Sunday 23 October 2016

చదరంగము - ధాన్యము

చదరంగము - ధాన్యము
చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.
ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.
అప్పుడు ఆ రాజుగారు.....
ఏమయ్యా! పండితా!
ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవ వచ్చు!
చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.
రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు ..
రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! అంటూ
సున్నితంగాతిరస్కరించాడు.
సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను.
మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! అన్నాడు రాజుగారు.
మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం. అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.
రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.
ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.
తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు పండితుడడి గాడు కదా.. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..
అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..
ఎందుచేత..? అన్నాడు రాజుగారు.
లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!
ఎందుకు..? ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు
ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.
అలాగా.. ఏమిటా పద్యం..?
ఇదుగో.. వినండి మహారాజా !
శర శశి షట్క చంద్ర శరసాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరితర్క పయోనిధి పద్మజాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకునిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికైనగుణసంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
పద్యం విన్న మహారాజు దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..
అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..
‘సరే… సరే.. విప్పి చెప్పు..’
*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పద్యంలో
శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.
గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)
శశి, చంద్ర, తుహినాంశు -1(చంద్రుడొకడే భూమి కి )
షట్కము - 6 (రిపు శతకము, రుతు షట్కము)
రంధ్ర - 9(నవరంధ్రాలు)
నగ, గిరి, భూధర - 7 (పర్వతముల పేళ్ళు)
అగ్ని - 3 (త్రేతాగ్నులు, ఇవి మూడు  అవి ఏవంటే  గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి - 4
వేద -4 (చతుర్వేదములు)
తర్క - 6 (షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
పద్మజాస్య - 4 ( బ్రహ్మ, నాలుగు ముఖములు కలిగినవాడు)
కుంజర - 8(ఏనుగులు, అష్ట దిగ్గజములు)
ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6 1 5
సాయక రంధ్ర వియత్
5 9 0
నగాగ్ని భూ
7 3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0 4 4 7
తర్క పయోనిధి
6 4
పద్మజాస్య కుం
4
జర తుహినాంశు
8 1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః" - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..
అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
1,84,46,74,40,73,70,95,51,615
ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615
ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.
పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సం.।।లు...
అదీ సంగతి…
వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘనాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.
అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.
ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.
ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

No comments:

Post a Comment