Thursday 6 April 2017

దేవుని మౌనం - ఒక కథ

దేవుని మౌనం - ఒక కథ

అనగనగా ఒక వూరు. ఆ వూరిలో ఒక శివాలయం. ఒక నగర పారిశుధ్య కార్మికుడు ప్రతి రోజూ వెళ్లి స్వామిని దర్శించి తన పని ప్రారంభించేవాడు. పని ముగియగానే తిరిగీ స్వామిని చూసి నమస్కరించి వెళ్ళేవాడు.
ఈ వీధులు ఊడ్చే పని చేసే ఆ భక్తునికి పని చేసి  చేసి విసుగొచ్చింది. ఒక రోజు తన పని ముగిసిన వెంటనే దేవుడితో ఈ విధముగా మొరపెట్టుకున్నాడు.
"స్వామీ నీవేమో రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు.రోజంతా వీధులు ఊడుస్తూ దుమ్ము దూళి లోనే గడుపుతాను. ఇంటికి పోయి పడుకొంటే సరిగా నిద్ర కూడా రాదు. స్నానము చేద్దామన్నా నీళ్ళు దొరుకుట మాకు ఎంతో కష్టము. తెల్లవారితే షరా మామూలే. మళ్ళీ అదేపనే! ఈ పని నేను చేయలేను. నీది ఎంత హాయయిన పని. కావలసినవన్నీ కూర్చున్నచోటికే వస్తాయి. ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నీవు చేయి" అని నిగ్గదీసినాడు.
దేవుడు సరదా పడి సరేనన్నాడు. కానీ  ఒక్క షరతు మాత్రము విధించినాడు. "నీ కంటిముందు ఏమి  ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఎవరు ఏమి చేసినా నోరు మెదపకూడదు." అని ఒక నిర్దేశించినాడు.
అదేం పెద్దపనిలే అని తలచి "సరే" అన్నాడు మన కార్మికుడు.
తెల్లవారింది. అనుకొన్న ప్రకారమే శివుడు భక్తుడు తమ తమ పనులు మార్చుకొన్నారు.
 సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః ||
అని సంఖ్య యోగములో (29 వ శ్లోకము) భగవానుడు చెప్పినట్లు తాను ఆ కార్మికుని రూపములో ఆ పాత్రను నిర్వహించుతున్నాడు.
ఇక్కడ భక్తుడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు రావటం జరిగింది. ఆతడు స్వామి వద్ద "దేవా ! నా వ్యాపారములోని ఈ కొత్త లావాదేవీ లో   లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టినాడు. చొక్కా పై  జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయినాడు.
భక్తుడు  "ఒరేయ్... పర్సు వదిలేసినావు చూసుకో" అని అరుద్దామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయినాడు.
ఇంకొంతసేపటికి ఒక పేదవాడు వచ్చినాడు గుడికి. తనవద్ద నున్న ఒకరూపాయిని దేవునికి కానుకగా వేసి 
"దేవా... నా దగ్గర వున్నా ఈ ఒక్క రూపాయిని  నీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లినాడు. కళ్లు తెరిచేసరికి  పర్సు కనిపించింది. "ఇది నీ దయే తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయినాడు.
"ఒరే దొంగా అది నీది కాదు" అని అరుద్దామనుకొన్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి నోరు మూసుకొని ఉండిపొయినాడు. 
ఆ తరువాత ఒక Truck Driver వచ్చినాడు. అతడు ఈ విధముగా ప్రార్థించినాడు.
"దేవా బండినిండే సరుకుతో డిల్లీ వెళుతున్నాను. నన్ను  కాపాడు స్వామీ" అని దండం పెట్టుకొన్నాడు.
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చినాడు. "నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు పోలీసులతో. పోలీసులు అతడిని అరెస్టు చేసి Station కు తీసుకుపోయినారు.
ఈ అన్యాయాన్ని చూసి దైవరూపములోని భక్తుడు ఉండబట్టలేకపోయినాడు. "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు ఫలానా" అంటూ అంతా చెప్పివేసినాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని Driver ను వదిలేసి, పేదవాడిని పట్టుకుని వెళ్లిపోయినారు పోలీసులు.
సాయంత్రానికి అనుకొన్న ప్రకారము తమ తమ DUTY లను మార్చుకొన్నారు శివుడు, భక్తుడు. భక్తుడు దేవునితో  "దేవా! ఈ రోజు నేను ఎంత మంచి పని చేసినానో తెలుసా! ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడినాను.  దోషిని అరెస్టు చేయించినాను." అన్నాడు.
దేవుడు "ఎంత పని చేసినావురా వెర్రివాడా! నిన్ను మెదలకుండా చూస్తూవుండమని కదా నేను చెప్పింది,ఎందుకు నీవట్లు   చేసినావు." అన్నాడు. "అదేమిటి స్వామీ? నేను చేసిన ఘన కార్యమునకు నీవెంతో  మెచ్చుకుంటావనుకున్నాను." అన్నాడు భక్తుడు. ఆ మాటకు స్పందిస్తూ శివుడు ఈ విధముగా అన్నాడు.
"ధనవంతుడు మహాపాపాత్ముడు. పేదకు కాస్త డబ్బు అందితే  కొంచమైనా వాని కష్టము తీరుతుందని  నేనే ఇదంతా చేయించినాను.

ఇక Truck Driver తెల్లవారితే సరుకుతో చాలా దూరము పోవనున్నాడు. దారిలో వాని Truck నకు Accident జరిగి అతడు చనిపోతాడు. అతడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
ఇప్పుడు చూడు, నీవు అంతా తారుమారు చేసినావు. Truck Driver చావబోతున్నాడు. పేదవాని కష్టము తీరలేదు. దొంగ నిజమునకు అతడు కాదు. పర్స్ అతనికి దొరికింది అంతే. ఆ డబ్బు అతడు తన కుటుంబమునకు వుపయోగించియుంటే అతని దరిద్రమూ కొంత తీరేది, ఆ ధనవంతునికీ తన డబ్బు సద్వినియోగమయినందుకు కొంత పుణ్యమూ దక్కేది. అంతా అస్తవ్యస్తము చేసినావు." అన్నాడు దేవుడు.
నీతి:
దేవుడి ప్రణాళిక మనకు తెలియదు.
కీడుగా కనిపించేది వాస్తవానికి మేలు కావచ్చు.
తప్పుగా కనిపించేది  ఒప్పై ఉండవచ్చు.
ఆయన ను అందుకోవడము అంత సులభము కాదు. ఎంత సాధన కావలెనో!

2 comments: