Wednesday 22 February 2017

మతరాజకీయ వ్యాపారంలో మదర్ తెరిసా

Wednesday 15 February 2017

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మన చరిత్రను గురించి తెలుసుకొనుట మన తక్షణ కర్తవ్యము. మన గతము మన   వారసత్వము, మన సంస్కృతిని గూర్చి మనసారా  తెలుసుకొనుట మన బాధ్యత. మన దేశమును మన కళ్ళతో చూసుకొనుట అత్యంత ఆవశ్యకము. సద్గురు శివానంద మూర్తి గారు.
ఆ భవిష్యద్దార్శనికుని మాటలను మనసారా విశ్వసిస్తూ ‘సారే జహాఁసె అచ్చా’ అన్న జాతీయ హోదా గలిగిన గీతమును గూర్చి దానిని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ గారిని గూర్చి నేను విన్నది, చదివినది, పెద్దలచే తెలుసుకొన్నది  అతి క్లుప్తముగా తెలియజేస్తాను. వీరిని పాకిస్తాన్ దేశపు ఆధ్యాత్మిక పితగా గుర్తించుతారు. వీరికి అల్లామా ఇక్బాల్ అని గౌరవముగా పాకిస్తానీయులు పిలుచుకొంటారు. 'అల్లామా' అన్నది ముస్లీములు ఘనమైన విద్వాంసులకు ఇచ్చే బిరుదము.
ఈ విషయమును గురించి వ్రాయుటకు కారణము కొంత కాలము క్రితము ఈ విషయమై నేను చూచుట  తటస్థించిన  ఆస్య గ్రంధి లోని ఒక ప్రచురణ. అది ఇక్బాల్ గారిని గూర్చిన కొన్ని కల్పనలు కలిగియుండుట చేత నేను వాస్తవమును నా చేతనయినంత మేరకు మీ ముందుకు తేవలసి వచ్చినది. నేను ఎక్కువ మందికి చేరుతుందను ఉద్దేశ్యముతో ఆంగ్లములో వ్రాసినాను కానీ దానిపై ఎక్కువమంది దృష్టి సారించలేదు. కారణమును పాఠకుల మనస్సాక్షికే వదలివేస్తున్నాను. ఈ తెలుగు వ్యాసమునైనా చదివి వాస్తవాలు తెలుసుకొందురని నా ఆశ. ఈ  ఆశను దేశ ప్రేమకు కొలమానముగా భావించుతూ వున్నాను.
ఇక్బాల్ గారు ఈ గీతమును తమ 27 సంవత్సరముల వయసులో వ్రాసియుండవచ్చునని చదివినాను. వారపుడు లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా ఉద్యోగము చేసే వారు.  దీనిని తరానా అంటారు. ఇది ఘజల్ శైలిలో వ్రాయబడింది. 16 ఆగస్టు 19౦4 లో లాలా హరి దయాళ్ అన్న విద్యార్థి అభ్యర్ధన మేరకు ఆయన ఏర్పాటుచేసిన సభకు ఉపన్యాసకునిగా వచ్చినా ఇక్బాల్ గారు ఈ పాటను ఆక్కడి శ్రోతలకు ఆవిధముగా లోకానికీ మొదటిసారిగా వినిపించినారట. ఈ గీతమునకు ‘తరానా-ఏ-హింద్ అన్న నామకరణమును వారు చేసినారు. తరువాత కొంత కాలమునకు వారు భవిష్యద్ ఇస్లాం సమాజ స్థాపన కొరకు, ఇస్లాం వేదాంతమును చదువనెంచి ఐరోపా వెళ్ళుట తటస్తించినది.

ఇక గీతము యొక్క విషయమునకు వస్తే అది 9 చరణములను కలిగి వుంది. అందులోని 5 వ చరణము ఈ విధముగా కనిపిస్తుంది.
అయ్ అబ్ ఎ రుద్ ఎ గంగా! వహ దిన్ హై యాద్ తుఝ్ కొ
ఉతరా తెరే కినారే జబ్ కారవాఁ హమారా
Ai āb-i rūd-i Gangā! Wuh din haiṉ yād tujh KO?
Utr
ā tire kināre jab kārwāṉ hamārā
మా బిడారు నీ ఒడ్డున విడిది చేసిన ఆరోజు నీకు జ్ఞాపకము ఉన్నదా! అని ప్రశ్నించుతున్నాడు కవి. మరి మహమ్మదీయులు మనము కలిసి బిడారును గంగ ఒడ్డున ఏర్పరచియుండినామా? చరిత్ర లో ఎక్కడయినా ఉటంకించ బడినదా!
బహుశ వారు తమ మతస్థులను గూర్చి చెప్పియుండవచ్చు. అప్పుడు, సనాతన ధర్మావలంబులమైన మనకు అన్వయించదు కదా! మరి అన్వయించనపుడు జాతీయ గీతము యొక్క హోదాకు తగుతుందా!
మనము వినే ఆ పాటలోని 3వచరణములో, అనగా అది పూర్తి పాఠము లోని 6వ చరణమౌతుంది, హిందీ, హిందుసితాఁ అన్న పదాలు వస్తాయి. బెంగాల్ బెంగాలీ గుజరాత్ గుజరాతీ, నేపాల్ నేపాలీ పాకిస్తాన్ పాకిస్తానీ అన్న విధముగా  హిందూస్తాన్ లో వున్న వారిని హిందీ అన్నారు. మరి హిందూస్తాన్ అన్నది మనము పెట్టుకొన్న పేరు కాదు కదా! ఇండియా హిందూస్తాన్ మనము పెట్టుకొన్న పేర్లు కాదు. ఎవరో నోరు తిరగని వారు పెట్టినవి. మనది భారత దేశము.
ఎందుకు మనము ఈ దేశమునకు భారత్ అన్న అధికారిక నామమును ఉంచుకొన కూడదు. ‘భ’ అన్న అక్షరానికి నిఘంటువు కొన్ని అర్థములను తెలిపింది, కానీ ఒక మహనీయుడు, మహా పండితుడు ‘భ’ అన్న అక్షరానికి అభివృద్ధి అన్న అర్థము లేక అన్వయము కూడా ఉన్నదని నాకు తెలియజేసినాడు. ‘నభము’ అభివృద్ధి లేనిది ఆకాశము, ‘భగము’ అన్న మాటకు వృద్ధి ప్రగతి కలిగించునది. 'అభము' అభివృద్ధి లేమి, ఎంత గొప్ప అర్థమో గమనించండి.

ఇక  హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు అన్న ఒక క్రొత్త అర్థమును ఎవరో ప్రతిపాదించినారు. ఆధారము కానరాదు. అంత అర్థవంతమూ కాదు. హిమాలయములకు ఆవలనున్న అరబ్బు దేశీయులు ‘స’ ను ‘హ’ గా పలుకుటచే ‘సింధు’ నది కలిగిన దేశము ‘హిందు’ దేశమైనది.
ఉత్తర భారతమున ‘స’ ను ‘హ’ గా పలుకుతారని ఒక వ్యక్తి ఆస్య గ్రంధిలో వ్రాయగా చదివినాను. హిందీ భాషలో శ, ష, స మూడు అక్షరాలూ ఉండుటయే గాక వారి పేర్లలో సందీప్, శారద, కృషి--- ఈ విధముగా మూడు అక్షరములనూ ఉపయోగించుతారు. అరేబియా దేశాల వారు నేటికినీ గణితమును ‘హింద్స’ అనే పిలుస్తారు. ఉత్తర భారత దేశమున ‘గణిత్’ అంటారు ‘హింద్స’ అన్నది ఔత్తరాహిక  సామాన్యులకు తెలియని పదము.
తిరిగీ అసలు విషమునకు వస్తే, ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే మనమంతా హిందూ దేశమునకు చెందినవారము కావున హిందీలమైనాము అని మాట వరుసకు సమర్థించుకొందాము.  మీ దేశమేది అని ఒక విదేశీయుడడిగితే హిందూ దేశము’ అంటామా లేదా? హిందీ దేశము అని మాత్రము అనము కదా! అసలు మన ధర్మమును పాటించనివారు ‘హిందూస్తాన్’ అని అంటారనుకొందాము. అప్పుడు కూడా ‘స్తాన్’ అన్నది సంస్కృత పదమే. ‘హిందు’ శబ్దోచ్ఛారణ యే వారి మత రీత్యా ఉచ్చరించుట దోషము కదా! దంత్యములు, కంఠ్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనునాసికములు  ఇత్యాదిగా వర్గీకరింపబడిన మన సంస్కృతము భాషలకు ఆది పునాది. మిగతా ఏ ప్రపంచ భాషకు కూడా ఈ వర్గీకరణ లేదు. అది వారు తెలుసుకొన ప్రయతించరు. ‘హింది’ ‘హిందు’ రెండూ ఒకటే కానీ వారు మొదటిది మాత్రమె ఉచ్చరించుతారు. అసలు అక్షరము అంటేనే బాహిరముగా ’అ’ నుండి ‘క్ష’ వరకు అని ధ్వనిస్తున్నా ‘క్షరము’ అనగా ‘నాశము’ కానిది అక్షరము. ఇంతటి గొప్ప విషయములను మనకందించిన మహనీయులు  మన పూర్వులు.
ఇక తిరిగీ ఇక్బాల్ గారి విషయమునకు వస్తే ఆయన ఇస్లాం వేదాంతమును పుణికి పుచ్చుకున్న తరువాత ‘తరానా-ఏ-మిలి’ అన్న గేయమును ‘సారే జహాఁ సె అచ్ఛా’ ఛందస్సులోనే వ్రాసినారు. ‘తరానా-ఏ-మిలి’ అంటే ‘మతానుగత గీతము’ అని మనము అనువదించుకొనవచ్చు. ఇక్బాల్ గారి లౌకిక తత్వమునకు సాధారణముగా ‘సారే జహాఁసె అచ్చా’ లోని ఈ చరణమును ఉటంకించుతారు.
మజహబ్ నహీఁ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా
హిందీ హైఁ హం వతన్ హై హిందూసితాఁ హమారా
Maẕhab nahīṉ sikhātā āpas meṉ bair rakhnā
Hindī haiṉ ham, wat̤an hai Hindūstāṉ hamārā
మతము అన్నది వైరమును బోధించదు. మనము హిందువులము మనది హిందూస్థానము అని నుడివినారు.
1910 లో ఆయన వ్రాసిన ‘తరానా-ఏ-మిలి’ లో ఏమి వక్కాణించినారో చూడండి.
సైన్-ఓ-అరబ్ హమారా, హిందూసితాఁ హమారా
ముస్లిం హైఁ హం వతన్ హై సారా జహాఁ హమారా
Cīn o-ʿArab hamārā, Hindūstāṉ hamārā
Muslimhaiṉ ham, wat̤an hai sārā jahāṉ hamārā

మధ్య ఆసియా మనది, అరేబియా మనది, హిందూస్తాన్ మనది. మనము ముస్లిములము  ఈ ప్రపంచమే మనది. దీనితో వారి హిందూదేశ భక్తి ఏమయి పోయిందో గమనించండి. రెండు దశాబ్దముల పిమ్మట 1930 లో ఇక్బాల్ గారు అలహాబాదులో ముస్లిం లీగ్ వార్షిక సమావేశములోని తమ అధ్యక్షోపన్యాసములో ఏఏ ప్రాంతములలోనైతే ముస్లిం జనాభా ఎక్కువగా వుందో ఆయా ప్రాంతాలను అన్నింటినీ ముస్లిం దేశాలుగా మార్చవలెనని ఉద్ఘాటించిన మహనీయుడు ఆయన. ఈ దేశానికి, మన ధర్మమును పాటించే వారిలో దేశభక్తి గీతము వ్రాయ గలిగే మహా కవియే లేడా! అసలు పాకిస్తాను బీజమును నాటిన మహానీయుడాయనే!  ఆయన 1887 నవంబరు 8 న సియాల్కోట్(ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతము) (1938 ఏప్రిల్ 21 న లాహోర్ (బ్రిటీష్ ఇండియా) లో మరణించినారు.
పాకిస్తానులో నేటికినీ ఆయన పుట్టిన దినమును ‘ఇక్బాల్ డే’ గా పిలుస్తూ ఆ రోజును సెలవు రోజుగా ప్రకటించుకొంటారు.
 చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆయన పూర్వీకులు  ‘సప్రూ’ అన్న ఇంటిపేరు గలిగిన బ్రాహ్మణులు. వారు ఇస్లాం లోకి బలవంతముగా మార్చబడినవారే! ఆతరువాత కాలములో వారు పంజాబ్ నకు వలస వచ్చినారు. అదే కాశ్మీరుకు చెందిన పండితులు ముస్లిముల చెర తప్పించుకొని జమ్మూ చేరి తమ తిప్పలు తాము పడుతూ వుండగా తగుమమ్మా అంటూ వచ్చి మీకు సహాయము చేస్తాము మా మతములోనికి మారండి అన్న విదేశీ క్రైస్తవులను త్రిప్పి పంపిన ఆ గొప్పవారిని గూర్చి తలచినవారున్నారా!
తెలిసినది క్లుప్తముగా తెలిపినాను. మంచి చెడుల నిర్ణేతలు మీరే! ఇక వారి అభిప్రాయము హిందువులపై ఏవిధముగా ఉండినది అన్నది తెలిపి నేను విరమించుతాను.
Iqbal expressed fears that not only would secularism weaken the spiritual foundations of Islam and Muslim society, but that India's Hindu-majority population would crowd out Muslim heritage, culture and political influence. (Muhammad Iqbal From Wikipedia)
మరి స్వాతంత్ర్యమునకు మునుపు ఈయన వ్రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా' మనకు జాతీయ గీతము ఎట్లు కాగలుగుతుంది.
స్వస్తి.

Wednesday 8 February 2017

విధి లేక నందో రాజా భవిష్యతి

విధి లేక నందో రాజా భవిష్యతి

తామరయందలి మధువును
ఏమరి తాత్రాగు చుండెఇనుడస్తాద్రిన్
తామరి చేరినయంతనె
సోమరి మధుపమ్ము సొక్కె సుమకోశమునన్

ఉదయము రాదా సూర్యుడు
ఉదయించక మానడంచు ఊహించంగా
ఉదయినుడు బొడము లోపల
మదగజమది త్రొక్కి వేసి మనుగడ బాపెన్

ఒకసారి ఒక మధుపము తనివితీరా తామర తేనెను గ్రోలుదామని ఆ పూవు కేసరములపై వాలింది. ఆస్వాదనలో మునిగి చీకటి ఆవరించినది గమనించలేక పోయింది. గమనించే సరికి
చీకటిపడి తామర ముకుళించుకొొనింది. తుమ్మెద ఎంతో ధైర్యముగా ఈ రాత్రిని ఎదో విధముగా గడిపినానంటే తెల్లవారుతూనే తామర వికసించుట నేను బయల్వెడలుట జరిగిపోతాయని తనకు తానూ ధైర్యము చెప్పుకొనినది. కానీ తరువాతి రోజు పూవు వికసించక ముందే అంటే ఇంకా తెలవారక మునుపే ఒక ఏనుగు ఆ కొలనిలోనికి వచ్చి ఆ తామరను కలిగిన తూడునే పెకలించి వేసింది. ఇక తేనెటీగ కథ ముగిసి పోయింది. ఒక్కొక సారి ఆపద కలిగినపుడు మనము ఏమీ చేయలేని పరిస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు మన భవిష్యత్తు విధిని అనుసరించే వుంటుందిఅది మంచి అయినా చెడ్డ అయినా! దానిని గూర్చి చెప్పేదే ఈ 'నందోరాజా భవిష్యతి' కథ

నందో రాజా భవిష్యతి
నందో రాజా భవిష్యతి అన్న నానుడిని మనము విరివిగా వాడుతూనే వుంటాము.ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడూరకుంటామా ! జరిగినప్పుడు చూద్దాములే అన్న భావనకు అనుగుణముగా వాడుతూవుంటారు.అసలు దీనికి ఒక కథ వుంది. అందులో ఒక దాసి తన రాణికి ధైర్యము నూరిపోసే సందర్భములో ఈ మాట చెబుతుంది.నిజానికి మనిషిలో నిరాశ నిస్పృహ ఆవరించినపుదు ప్రోత్సాహము అత్యవసరము. మనము క్రీడలలో ఈ విషయమును గమనించుతూనేవుంటాము. అసలు సీతమ్మను వెదుక సుగ్రీవుడు వానరసైన్యమును అఖండ భూమండలములోని అన్ని దిక్కులకు తన వానర సైన్యమును పంపి వెదకించుతాననుట ఒక ఆశను కలిగించే ప్రోత్సాహమే కదా! మనము చేయగలిగినది లేనపుడు చేసిపెట్టమని భగవంతుని ఆశించుచూనే వున్నాము కదా!
మన అబ్దుల్ కలాము గారు కూడా కలలుగను. కన్న కలను సాధించు అన్నారు. కొన్ని కష్టపడి సాధించేవైతే కొన్ని కాకతాళీయంగా జరిగి పోయేటివి వుంటాయి. అందుకే అటువంటపుడు ఆశ ఉన్నా అవకాశము వచ్చేవరకు ఊరక ఉండవలసినదే. భర్తృహరి సుభాషితముల తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేతలోని ఈ పద్యము చూడండి. 
రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండ బద్ధమై
భీతిలి చిక్కి యాశ చెడి పీదయు దస్సిన పాము వాత సం
పాతముజెందె దానిదిని పాము తొలంగె బిలంబు త్రోవనే
ఏతరి హానివృద్ధులకు నెక్కుడ్ దైవము కారణంబగున్
బుట్టలో బంధింపబడిన పాము బయటికి పోయే దారి లేకపోయినా బ్రతుకుతూ వుండింది కేవలము ఆశతోనే.ఆ ఆశే అసంకల్పితంగానే ఎలుక బుట్టకు రంధ్రము చేసి లోనిలి పోవుట తో పాము దానిదిని బయటకు కూడా రాగలిగింది. కాబట్టి కొన్నిటిని విధికి వదిలి పెట్టుటలో కూడా  ఎటువంటి తప్పు లేదు.
ఒకానొక రాజుగారు నిక్షేపంగా ఉన్న సంసారములో శీలవతియైన భార్యను కాదని వేశ్యా వ్యామోహములో పడినాడు.  ఇద్దరుభార్యలుండటం, గతము మరచి, గణిక తో శేష జీవితము గడపనెంచి పట్టపురాణీగారిని సదరు రాజావారు నిర్లక్ష్యంచేస్తూ ఆమెను అంతఃపురములో గాకుండా రాజ ప్రాసాదానికి దూరముగా ఉంచ దలచినాడు ఆ వేశ్య మాటలు నమ్మి.
అతను వేశ్య మాటను మంత్రముగా భావించి తన పట్టపురాణిని రాజప్రసాదమునకు దూరముగా తమ వనాంతర గృహము (farm house) లో ఆమె దాసితో బాటూ వుంచినాడు. ఆ రోజులలో రాణిగా మెట్టినింటికి వచ్చే వధువు పుట్టినింటి నుండీనే తన ఇష్ట సఖిని తెచ్చుకోనేది. ఆవిధముగానే తనతో తెచ్చుకొన్న సాహి తోడు రాగా ఆమె ఆ వనాంతర గృహములో ఉండసాగింది. వనాంతర గృహము చేరు సమయమునకే  రాణి గర్భవతి. ఆ విషయము అప్పుడు రాజుకు తెలియదు. ఆమె రాజ్యానికి వారసుని ప్రసవించినది . అయినా రాజు ఆమెను చూచుటకు కూడా రాలేదు వెలయాలి ప్రభావముతో! పిల్లవాడు దినదిన ప్రవర్ధమాను డౌతూవస్తున్నాడు. బాలునికి నందకుమారుడన్న పేరు పెట్టుకొన్నది ఆ తల్లి.
ఒకనాడు ఒక బంగారు నగల వర్తకుడు ఒక అత్యంత విలువ గల వజ్రాల హారాన్ని అమ్మకానికి రాజు వద్దకు తెచ్చినాడు. అతనికి పిల్లలు లేరు. రాజు అప్పటికే తన సర్వము వేశ్యకు దారపోయుటవల్ల వర్తకునితో వద్దు అని అన్నాడు. వెశ్య ఆయన పై అలిగింది. రాజు ఇంతకాలము తన సర్వస్వము వెశ్య పై వెచ్చించినా ఒక హారము కొననందుకు అట్లు వేశ్య ప్రవర్తించుట నచ్చ లేదు.
ఆవ్యాపారి మొదటినుండి రాణి గారు తెలిసిన వాడయినందువల్ల ఆవిడ ఉనికి కనుగొని ఆవిడ వద్దకు వెళ్ళినాడు. విషయము తెలుసుకొని బాధ పడిన వాడై ఆనగను ఆమెకు అప్పుగా , ధర కూడా తగ్గించి ఇవ్వదలచుకొన్నాడు. పిల్లవాడు పెద్దయ్యే వరకు ఆగుతానన్నాడు. అప్పుడు రాణి యొక్క దాసి ఆమెను ప్రక్కకు పిలిచి, అమ్మా హారము ఎంతో బాగుంది. రేపు మీ కుమారుడు రాజయిన తరువాత కోడలికైనా ఉపయోగ పడుతుంది. కావున తప్పక కొనమని ప్రోత్సహించుతూ పై శ్లోకము చెప్పింది:
ఉత్తుంగ భుజ నాశోవా దేశ కాల గతోపివా
వేశ్యా వణిజ నాశోవా నందోరాజా భవిష్యతి
అమ్మా! భవిష్యత్తు ఎవరికి తెలుసు. మహారాజయిన ఉత్తుంగభుజుడే మరణించ వచ్చు, దేశ కాల పరిస్థితులే మారి పోవచ్చు వేశ్య (పిల్లలులేని), వర్తకుడు కాలాంతరములో చనిపోవచ్చు, రాజకుమారుడైన నందుడే రాజు కావచ్చు . అందువల్ల  హారాన్ని తప్పక కొనుమని ప్రోత్సహించింది. రాణి అట్లే చేసింది. రాజు పై కక్ష తీర్చుకొనుటకు వేశ్య ఒక పామును తెప్పించి రాజును మాయ మాటల చేత తన మందిరానికి రప్పించి రాజు చూడకుండా పాము నాతనిపై వుసిగొలిపినది . పాము కాటుకు రాజు మరణించగా, ఆత్రముతో రాజువైపుకు నడచిన వేశ్య , పామును గమనించనందువల్ల, తానూ పాము కాటుకు గురియైనది. అక్కడ వర్తకుడు వయోభారముచే గతించినాడు.
దాసి చెప్పినట్లు నందుడు రాజయినాడు. హారము దక్కింది.
ఈ కథను ఆశావాదమును బల పరచుటకు పూర్వము పెద్దలు చెప్పే వారు. మా అమ్మమ్మ గారి వద్దనుండి నేను విన్నది మీతో పంచుకొనుచున్నాను.
స్వస్తి.


Tuesday 7 February 2017

ఏకం సత్ విప్రాః

Rigveda 1-164 
46 इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान |
एकं सद विप्रा बहुधा वदन्त्यग्निं यमं मातरिश्वानमाहुः ||



ఒక ఋగ్వేద సూక్తం  1-164 
‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్
ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్ మాత రిష్వాన  మాహుహు ‘’

ఈ సత్యాన్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,యమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు. కాని  సత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోంది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది. అందుకే వేదం ‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు  అని అర్ధం . అందువల్లనే పై పద్యములో 'ఆకలంకుని'  అంటే ఎటువంటి కళంకము లేని వాని అని సంబోధించినాడు పోతన. పరమాత్ముడు సకలాత్ముడు అంటే రూపమును ధరించి దర్శనమిస్తాడు అట్లే ఆయన ఆకలాత్ముడు అంటే రూప రహితుడు. కాబట్టి అంతా తనచేతిలోనే న్చుకొన్న వానికి కళంకము ఆపాదిమ్పబదుట ఎట్లు?

ప్రణయ లేఖా రహస్యం

ప్రణయ లేఖా రహస్యం (శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు)
భోజుని సభకు ఒకనాడు మల్లినాధుఁడనే పండితుడు వచ్చాడు . రాజుగారికి వినయంగా నమస్కరించి " మహారాజా! మీసభలో కాళిదాసుగారి వంటి గొప్పకవులు, పండితులు, మేథావులు అనేకమంది ఉన్నారు వారిలో యెవ్వరైనా ఈశ్లోకంలోని మర్మం విప్పి చెప్పగలరా?" - అంటూ
శ్లో: కాచిత్ బాలా రమణ వసతిీం ప్రేషయంతీ కరండమ్
దాసీహస్తాత్, సభయ మలిఖత్ వ్యాళ మస్యోపరిష్టాత్
గౌరీ కాంతం , పవన తనయం, చంపకం , చాత్ర భావం
పృఛ్ఛత్యార్యో నిపుణ తిలకో, మల్లినాధః కవీంద్రః ;- అనేశ్లోకం చదివి వినిపించాడు. దాని యర్ధమిది;
కాచిత్-ఒకానొక; బాలా-యువతి; కరండం-చిన్నపెట్చెను; దాసీహస్తాత్- దాసిచేతికి యిచ్చి; రమణవసతిం-ప్రియునియింటికి; 
ప్రేషయంతి -పంపుచున్నదియై; అస్య- దానియక్క; ఉపరిష్టాత్- పైభాగమునందు; సభయం- భయపడుతున్న; వ్యాళం-పామును,;
గౌరీకాతం- శివుని;పవనతనయం-హనుమంతుని;చంపకం--సంపెంగపూవును;అలిఖత్--చిత్రించినది;ఆర్యః--సభలోనిపెద్దలు;నిపుణతిలకః--ెతెలివైనవారు; కవీంద్రః- కవాశ్వరులను; మల్లినాధః--మల్లినాధకవి; అత్రభావం--ఇందలిభావము,యేమైయుండునని పృఛ్ఛతి--అడుగు చున్నాడు;
భావము; ఒకయువతి దాసిచేతికి ఒకపెట్టెనిచ్చి ప్రియుని యింటికి పంపుచున్నది. ఆపెట్టెపై పాము, శివుడు,
ఆంజనేయుడు , సంపెంగల బొమ్మలను భయం భయంగా చిత్రించింది. దీని భావమేమి? యని మీసభలోని పెద్దలను ,కవులను, తెలివైనవారిని మల్లినాధుడు అడుగుచున్నాడు. అని;
విన్నవారందరూ మౌనము వహింపగా కాళిదాసు ఆశ్లోక భావము నిట్లు వివరించెను.
" ఆయువతి అష్టవిధ శృంగార నాయికలలో ప్రోషిత భర్తృక. యెక్కడనోయున్న ప్రియునికి తన విరహబాధను మర్మంగా సందేశం పంపుతున్నది. తన విరహ బాధను నలుగురు పెంచుతున్నారని,నువ్వు త్వరగా వచ్చి ఆబాధను పోగొట్టమని ,యీసందేశంలోని మర్మం!
ఆనలుగురు యెవరనేది వారి శత్రువులను పెట్టెపై చిత్రించటం ద్వారా తెలియ జేసింది. విరహాన్ని పెంచేవి యేమిటి?1 మలయమారుతం . దానికి శత్రువు పాముగదా (పామునకు గాలియాహారం) 2 రెండవది మన్మధుడు. మన్మధునకు శత్రువుశివుడుగదా! ఇక3 మూడవది ఉద్యాన వనములు . వనమునకు శత్రువు వానరనేగదా!( అదేహనుమంతునిబొమ్మ) 4 నాల్గవది తుమ్మెదలు.వాటికి శత్రువు సంపెంగపూలు.( సంపెంగ వాసన తుమ్మెదకు పడదు)
ఇంత రహస్యంగా కోడ్ భాషలోవలె యెవరికీ అర్ధం గానంతగా చిత్రించిన యువతినీ, ఇదిచక్కగా వర్ణించిన మల్లినాధునీ, దీనిని చక్కగా విపులంగా వివరించిన కాళిదాస మహాకవిని సభఎలోనున్నవారెల్లరు బహుధా ప్రశంసించినారు.
భోజుడు కాళిదాస మల్లినాధులను ఘనంగా సత్కరించినాడు.
నాటి కవుల ప్రతిభా వ్యుత్పత్తులట్టివి!

Thursday 2 February 2017

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ
ఢిల్లీ పాలకులలో ఈతను రెండవ వాడు. ఇతను టర్కీ కి చెందినవాడు. మనము తెలుగులో వాడే తురక అన్న పదము టర్కీ అన్న పదము నుండీ వచ్చినదే! 1296 నుండి 1316 వరకు 20 సంవత్సరములు ఈయన పరిపాలనా కాలము. తాను రెండవ అలెగ్జాండరు గానూ, ఇస్లామునకు మరియొక ప్రవక్త గానూ కాదలచినాడు. అప్పుడు నాటి ప్రసిద్ధిగన్న ‘సూఫీ సన్యాసి’ యగు అష్రఫ్ జహంగీర్ సేమ్నాని కావాలనుకొంటే  రెండవ అలేగ్జాండరువు కావచ్చు కానీ మత ప్రవక్త అగుటకు ప్రయత్నించవద్దు అని చెప్పుట జరిగింది. సరేనని తలచి ‘సికందర్-ఏ-సాని’ అన్న బిరుదు తగిలించుకున్నాడు. He was a Tyrant, an oppressive ruler who levied heavy taxes on Hindus and even disallowed them to possess weapons.
( గూగుల్ aazad.com సౌజన్యము) 
హిందువులపై ఇతను సాగించిన దురంతములు ఇన్ని అన్ని అని చెప్పనలవి కాదు. లక్షల మందిని తన 20 సంవత్సరముల రాజ్యకాలములో చంపగా , బ్రతికిన హిందువులపై లేనిపోని పన్నులు విధించుటయే గాక వారు చక్కని బట్టలు కూడా వేసుకో కూడదని చెప్పిన క్రూరుడు. తన సామ్రాజ్యము లోని పల్లెలు, పురములు, పట్టణములలో  అర్థబలము, అంగబలము కలిగిన మహమ్మదీయులకు మాత్రమే పెత్తనమిచ్చి అప్రాంతపు హిందువులపై పెత్తనము చలాయింప జేసినాడు.
మాలిక్ కాఫిర్ అన్న నపుంసకుడు ఈతని సర్వ సేనాధిపతి. అలావుద్దీన్ కు ఎన్నో రాజ్యములు ఎన్నో రాజ్యములు జయించి సంపాదించి పెట్టిన ఈతడు నిజమునకు హిందువు. కంభాత్ యుద్ధమున తటస్థించిన ఇతని తల్లిదండ్రులను చంపి బాలునిగా ఉన్న ఇతని అందమునకు మెచ్చి మెచ్చి పుంరతికి అలవాటు పడిన అల్లాఉద్దీన్ 1౦౦౦ దీనారములిచ్చి ఈతనిని కొని నపుంసకుని చేసినాడు. అంతటితో ఆగక ఇస్లామునకు మార్చి ‘మాలిక్ కాఫర్’ అన్న నామకరణము చేసినాడు. అందుకే అతనిని ‘హజార్ దినారీ’ అని కూడా అనేవారు.
అన్నివిధాలా అతని మెప్పు సంపాదించి సర్వోచ్ఛ  సేనానాయకుడైనాడు కాఫర్. దేవగిరి, హోయసల, హలెబీడు, పాండ్య దేశమగు మధుర ను జయించి దక్షిణా పథమును మహమ్మదీయ పాలన లోనికి తెచ్చినాడు. మధుర దేవాలయమున ఈతను చేసిన ఘాతుకములు మాటలకు అందనివి. చివరకు అల్లాఉద్దీన్ ను అతని వారసులను కూడా చంపి 36 దినములు దేశమును పరిపాలించి ఘాతుకముగా తన సిపాయీల చేతనే చంపబడినాడు.
  ఇక రాణీ పద్మిని లేక పద్మావతి విషయమునకు వత్తము.
రావల్ రతన్ సింగ్ యోధుడు, కళా పోషకుడు, ప్రజా హితైషి మరియు సమర్థవంతమైన మహా రాజు. ఆయన పద్మినీ దేవిని స్వయంవరములో గెలిచి వివాహమాడుతాడు. ఆమె తండ్రి మెచ్చి ఆయనకు ఎన్నో అపురూపమగు కానుకలు ఇవ్వగా అతని తోబుట్టువులు రాఘవ్ మరియు చేతన్ తమకు కూడా ఇప్పించమని రతన్ సింగ్ ను అడుగుతారు. ఆయన అది సభ్యత కాదని తెలిపినా పట్టుబట్టుటతో వారిని దేశమునుండి బహిష్కరించుతాడు.
వారు సరాసరి  ఢిల్లీ సుల్తాను అగు అల్లా ఉద్దీన్ ఖిల్జీ వద్దకు వెళ్లి తమను పరిచయము చేసుకొని తగు సమయములో ఆతనికి పద్మావతి (పెళ్ళికి తరువాతి పేరు) అతిశయించిన అందచందాలను గూర్చి చెప్పి అతనిలో కామము రగుల్గొల్పుతారు. ఈ విషయమున ఇంకొక కథ కూడా ప్రచారములో వుంది. రాఘవ్ చేతన్ అనే వేణు వాదకుడు ఆ కళ యందు ఎంతో పేరు గాంచినవాడు. దానికి తోడుగా అతను భూత పిశాచ ఉపాసకుడు. అది రాజ్యములో అనూచానముగా నిషిద్ధము. ఆవిషయము కంటబడి రాజు అతనిని తల సగము గొరిగించి సున్నపు పట్టెలు పెట్టి గాడిద నెక్కించి, ఇతరులెవరూ ఆ పనికి సాహసించని రీతిలో అవమాన పరుస్తాడు.  దానితో అతడు డిల్లీ కి చేరువగు అరణ్యము చేరి అల్లా ఉద్దీన్ ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉంటాడు. ఆరోజు రానే వస్తుంది.  అతని వేణు గానమునకు ముగ్ధుడై తన శిపాయీలను పంపి ఆతనిని తన సభకు తోడి తెమ్మంటాడు. ఆతను వచ్చి సుల్తానుకు తన వేణుగానము పద్మావతి ముందు దిగదుడుపు అంటూ ఆమె అందమును అతిశయించి పొగుడుతాడు. ఈ రెంటిలో ఏది నిజమయినా ఆ తరువాత జరిగినది మాత్రము ఒకటే! ఖిల్జీ ఒక కుట్ర చేస్తాడు. మేవార్ దుర్గము దుర్భేద్యము కావున రతన్ సింగు నకు తాను మిత్రునిగా మెలగ దలచినట్లును, ఒకసారి సహోదరి సమానురాలగు పద్మిని ముఖము నొకసారి చూపించ వలసినట్లును కోరుతాడు. రాజు వల్లె యంటాడు.
కానీ ఇందు ఎదో మోసమున్నట్లు రాణీ పద్మిని పసి కడుతుంది. అసలు అల్లా ఉద్దీను కుతంత్రము ఏమిటంటే యుద్ధము తో ఆ కోటను జయించుట కష్టమని తెలిసి తనతో బాటు అతి చురుకైన మరియు బలశాలులైన బలగముతో కోట లోనికి ప్రవేశించి రాజును బందీ చేసి తన స్థావరమునకు తీసుకుపోయి రాణిని పొందే బేరమును ఆడుదామనుకొంటాడు.
రాణి తన రూపమును అద్దములో చూపుతుంది. భ్రమించిన ఖిల్జీ తప్పక ఆమె తన జనానా చేరవలసిందేనన్న నిర్ణయానికి వస్తాడు. గౌరవముగా తనను సాగానంపుటకు వచ్చిన రతన్ సింగును బంధించి తన గుడారమునకు తీసుకు పోయి రాణికి ‘ఆమె తనదైతేనే రాజుకు విముక్తి’ అన్న షరతును విధించుతాడు.
ఆమె చాతుర్యము కలిగినది కాబట్టి సరే అంటూ తన వెంట 15౦ పల్లకీలలో తన పరివారముతో వస్తానంటుంది. మెరికల వంటి  యోధులు ఒక్కొక్క పల్లకీ లో నలుగురు కత్తి కటారు బాకులు మొదలగు శాస్త్రములతో కూర్చొనగా నలుగురు దానిని మోసే బోయలుగా ఏర్పాటు చేసి ఇద్దరు కొడుకుల నాయకత్వములో పంపుతుంది. వారు రాజును విడిపించి కోటను చేర్చ గలుగుతారు కానీ తాము మరణించుతారు.
ఆగ్రహోదగ్రుడైన ఖిల్జీ కోట అనుపానములను తను రాజు వద్దకు మైత్రి నెరుపుటకు పోయి ఉండినాడు కాబట్టి కోటలోనికి ఖాద్య వస్తువులు పోకుండా కట్టుదిట్టము చేసినాడు. రానురాను పరిస్థితి విషమించుటతో వీరులగా పోరాడి ప్రాణ త్యాగము చేయ దలంచి యుద్ధము చేస్తారు.
ఇక ప్రాయోపవేశమే శరణమని తలచిన రాణీ పద్మావతి తన పరివారముతో జౌహర్ కుండ్ (చితి మంటలు పేర్చిన అతి పెద్ద గాడి) లో దూకి ప్రాణ త్యాగము చేస్తుంది.
ఈ గాధను 154౦ లో మాలిక్ మొహమ్మద్ జాయసీ తన ‘పద్మావత్’ అన్న కావ్యములో వ్రాసినాడు.  ఒక్క కవిత చదువగలిగిన వారి కొరకు:
तन चितउर, मन राजा कीन्हा। हिय सिंघल, बुधि पदमिनि चीन्हा॥
गुरू सुआ जेइ पंथ देखावा । बिनु गुरु जगत को निरगुन पावा ?
नागमती यह दुनिया-धंधा । बाँचा सोइ न एहि चित बंधा ॥
राघव दूत सोई सैतानू । माया अलाउदीन सुलतानू ॥
प्रेम-कथा एहि भाँति बिचारहु । बूझि लेहु जौ बूझै पारहु ॥

13౦3 లో జరిగిన ఈ సంఘటనను 2౦౦ ల సంవత్సరముల తరువాత వ్రాయటము జరిగినది. ఏది ఏమయినా శూరతకు రాజ పుత్ర యోధులు లు పాతీవ్రత్యమునకు రాజపుత్ర మహారాణులు పెట్టినది పేరు గదా!
౩౦,౦౦౦ మంది ముస్లిములను ద్రోహులని ఊహించి, లక్షల మంది హిందువులను పొట్టన పెట్టుకొన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీ గోప్పదనమిదియే!

అటువంటి హీన మనస్కునితో, అతని కలలోనికి పద్మావతిని రానిచ్చి చుంబన దృశ్యమును చేర్చ ప్రయత్నించుట నిజమయిన భారతీయత నరములలో ప్రవహించే వ్యక్తి ఎవరయినా నాకు సంబంధించినది కాదు కదా అని ఊరకుండగలడా! అసలటువంటి ఆలోచన ఆ సినిమా దర్శకునికి గానీ, ఆ దృశ్యములో నటించుటకు అభ్యంతరము తెలుపని నటులకు గానీ దేశభక్తి అన్నది లేనట్లేనా! డబ్బు కొరకు ఏమయినా చేయ నిచ్చగించుట వారు నేర్చుకొన్న సంస్కృతి అనుకోనవలెనా! అన్న విషయముల గూర్చి ఆలోచించుట పాఠకుల మనోగతమునకు వదలివేస్తున్నాను.
స్వస్తి





Wednesday 1 February 2017

నే పొగడకుంటే

నే పొగడకుంటే
సంగీత సాహిత్యములను సరస్వతీ దేవి యొక్క స్థన ద్వయమునకు పోల్పబడినది. పెద్దలు ఈ విధముగా చెబుతారు.
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్థన ద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం .
అంటే ఆ రెంటిదీ విడదీయలేని బంధము. అసలు సంగీతమునకు సాహిత్యము ఊపిరి. అది గమనించకుంటే అర్థము కన్నా అనర్థము ఎక్కువ.
తమిళులు తెలుగు తమ మాతృభాష కానందువల్ల సంగీతమును విడువకుండా పట్టుకొన్నారు. మనము సంగీతము సారస్వతము రెండూ వదలి ఆటవికతను ఆదరించుచున్నాము.

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు శుభ పంతువరాళి రాగం లోని 'నే పొగడకుంటే' అన్న త్యాగారాయ కీర్తన తమ కుడ్యము పై ప్రచురించినారు. దానిని చూసిన తరువాత నాలుగు మాటలు చెప్పవలెనని అనిపించింది.
ఒక తమిళ శాస్త్రీయ గాయకుడు ఈ కీర్తన పల్లవిని ‘నే పకోడా కొంటే నీకేమి కొదవ' అని పల్లవినెత్తుకొన్నాడు. తమిళ, శాస్త్రీయ సంగీత గాయయకులలో, పూర్వమున పెక్కురు త్యాగయ్య కీర్తనలోని భాషకు కానీ భావానికి కానీ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వారి భాషలో కవర్గమంతా'జ్ఞ' తప్పించి ఒకే అక్షరము ప్రతినిధిత్వము వహించుతుంది. కావున వారు ఆ అక్షరము కలిగిన పదమును బుద్ధికి తోచినట్లు పలుకుతారు . చ ,,సకు ఒకటే అక్షరము వాడుతారు. '' తప్పించి త వర్గమునకు ఒకటే అక్షరము.''తప్పించి '' వర్గమంతా ఒకటే అక్షరమే. ప వర్గము కూడా అంతే. ఒక్క 'za' అన్న అక్షరము ఎక్కువ కానీ అది మనకు లేదు'. మనకు దాని ఉపయోగము లేదు. ఒక 'కృష్ణ' అన్న శబ్దము వ్రాయవలెనంటే
కి రుట్ చ్ న అన్న అక్షరాలను కలపవలె. పైపెచ్చు మనవలె ఆ భాషలో 'అమ్మ' వ్రాయవలసి వస్తే వారు 'అమ్ మ' అని వ్రాయవలె.
ఇంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే అంత ఇబ్బంది వుండి కూడా 'సంగీత త్రిమూర్తులైన' మన ముగ్గురు వాగ్గేయకారులను దైవ సమానులుగా చూసుకొంటారు.(త్యాగయ్య, శ్యామా శాస్త్రి వారి పూర్వులది ఒకప్పటి కడప మండలములోని కంభము కాగా, ముత్తు స్వామి వారి పూర్వులది గోదావరీ తీర ప్రాంతమని చెబుతారు. శ్యామా శాస్త్రి వారికీ త్యాగయ్య గారికి ముత్తుస్వామి గారికి మధ్యన 10 సంవత్సరముల తేడా. వారు సమకాలీనులు. మరి మనమో అసలు కర్నాటక సంగీతాన్ని సినిమా మాధ్యమములో కూడా, కొందరు విశ్వనాథ్ గారి లాంటి దర్శకులను తప్పించి, బ్రహ్మానందం లాంటి హాస్య నటులతో సంగీత కచ్చేరీలో అపాన వాయువుల జోప్పించి అవహేళన చేసినారు. అది చూసి ఆనందిచినామే కానీ అంగుళము మాత్రము కూడా స్పందించని సంగీతాభిమానము మనది. అభినయించిన నటుడు తెలుగు ప్రొఫెసరు. కేవలము బహుశ అతనికి డబ్బు మాత్రమె ప్రధానమేమో! ఇది ఆ నిర్మాతల నాదబ్రహ్మము పై గల అభిరుచి తెలుపుతుంది. ఇక ఆ దర్శకుని కళాభిజ్ఞత గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఆ దృశ్యమును ఆస్వాదించిన ప్రేక్షకులను అసలు మానవులుగా పరిగణించవలెనో లేదో నాకు తెలియదు. బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ఆ నాద బ్రహ్మలు పెట్టిన భిక్షను అవహేళన చేసిన మన సంస్కృతిని ఏమని పొగడగలము. తమిళులైన M.S.సుబ్బలక్ష్మి,D.K. పట్టమ్మాళ్, M.L. వసంత కుమారి, వసంత కొకిలం లాంటి ఎందఱో తమిళ సంగీత విద్వాంసులు ప్రత్యేకంగా తెలుగు సంస్కృత ఉచ్ఛారణ నేర్చుకొని కీర్తనలు పాడేవారు. వారి పాటలలో ఆత్మ కనిపించేది. అసలు ఆత్మయే పరమాత్మ కదా! అచటి సంగీత ఆస్వాదకులకందరికీ రాగము తాళము స్వరమును గూర్చి కొంచెమయినా తెలిసి వుంటుంది.
     తమిళ సంగీత విద్వాంసులైన కొందరు తెలుగు పట్టించుకోకుండా పాడినప్పుడు మనసుపెట్టి వినేవారికి నొప్పి కలుగుతుంది. నిజమే. వారికి సంగీతమే ప్రధానము. ఈ వాస్తవము ఒకసారి గమనించండి.'బంటు రీతి కొలువు ఇయ్యవయ్య స్వామి...' అన్న కీర్తనను తెలుగుపై అశ్రద్ధ కలిగిన తమిళులు ' పండు రీది గోలు వియ్యవయ్య చామి' అని పాడుతారు. ఒక సంగీతము నేర్చుకొనే చిన్న అమ్మాయిని అమ్మా నీకు ఈ పాటకు మీ టీచరు ఏమన్నా అర్థము చేపిందా! అన్నాను. అవును చెప్పింది అని అన్నది ఆ అమ్మాయికి. అయితే పల్లవికి అర్థము చెప్పమని అడిగినాను. ఆ అమ్మాయి చెప్పింది నేను నాదయిన రీతిలో మీకు తెలియజేస్తున్నాను. ‘గొలు’ అంటే ‘బొమ్మల కొలువు’ అని అర్థము. ‘పండు’ అంటే అందులో ఉంచిన ‘బొమ్మ పండు,’ కావున మొత్తమునకు అర్థము ఏమిటంటే మా దశరా బొమ్మల కొలువులో బొమ్మ పండును పెట్టించు ‘చామీ’ అంటే ‘స్వామీ’ అని అర్థము. కావున భాష, భావము సంగీతమునకు రెండు కన్నులు. ఎంతయినా శాస్త్రీయ సంగీతము పై వారికున్న భక్తి ప్రపత్తి సర్వదా సంస్తుతి పాత్రము.

ఒక పేరంటములో (ఇప్పుడు function అనవలెనేమో) ఇద్దరు ఆడవాళ్ళు కలిసినారు. ఒకావిడ ఇంకొక ఆవిడ దుద్దులు చూసి ' అమ్మా! నీవి ఇత్తడి కమ్మలే అనింది'. రెండవ ఆవిడ వెంటనే 'నీకు అవి కూడా లేవే' అంది. 
ఇది నేటి మన శాస్త్రీయ సంగీత దుస్థితి.