Friday 24 May 2019

కవిత్వము - హాస్య సరళి


కవిత్వము - హాస్యసరళి

సంస్కృతము దేవవాణి. దాని పుట్టుకను గూర్చి ఎవరూ చెప్పలేరు. షడంగాలలో వ్యాకరణమున్నా మనకు పాణిని మహర్షి వ్రాసిన అష్టాధ్యాయియే ఆలంబనము. అందునుండి వెలువడిన సూత్రములనే వేరువేరు పండితులు విశ్లేషించగా మనము చదువుచున్నాము. భాషకు సాహిత్యము ఆయువు పట్టు. ఆకాలములో రాజులు కదనము, కవనము సమాంతరముగా పోషించినారు. అందుకే ఒక రాజు అన్నాడట సుకవితా యద్యస్తి రాజ్యేన కిం” అంటే మంచి కవిత్వం ఉంటే ఇక రాజ్యము ఎందులకు. సాహిత్యము అంటే “స హితస్య భావం సాహిత్యం” హితముతో కూడియున్నది సాహిత్యము. అది మనోరంజకము, మార్గ నిర్దేశకము, అజరామరము మరియు మల్లె మరువముల అనుబంధము . కనుకనే “విశ్వశ్రేయః కావ్యం” అనికూడా అన్నారు. “మానిషాద’ అన్న వాల్మీకి శోకము శ్లోకమై వెలువడినది మొదలు సాహిత్యము శ్రోతస్వినిలా నిరంతరము భువిపై ప్రవహిస్తూనే ఉంది. మనల్ని నడిపిస్తూనే ఉంది. అట్టి సాహిత్యము  మాత్రమే నిత్యము,సత్యము,శాశ్వతము. ఉదయారుణ కిరణాలలోని నులివెచ్చదనము, హిమమౌక్తికములుచే అలంకరిపబడిన సౌగంధికా కుసుమములు, మలయమారుతమునాస్వాదింప కాగడాలు పట్టుకొని దేవతలు నిలచినారా అన్నట్లున్న వెన్నెల రాత్రులు,  వసంతమందున ఝరి గమనములు, చిగురాటాకులు మేసి కూసే పిక నిస్వనములు, కరి మబ్బుల గాంచి పరవశించి నర్తించే మయూర తతులు, చెంగు చెంగున ఎగిరిదూకే లేడి పరుగుల విన్యాసాలు, పసి పాపల బోసి నవ్వులు, తొలకరి జల్లుకు పులకరించి చిలకరించే మట్టి వాసనలు, మొదలగు ప్రకృతి ప్రసాదించిన అందాలను అనుభూతులను ఆస్వాదింప చేయగలిగినది కవిత్వము. కవిత్వము అతివ అంగాంగ వర్ణనకే పరిమితము కాదు.  ప్రకృతి అందాలనే కాకుండా మానవుల నడుమ ఏర్పడే అనుబంధాలు,   అనురాగాలు, ఆత్మీయతలు, అవమానాలు, కోపాలు,తాపాలు, మానసిక సంఘర్షణలు, సుఖ దుఃఖాలవంటి అనేక భావాలను ప్రకటించి, అనుభవింప జేయించేదికూడా కవిత్వమే!
ఈ సన్నివేశము కరుణార్ద్రతల కదంబము.  ఒకపరి గమనించండి. “ ఓ వ్యక్తి కారాగారంలో శిక్ష అనుభవిస్తూ,  చివరిదశలో ఉంటాడు. అతణ్ణి చూడటానికి బాలింతరాలైన అతని కుమార్తె వస్తుంది. తాగడానికి నీళ్ళు కూడా లభించక దాహంతో అలమటించే తండ్రి దీనస్థితిని చూసి మిక్కిలి కలత చెందిన ఆమె తన  ‘స్తన్యాన్ని’ తండ్రికి ఇచ్చి అతని దాహార్తిని తీర్చి చరితార్థ అవుతుంది.” ఓ చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని వర్ణించి చెప్పే అపురూప దృశ్యం పై ఉదాహరణ. కవిత్వం నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటనీరు తెప్పిస్తుంది,  మునుముందుకు నడిపిస్తుంది. అట్టి అద్భుతమైన, అంతులేని సాహిత్య సముద్ర  జలతరంగములందు ఒకటగు చాటు సాహిత్యమునుండి ఒకటి, రెండు  పద్యములు మీకు పరిచయము చేస్తాను. పై భావమును స్ఫురింపజేస్తూ నేను వ్రాసిన పద్యమును మీముందుంచున్నాను.
చేయని తప్పు తో చెరన చేరిన తండ్రిని చూచి బాధతో 
నాయన ఏమి కావలెనొ నాదరి చెప్పమటన్న కూతుతో          
నాయన  దాహమయ్యెనన అంత తటాలున స్తన్యమిచ్చి నీ
కీయగ వేరు ఏమియును ఎంచగ లేదనె సూతికార్ద్రతన్
కూతుతో నాయన = కూతుతోన్ + ఆయన; సూతిక=బాలెంతరాలు
తండ్రి చేయని నేరానికి చెరసాల పాలయినాడు. ఒక్కగా నొక్క కూతురు. అందునా బాలింతరాలు. మనసున బాధ అనెడు మున్నీరు కనీరై ప్రవహించగా చెరసాలకు వచ్చి తండ్రిని చూసి గద్గద స్వరముతో నాన్నా నీ కేమికావలెనని అడిగింది. దప్పికగొని గొంతు ఎండిపోయిన తండ్రి దాహమన్నాడు. ఎక్కడికీ పోయి నీరు తేలేని ఆతల్లి, తండ్రికి తన స్తన్యమిచ్చి ‘తండ్రీ! ఇంతకు మించి వేరేమీ ఇవ్వలేనని కంట తడిపెట్టుకొనింది.”
పద్యము చదివితే సన్నివేశము కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.
మనము హాస్యమును గూర్చి మాట్లాడుకొన దలచి కరుణ రసమునకు పోయినాము. ఇందుకు కారణము ఉన్నది. బాగా చెమట పట్టిన తరువాత వాతానుకూల కక్ష్య లోనికి వెళితే సుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా!

హాస్యస్పోరకమైన ఈ పద్యమును చూడండి. ఈ భాష నేడు బ్రాహ్మణులలో కూడా మృగ్యము.
పూర్వము అంటే ఒక వంద సంవత్సరముల నాటి మాట. నాకు నాడు అవ్వ వరుసయ్యేవారు ఈ భాషనే  మాట్లాడేవారు.   భాష కొంత వింతగా వుండేది. ఆ భాష తీరు తెన్నూ ఈ పద్యము ద్వారా  చవి చూడండి.  
అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే?  
విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిత్సారషే !  సుఖము యొక్కసుఖము యొక్క ప్రాధాన్యత ఇనుమాడించుతుంది కదా! 
విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ  
ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!  
 పై  చాటు  పద్యము, నీళ్ళ కోసం వెళ్లి చెరువుకు వెళ్లి బిందెలు తోముకొంటూ బ్రాహ్మణ స్త్రీలు జరిపిన  సభాషణను వివరిస్తూవుంది. భావం వివరిస్తాను.  
ఏమే చూచినావా! అంటే ప్రక్కావిడ పలకలేదు, అందుకే వెంటనే మొదటి స్త్రీ  “ఒసే! నీకుచేముడా  ఏమి?” అంటే రెండవ ఆవిడ అయ్యో పిలిచినావా  ఏమిటి? అని అడిగింది. అందుకు మొదటి బ్రాహ్మణి “విస్సా వఝలవారి బుర్రిని అంటే అమ్మాయిని మన విస్సాయికి అంటే మన కుర్రవాడికి ఇచ్చి పెళ్లి  చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత వర్చస్సు కలిగి ఉంటాడో” అంటూ తమ సంభాషణను శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు కొనసాగించుతున్నారు.  
ఇట్టిదే ఇప్పుడొక చాటు వాక్యాన్ని చూడండి
ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరనుంఛా. చూడది ఎండిందంఛావా? లేదంఛావా?” అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే పంచటరుగు. గావంచా అంటే చిన్ని టవలు. ఇంకో చమత్కారయుతమైన ఈ పద్యము ను చూడండి.  నేను ఉన్నత పాఠశాలలో 65 సంవత్సరముల క్రితము విన్నది. ఆ చాటువు యొక్క సందర్భము, ‘చంకనాకు’ అన్న మాట మాత్రమే నాకు గుర్తు. అందువల్ల పద్యమును నేనే తయారు చేసి మీ ముందుంచుచున్నాను.
ధనవంతుల ఇండ్లలో జరిగే  పెళ్ళిళ్ళకు సదస్సు అని ఒక గొష్ఠి జరుపుతారు. అందు విద్వాంసులు, పండితులు కవులు వస్తారు. వచ్చినవారందరికీ వారి వారి శక్తిననుసరించి సంభావనలిస్తారు. కొందరు ఏమీ తెలియని నాలాంటివారుకూడావచ్చినంత దక్షిణ వస్తుందిలే అని వెళతారు. అటువంటి సదస్సులో జరిగిన సన్నివేశము మీముందు నేను వ్రాసిన చాటువును ఉంచుటకు ముందు సదస్సుకు సంబంధించిన ఒక చాటువును తెలియజేస్తాను.
లేవరు లెండులేండనిన లేచినవారయినన్ దటాలునన్
బోవరు పొండు పొండనిన పొదుము పొదుము త్రోయకుండటం
చీవరుసందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం
భావన నాడు చూడవలె బాపన సాముల సాములన్నియున్
సదస్సు ముగిసింది ఇక లేవండి అంటే లేవరు, లేచిరి పో వెంటనే పోతారా అంటే పోరు. పోతున్నాము పోతున్నాము త్రోయవద్దు అంటూ యజమానిని అనునయించుతూ నెమ్మదిగా కదులుతూ వుంటారు. ఈ విధముగా బాపన సాముల 'సాములు' పెండ్లియండలి సదస్సునందు చూడ వీలగుతుంది. అన్నది పద్యభావము. ఇందు ఒక బాధాకరమైన విషయము ఏమిటంటే నేదసదస్సులు లేవు, అసలు సదస్సు అంటేనే చాలామందికి తెలియదు. సంభావనకై ఎదురుచూసే వేదము చదువని పెదబ్రాహ్మలు మాత్రము ఉన్నారు. కూలిపనులు చేయలేరు. మంత్రాలు చదువలేరు. ఎగతాళి చేసేదానికంటే వారికి వితరణ కలిగిన ఏ ధనికుడయినా ఒక ఆధారము చూపితే ఆత్మ సంతృప్తి కలిగినవాడవుతాడు.

ఇక తిరిగీ మన చాటువును గూర్చి చెప్పుకొందాము. ఆ ధనవంతుడు వివాహానంతరముసదస్సు ముగిసిన పిదప వారివారి పాండిత్యము, కవితా శక్త్యనుసారముగా డబ్బులు ఇస్తూవున్నాడు. ముఖ్యముగా ఆ యజమాని కవులకు కొంచెము ఎక్కువ, పండితులకు కొంచెము తక్కువగా సంభావనలు ఇస్తూ వుందినాడట. ఆ గుంపులో  ఒక వ్యక్తికి తక్కువ సంభావన ఇవ్వబోయినాడు ఆ యజమాని. ఆ కవికి కోపము వచ్చి యజమానితో ఈ విధంగా అంటూవున్నాడు 
కవియా కదా అరయక
కవియనుకొని గౌరవించ తగునా మూర్ఖా!  
కవిగనుము కనులు లేవా  
కవివైతే ‘చంకనాకు’, కనబడలేదే!
ఒక కవికి తానూ చూస్తూ ఉండగానే తనకన్నా తక్కువస్థాయి కలిగిన కవి పండితులకు ఉదారముగా సంభావనలనోసగినాడు. ఈయన వంతు వచ్చుసమయానికి ఎదో చిల్లర చిలకరించినాడు, బహుశ యీతడు గర్వి, అహంభావి అని అతనికి తెలుసునేమో! కవి కోపముతో కందపద్యములోని పై మూడు పాదములు చెప్పినాడు. యజమాని ఆ పద్యమును తన చివరి పాదముతో పూర్తి చేసినాడు.
ఎవరంటే వారిని కవియా కాదా అన్న విచక్షణ లేకుండా ఇతోదికముగా పారితోషికములనిచ్చి పంపుతూ వచ్చి నావే నేను కవిని గమనించి సంభావననివ్వు అని కొత్త గర్వముతో పలికినాడు. అప్పుడు ఆ ధనికుడు ఆ కందపద్యము యొక్క నాలుగవ పాదముతో ఈ విధముగా బదులు తెల్పినాడు. నీవు కవివైతే నాకేమి కనబడలేదే అంటే కనబడుతూనే ఉందికదా, చంక నాకి పో అన్నది కొంత జుగుప్సాకరమైన బాహ్యార్థము. ఆ పాదము యొక్క అంతరార్థము ఏమిటంటే ‘మరి నీవు కవివైతే ‘చంకనాకు’ అంటే చంకలో కవిత్వము వ్రాయుటకు తాటియాకుల కట్ట లేదే అని. చూచినారుకదా ఎంత భావ గర్భితమైన పద్యమో తెలియండి.
ఇట్టి అపురూపమయిన పోకడ సంస్కృతము తరువాత ఈ భాషకే చెండుతుందేమో!
ఈ వ్యాసమును నేను నా పట్టా తలను గూర్చి వ్రాసిన పద్యముతో ముగించుచున్నాను. 

శిరము శశాంక గోళముగ చెప్పుము మారెను ఎట్లు మిత్రమా

సరసకు చేరు సుందరుల  చంద్ర ముఖమ్ముల చంద్రులందరున్

సరసర వచ్చినా శిరము చక్కగ చేరుచు కేశ యామినిన్

దొరకొని పారద్రోల తల తొంగలె సోమసుధా స్రవంతియై

స్వస్తి.

1 comment:

  1. ఎన్నో విషయాలు వివరంగా చెప్పినారు
    ధనికుని సందర్భోచిత పూరణ బాగుంది

    ReplyDelete