Friday 30 August 2019

మిలారేపా (టిబెట్టుకు చెందిన అసమాన బౌద్ధయోగి)

మిలారేపా (టిబెట్టుకు చెందిన అసమాన బౌద్ధయోగి)

మిలారేపా
(మీరు వ్రాసే COMMENTS నా కృషికి దోహదము చేస్తాయి)
ఇది టిబెట్ కు చెందిన ఒక మహానీయుడగు బౌద్ధ గురువు పేరు. త్రివిష్ఠపము అన్న పేరు పాశ్చాత్యుల నోటిలోబడి టిబెట్ అయ్యింది. త్రివిష్ఠపము అంటే 'స్వర్గము' అని అర్థము. అంటే ఈ ప్రదేశము భూతల స్వర్గమన్నమాట. బౌద్ధము ప్రబలిన తరువాత ఇచ్చటి పౌరులు బౌద్ధమును ఆశ్రయించినారు, కానీ వారు మొదటి నుండీ హైందవమునకుచెందిన తంత్రవిద్యను వదలలేదు. నేటికి కూడా అచట ఈ విద్యను అనుష్ఠించినవారు అధికముగా అగుపడుతారు.
ఒక వాల్మీకి కనిపించుతాడు ఈయనలో. తెలియని వయసులో చేసిన పనులను శీఘ్ర కాలములోనే 'అపరాధములు' అని గ్రహించి మానస్సిక పరివర్తన చెంది, పాప ప్రక్షాళన గావించుకొని లోకానికే ఆరాధ్యుడైన ఈ మహనీయుని చరిత్రను రేపటినుండి శృంఖలగా మీముందు ఉంచబోతున్నాను.
ఇక్కడ ఒక్క విషయము తెలియజేస్తాను. ఆస్యగ్రంధిలో ప్రచురించే చాలామందిలాగా నేనూ బొమ్మలు పెట్టి లైకులు కొట్టమనవచ్చు. కానీ నామనసుకు అది నచ్చలేదు. నేను Good Morning, Good Afternoon, Good Night postings పెట్టను. వానిలోని ఉత్పాదకత (Productivity) ఏమిటో నాకు అర్థము కాదు. చేసే పని ఏదయినా ప్రయోజనకారిగా ఉండవలేననేది నా ఉద్దేశ్యము.
నిజమునకు నాకు Typing రాదు. ఒక్క వ్రేలితోనే నేను చెప్పదలచిన విషయమును టైపు చేస్తాను. నేను దీనివల్ల ఏ ప్రతిఫలమునూ పొందుటలేదు. నాకు అవసరమూ లేదు. ఈ దేశమును గూర్చి, ఇచట పుట్టిన మహనీయులను గూర్చి, వారు నిష్కాములై ప్రజలకు అందించిన అనేకానేకములగు ఆవిష్కరణల గూర్చి తెలుపవలెనన్న తపన, కష్టమైనా నాతో ఈపని చేయిస్తూవుంది. నేను ప్రతిఫలము కాదుకదా ఎటువంటి గుర్తింపు సంమానములను కూడా కోరను. నిష్కాములై అంకిత భావముతో విశ్వ శ్రేయస్సు కోరిన మన ఋషి ముని శాస్త్రజ్ఞులే నాకు ఆదర్శము.
మిమ్ము కోరేది ఒకే కోరిక. ఈ రచనలు చదువుటవల్ల మీసమయము వృధా కాకపోగా సద్వినియోగము చేయుసున్నారని గుర్తించండి. 'అజనాభము' అన్న మొట్టమొదటిపేరు కల్గిన ఈ భూమిపై పుట్టుట మన అదృష్టము. అజుడు అనగా పరబ్రహ్మము. ఆయనకు నాభివంటిది మనము పుట్టిన ఈ ప్రదేశము. అందుకే ఇందు ఎందరో మహనీయులు జన్మించినారు. అందుకే ఈ భూభాగామును ఆర్యావర్తము అన్నారు.

అట్టి ఆర్యావర్తములో పుట్టి జ్ఞానమును ప్రసాదించి మోక్షము సాధించిన మహనీయుడు 'మిలారేపా'. తప్పక ఆ మహనీయుని గూర్చి తెలుసుకోండి.

స్వస్తి.
మిలారేపా
https://cherukuramamohan.blogspot.com/2019/08/blog-post_30.html

మిలారేపా . ఇది మనలో చాలామంది బహుశ వినని పేరు. కానీ మన ముందుతరము వారు ఈయనను గురించిన అనేక విషయములను మనకు సమగ్రముగా అందించినారు. వివరములు తెలుసుకొనుటకు ముందు స్వల్పముగా ఆయన గొప్పదనము తెలియజేస్తాను.
12వ శతాబ్దానికి చెందిన ఈ మహా యోగి బౌద్ధంలో కొత్త ప్రయోగములు చేయుటయే గాక  తద్వారా మోక్షమును సాధించిన ధర్మభిక్షువు ఈయన.
తనదైన పద్ధతిలో యోగ సాధనచేసి అమరుడైనవాడు. మిలారేపా గౌతమ బుద్ధుడంతటి జ్ఞాని. త్రివిష్టపము (టిబెట్) వారికి మిలారేపాయే అపరబుద్ధుడు. ధ్యానసాధనకు  కొత్త బాటలు వేసినవాడు మిలారేపా. పూర్వ జన్మల పాపాలన్ని ఒక జన్మలోనే నశిస్తాయని బోధిసత్వులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమన్నవాడు ఈ మహానుభావుడు. ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చి యోగంలో స్త్రీలకు మహోన్నత స్థానం కల్పించినవాడు. మిలారేపా జీవితమునుగూర్చి తెలుసుకొనడము  మన అదృష్టము. ఆ మాటే కదా ఆంద్ర భాగవతములో పోతన్న మనకు తెల్పినది.
నీపాద కమల సేవయు
నీ పాదార్చకులతోటి నెయ్యము, నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయగదే
కావున మహనీయుల చరిత్రలు మనము తప్పక చదువవలసినవే! మన జీవితములో అవి ఎంత మార్పులు కలిగించుతాయో మనము తెలుసుకొనక ముందే తెలుపలేము కదా!
12వ శతాబ్దానికి చెందిన ఈ యోగి కథను శ్రీ శార్వరి గారు  మంచి ఆధ్యాత్మికానుభూతిని ఇవ్వగల గ్రంథముగా  మలిచినారు. లబ్ధప్రతిష్ఠులగు ఎక్కిరాల భరద్వాజ గారు కూడా వీరి చరిత్రను విస్తారముగా వ్రాసినారు.
సాధకులకు ఈ యోగి ఆత్మకథ ఆవశ్య పఠనీయమన్న విషయయము ముందే తెలుపుకొన్నాను. బుద్దుని బోధనలు, ధ్యాన సూత్రాలు ‘మహాముద్ర’గా టిబెట్‌లో అందిపుచ్చుకున్న వారిలో ‘మార్ఫా\మార్వా’ ఈ ‘మిలారేపా’కు గురువు.
దక్షిణ టిబెట్‌లో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ‘మిలారేపా’ తండ్రి మరణంతో, సాటి బంధువుల ఈసడింపులకు గురియై, తల్లి మాట మీద, ప్రతీకారం తీర్చుకోవడానికై క్షుద్ర విద్యలు అభ్యసిస్తాడు. అయితే తదనంతరం, తన దృష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూసి, ఆత్మ విచారణ చేసి, చైతన్యంపొంది, సన్మార్గంలోకి వస్తాడు.
ఉద్రేకము ఉరకలువేసే యవ్వనంలో తన మంత్రశక్తితో వడగళ్లవాన కురిపించి, పంటచేలను నాశనం చేసి, గ్రామస్థుల్ని భయభ్రాంతులను చేసిన వ్యక్తే. 83 ఏళ్ల వయసులో - ఆ గ్రామస్తులకే ‘ఆరాధ్య దైవ’ముగా మారిన సద్గురువు - ‘మిలారేపా’.
భౌతిక దశలో గురువు సహాయ సహకారాలు అవసరంగానీ, సాధన తీవ)తరమై, అంతః చైతన్యము ఆవిష్కృతమైన దశలో, గురు చైతన్యంలో తన చైతన్యం కలిసిపోయి, ఒక మహా చైతన్యంగా పరిణమిస్తుందని ‘మిలారేపా’ కథ మనకు చెబుతుంది. ఒకసత్యాన్వేషి సాధనాక్రమాన్నిమనకళ్ళముందుంచుతుంది. శిష్యుల మానసిక స్థితిగతులను బట్టి సద్గురువు నిర్దేశించే పద్ధతులుంటాయనికూడా ఈ రచన చెబుతుంది. ఆత్మజ్ఞానం ఎవరికివారు పొందవలసిందే. ఈ ఒక్క మానవ జన్మలోనే జన్మ జన్మల కర్మశేషాలు విదుల్చుకుని మనము జన్మరహితులo కావచ్చని మిలారేపా కథ ప్రబోధిస్తుంది.
నేను ఈ మిలారేపా చరిత్రను ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన ‘టిబెట్ యోగి’ మిలారేపా చరిత్రను చదివినవాడనయినందున నాదయిన రీతిలో వ్రాసి మీ ముందుంచుచున్నాను.
మిగిలినది రేపు.......
మిలారేపా - 2

మిలారేపా గారి శిష్యుడైన ‘రేచుంగ్’ నకు సమాధి స్థితిలో మిలారేపా గారు దర్శనమివ్వగా ఆయనను సమగ్రముగా తన జీవిత చరిత్రను తెలుపమని అర్థించుట జరిగినది. అందుకు సమ్మతించి ఆయన స్వయముగా తెలిపిన తన చరిత్ర మనకు మహనీయులు ఎక్కిరాల భరద్వాజ గారు, తెలుగులో రేచుంగ్ ద్వారా చెప్పించినారు.
మిలారేపా పూర్వులు క్షుద్రవిద్యా ఉపాసకులు. ఆయన పూర్వులలో ఒకరు, ఎవరూ వదిలించలేని దయ్యాన్ని ఒక వ్యక్తికి వదిలిన్చినపుడు అది ‘మిలా’ మిలా’ అని అరుస్తూ వెళ్ళిపోయిందట. అందువల్ల మిలారేపా పూర్వీకులు ఆ ఉదంతము తరువాత ‘మిలా’ అన్న పేరుతో ప్రారంభించి నామకరణము జరుపుకొనేవారు. ‘మిలా’ అంటే మానవుడు అని అర్థమట.
మిలారేపా తండ్రికి తండ్రి అంటే తాతగారు జూదములో సర్వస్వము పొగుట్టుకొని కుమారుడు దోర్జీ సింగ్ మిలా మరియు  సంసారముతో వీధినబడినారు. ఆతను తనకు తెలిసిన క్షుద్రవిద్యల సహాయముతో పంటలను నాశనము చేయబోవు వడగళ్ళ వానలను  దారి మళ్ళించి ఆ పొలముల స్వంతదారులు ఇచ్చే డబ్బుతోనూ చిన్న పిల్లల బొమ్మలు తయారుచేసి వానిని అమ్మి వచ్చే డబ్బుతోనూ కుటుంబ పోషణము చేసేవాడు. తరము మారింది. ఆయన కాలమైపోయినాడు.
ఇప్పుడు ‘మిలారేపా’ తండ్రి ఇంటిని నడుపుతున్నాడు. ఆయన తల్లిపేరు ‘కాల్మోయాస్’ అంటే తెల్లని దండ అని అర్థమట. 1052 ఆగస్టు 25న మన కథానాయకుడు జన్మించినాడు. పిల్లవాని ఏడుపు విని ఆతని తండ్రి ‘తోపగ’  ‘తోపగ’ అని అరచినాడట. తోపగ అన్న మాటకు శ్రావ్యమైన కంఠము అని అర్థము.   తరువాత కొంత కాలానికి ఆదంపతులకు ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు ‘గొంగిట్’ అయినాకూడా, నోరు తిరుగనందువల్ల మన మిలా ఆమెను ‘పేటా’ అని పిలిచేవాడు. దోర్జీ తండ్రి సంపాదనా విధానమును అనుసరించక ఉన్ని దుప్పట్లు శాలువలు తయారుచేసి అమ్మేవాడు. అనతికాలములోనే ఐశ్వర్యవంతుడైనాడు. ఎప్పుడు సంపద గల్గిన అప్పుడు బంధువులు వత్తురన్న సామెతగా అయిన వారెందరో వారి ఊరు చేరి వారి ఇంటిచుట్టూ తమ తమ శక్తికొలది ఇళ్ళు కట్టించుకొని ఉండి, తమకవసరమైనపుడు ఆయన నుండి అన్ని విధములా సహాయము పొందజొచ్చినారు. మిలారేపా బాల్యము ఆనందముగా గడిచే సమయములో ఆయన తండ్రి తీవ్రమైన అస్వస్థతకు గురియైనాడు. బాల్యముననే మిలా కు ‘జేసే’ అనే అమ్మాయితో వివాహము నిశ్చయంయ్యింది. కానీ ఆయన ఆమెతో అంటీ ముట్టనట్లు తిరిగేవాడు. ఇంతలో ఆయన తండ్రికి, ఆరోగ్యము దినదినమూ క్షీణించుటచే మరణమాసన్నమైనది. తనకు తమ్ముని వరుస అయ్యే అతను అతని భార్యకు తన ఆస్తిని అప్పగించి తన భార్యను పిల్లలను జాగ్రత్తగా చూచుకొమ్మని, అబ్బాయి యుక్త వయస్కుడయిన తరువాత ఆస్తి అప్పజెప్ప,మని  అసువులు బాసినాడు. అమిత దుర్మార్గులగు ఆ దంపతులు ఆయన చెప్పినవన్నీ మరచిపోయి ఆ సంసారమును అష్టకష్టముల పాలుజేసి ఆస్తిని అసాంతమూ సొంతము చేసుకొన్నారు. అది చాలదన్నట్లు మిలా కుటుంబమును  పడరాని ఇడుముల బడవేసి పరిపరి విధముల హింసించినారు.
మిలారేపా తల్లి లోని సహనమును, ఒక విధముగా, వారు చంపివేయుటతో  ఆమెకు మార్గాంతరము తోచక, మొదటి నుండీ క్షుద్రవిద్యలతో సంబంధమున్న కుటుంబము కాబట్టి, మిలా తో ఈ దుర్మార్గులు పెట్టె కష్టాలను ఇక భరించలేము నీవు తగిన గురువు వద్దకుచేరి క్షుద్రవిద్యలు సంపూర్ణముగా నేర్చుకొని వారిని మట్టుబెట్టు’ అని చెప్పింది. ఆ బాలునికి తగిన పైకమును, తనకు కానుకగా తన అన్న ఇచ్చిన అర ఎకరము పొలమును అమ్మి, చేత పెట్టినది.
తగిన గురువును సంపాదించుకొనుటయే గాక క్షుద్రవిద్యలన్నీ సమగ్రముగా నేర్చుకొన్నాడు వడగళ్ళను దారి మళ్ళించి పంటలను పాడు చేయుట మరియు పంటలను కాపాడుట అనబడు విద్యతో గూడా! ఆ శక్తితో తమకు విరోధులయిన వారినందరినీ సమూలముగా మట్టుబెట్టినాడు. తన పిన్నమ్మ, చిన్నాయనాలు తనకెంత ద్రోహము చేసినా వారి ఆస్తులను నాశానముచేసి వారిని ప్రాణములతో వదిలిపెట్టినాడు.
కొంతకాలము గడిచింది. మిలారెపా మేనమామ అండదండతో మరియు ‘జేసే’ ఆమె తల్లిదండ్రుల సహాయముతో రోజులు సజావుగా సాగిపోతూ వచ్చినాయి. ఒకానొకరోజు మిలారెపా ఇంకా క్రొత్త క్రొత్త విద్యలు నేర్చుకొనుటక అమ్మ అనుమతిని గ్రహించి, ఆమెచే కొంత డబ్బు తీసుకొని, ఒక పేరుపొందిన గురువు వద్దకు ప్రయాణమైనాడు. ఆయనను చేరి మెప్పించి అనుంగు శిష్యుడైనాడు.
ఒకనాడు గురువు వేరు ఊరిలోనున్న తన మిత్రుడు అవసాన దశలో ఉన్నాడను వార్త వస్తే అతనిని చూచుటకుపోయి, అతను మరణించగా ఎంతో నిర్వేదముతో వెనుదిరిగి వచ్చినాడు. దుఃఖము చేత ఖిన్నుడైన ఆ గురువు మిలా తో ‘నాయనా! నీవు వయసులో ఉన్నవానివి. కష్టమునకు ఒర్చుకోగల శక్తి కలిగినవానివి. క్షుద్ర విద్యలు మనకు పాపమును చేకూర్చేవే కానీ పరమాత్మ దర్శనమునకు పనికి రానివి. అందుచే ఒక సద్గురువును ఆశ్రయించు. నీజన్మ చరితార్థముచేసుకొని అందలి సారమును నేను బ్రతికి ఉంటే నాకూ తెలియజేయి’ అని జ్ఞాన బోధ చేసినాడు. ‘నార్’ అన్న ప్రాంతము క్రొత్తగురువు నివాస స్థలమని చెప్పి ఒక ‘యాక్’ ను ఉన్ని దుస్తులను మిలా కు ఇచ్చి ఆ గురువునకు బహుమతిగా ఒసంగుమని చెప్పి పంపినాడు.
ఆయన ‘నార్’ వెళ్లి గురువును చేరి తెచ్చిన బహుమతులనిచ్చి మంత్రోపదేశము పొందినాడు, కానీ ఒకరోజు ఆగురువు “తోపగా!(మిలాకు తండ్ర చేసిన నామకరణము) నీవు నన్ను మించిన సాధకుడవు అన్నది నాకు తెలిసిపోయినది. అందుకే నేను నిన్ను ఒక మహా గురువు వద్దకు పంపుచున్నాను. ఆయన భారత దేశపు యోగీశ్వరుడయినా ‘సరోపా’ గారి శిష్యుడు. ఆయనను ‘మార్ఫా’ అంటారు. మీ ఇరువురిదీ గతజన్మ సంబంధము. కావున తక్షణం నీవు ఆయన వద్దకు వెళ్ళుము” అని ఆదేశించినాడు.
గురువు చెప్పిన విధముగానే ఎంతోప్రయాసకు ఓర్చి, ఎన్నడూ పొలమునకు పోని మార్ఫా తగిన ఆహారమును అతిథికి కూడా భార్యతో  చేయించుకొని పొలములో వుంటే , గురువును కలసినాడు. మిలా, మార్ఫా గారిని గూర్చి అడిగితే “ముందు నీవు ఈ పొలము దున్ని ఈ ఆహారము తిని, నేను ఉన్న కుటీరమునకు వస్తే నీకు మార్ఫాను చూపుతా” నన్నాడు. మిలా అలాగే చేసి ఆ కుటీరము లోనికి వెళ్లి అక్కడ కూర్చున్న మహనీయుని అప్రతిభుడై చూసినంతనే ఆయన “నేనే మార్ఫాను, ఇప్పుడు నమస్కరించు” అన్నాడు. నమస్కరించిన తరువాత తన చరిత్ర దాపరికము లేకుండా చెప్పి తనకు ‘అద్వితీయ మంత్రోపదేశము’ మరియు ‘వసతి’ ని కోరితే ఆయన ఎదో ఒకటే ఇస్తానన్నాడు. మిలా ‘మంత్రోపదేశమే’ కోరినాడు. వీరి సంభాషణ విన్న గురుపత్ని మిలాకు అండగా నిలిచి ఆహారము ఎదో ఒక విధముగా మిలాకు పెట్టి, భర్త ఆమోదముతో వారి ఇంటనే ఉండజేసింది.

ఇక అక్కడి నుండి మిలా కష్టాలు మొదలైనాయి. 
మిగిలినది మరొక రోజు .......
మిలారేపా - 3
గురువు, మిలాతో తన శత్రువుల ఉనికిని జెప్పి వారిపై ప్రతీకారము తీర్చి రమ్మన్నాడు. అవి చేసినతరువాత మళ్ళీ వారిని బ్రతికించి తన కుమరుని కొరకు ఒక స్థలము చూపించి ఇల్లుకట్టమన్నాడు. అది పూర్తి అయిన వెంటనే అక్కడ కాదు అని వేరొక దిక్కునకు పిలుచుకు పోయి అది చూపినాడు. ఈ విధముగా ఇల్లు కట్టడము పడగోట్టడము చేయుటచే శక్తికి మించి శ్రమించిన మిలాకు తొడల మూలమున వీపు మీద గడ్డలు కట్టి నడచుటయే కష్టతరము చేసినా గురువు చెప్పుట మానలేదు.
చివరకు గురుపత్ని జోక్యముతో 10 అంతస్తుల మేడ మొదటి స్థలములో కడితే ఉపదేశము చేస్తానన్నాడు. ఏడంతస్తులు కట్టిన తరువాత పక్క స్థలము చూపించి 10కాళ్ళ మంటపము కట్టమన్నాడు. అదయిన తరువాత తాను శిష్యులకు ఉపదేశము చేయు రోజున రమ్మన్నాడు. మిలా అందరి వెనకల చేరి కూర్చోగానే మార్ఫా తనకు తెచ్చిన బహుమతి చూపమన్నాడు. ఏమీ తెలేదంటూనే తన్ని తరిమివేసినాడు. పదే పదే అవమానాలు దండనలు మిలా భరించేది చూడలేక, మార్ఫా సతి మిలాకు, మార్ఫా గురువగు సరోఫా, మార్ఫా కు, ఇచ్చిన కంఠమాలను మరియు  ఉంగరమును భర్తకు తెలియకుండా ఇచ్చుటయే గాక, తన భర్త వ్రాసినట్లు, ఆతని చేతివ్రాతను అనుకరించుతూ ఒక ఉత్తరమును వ్రాసి, అతనిని ‘గోగ్ డన్’ అన్న తన భర్త యొక్క అతిముఖ్య శిష్యుడు, గురువు వద్ద సమగ్రముగా మంత్రోపదేశము పొందినవ్యక్తి వద్దకు పంపింది. అందులో స్పష్టముగా మిలా కు ఆత్మా విద్య నేర్పమని ఉంది. ‘గోగ్ డన్’ ను అంతకు మునుపు ఒకసారి గురువును చూడ వచ్చినపుడు, మిలా అతనిని చూసియుండినాడు.
గోగ్ డన్ కూడా చూసియుండుటచే ఆతనిని శిష్యునిగా అంగీకరించినాడు.
ఇక్కడ మార్ఫా ఇంటివద్ద, మిలాను గూర్చి ఆయన తన భార్యను వాకబు చేస్తే ఆమె బహుశా మీ పోరు పడలేక వెడలిపోయినాడేమోనని చెబుతుంది. నావద్దకు రాకుండా వాడు ఎక్కడికి పోతాడో చూద్దాం అని, అని మౌనముగా ఉండిపోయినాడు.
ఇక్క గోగ్ డన్ కూడా మార్ఫా వలెనే మిలాను పరీక్షింపనెంచి తనకు ద్రోహము చేసిన మూకను, మిలా క్షుద్రశక్తులచే చంపమన్నాడు. గురు వాక్యమును త్రుణీకరించలేక  అట్లే చేసి పరితాపముతో “గురువుగారు మంచి మార్గము లో పోవలసిన నేను మళ్ళీ చెడుదారి తోక్కుచున్నాను” అని అన్నాడు. అప్పుడు గోగ్ డన్, ఇది నీకు పరీక్ష మాత్రమే! చూడు ఆ మరణించిన పక్షులు రెక్కలల్లార్చుతూ ఎంచక్కగా ఆకాశములోకి ఎగిరి పోతున్నాయో ! అట్లే నీచేత చంపబడిన మనుషులు జంతువులు కూడా నిదురించి లేచినట్లుగా తమ తమ పనులు చేసుకొంటున్నారు అని అన్నాడు.
మిలాను శుచియై వచ్చి తన వద్ద కూర్చోనమని ఉపదేశము చేసి, గాలి ఆడుటకు గోడకు ఒక చిన్న తూము గలిగిన గుహ చూపించి తిండితో అందులో ఉండి గొళ్ళెము వేసుకొని సాధన చేయమన్నాడు. ఎంత సాధన చేసినా మిలాకు ఫలితము దక్కలేదు. గోగ్ డన్ కు సందేహము కలిగి మిలాను నిగ్గదీసినాడు. ఉన్నదంతా మిలాచెప్పివేయుటతో ఇకపై విద్య నేర్పే గురువులతో ఇటువంటి ఆటలాదవద్దు అన్నాడు. అంతలో మార్ఫా నుండి గోగ్ డన్ కు, తన కొడుకు ఉపనయనమునకు  శిష్య సమేతముగా రమ్మని ఆహ్వానము వచ్చింది. గోగ్ డన్ మిలాతో కూడా అందరుశిష్యులను తీసుకొని బయలుదేరినాడు.
ఊరి పొలిమేరలకు వచ్చిన తరువాత మిలాను మార్ఫా వద్దకు వెళ్లి ఆహారము, నీరు, బీరు (అక్కడి వాతవరణమునకు బార్లీ పంట ఎక్కువ కావున వారు దానితో చేసిన బీరును త్రావుట ఒక సంప్రదాయముగా పాటీంచుతారు.) తెమ్మని పురమాయిచినాడు. ఇష్టము లేకున్నా మిలాకు పోవ తప్పలేదు.
ఆతడు మార్ఫా గారి గృహమునకు వెళ్లి గుట్టుగా గురుపత్నిని కలసినాడు. అప్పుడామె “గోగ్ డన్ ఉత్తముడు, కానీ ఇప్పుడు గురువుగారికి నీవు వచ్చిన విషయము తెలిపితే అగ్గిపి గుగ్గిలమౌతాడు. అందుకే గోగ్ డన్ చెప్పినవి తీసుకొని నీవెంట నేనే వస్తానని చెప్పింది. వారించినా వినకుండా, గోగ్ డన్ చెప్పిన వస్తువులు తీసుకొని అతనితో బయలుదేరింది.
వారి భోజనము,విరామము ముగిసిన తరువాత అందరు బయలుదేరి మార్ఫా వద్దకు చేరుకొన్నారు. భార్య ద్వారా విషయము తెలుసుకొని అటు ఆమెకూ ఇటు గోగ్ డన్ కు కావలసినంత వడ్డించి తన కోపమును చల్లార్చుకొన్నాడు మార్ఫా.
తదనంతరము పిచ్ఛాపాటీ లో  మొదట ‘నాకేమి తెచ్చినావు, గురువు వద్దకు రిక్త హస్తములలతో రాకూడదని తెలుసు కదా!’ అని అడిగినాడు గోగ్ డన్ ను మార్ఫా. ‘ఒక కుంటి మేకను తప్ప నా సర్వస్వము తెచ్చినాను’ అని అన్నాడు గోగ్ డన్ . ‘అది నిర్ణయించ వలసినది నీవు కాదు, నేను’ అన్నాడు మార్ఫా అధికార స్వరముతో. పొరబాటును క్షమించమని ఎంతో వినయముతో  ఆయనకు విన్నవించి తన ఊరికి పోయి ఆ మేకను భుజముపై వేసుకొని తెచ్చినాడు గోగ్ డన్. మార్ఫా ‘నాకు ఇఒది ఎందుకూ పనికిరాదు, కానీ నీ శిష్యులకు గురుభక్తి అంటే ఏమిటో నిన్ను చూసి తెలుసుకోనుటకిట్లు చేసితిని’ అన్నాడు మార్ఫా. ఆ తరువాత ఏవేవో మాట్లాడుతూ, మార్ఫా మిలాను గూర్చి అడిగినాడు.

గోగ్ డన్ మిలా ద్వారా తాను తెలుసుకొన్నదంతా చెప్పినాడు.
తదుపరి  ఇంకాస్త ...........
మిలారేపా - 4
కుపితుడైన మార్ఫా ‘వానిని నీ వద్దకు పంపలేదు. నాసా గురువు సరోఫా నాకు ఇచ్చిన ఆ అమూల్యమైన వస్తువులు నేను పంపలేదు. వాడు వచ్చియుంటే వానిని నా ముందు నిలబెట్టు’ అన్నాడు మార్ఫా. మిలాను చూస్తూ కోపముతో కంపించిన మార్ఫా నిజాయితీగా నిజము చెప్పమన్నాడు. భయ విహ్వలుడైన మిలా చెమటచే నానిపోయిన శరీరము కలవాడై వాస్తవము చెప్పుచున్నంతలో రాబోవు ఆపద గ్రహించిన గురుపత్ని దేవుని గదిలోకి వెళ్ళి లోపలి తలుపును బిగించుకొంది. మార్ఫా తో, ఆమెను తానేమీ అనను, అన్నంతవరకు తలుపు తీయలేదు. ఆయన నేరుగా దేవుని మంటపము వద్దకు చేరి నిమేరేలిత నేత్రుడై ధ్యానముద్రలో భగవంతుని ఆరాధించి, ప్రశాంత చిత్తుడై భార్యతో కూడా బయటికి వచ్చినాడు గోగ్ డన్. మిలా, మొదలైనవారంతా కూర్చున్నచోటికి.
అప్పుడు అందరినీ ఉద్దేశించుతూ ఈ విధముగా చెప్పదొడగినాడు. “కోపము నిప్పుతో సమానము. అది తననూ కాలుస్తుంది ఎదుటి వారినీ కాలుస్తుంది.మరి నేనట్టి కోపమును అంతంత గా అందరిపైన ముఖ్యముగా  తోపగా పైన చూపుచూ వచ్చినాను. ఎందుకు అంటే ఆ కుంకకు ఈ జన్మలోనే దైవసాక్షాత్కారము కలుగావలేనని నా పట్టుదల. వాడు చేసిన పాపకర్మలు సామాన్యమైనవి కావు. మరి ఆ పాపము ప్రక్షాలణమైతే తప్ప వాడు వాడు నావద్ద దీక్ష పుచ్చుకొనుటకు అర్హుడు కాదు. అందుకే వానిని ఎన్నోమార్లు ఇళ్ళు కట్టమనటము, ఇంకా ఎన్నో విధములుగా హిమ్సిన్చాతము, జరిగినది. వాడు నావద్దకు రాకముందే నాగురువు సరోపా కలలో కనిపించి, నాకు ఎనలేని ఖ్యాతి తెచ్చే శిష్యుడు వస్తున్నాడు అని చెప్పినాడు. వాడు కానుకగా తేబోయే వస్తువులలో రాగిపాత్ర తనకెంతో ప్రియమైనది అని కూడా చెప్పుట జరిగినది. అందుకే ఆ పాత్ర చూడవలెనన్న తహ తహ తో వాడు వచ్చిన వెంటనే నాకొరకు ఏమి తెచ్చినావని అడిగినాను. వాడు నాకు తాను తెచ్చినవన్నీ అందించినవెంటనే రాగి పాత్రను తీసుకొని దైవమందిరమునకు దానిని తీసుకొనిపోయి దేవుని ముందు దీపము వెలిగించుటకువాడే పరిశుద్ధమైన వెన్నతో నింపి అక్కడే ఉంచినాను.
వాడు జ్ఞాన ప్రాప్తికి చిన్నవాడు. అందువల్ల తన వయసుకు తగిన విధముగా నానుండి, విసుగు చెంది, పోదలచినాడు. వానికి నా భార్య అండదండ లభించుటతో ఉరకల పరుగుల మీద నీవద్దకు చేరినాడు. ఇక నా భార్య విషయమా! ఆమెది మాగురువుగారి వస్తువులను ఇచ్చుతలోగానీ, నా దస్తూరి తో గోగ్ డన్ కు లేఖ వ్రాయుటలో కానీ తప్పులేదు. ఆమె వానిని మొదటి చూపులోనే వానిని తన పుత్రునిగా స్వీకరించింది. మరి తల్లికి కొడుకుపై మమకారము ఉండుట సహజమే కదా! ఇక గోగ్ డన్ ను కుంటిమేక తెమ్మని ఎందుకన్నానంటే అంతనూ ఎంత ఆదర్శప్రాయమన శిష్యుడో తక్కిన వారాలకు చూపదలచుకొన్నాను. గురువుగా తానొక గొప్ప స్థానములో ఉంటూకూడా నాకు శిష్యుడే అన్నది నిరూపించి ఆదర్శ ప్రాయుడై నిలచినాడు. కావున ఇంతవరకూ జరిగిన విషయములలో ఎవరిదీ తప్పులేక పోగా తమ తమ విధులు చక్కగా నిర్వర్తించినారు. తోపగా లోని తృష్ణ లోకానికి తెలియబడినది. నేటినుండి వానికి నా బోధన మొదలౌతుంది.” అని చెప్పినపుడు మిలా ముఖము సూర్యుని జూచిన సహస్రదళ కమలము వలె వికసించినది.
ఆ మాట వింటూనే మిలాకు ఆనందముతో ఆకాశమునంటినట్లయ్యింది.
“గురుదేవా మిమ్ము మనసులో అప్పుడప్పుడు కష్టముల కోర్వలేక తప్పుగా తలచినాను. నా తప్పును మనసారా క్షమించండి. నా ఉన్నతిని కోరేవారేవరున్నా వారంతా మీ తరువాతనే! మీరుమీ పత్నియగు నాకు అమ్మ గారునాకు చేసిన సహాయానికి నేను మీ అడుగుజాడలో నడచి జీవన్ముక్తి సాధించి మాత్రమె మీ ఋణము తీర్చుకోగలను. నేను వ్రేమీ చేయనూలేనుఎదో వంతుకు ఒక బహుమతి ఇచ్చి నా బాధ్యత దులుపుకోనూ లేను. నేను బుద్ధునికిసంఘానికిధర్మానికి నా దీక్షనునా భావ చిత్తములను సమర్పణ చేసిఅష్టాంగా మార్గములో ముక్తిని సాధించుతాను. ఇది త్రికరణ శుద్ధిగా నేను మీ పాదములంటి జేయు ప్రమాణము.”
తరువాత రోజు ఉదయము మిలాకు నవోదయము. గురుబోధ మొదలయ్యింది.
గువాజ్ఞ ప్రకారము  గురు గృహము వద్దనే వారు చెప్పిన ప్రకారము ఒక గుహను నిర్మించుకొని గాలి నిరంతరము వచ్చు విధముగానూఆహార పదార్థములను అందివ్వవలసి వచ్చినపుడు ఇవ్వగలిగిన తీరుగానూ తగిన ఒక కిటికీ నిర్మించుకొనిగురుపత్ని మనసారా నాకందించిన ఆశిస్సులతో ఆహారముతో గుహలో చేరిపోయి  సాధనను ప్రారంభించినాడు.

గురు దీక్ష లభించినది మొదలుగా మిలారేపా తన సమయమునంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే గడుపదొడగినాడు. ఒకనాడు మార్ఫా గారు తన ధ్యానమునుండి బాహ్య ప్రపంచాములోనికి వచ్చి మిలాతో గంభీరముగా నీవు సంపాదించిన జ్ఞానముతో నీవు ధ్యానమగ్నునివి కాలేకుండా ఉన్నావు. నీవు కైలాస శిఖరముజేరి నీద్యానమునచట కొనసాగించమని ఉపదేశము చేసినాడు. మిలా తన శిష్యగణముతో అచటికి 1093 లో బయలుదేరినాడు. ఆయన కైలాస పర్వతమును పశ్చిమ దిశనుండి అధిరోహించ దలచినాడు. మొదట వచ్చే గుల్రాసేహీ అన్న ప్రాంతము చేరినాడు. అచట ఆయనకు దేవతలు ఆతిధ్యమిచ్చినట్లు చెప్పబడినది. తిన్నగా మానస సరోవరము వైపు నడవసాగినాడు ఆయన తన శిష్యులతో. చేరిన పిమ్మట ఆయనకు నారోవాన్ చుమ్ అన్న బాన్ మతస్థునితో పరిచయము అయ్యింది. 
మిగిలినది మరొక పర్యాయము......
మిలారేపా - 5
కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట చుమ్ ప్రశ్నకు జవాబుగా మిలా తాను కైలాస శిఖరము చ్వ్హెర సంకల్పించినట్లు తెలిపినాడు. దానితో అది బాన్ మతస్తులకే సాధ్యమన్న వితండ వాడములోనికి దిగినాడు చుమ్. అంతటి తో ఆగక బ్రాహ్మీ ముహుర్తములో బయలుదేరి సరిగా సూర్యుడు ఉదయించు సమయమునకు ఎవరు చేరుతారు అన్న పందెము కాసినాడు చుమ్. మిలా కూడా అందుకు అంగీకరించినాడు. చుమ్ వేకువనే లేచి తన సాధనా శక్తితో వడివడిగా శిఖరము చేరదొడగినాడు. మిలా మాత్రము తన శిష్యుడు వచ్చి లేపెవరకూ నిడురపోతూనే ఉండినాడు. శిష్యుడు ఆతనిని లేపి విషయము వివరించినంతనే ఆతను శిఖర పాదమును జేరి తన అసాధారణమైన యోగ శక్తితో శిఖరముచేరి ఉదయార్కుని వెలుగురేఖలను తన శరీరమునకు సంతరించుకొని సూర్యునికి కృతజ్ఞతా పూర్వకముగా నమస్కరించి ఒక మంచు పేళ్లను భూమిపైకి విసరి తిరిగి స్వస్థానము చేరినాడు. పరాజితుడైన చుమ్ తన ఓటమిని అంగీకరించి నమస్కరింపగా, తానూ విసరిన మంచుపెల్ల ఒక మంచుగుట్టయై దర్శనమివ్వగా, చుమ్ తో నీ ఇకపై అక్కడ ఉంది కైలాస శిఖర దర్శనము చేసుకొంటూ నీ ధ్యానము సాగించుమని తెల్పినాడు. ఆయన తన శిష్యులతో ఇకపై ఎవరూ ఆ ఉన్నత శిఖరము జోలికి పోవాడ్డు అని చెబుతూ, అట్లు మొండిగా పోయిన వారు తిరిగీ రారు అనికూడా తెల్పి, తన ధ్యానమును గురువు తెల్పిన నిబంధనల ప్రకారము ముగించుకొని తిరిగీ గురువును చేరినాడు. (Obtained from roar.media)
మార్ఫా యజ్ఞము చేసే సమయములో ఎవరో దేవతా స్త్రీలు వచ్చి, తన గురువు సరోఫా గారు చెప్పిన, అప్పట్లో అర్థము కాని కొన్ని విషయములు గుర్తుచేయగా, తదనంతరము కొంతవరకు ఆ విషయములు అర్థము చేసుకొన్నా మార్ఫా భారత దేశములోని తన గురువు సరోఫా వద్దకు బయలుదేరినాడు. ఆయన గురువు వద్ద ఉన్న సమయానికి ఇక్కడ మిలాకు కూడా కలలో ఒక దేవత కనిపించి అతను ఇంకా ‘డోగ్ జగ్’ అన్న ఒక యోగవిద్యను  నేర్చుకోనవలసియున్నట్లు తెలియజేసింది.
మిలా గురువుగారినుద్దేశించి ఈ విధముగా చెప్పినాడు "నిన్నటి రాత్రి నాకొక కల వచ్చినది. అందులో మన ఊరికి ఉత్తరముగా ఉన్న కొండపై నేను నిలబడి ఉన్నాను. ఆ శిఖరము ఆకాశాస్మునంతినడా అన్నంత ఎత్తులో ఉంది. పర్వతము నాలుగు వైపులా జలపాతములున్నాయి. ఆ నాలుగు నదులూ సముద్రములో కలుస్తూ ఉన్నాయి. ఆ సాగారతీరమున పూదోటలు వికసించిన పూలతో కళకళలాడుతూ ఉన్నాయి. ఆ పర్వతమునకు గల తూర్పు శిఖరములపై అమితమగు జూలుభయంకరమగు గోర్లు ఉన్న  ఆ సింహము ఆకాశము వైపు చూస్తూనిల్చుంది. కాసేపట్లు తిరిగిన తరువాత ఆ శిఖరమునుండి దిగి పర్వత సానువులలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దక్షిణ శిఖరముపై ఒక ఆడ పులి కనిపించింది. అది అటూఇటూ తిరుగుతూ హటాత్తుగా ఆకాశము వైపు ఎగిరింది. పశ్చిమ శిఖరము పై వాలియున్న గ్రద్ద సముద్రపు అలలయంత విశాలమయిన రెక్కలనల్లార్చుచూ ఆకాశామువైపు చూస్తూ వుంది. అది ఉన్న స్థలమును ఆనుకొని యుఇన్న గూట్లో దాని పిల్లలున్నాయి. అది కాసేపు ఆవిధముగా పైకి చూస్తూ చూస్తూ ఎగిరి పోయింది.” ఇదీ నాకు వచ్చినకల అన్నాడు.

ఆ స్వప్న వృత్తాంతము విన్న మార్ఫా అమితానందభరితుడై తన భార్యతో షడ్రసోపేతమగు వంటలను చేయమన్నాడు. ఆమెకు ఆ మాట చెప్పి ఆ స్వప్న వృత్తాంతమును తన శిష్యులకు ఈవిధముగా చెప్పదోదగినాడు. మిలా అయితే తన గురువు చెప్పేది అమితమైన శ్రద్ధతో ఆలకించ సాగినాడు.
మిగిలినది మరొకసారి.......


మిలారేపా - 6
మార్ఫా అక్కడ గుమి కూడిన వారినందరినీ ఉద్దేశించుతూ మిలా కు వచ్చిన కలయోక్క వివరణ ఈ విధముగా ఇవ్వదొడగినాడు “ తోపగా కు వచ్చిన కలలో ఉత్తరమున బౌద్ధము ఒక మహాపర్వతమువలె నిలచియుండగా అందు ఉన్న అత్యున్నత శిఖరము త్రివిష్టపము(టిబెట్) అని తెలుపుతూ వున్నది. అక్కడ కనిపించిన పర్వతము నేను ఏర్పరచిన సాంప్రదాయము. మీరంతా ఆ సాంప్రదాయమునకు చెందినవారే! ఆ పర్వత శిఖరము ఆకసమునంటుట  ఈ సాంప్రదాయము ఎంతటి ఉన్నత ధర్మాలు కలిగివుందో  తెలుపుతుంది. దాని చుట్టూ తిరుగుతున్న సూర్య చంద్రులు జ్ఞానమునకు వాత్సల్యమునకు గురుతులు. వాటి కాంతి భూమిపై వ్యాపించడము ఈ ప్రపంచముపై వేదజల్లబడే భగవంతుని కృపకు చిహ్నము. ఆ పర్వత మూలము భూమిని ఆక్రమించుకొనుట మన సాధనా సంపత్తిని ప్రపంచమునందు విస్తరించుతాను తెలియజేయుచున్నది. ఇక తోపగా చూసిన ఆ నాలుగు నదులు భగవంతుని చేరుటకు  పెద్దలచే నిర్దేశింపబడిన నాలుగు ముఖ్య మార్గములు. ఆ సముద్రమే భగవంతుడు. ఆ సముద్రపు ఒడ్డున ఉన్న పూల చెట్లు సాధకునిచే గ్రహింపబడిన విషయములు.
ఇక తూర్పున కనిపించిన సింహము ‘పిరటన్ వాంగి’. అతను సింహస్వభావుడు. ఆతను గోళ్ళను భూని పట్టియుంచడము ఆయన పట్టుదలను తెలుపుతుంది. ఎక్కువగా ఉన్న ఆ సింహపు జూలు ఆయన నేర్చిన అగణిత విద్యలకు సంకేతము. యధేచ్చగా సంచరించుట ఆయన బంధములను అతిక్రమించినాడు అంటే బంధముక్తుడు అన్న విషయము తెలుపుతుంది.
దక్షిణదిశలో ఉన్న ఆడపులి నా పోరాస్తమ శిష్యుడు ‘గోగ్డన్-చు-డోర్’. అతను ఆడపులి వంటి మనస్తత్వము కలిగినవాడు. అంటే తనను నమ్మిన శిష్యులను తన అక్కున చేర్చి కాపాడుకొనుటయేగాక వారికి, తనకు తెలిసిన విద్యనంతటినీ నేర్పువరకు వదిలిపెట్టడు. ఆయన ఒంటిపై కనిపించే చారలు ఆయన సాధించిన ఆధ్యాత్మిక సత్యములు. గోళ్ళను భూమిలోనికి క్రుచ్చి యుండుట  బోధిసత్వుని నాలుగు ధర్మములను గ్రహించినటువంటి తన పట్టుదలను తెలియజేస్తాయి. ఆపులి ఆకాశమును చూచుట అతనికి లౌకిక విషయములపై ఉన్న విరక్తిని తెలుపుతుంది.
ఇక పశ్చిమమున రెక్కలను విశాలముగా విప్పార్చియుంచిన గ్రద్ద ‘మొటాన్ నోఫా’. విప్పారిన ఆరెక్కలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యములు. ఇక ఉత్తహర దిశగా ఉన్న రాబందే మన ‘తోపగా’. ముందు ముందు ‘గాంగ్ తాంగ్’ ప్రాంతములో స్థిరపడి ‘మిలారేపా’ గా ప్రసిద్ధిగాంచనున్నాడు. ఆ రాబందు ఏర్పరచుకొన్న రాతినివాసము వలె శాశ్వతము కానున్నది. ఆ గూటిలోని పిల్లలు అతనికి ఉండబోయే అశేష శిష్య సంపదను తెలియజేస్తుంది.ఇది ఆ స్వప్న వృత్తాంతము” అని ముగించినాడు. మిలా సంతోషానికి అంతు లేదు.
ఎందుకో మార్ఫా కు తన నలుగురు శిష్యులకు ఈ ఈ ఆధ్యాత్మిక విద్యలు తగియున్నాయో తెలుసుకోవలెనను తలంపుతో ధ్యానమగ్నుడైనాడు. అందు ఆ నలుగురూ తమకు తగిన శాఖలనే ఎంచుకొని సాధన చేస్తున్నారని తెలుసుకొన్నాడు. అందు మిలా ‘తు-ము’ అన్న సాధన చేస్తున్నట్లు తెలుసుకొనుటయే గాక అది అతనికి తగినదని ఆయన తెలుసుకొన్నాడు. అది సాధకునియండలి అగ్నితత్వమును ఉద్దీపితము చేస్తుంది. ఆ సాధనయే మిలా కు ‘రేపా’ అన్న పట్టము కట్టినది. రేపా అంటే ‘నూలు వస్త్రములు ధరించేవాడు’ అని అర్థము. పై యోగ్యతను సాధించినవారే ఆ వస్త్రములను ధరించుతారు. ఆవిధముగా ఆ మహానుభావుడు ‘మిలారేపా’ అయినాడు. గురువు అందరికీ వారి వారి సాధనకు తగిన గ్రంధాలను ఇచ్చి సాధన చేయమన్నాడు.
మిలా తానూ ఏర్పరచుకొన్న గుహలో తీవ్ర సాధన చేస్తూవుండగా తన తల్లి మరణించినట్లు, తన ఇల్లు పాడుబడినట్లు, తన చెల్లెలు బిచ్చగత్తెగా మారి ఊర్లు పట్టుకొని తిరుగుతూ అడుక్కుతింటున్నట్లు కలగనాడు. తన తల్లిణి చూడవలేనన్న బలమైన కోరికను ఆపుకోలేక తాను కట్టుకొన్న గుహను బద్దలుకొట్టి బయటికి వచ్చినాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తము జరుగుతూవుంది అంటే ఇంకా సూర్యోదయము అగుటకు కొంత సమయము పడుతుంది అన్న మాట. మిలా గురువు పడుకొని నిడురించుచున్న ప్రక్క వద్దకు చేరి తనగోడు చెప్పుకోన దొడగినాడు. చివాలున లేచిన మోఫా ముఖము ఎంతో కాంతివంతముగా ప్రకాశింపజొచ్చినది. అప్పటికే లేచిన గురుపత్ని తినుటకు పదార్థములను పట్టుకు వచ్చినది. శిష్యుని చూసిన వెంటనే కోపపడిన మోఫా శాంత చిత్తుడై దంతదావనాదులు గావించుకొని వచ్చి ఆహారమును తీసుకొమ్మన్నాడు. ఆహార్తము తీసుకొంటూ వుండగా విషయమును అడిగినాడు మోఫా. మిలా తనకు తనగ్రామము చేరి ఇల్లును తల్లిని చూడవలెనని అనిపించుచున్నదని చెప్పినసాడు. అప్పుడు ఆయన అనుమతించుతూ “నీకు జ్ఞాన ప్రాప్తి జరిగినది. 4,5, దినములలో నీకు అత్యంత ముఖ్యమైన మంత్రోపదేశములను చేసి, అత్యంత క్లిష్టమయిన పరిస్థిలో తెరిచి చూడవలసిన విషయముగల్గిన ఒక కాగితపు చుట్టను అంటించి నీకు ఇస్తాను. మనము బ్రతకబోయే కాలములో ఇక కలిసే అవకాశము లేదు” అని అనీ అనగానే గురుపత్ని కన్నీరు మున్నీరై ఏడ్వదొడగింది. మొర్ఫా ఆమెను ఓదార్చి మిలాను గుహలోనే సాధన చేస్తూ తనవద్దకు తానూ చెప్పినపుడు వస్తూ ఉపదేశము తీసుకొమ్మన్నాడు.
అంతా సవ్యముగా ముగిసింది. చెప్పవలసినది ఇవ్వవలసినది అంతా జరిగిపోయింది. మున్నీరై ప్రవాహించుతున్న కన్నీటితో గురు దంపతుల కాళ్ళు పట్టుకొని కదిగినంత పనిజేసి, గురువు ఓదార్పు మాటలతో లేచి నిలబడినాడు. గురుపత్ని మిలాకు తాను మోయగలిగిన తిండినిచ్చి ఆశీర్వదించింది.  దంపతులవద్ద శెలవు తీసుకొని విషణ్ణవదనుడై  బయలుదేరి, గురువాజ్ఞ ప్రకారము ‘గోగ్ డన్’ వద్దకువెళ్ళి ఆయన వద్దనుండి తీసుకోవలసిన ఉపదేశమును తీసుకొని  కష్టాలకు కడగళ్ల్లకు ఓర్చుకొంటూ సొంత ఊరు చేరినాడు.

చీకటి పడేవరకూ అటూ ఇటూ తిరిగి రాత్రికి ఇల్లుచేరినాడు. కాలికి బలంగా ఎదోతగిలితే దానిని తీసి పుర్రెగానూ, అది తన తల్లిదిగానూ గుర్తించి ఏడ్చినాడు. తన యోగ శక్తితో పితృలోకములలోయున్న తల్లిదండ్రులతో మాట్లాడి వారి ఆశీస్సులను తీసుకొన్నాడు.
మిగిలినది తరువాత ........
మిలారేపా - 7
తెల్లవారిన తరువాత ఊరిలో తిరుగుతూవుంటే పిన్ని కనిపించింది. ఎట్లో మిలాను గుర్తించింది కానీ స్వార్థము ఆమెను వదలలేదు. ఇహము పై ఆసక్తిలేని మిలాను బుజ్జగించి అతనిదయిన ఇల్లూ పొలము తన వశము చేసుకొంది. ఊరికి కొంత దూరముగా పాకవేసుకొని  ధ్యానములో ఉన్న మిలాను చూచుటకు, తమ పెళ్లి నిశ్చితార్థములోనే ఆగిపోయిన ‘జేసే’ ఎంతో ఆసక్తితో  మధుర పానీయముతో చూడ వచ్చింది. తానూ పెల్లిచేసుకోలేదని, మిలాకొరకే వేచియున్నానని చెప్పింది. ఆధ్యాత్మికము తలకెక్కిన మిలా ఆమెను అనునయించి వేరే పెళ్లి చేసుకొమ్మంటే వీలుపడదని తెలుపుతూ తానూ తనదయిన భక్తిమార్గమును ఎన్నుకొని బ్రహ్మచారిణిగానే ఉంటానంటూ వెళ్లిపోయింది.
రోజులు గడుస్తున్నాయి. మిలా సాధనలోపడి ఒంటిపైన బట్ట, కంటిపైన నిద్ర, కడుపులోకి తిండి అన్న విషయమునే విస్మరించి ఉండిపోతున్నాడు. ఒకరోజు జేసే పెటా ను వెంటపెట్టుకొని తినుటకు త్రావుటకు కావలసిన పదార్థములను తీసుకొని మిలా వద్దకు వస్తే ఆ సమయమున ఆయన ఒంటిపై వస్త్రమేలేక తన పనిలో నిమగ్నమైయుండినాడు. వారు ఆయన స్థితిని చూసి క్షణకాలము నివ్వెరపోయి శిగ్గుతో తల వంచుకొన్నా, పెటా వెంటనే తేరుకొని అన్నాను ఆలింగనము చేసుకొని వలవల ఎదుస్తూవుందిపోయింది. ఆయన ఆమెను ఒడార్చుతఎగాక ఆధ్యాత్మికముగా తానెంత ఎదిగినదీ తన మాటలతో పాటలతో తెలియజేసినాడు. పెతా అప్పుడప్పుడు ఆయన తినుటకు ఏవయినా వస్తువులు తెస్తోవుంతానని చెప్పింది. ఆయన ధ్యానమునకు అంతరాయము లేకుండా ఇరువురూ శెలవు తీసుకొని బయలుదేరినారు.
మిలా తన ధ్యాన తీవ్రస్తాను హెచ్చించి ఎక్కడ ధ్యానము చేసుకోవలెనంటే అక్కడికి చేరుకోగల శక్తిని పొందగలిగినాడు. ఈ శక్తి రావటముచే తన శరీరమునందు యోగాగ్నిని మేలుకోలుపుటను తాను సాధించుటకు అతిదగ్గరలో ఉన్నట్లు మిలాకు అర్థమైపోయింది.
ఒక రోజు ఒక బాలుడు తన తండ్రి తో వీధిలో నడుస్తూ ఆకసముపై ఎగురుచున్న మిలాను చూపి “నాన్నా ఆయన ఎంత మహానీయుడో చూడు” అన్నాడు. అతనికి మిలా పూర్వ వృత్తాంతము మాత్రమే తెలిసిన వాడయినందున “ అతడు పాపి. అతనిని చూడవద్దు” అని ఆ బాలుని దండించినాడు.  “మరి నీవు పాపములు చేయలేదు కదా, నీవు ఎగురు చూద్దాము” అన్నాడు. ఆతని వద్ద సరియైన సమాధానము లేదు. ఈవిధముగా రానురానూ మిలా చెడుగు నుండి మచివాడు, మహనీయుడు అన్నపేరు సంపాదింప దొడగినాడు.
ఇట్లే ఒక రోజు గుంపుగా కొంత మంది కలిసి పోతూ శుష్కించిపోయి చూచుటకే అసహ్యముగా ఉన్న మిలాను అవహేళన చేస్తూ తమకు ఆకలిగా వున్నదనియు, తినుటకు ఏమయినా పెట్టమనియు అడిగితే మిలా ఎటువంటి అసహనము బాధ చూపక తన దీనావస్థను తెలిపి తానూ లతలు ఆకులతో కడుపు నింపుకొంటున్నట్లు తెలిపి కావాలంటే అవే వారికి ఇస్తానన్నాడు. అప్పుడు ఆ గుంపులో ఒక ముదుసలి, ఆ ఎగతాళి చేసిన వ్యక్తిపై వ్సుగు కొని “ఆయన యోగాసాదనలో వుండే వ్యక్తిగా కనిపించుతున్నాడు. మీరు ఆయనతో హాస్యాలదకండి” అని తెలిపి, ప్రార్థనా పూర్వకముగా “ఏదయినా ఒక తత్వమును పాడి వినిపించాగాలరా” అని అడుగగా ఈ క్రింది భావము కల్గిన ఒక పాటను తమ భాషలో అందుకొన్నాడు మిలా.

‘ఈ శరీరమనే దేవాలయములో, హృదయమనే పూజాపీఠము వద్ద, మనసు అనే గుఱ్ఱము చిందులు త్రొక్కుతూ వుంది. జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యమును గురించిన నిశ్చిత బుద్ధి ఆగుర్రమును నిగ్రహించాగాలిగిన కళ్ళెము. ఆ గుర్రమును ధ్యానము అను గుంజకు కట్టివేసి, గురుబోధ అను ఆహారమును దానికి వేయాలి. దానికి త్రాపే నీరు చైతన్యమనే నిరంతర స్రవంతినుండి వస్తుంది. దానిచుట్టూ వున్నా ప్రాంగణము శ్యూన్యత అనబడు నిరాకార తత్వము. ధృడ సంకల్పమే ఆ గుర్రముపై వేయవలసిన జీను. ఆ గుర్రమునకు కళ్ళెము బుద్ధి. దానిని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనము. దానిపై స్వారి చేసేవాడు నిరంతర స్మృతి, తదేక ధ్యాస కలిగి యుండవలెను. ఆ రౌతు ధరించే శిరస్త్రాణము సర్వజీవులపై గల ప్రేమ. ఆరౌతు ధరించే కవచము శాస్త్ర పాండిత్యము.అందుండి ఏర్పడే తత్వ చింతన అతని వీపునకున్న డాలు. ఓరిమి అతని చేతిలోని బరిసె. ఉత్తమస్థితికి చేరుటకు ఏర్పరచుకొన్న లక్ష్యమే అతని విల్లు. విశ్వ చైతన్యమును గూర్చిన అవగానయే అతని అంబులపొదిలోనున్న బాణములు. ఆ బాణముల ములుకులు ద్వేషము, ఈర్ష్య అన్న రెండు దోషములను తొలగించు వరకు తరిణె పట్టబడినవి. ప్రతి బాణమునాకు పవిత్ర లక్షణములు అనబడు నాలుగు ఈకలు కట్టబడి ఉన్నాయి. ఆ నాలు ఏమిటివంటే 1. నిత్యానిత్య వివేకము, 2. వైరాగ్యము, 3. శమాది షట్కము దీనినే షట్సంపత్తి అంటారు, 4. ముముక్ష తత్వము. వీనిని గూర్చి వేరోక సందర్భములో వివరించగలను.

 మిలారేపా - 8 
 ఇన్ని లక్షణములు తమ తమ స్థానములలో ఉన్నపుడు గుఱ్ఱము బుద్ధత్వము అన్న బాటలో సజావుగా సాగగలుగుతుంది.  ఆ విధముగా ముందునకు సాగే గుఱ్ఱమునకు వెనుకబడుతూ వున్నట్లు కనిపించే ప్రాపంచిక పశుపక్ష్య జడములు మనకు రౌతుకు ఏర్పడిన వస్తు విరక్తిని తెలియజేస్తుంది. అప్పడు సాధించిన గమ్యమే ముక్తి.’
ఇంతటి మహత్తరమైన భావమును పాట రూపములో ఆ మహానుభావుడు, తన చుట్టూ వున్న గుంపులోని వృద్ధుని అభ్యర్తన మేరకు ఆశువుగా పాడి వినిపించినాడు. ఎంతటి తపస్సాధన, ఎంతటి కారుణ్య స్వభావము. ఎంతటి లోకల్యాణ తత్పరత.  మనము కథకన్నా కూడా ఇటువంటి విషయములను ఎంతో శ్రద్ధతో, లగ్నముతో, జిజ్ఞాసతో చదువవలసి యుంటుంది.
మిలాకు రాను రానూ ఏకాగ్రత కొరవడింది. ఎవరెస్టు వైపు పోతే సాధనకు తగిన గుహలున్నాయని విని, ఒకే మట్టిపాత్ర పట్టుకొని బయలుదేరినాడు. రెండడుగులు వేసినాడో లేదో కాలికి రాయి తగిలి ఆ మట్టిపాత్ర చేయిజారి పగిలిపోయింది. సన్యాసికి ఈ లంపటము కూడా తగదనుకొన్నాడేమో పరమాత్ముడు, అందుకే, అదీ లేకుండా చేసినాడు.
తన పరిసరములలో ఉన్న ఒకరిద్దరు అడిగితే తాను ఎవరెస్టు పరిసరాలకు పోతున్నట్లు చెప్పి రిక్త హస్తములతోనే బయలుదేరినాడు ఆ నగ్న సాధకుడు.
అన్నను చూచుటకు ఒక రోజు, అన్న ఒంటికి ఆచ్ఛాదనగా  కొన్ని గుడ్డ పీలికలు, కొంత తిండి, తీసుకొని బయలుదేరిన పేటా అన్న ఉండిన పాత చోటుకు పోతే అతను ఎవరెస్టు వైపు వేలుతున్నాడని తెలిసి తానూ అదేత్రోవలో బయలుదేరింది. దారిలో ఆడంబరములతో అట్టహాసములతో అన్నీ తానేనని నమ్మించే ‘బారిలోద్సావా’ అన్న గురువును చూసింది. అతని డాబు, అతని శిష్యులు చేసే సేవలు, అమాయక భక్తులు ఈ విధముగా అన్నీ చూస్తూ చూస్తూ చివరకు అన్నను చేరింది.
అన్న దీనావస్థను చూచి తాను తెచ్చిన ఆ బట్టలనిచ్చి కట్టుకొమ్మనింది. కప్పుకోమ్మనింది. దారిలో తానూ చూసిన గురువుకు శిష్యునిగా కమ్మని పేటా మిలాకు నచ్చచెప్ప ప్రయత్నించింది. అప్పుడు మిలా తానము ఆధ్యాత్మికముగా ఎంతో ముందున్నానని, తన గురువు మోఫా అండదండలు తనకు ఎపుడూ ఉంటాయని, తన ఆధ్యాత్మిక గమ్యమును చేరుకోలేకపోతే ప్రాణమైనా వదుల్తానని  నచ్చజెపుతూ బారిలోద్సావా వంటి వారు దొంగాసంయాసులనీ, వారికి, తగిన కాలములో, తీవ్రమైన శారీరిక మానసిక ముప్పు వాటిల్లుతుందని చెబుతాడు. పెతా మాత్రము పట్టువిడువక “నీ సాధనకయినా దేహదార్ఢ్యము అవసరము. కావున తగిన ఆహారము తీసుకొమ్మని బ్రతిమలాడి చెప్పి శెలవు తీసుకొంటుంది. తన ప్రయాణము అంగుళము కూడా కొనసాగించలేని స్థితిలో మనసుకు పెతా చెప్పినది నిజమని అనిపించదొడగినది. తన వివేకము గురువు ఇచ్చిన ఆ కాగితపు చుట్టను తెరిచి చూడమని బలవంతము చేసినది. ఎట్టకేలకు తెరచి చూస్తే అందులో కూడా పెతా చెప్పినట్లే ఉంటూ ఇకపై చేయవలసిన ధ్యాన కార్యాచరణను గూర్చి కూడా వుంది. నీరునిండిన కనులతో గురువును మనసారా తలచుకొని శరీరమును కాపాడుకోనవలసిన ఆవశ్యకతను గుర్తెరిగి తదనుగునముగా ప్రవర్తించ మొదలిదినాడు మిలా!
ఎన్నేన్నో గుహలను తానూ ఆశ్రయించి తన సాధనను అకుకుంఠితముగా కొనసాగించినాడు. ఎంతగా నంటే ఆయనలోని ధ్యానము, ధ్యాత, ధ్యేయము అన్న మూడు ఒకటై ఆయన ఆసాధనకు ప్రతిరోజూ అప్రయత్నముగానే అంకితమైపోయేవాడు. రోజులు దొరలిపోతూనే వున్నాయి. మిలా సాధన పరాకాష్ట దిశగా సాగుతూనే వుంది. తన సాధన త్వరితపరచుకొనుటకు నాటి ప్రజలకు తెలిసిన, తెలియని ఎన్నో గుప్త గుహలను వెదుకుతూ సాధన చేసుకొంటూ ముందుకు సాగుతూనే వున్నాడు. అతని అంతులేని ప్రయానములోని భాగముగా ఒకసారి ‘బ్రిస్’ అనే ప్రాంతమును చేరుకొన్నాడు.
'బ్రిస్'లో 'సాకువాఅన్న పేరుగల ఒక మహా పండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్య ప్రతిభావాటవములకు ఆకర్షితులైన అక్కడి ప్రజలుఆయనక్లు అపూర్వమైన 'గేష్అన్న బిరుదును ఇచ్చి గౌరవించినారు. అట్టి బిరుదు సామాన్య పండితులకు అందని మ్రాని పండు. మిలారేపా గారు తన సాధన యాత్రలో 'బ్రిస్చేరినారు. రానురాను అక్కడి ప్రజలు మిలారేపా గొప్పదనమును గుర్తించదొడగినారు. దీనిని గమనించిన సాకువా ప్రజలు మిలా వైపు మొగ్గు చూపటము సహించలేక పోయినాడు. పైపైన మాత్రము మిలారేపా కనిపించినపుడు తన ఆదరమును వ్యక్తపరచేవాడు. సాధారణముగా  తనవద్ద శ్రోతలోతన భక్తులో ఉన్నపుడు మిలారేపా కనిపించితే ఆయననుమనసులో కుల్లుబుద్ధి వున్నాతన వద్దకు ఆహ్వానించి ఉచిత రీతిన ఆసనము అలంకరిమ్పజేసిపైకి తెలుసుకోవలేనన్న జిజ్ఞాస కనబరచుతూ జటిలమైన ప్రశ్నలు వేసేవాడు. మిలా అవలీలగా అద్భుతమైన సమాధానములు చెబుతూవుంటే అక్కడున్నవారంతా కళ్ళు తెలవేసేవారు. సాకువా దానిని అరిగించుకోలేకపోయేవాడు. మిలా జవాబులో లొసుగులు వెదకేవాడు. తనధ్యేయమంతా మిలారెపాను ఇరుకునపెట్టి తన గొప్పదనము తన చుట్టూ వున్నవారిముందు ప్రకతిన్చుకోనవలేనాను కాంక్షయే! ఎన్నిమార్లు ప్రయత్నించినా అది వీలు పడలేదు సాకువాకు.
ఇది ఇలా కొనసాగుతూ వుండగా మిలా గారి భక్తుడొకడు తనయింట జరుగు వివాహమునకు ప్రత్యేకముగా ఆహ్వానించినాడు. వేదిక వద్ద ఏర్పరచిన ఉచితాసనములలో అత్యున్నతమైన దానియందు మిలారేపా గారిని కూర్చుండజేసి, ప్రక్కన ఉన్న స్థానమును సాకువా కొరకు కేటాయించినారు. కార్యక్రమములోని భాగముగా అందరూ మిలారేపా గారికి నమస్కరింప మొదలిడినారు. సాకువా కూడాలేచి, తానూ నమస్కరింపబోవు సమయములో తనను వారించి గౌరవించుతారను భ్రమపడి, తటపటాయిస్తూనే, అప్రయత్నంగా సాష్టాంగ నమస్కారము చేసినాడు.
ఈ భౌతిక మర్యాదలకు మిలారేపా ఎప్పుడో అతీతుడైనాడు. తన గురువుకు తప్ప ఇతరులకు నమస్కరించని నిష్ఠ కలిగినవాడు. అందుచేత ఆయన సాకువా నమస్కారమునకు స్పందన ఏమీ చూపలేదు. సాకువా అహము దెబ్బతిన్నది. ఆతడు నమస్కారభంగిమ నుండి లేచి తేరుకొని తన వద్దనున్న ఒక పుస్తకమును తీసి దానిని చదివి అంతరార్థ బాహ్యార్థ గూడార్థములను చెప్పమన్నాడు. అప్పుడు మిలారేపా “అయ్యా మీరు స్వతహాగా పండితులు. ఒక వేళ మీకు అర్థము కానిదేదయినా ఉంటే వ్యాకరణ నిఘంటువుల సాయమున తెలుసుకోగలరు. నేను దైవమార్గమున ఉన్నవాడను. ఈ పుస్తకములు వీటికి సంబంధించిన విషయములు మరచినవాడను. పైపెచ్చు వానిని గూర్చి తెలుసుకొను ఆసక్తి లేనివాడను. ఎంత సేపయినా జీవన్ముక్తికి  తగిన విషయములగూర్చి నాకు తోచిన పాటల రూపముననో ప్రవచన రూపముననో తెలుపగల వాడను. అందువల్ల దీనిని గూర్చి నేను తెలుపలేను” అని అన్నాడు.
మిగిలినది మరొకసారి....


 మిలారేపా - 9
దీనిని అపార్థముగానూ అలుసుగానూ తీసుకొని మిలారేపాను తన సూటిపోటి మాటలతో అవమానింప ప్రయత్నము చేసినాడు సాకువా. కానీ ఆ సభలో ఉన్న ప్రతియోక్కరితో బాటూ సాకువా శిష్యులు కూడా అతని చర్యను గర్హించి అతనిని దుయ్యబట్టినారు. అవమానముతో అవనత శిరస్కుడైన సాకువాలో ప్రతీకార జ్వాల రగిలింది. ఇంటికి వచ్చి దీర్ఘముగా ఆలోచించి తన ఉంపుడుకత్తెలలో ఒక అందము తోబాటు చురుకుదనము కలిగిన ఒక ఆవిడను పిలిచి ఆమెకు భయంకరమగు విషముతో చేసిన పానీయమునిచ్చి ఎత్తులయినా మిలారేపాకు తాపించమని చెప్పి, అందుకు ప్రతిగా తన సంపాదనలోని ఒక అత్యంత విలువైన మణిని ఇస్తానని ఆతడు era చూపినాడు. ఆ మనిమీద ఆమెకు ఎప్పటిండియో వ్యామోహము కలిగినదగు ఆమె  అందులకు ఒప్పుకొని మిలారేపా వద్దకు ఆ పానీయమును తీసుకొని పోయింది. ఆయన వర్చస్సు వాలకము చూస్తూనే అంతా ఆయనకు తెలిసినదేమో నన్న భయముతో వణికిపోయినది. అంత మిలారేపా “అమ్మా నీవు ఇంకా రెండురోజులు ఆగు. అప్పుడు నేను నీకు చెబుతాను ఈ ఆసవమును నాకు ఎప్పుదివ్వవలసినది” అని తెలిపినాడు. అప్రతిభురాలై, అవమాన భారముతో కృంగిపోయి వెనుదిరిగి సాకువా వద్దకు పోయి జరిగినది చెప్పినది. మదమాత్సర్యముతో మతి గతి తప్పినా సాకువా ఆమెను మళ్ళీ వెళ్ళమన్నాడు. ఆమె కానేకాదు అంటే ఆమెను తన అర్ధాంగిని చేసుకొని ఆస్తీ అంతటినీ ఆమె కైవశము చేస్తానన్నాడు. ఆశ చెడ్డది. ఆమె అతని సలహాను అనుసరించింది.
మిలారేపా చెప్పిన విధముగా రెండురోజుల తరువాత ఆయన వద్దకు పోయి నిలచినది. అప్పుడు ఆయన “అమ్మా! ఆరోజు, సాకువా తన మాట ప్రకారమూ, నీవు నాకీ పానీయమును తాపించి యుండినా తనపని జరిగిపోయినదని నీకు మొండిచేయి చూపించియుండేవాడు. ఈ రోజు అట్లు చేయదు కాబట్టి ఆ రసమును నాకివ్వు. నేను త్రాగుతాను” అని చెప్పి ఇప్పించుకొని గుక్క త్రిప్పుకొకుండా త్రాగివేసినాడు. ఆమె తక్షణమే ఆయన కాళ్ళపై బడి తనను క్షమించమని వేడుకొంది. అప్పుడు మిలారేపా “అమ్మా! నీవు మొదటిసారి పానీయముతో వచ్చినపుడే అది విషపూరితమనీ, సాకువా దానిని తయారుచేసి నిన్ను ప్రలోభపెట్టి పంపినాడనీ నాకు తెలుసు. అపుడే నేను త్రాగివుంటే నీకు మణిని ఇవ్వకుండా ఉండిపోయే వాడు. ఇప్పుడు అతడు మానసికముగా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు సిద్ధపదియున్నాడు కాబట్టి నేను త్రాగినాను. నేను నెరవేర్చవలసిన పనులు కొన్ని భూమిపై ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు కాయముతో కనిపించుతాను. ఈ విషము యొక్క తీవ్రతను నాలోనే అణచుకొంటాను” అని చెప్పిన వెంటనే ఆమె వలవల ఏడ్చుతూ అచటి నుండి నిష్క్రమించినది.
మిలారేపా తన ధ్యానముపై ఎక్కువగా ధ్యాసను ఉంచి ఉధృతము చేసినాడు. ఒక వారము తరువాత స్మారకము వచ్చినపుడు తన శిష్యగణముతో భక్తులకు, ఆ దినము తన అనుగ్రహ భాషణము ఉంటుందని తెలియజేయమని చెప్పినాడు. అందరూ మిలారేపా గారి ఆశ్రమమువద్ద గుమిగూడినారు.
మిలారేపా గారు గొంతు సవరించుకొని తన భాషణము ప్రారంభించినారు. ఆ ప్రాంతమంతా ఆయన దివ్య భాషణము తప్ప వేరు శబ్దము ఏదీ వినిపించలేదు. తన ప్రసంగామునకు అనుబంధముగా ఎన్నో తత్వాలు పాడుతూ అక్కడ ఉన్నవారినందరినీ తన్మయులను చేసినాడు.
తన భాషణములో  పూర్తిగా మునిగిన ఆ మహానుభావుడు తన శరీరము కూర్చునుటకు కూడా సహకరించుట లేదని గుర్తించలేదు. అనుకోకుండా చుక్క మంచినీరు గుక్కలో పోసుకొనుటకు తన ఉపన్యాసమును నిలిపిన వెంటనే ప్రక్కనే ఉన్న శిష్యుడు ఆయన పరిస్థితి గుర్తుచేసి ఇక చాలించమని సలహా ఇచ్చినాడు. పైగా అతడు తమ గురువు తిన్న ఆహారములో ఏదయినా విషము కలిసిండా అన్న అనుమానమును కూడా మిలారేపా గారితో వ్యక్తపరచినాడు. అప్పుడు తన సంభాషణా విషయమును విషము పైకి మరలించి చెప్పదొడగినాడు.
వారి గురువు మార్ఫా గారు తాను శిష్యరికము చేస్తున్న సమయములో నేర్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని అక్కడ చేరిన భక్త గణమునకు ఈ విధముగా చెప్పినాడు. మనిషి చంపే విషములు 5 ఉన్నాయి. అవి ఏవంటే కామము, ద్వేషము, మూఢత్వము, అహంకారము, అసూయ. వీనిని తొలగించుకొనే ఉపదేశమును ఆయన పొందుటచే ఆ విషములు తనపై ప్రభావమును చూపవని తెలియజేసినారు. వానికి మించిన విషము ఏదీ తానూ చూడలేదన్నాడు.
జీవితములో ఏపని చేసినా తదనంతర కాలములో ‘అయ్యో! నేను ఈ పని చేయకుంటే బాగుండేది’ అన్న పశ్చాత్తాపము రాకూడదు. నీవు చేసినపని నలుగురిలో నీకు అవమానము తెచ్చేదయి ఉండకూడదు. ఈ విధముగా చేయుట చేత నేనూ, నా పూర్వ గురువులు పైలోకములనుండి మిమ్ము దీవించుతాము.
నావల్ల ఒకవ్యక్తి పశ్చాత్తాపముతో మంచి మార్గము వైపు మరలినాడు. నా శరీరమును ఆతని ‘చూచార్’ అన్న పట్టణములో విడువవలసి యున్నది. ఇక అక్కడికి బయలుదేరుతానన్నాడు. ఇక్కడ సుస్తీ అన్న ప్రక్రియను ప్రదర్శించినట్లే అక్కడ మృత్యువు అన్న లీలను ప్రదర్శిస్తానన్నాడు.
రేచుంగ్, వారి వద్దకువచ్చి చూచార్ లో కలిసినపుడు తాను తనవద్ద ఉంచుకొన్న నూలు గుడ్డనూ, వెదురు చేతికర్ర ఇవ్వమన్నాడు. పంచ ప్రాణాలను తన ఆధీనములోనికి తెచ్చుకొనే అతని సాధను, అవి అంతరాయము కలుగకుండా కాపాడుతాయి. అదే విధముగా ‘ఉపా-తోపా’ అన్న నా శిష్యునికి, ‘మైత్రి’ అన్న గురువుగారి వద్దనుండి నేను పొందిన తలపాగా, దండము ఇవ్వాలి. వానివల్ల అతనికి లోతుగా ధ్యానము కుడురుటతోబాటు, బౌద్ధధర్మమునుద్ధరించుతాకు గానూ తనలోవున్న ఆశలు ఆశయాలు సిద్ధిస్తాయి. ‘శీబా-ఉద్’ అను శిష్యునకు ఈ కొయ్య భిక్షాపాత్ర నివ్వండి. ‘గాస్’ అన్నవానికి ఈ పుర్రె తోపీనివ్వండి. ‘శేబవ్- రేపా’ అన్న వానికి ఈ చెకుముకి రాళ్ళు, ఉక్కుముక్క ఇవ్వండి. ‘బ్రిగ్రుం’ అన్నవానికి ఈ ఎముకతో చేసిన ‘చెంచా’ ఇవ్వండి. ఇక మిగిలిన వారందరికీ ఈ నూలువస్త్రమును చిన్న చిన్న పీలికలుగా చించి ప్రతి శిష్యునికీ పంచేది. వీటితో, వారిపై నా ఆశీస్సులు కలకాలమూ ఉంటాయి.’ అని ఆయన చెబుతూవుంటే విన్నవారంతా ఆయన శిష్యవాత్సల్యతకు అవాక్కయిపోయినారు.
ఎంతో నీరసించి తూలి పడబోతూవుండే ఆ మహానుభావుని చూసి సాకువా సాహిమ్పలేని రీతిలో ఎగతాళి చేసినాడు. మిలారేపా గారిని ఎంతగానో కవ్వించినాడు. ఎంత ఊరకున్నా రెచ్చకోట్టిన సాకువా నోరు మూయించుటకు, తన బాధను అచట ఉన్న ఇంటి తలుపుపైకి తన మంత్రం శక్తితో చొప్పించినాడు. అది అటు ఇటు ఊగి ఉబ్బి తబ్బిబ్బయి పగిలి పోయింది. అప్పుడు కూడా అది మిలారేపా గారి కనికట్టన్నాడు  ఆ విషహృదయుడు. మార్గాంతరము లేక తన బాధలోని పాతిక భాగమును సాకువా కు ఆవహింపజేసినాడు. మెలికలు తిరిగిపోయి సాకువా తనను రక్షించమని మిలారేపా గారి కాళ్ళపై బడినాడు. ఆ సుధామయ హృదయుడు ఆతనిని మన్నించి ఆ బాధను వెనక్కు తీసుకొన్నాడు. అప్పటికి సాకువాకు జ్ఞానోదయమై తన ఆస్తిని అందరికీ పంచి తానూ బౌద్ధ భిక్షువైపోయినాడు.
      ఆయన తన మాటగా లౌకికమయిన కీర్తి అనే విషము తాగకండి. జీవితమును పరార్థము, పరమార్థములకై  ఉపయోగించండని ఉద్బోధ చేసినాడు. సంపూర్ణమగు నిస్స్వార్థ సేవ అన్నది అలవరచుకోవలసిన అతి ముఖ్య గుణమని నొక్కి పలికినాడు. శాంతము  దాంతము అనగా మనస్సులో తనకు ఎవరయినా చేసిన చెడుగును తలవక మనః పూర్వకమైన మౌనమును కలిగియుండుట మరియు ప్రతిక్రియ లేని నెమ్మదితనము కలిగియుండుట అన్న గుణములు అత్యంత ముఖ్యమైనవని ప్రబోధించినాడు. వారికి చివరిగా “నేనిక ఎక్కువ కాలము ఉండబోవటము లేదు. కనుక నేను చెప్పిన బోధనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని తన అడుగు జాడలలో నడువండి”అని చెప్పినాడు.

ఈ మాటలన్తూనే ఆయన ఒక విధమగు ధ్యానస్థితిలోనికి వెళ్లి తిరిగీ లౌకిక స్ప్రుహలోనికి రాలేదు. ఆయన 84 సంవత్సరముల వయసులో 1135 వ సంవత్సరము జనవరి మాసములో సమాధి చెందినారు.
రాబోయేది చివరి భాగము......
మిలారేపా - 10
మిలారేపా చివరిరోజుల్లో అనేకానేక అద్భుత విషయములు జరిచోటు చేసికొన్నాయి. ఆయన మరణించిన వెంటనే ఆ ప్రాంతమంతా సుగంధ సుమ పరిమళము వ్యాపించింది. అత్యంత శ్రావ్యమైన సంగీతము వినిపించింది. దేవతలే దిగివచ్చి ఆయనపై పుష్పవృష్టి  కురిపించినట్లు చెప్పబడింది. ఆవిధంగా వారు తమ గౌరవమును ఆయనకు ప్రకటించుకొన్నారు. ఆ దృశ్యము వర్ణనాతీతము.
ఇంతలో యానాం నుండి భక్తులు బ్రిస్ ప్రాంతములోని కొందరు ధృఢకాయులతో వచ్చి మిలారేపా గారి పార్థివ శరీరమును తమవెంట తీసుకుపోతామని అక్కడి వారిని బెదిరించినారు. అందరూ పరిపూర్ణ భక్తులే కానీ అంతరాలాలలో దాగిన స్వార్థము అంతపని చేయించుతూవుంది. అప్పుడు మిలాగారు ప్రత్యక్షమై అందరితో ఈ విధముగా చెప్పినాడు. యానాం, బ్రిస్ భక్తులారా మీ చర్య వితండమే అయినా మీ భక్తి నిరుపమానము. అందుచే నా పార్తివ దేహము ఇప్పుడు మీకు మూడుగా కనిపించుతాయి. మద్యలో వున్నది వాస్తవ మగు పార్థివ దేహము. దాని సంస్కారము చోచార్ అంటే ఇక్కడే జరుగుతుంది. కుడి ప్రక్కది యానాం భక్తులు ఎడమ ప్రక్కది బ్రిస్ భక్తులూ తమ తమ ప్రాంతములకు తీసుకుపోయి ఉత్తరక్రియలు నిర్వహించండి అని చెప్పి అంతర్హితుడైనాడు ఆ మహనీయుడు. మొదలే రేచుంగ్ అన్న శిష్యసత్తముడు వచ్చేవరకూ శరీరమును దహనము చేయవద్దని చెప్పుటచే వారు ఊరక ఉండిపోయి రేచుంగ్ కై ప్రతీక్షించ మొదలు పెట్టినారు. రేచుంగ్ కు వార్త అందిన వెంటనే ఆఘమేఘాలపై చూచార్ కు బయలుదేరి, చూచార్ కు దగ్గరగా ఒక గుట్ట వద్ద పడిపోయినాడు. అప్పుడు మిలారేపా వచ్చి ఆతని సేదతీర్చి నీవు నెమ్మదిగా బయలుదేరి రా. నేనన్తలో అక్కడ చేయవలసిన పనులు చేస్తానని చెప్పి వెళ్లినాడు.
రేచుంగ్ చూచార్ చేరే సమయానికి జనమంతా దుఃఖసాగరములో మునిగి తన గురువుగారు విడచిన తనువు చుట్టూ చేరి  రోడించుట గమనించినాడు. అప్పుడు అతనికి అర్థమైనది తన గురువుగారి లీలావిలాసము.
అంతా ఆయన అనుదినమూ కూర్చుని ధనమగ్నుడై ఉన్న బండరాయివడ్డ దహనమునకు ఏర్పాటు చేసినారు. ఆవిధముగా చితి మండుతూ వుండగా అందుండి మిలారేపా గారు లేచి “రేచుంగ్ తత్వసాధనలో మీ అందరికన్నా ఎంతో ముందు వున్నాడు. అందుచే ఆతనిని నా తదనంతరము గురువుగా స్వీకరించేది. దేహాన్ని నమ్ముకోవద్దు. అది ఎప్పటికయినా మోసము చేసేదే! మీఆధ్యాత్మిక సాధనే మీకండదండ.” అంటూ ఈ విధముగా ఎన్నో ఉపదేశ వాక్యములను తెలిపి ఆయన తిరిగీ చితిపై పడుకొన్నాడు. అంతా ముగిసిణ తరువాతి రోజు అస్థికలు బూడిద కోసం భక్తులందరూ వస్తే ఆ ప్రదేశము ఏమియును లేక ఎంతో స్దుభ్రముగా వుంది. వాళ్ళు అదిచూసి ఒకవైపు ఆశ్చర్య పడుతూనే విలపించుతూ వుంటే దేవతలు ప్రత్యక్షమై వీరు విలపింప పనిలేదు. మిలారేపాగారు తమ బోధనల ద్వారా, తత్వలుల ద్వారా, ఉపదేశముల ద్వారా మీలోని ప్రతియోక్కరిలో ఉన్నారు. ఆ అనుభూతిని కలకాలం మీరు భూమిపై ఉన్నంతవరకూ మిగిల్చుకోండి అని చెప్పి అంతర్ధానమందినారు.
ఈ విధముగా ఆ మహనీయుడు టిబెట్ ప్రజల హృదయాలలో చిరంజీవియై నిలచిపోయినాడు.
ఆ మహనీయుని కథను నాకు జ్ఞాపకమున్న మేరకు, తోచిన మేరకు మీ మున్డున్చినాను. ఇటువంటి మహానీయుళ జీవిత చరిత్రలు విన్నా చదివినా, తెలిపినా అనిర్వచనీయమైన ఆనందము గుండెలు నిండిపోతాయి. అట్టి ఆధ్యాత్మిక సృష్టి కర్తల చరిత్రలకు మనము దృష్టి కర్తలమైనా పుణ్యమే!
స్వస్తి.




4 comments:

  1. ఇప్పటివరకు నేనీవిషయములలో ఆవగింజంతైనా తెలియనివాడను. మంచి విషయాలు తెలుసుకున్నాననే సంతృప్తి. మరోమారు చదవాలి అన్నంత కోరిక జనింపజేసారు. ధన్యవాదములు.

    ReplyDelete