Thursday 20 October 2016

పంచతంత్రమన్న పేరు ఎందుకు వచ్చింది

పంచతంత్రమన్న పేరు ఎందుకు వచ్చింది
https://cherukuramamohan.blogspot.com/2016/10/blog-post_20.html
పంచతంత్రము, చాణక్యుని అర్థ శాస్త్రము మరియు నీతి శాస్త్రము మానవ సంకలనమునకు (human relationship) అత్యంత దోహద కారకములు. ఇవి చదివి ఆకళింపు చేసుకొంటే మానవుడు నీతి నియమములకు తోడుగా లౌకికమయిన చాకచక్యమును కూడా పొందగలడు.  
పంచతంత్రంలో విష్ణుశర్మ అందుకే రాజకుమారులకు ఈ అవసరమైన విద్య  చెబుతాడు. కౌటిల్యుడు అర్థ శాస్త్రంలో రాజులకు అవసరమైన విద్యలు నాలుగు అని చెప్పినాడు. అవి త్రయీ, వార్తా, దండనీతి, అన్వీక్షకి అనేవి. త్రయి అంటే వేదములు, ఇవి ధర్మ పాలనకు అవసరం. వార్త అంటే తన చుట్టూ జరుగుతున్నవి, అంటే ఈ సమాచారం సేకరించే యంత్రాంగం ఉండాలి. (intelligence ). దండనీతి అంటే శత్రువులను, నేరస్థులను శిక్షించ గల బలం. అన్వీక్షకి అంటే తర్కము (logic). సమాచారంనుండి కర్తవ్యం దాకా మార్గదర్శనం చేసే శాస్త్రం. దీని వలన మనకు లభించేవి తంత్ర, యుక్తులు. తంత్రం ( strategy), యుక్తి ( tactic). ఒకటి దూరాలోచన(planning), ఒకటి తక్షణ కర్తవ్యం(incitement). అందుకు పంచతంత్రంలో కథలరూపంలో ఐదు ముఖ్యమైన తంత్రాలను గురించి చెబుతాడు. మొదటిది మిత్రభేదం - ఎప్పుడూ మిత్రుల కన్నా శత్రువుల విషయం ముఖ్యం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని గమనిస్తూ ఉండాలి. వారి స్నేహ సంబంధాలు భగ్నం చేయాలి. ఇది తక్షణ కర్తవ్యము (priority item). దీనిని ఎదురు దాడి (offence) అంటారు .రెండవది మిత్ర లాభం, లేదా మిత్ర సంప్రాప్తి,ఇది రక్షణ  (defence). శత్రువును ఎదుర్కోడానికి మిత్రకూటమిని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలి. మూడవది కాకోలూకీయము(crows and owls). కాకులు, గుడ్లగూబలు (ఉలూకం) అని మనుష్యులు రెండు రకాలు. కాకుల నిశిత దృష్టి. గుడ్లగూబల జాగరూకత అన్న తత్త్వాలను అర్థంచేసుకునే ప్రయత్నం. నాలుగవది లబ్ధ ప్రణాశం (safty measure). అంటే ఉన్నది నాశనం కాకుండా చూసుకోవడం, అంటే క్షేమం ఉండాలి. ఐదవది అసమీక్ష (అపరీక్ష) కారికం (abrupt conclusions). పరిస్థితిని సమాచారాన్ని సమీక్షించకుండా నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం. ఇవి ప్రమాదాలను తెచ్చిపెడతాయి.
ఈ అయిదు తంత్రములను  చేర్చి పంచతంత్రము అన్న పేరుతో కథల రూపములో చెప్పుట జరిగినది.

స్వస్తి

No comments:

Post a Comment