలు కూడా ఒప్పుకొన్నాయి కాబట్టి. ఇపుడు ఆకాశము విషయానికి వస్తాము. ఆకాశము అనంతము. దానికి పెరుగుదల కానీ తరుగుదల కానీ లేదు. అర్థము చేసుకొంటే అది శూన్యమే. ఈ విషయము అవగాహనకు వస్తే ఈ పంచ భూతానుభూతులు మాయమయిఅసలు వీటికి కర్త ఎవరు అన్న ఆలోచన వస్తుంది. వస్తువుంటే కర్త వుండవలసినదేకదా ! ఆ కర్తను మనము పరమాత్మ అన్నాము.
కార్యాలయమును మనసునందు ఊహించుకో! దాని ప్రధానాధికారియొకడే కానీ అతనిక్రింద ఇద్దరు వారిక్రింద నలుగురూ ఈ విధముగా పోతూనే వుంటుంది. ఆ కార్యాలయములో మనకు పనిబడినపుడు క్రిందినుండి మన సాధన మొదలుపెట్టి ఏ అంతస్తు అధికారివద్ద మనపని జరిగిపోతే అక్కడితో మనపని ముగుస్తుంది. లేకుంటే సాధనను పెంచి అత్యున్నత అధికారి వరకు పోతాము. దీనిలొ అత్యున్నత అధికారి పరమాత్మ ఐతే మిగిలిన అధికారులే దేవతలు. దీనిని విధుల కేటాయింపు (Allocation of Duties) అనవచ్చు.
గౌరవనీయుల వద్దకు పోయినపుడు పత్రం పుష్పం ... పట్టుక పోవడము మన పెద్దల కట్టుబాటు. అది పెద్దలయందు గౌరవము విధేయతకు చిహ్నముమనము వారియందు మన కోర్కెలనీడేర్చే భగవంతుని చూస్తాము కాబట్టి. ఇది లంచము కానేరదు. పరమాత్మనే ఈ మాట చెప్పినాడు.

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన:             (భగవద్గీత 9 - 26)
ఫలమో పుష్పమొ పత్రము జలమో
ఆత్మ శుద్ధితో అమిత శ్రద్ధతో
 పరమ ప్రీతితో భక్తుడొసంగిన
అందుకొందునతి ఆదరమ్ముతో                                  (భగవద్గీత 9 - 26)               
సుదాముడు (కుచేలుడు ) కృష్ణుని స్నేహితునిగానే ఎంచి చూడబోయినాడని మనకు తెలిసినదే అయినా తనకు గలిగిన అటుకులను తీసుకుపోయినాడు. ఈ పద్ధతి గౌరవముప్రేమఅభిమానముభక్తిస్నేహము మొదలగువానికి నిదర్శనము.

దళమైన బుష్పమైనను, 
ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన, 
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (పొతన భాగవతం-దశమ స్కందము-కుచేలోపాఖ్యానము)

అంటే దేవతలను కూడా భక్తి ప్రేమ భావములటొ వారికి ఫలము నొసగవలెనని తెలియుచున్నది కదా ! ఆ ఫలము నొసగితేఅంటే ఇక్కడ వారి  హవిస్సులు అని అర్థముఎందుకంటే హవిస్సులే యజ్ఞ ఫలములువాని వాహకుడే అగ్ని. ఆయనే దేవతలకు మానవులకు సంధానకర్త. వారు తృప్తులయి మన కోర్కెల నీడేరుస్తారు. కరువు కాటకములళో యజ్ఞములుచేసి వర్షమును కురిపింపజేయుట మనము గమనించే విషయమే కదా! కాబట్టి దేవుడొకడైనా దేవతలు మెండు. చదువు (Education) సరస్వతి ,సంపద (Wealth) లక్ష్మి శౌర్యము (Velour) శక్తి. ఇంద్రుడు సౌభాగ్యము నకు బ్రహ్మ విష్ణు మహేశులు సృష్టిస్థితిలయములకు ఈ విధముగా దేవతలకు వారి వారి విధులు ఏర్పరుపబడినాయి. మనపని ఎవరివల్ల లేక ఎవరి ద్వారా జరుగుతుందో వారిని 
మనము కొలుస్తాము. అందరినీ అంటె యజ్ఞము చే తృప్తుల జేయవచ్చు.

ఇక భగవానుడేమంటున్నాడో విను.
దేవాన్ భావయతా నేన తే దేవా భావయంతు వః
 పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ             11 - 3


ఇచ్చి పుచ్చుకోవడాలు ఇహపరముల సాధనాలు
దైవ ప్రీతి జేయ నరులు దయ వారిది పొందగలరు
నిస్వార్థపు భావనయే నిజము నరుల కండదండ
ఒకరికొకరుఇది గల్గిన ఒనరు నిష్టకామితములు            11--3

ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్ధత్తానప్రదాయైభ్యో యోభుంక్తే స్తేన ఏవ సః    12 --3

హవన ప్రీతులై యఖిల దేవతలు
ఇత్తురయాచిత ఇష్ట భోగములు
ఏమి ఇవ్వకనె ఎల్లసుఖములను
పొందెడువారలు పోల్పగ చోరులు                  12 --3

యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా చోరుడగును.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .
ఒక Super Market కు పోతే మనకు కావలసిన వస్తువులను కొంటాము. ఆ వస్తువు పై ఆ company పేరు అందు ఏ పదార్థములు వాడినారో మొదలగు వివరములు వుంటాయి. మరి కలకాలమూ మనము వాడే నేల నీరు నిప్పు మొదలగు పంచభూతములకు Expiry Date లేదు కదా! మరి ఆ వస్తువులనిచ్చిన దేవతలకు మనము కృతజ్ఞత కబరచుకోనవసరము లేదా ! అట్లు కనబరచక అవి వాడుకొనుట కృతఘ్నత మరియు చౌర్యము కాదా!
దదాతి ప్రతిఘృణ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి
భుంక్తేచ భోజయింత్యేవ ఇత్యేతత్ మిత్రలక్షణం
అన్నారు పెద్దలు. మరి దానిని పాటించుట మన బాధ్యత.

కాబట్టి దేవతలు వున్నారని వారి కరుణ చేతనే మనము సుఖముగా వుండ గలుగుతామనివారిని సంతృప్తిపరచ వలసిన బాధ్యత మనపై కలదని గ్రహించి సంచరించి సత్ఫలితములను పొందుము.
దైవానుగ్రహ ప్రాప్తిరస్తు .



K R Narayanachar Narayan Sir meeru chese posting chadevetappudu meelo aikyamai(mee sanidyamulone vundalanna thapana)
Kaluguthundi, samudramula lothu laga Abba yennivishayamulu dakkunnayi andukone sakthi ledu 
Anandinchadam aswadinchadam thappa, dhanyosmi

***********************************************************************************************