Thursday 2 December 2021

పుష్పగిరి

 

పుష్పగిరి

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post.html

‘హంస వింశతి’ కావ్యములోని ఈ పద్యమును గమనించండి.

తిరుమల కంచి పుష్పగిరి తీర్థములన్ జని కొంగుముళ్ళతో

వరములు దంపతుల్  వడయ వారికి కాన్కలు వైచి యంతటన్

బరికలు దృష్టి దీపములు పన్నిన గద్దెలు బెట్టి ఏమిటన్

గరమగు పుత్ర వంఛితము గానగ లేక విచార ఖిన్నులై 

తిరుమల , కంచితో ఒకానొకనాడు  సమానమైన, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. 

పుష్పగిరి ఒక అద్వైతపీఠము, పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప కర్నూల్ రహదారిలో కడపకు 16 కిలోమీటర్ల  వద్ద ఎడమవైపు తిరిగి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దక్షిణ భారతదేశం లోని మొట్టమొదటి “ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి” పీఠం , ప్రస్తుతం వైభవం కోల్పోయింది గాని ఈ ప్రాంతానికి “ పుష్పగిరి” అన్న పేరుకి గల కొన్ని పురాణ గాథలు ఇక్కడ ప్రచారం లో ఉన్నాయి.

తల్లి దాస్య విమోచనకోసం నాగులకోరిక మేరకు స్వర్గలోకం నుండి అమృతం తెస్తున్న గరత్మంతుడిని ఇంద్రుడు ఆ ప్రాంతం లో అడ్డగించినాడని, వారిద్దరు పెనుగులాటలో అమృతభాండం తొణికి అందులోని కొన్ని బిందువులు చింది ఇచట గల కొలనులో పడినట్లు, నాటి నుండి ఈ కొలనులో స్నానం చేసిన మానవులు అమరత్వం పొందుతున్నట్లు, ముసలి వారు యవ్వనవంతులుగాను, అనారోగ్యముతో బాదపడుతున్నవారు  ఈ కొలనులొ స్నానం ఆచరించిన పిదప ఆరోగ్యవంతులుగాను అవుతుండడం తో మనుషుల భారాన్ని మోయలేక భూమాత   త్రిమూర్తులతో మొరబెట్టుకోవడం తో  ఆ త్రిమూర్తులు వాయుదేవుని ద్వార ఒక పెద్ద కొండను తెప్పించి కొలను కప్పించారని, ఆ కొలనుపై కొండ తేలియాడగా విష్ణువు ఒక పాదం తోనూ, మహేశ్వరుడు మరొక పాదం తోను తొక్కిపట్టారని, కొండ సరస్సుపై పుష్పము వలే తేలియాడినందున ఆ కొండకు పుష్పగిరి  పేరు వచ్చినదని స్థానికుల కథనం.

పుష్పగిరి సమీపం లో పెన్న, పాపాఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవ్య నదులు కలుసుకొనుట చేత ఈ ప్రాంతం పంచనది క్షేత్రమని ప్రసిద్దికెక్కింది, క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని  నిర్మించట్లు ఉన్నది,  రాష్ట్ర కూట రాజు కృష్ణ వల్లభుడు  ఇక్కడి వైద్యనాధేశ్వర స్వామికి పూజల నిమిత్తం కొంత భూమి దానమిచ్చినట్లు, పల్లవ చిద్దణ దేవరాజు, వైదంబి సోమదేవ, కేశ మహారాజు యాదవ సింగవ, కాకతీయ సామంతుడు కాయస్థ గంగయ సాహిణి, విజయనగర ప్రభువులు, వారి సామంతులు అనేకులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అనేక దానములు ఇచ్చినట్లు ఇక్కడి శాసనములు తెలుపుచున్నవి. ఇక్కడి వైద్యనాధేశ్వర అలయాన్ని కరికాచోళుడు కట్టించాడని చరిత్ర కారులు చెబుతున్నారు,  కాకతీయ ప్రభువు గణపతిదేవులు పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీశివయోగింధ్రుల శిష్యులుగా ఉన్నట్లు ఆంధ్రుల చరిత్ర చాటుతున్నది.

పెన్నా నది ( పినాకిని) పుష్పగిరి గ్రామాన్ని చుట్టి తూర్పుకు ఉత్తరముకు ప్రవహిస్తున్నది, సందర్శకులు పుష్పగిరి గ్రామం నుండి పెన్నానదిని దాటి పుష్పగిరి కొండ చేరుకోవాలి, ఇక్కడ ఒక విశిష్టత ఉన్నది, నాకు తెలిసి శివకేశువులు ఒకే ప్రాంగణము ఉన్న ఆలయం లో ఉండడం అన్నది ఈ దేశం చాలా అరదు, ఇక్కడి విశిష్టత అదే…! ఒకే ఆలయ ప్రాంగణం లో శివకేశవులున్నారు పూజలందుకున్నారు కూడ, శైవులు, వైష్ణవులు చే పూజించబడినారు, మరో విశేషము ఎక్కడ కనపడనీ బ్రహ్మదేవుని విగ్రహం కూడ ఇక్కడ చూడవచ్చు, ఇంకా సంతాన మల్లేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మీ, సుబ్రమన్యస్వామి, గదాధరుడు, యోగాంజనేయులు దర్శనమిస్తారు. మరో విశేషము ఇక్కడి ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడల మీద ఖాళీ లేకుండా  పూర్తిగా  శిల్పాకళాకారులు మొలిచిన , కుడ్య శిల్పాలచిత్రాలు ఉన్నాయి, అంత్యంత మనోహరంగా ఉన్నాయి, రామాయణ, మహాభారత , భాగవత ఇతిహాసాల లోని ముఖ్య ఘట్టాలన్ని  ఈ గర్భగుడి గోడల చుట్టు చూడచ్చును ఈ  అద్భుతం.

ఆస్తికుడివా..? లేక నాస్తికుడివా అన్న బావనతో సంబందం లేకుండ  ప్రతి ఒక్కరు ఈ కళారూపాలను చూస్తూ..ఆస్వాదించవచ్చు, శిల్పకళల పట్ల మక్కువ, ఆసక్తి ఉన్న వారికి ఇక్కడికొస్తే పండగే,  మనకున్న చారిత్రిక సంపదయగుఈ అపురూప కళారూపాలను చూస్తూ మైమరుస్తాము. ఆంధ్ర శిల్పుల నేర్పరితనం అణువణువున కనిపిస్తుంది.  శివకేశవాలయముల చుట్టూ ఉన్న కుడ్య శిల్పకళాఖండాలు,  అందులో నటరాజనృత్యము,కిరుతార్జునీయగాధ, ఏనుగుల వరుసలు, అశ్వరోహకులు, వీరుల విన్యాసాలు చూపరలను రంజింపచేస్తాయి.

ఆలయ విమానం నాగర పద్దతి శిఖరము కలిగి ఉన్నది. విమానమునకు నాలుగు దిక్కులు నంది విగ్రహములున్నవి.   గజాసుర సంహారమూర్తి, కార్తికేయ, వినాయక, భిక్షాటన మూర్తులు గోడలపై చిత్రములైఉన్నవి.  శ్రీచెన్నకేశవస్వామి ఆలయానికి నైరుతి దశలో రుద్రుని పాదము, దానికి రెండుకిలోమీటర్ల దూరములో విష్ణు పాదము కనిపిస్తాయి,  శివకేశవు లిరువురు ఇచట పాదము మోపినారనటకు అవి దృష్టాంతారములు.  పౌరాణిక సంబంధమైన సర్వదేవత ఆలయములు ఇచట కనిపిస్తాయి, మరో విశేషము.. రతీమన్మధుల రతీ భంగిమల శిల్పాలు  నిశితంగా పరశీలిస్తే ఈ గోపురం మీద  కనపడుతాయి.

ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీన మైనది, శ్రీశైలఖండమందును, స్కంధ పురాణమందును,సత్యనాధుని రసరత్నాకరమందును, పుష్పగిరి క్షేత్రమును గూర్చి విశేషములు ఎన్నో ఉన్నవి, ఇక్ష్వాకులు నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణ ద్వారముగా ఈ క్షేత్రము పేర్కనబడింది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామిశ్రీచక్రాన్ని ప్రతిష్టించినారు.వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠము. మిగతవి వారు స్థాపించినవి కావు.

కాశీ యాత్ర గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతం నందు విడిది చేసినారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాసినారు:

పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా

రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది,

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లోని బ్రహ్మాండ పురాణం, వాయు పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. శ్రీ శైల మహా సంకల్పంలో ‘...ఏలేశ్వర, స్కంద సోమేశ్వర, ప్రసూనాచల సంగమేశ్వరాద్యుపద్వార శోభితే..’  అని చెప్పడాన్ని బట్టి  పుష్పగిరి క్షేత్రమే శ్రీశైల నైరుతీ ద్వారమని తెలుస్తోంది (ప్రసూనాచలము అంటే పుష్పగిరి అనియె అర్థము). అంతేకాక ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది.

ఇన్నివిధముల ప్రశస్తికెక్కిన పుష్పగిరిని నేడు తాకి తలచేవాడు లేడు.

ఏ నాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మాపని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగం భోట్టూ!

అన్నట్లు తయారయ్యింది నేటి పుష్పగిరి పరిస్థితి.

స్వస్తి.

 

1 comment:

  1. రామమోహన్ గారు మీరు విసిదము గా పుష్పగిరి గురించి శ్రీశైల క్షేత్రం ఒకప్పుడు పుష్పగిరి పీఠం యాజ మాన్యము లో ఉన్నట్లు గా విని ఉన్నాను.
    శివ కేశవ ఆలయం లో ని ఆంజనేయ స్వామికి తోక లేదని విన్నాను

    ReplyDelete