Sunday 15 May 2022

విద్యార్థ సాధన – ఆరోగ్యము

 

విద్యార్థ సాధన ఆరోగ్యము 

https://cherukuramamohan.blogspot.com/2022/05/blog-post_15.html

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వబుద్ధినా ॥

పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణత్ ॥

ఒక పదార్థాన్ని నాలుగు పాదాలుగా విభజించుట ఆనవాయితీ. చేతులు కలుపుకొంటే మనిషికి కూడా జంతువులవలె నాలుగు పాదాలే!  పాదం అంటే పావు భాగమని లేక పాతిక భాగమని లేక కాల్ భాగమని లేక నాల్గవ వంతని, లేక 25% అని  అర్థము. ఇపుడు పై శ్లోకము ఏమి తెలియజేయుచున్నదో చూద్దాము. విద్యార్థి లేక జ్ఞానార్థి  విద్యనూ జ్ఙానాన్ని, ఆచార్యుల నుండి పాతిక భాగము,  తన విచక్షణ విశ్లేషణలతో పాతిక భాగము, సహ విద్యార్థుల నుండి పాతిక భాగము సంపాదిస్తాడు. మిగిలిన నాలుగవ భాగము కాలము గడిచే కొద్దీ, జీవితాంతం వఱకు సంపాదిస్తూనే వుంటాడు. వాస్తవమేమిటంటే విద్యకు జ్ఞానానికి అంతు లేదు.  విద్య జ్ఞానము అని వేరువేరుగా చెబుతూ వచ్చినాను కారణము ఏమిటంటే ఆ రెండూ ఒకటి కాదు. గణితములో  

(a + b) 2 = a2 + 2ab + b2 అన్న సూత్రమును నేర్చుకొని ఆ ఫలితము సాధించుట విద్య. అదే  

14 x 14 యొక్క విలువను సాధించుటకు (10+4) 2 గా వేసుకొని 102+2x10x2+42 గా వ్రాసుకొని 156 అన్న ఫలితమును రాబట్టుట జ్ఞానము. ఎందుచేతనంటే కొందరు 14x14 వేసి హెచ్చించి ఫలితము పొందుతారు. అదే 1004 అయితే హేచించుట ఆలస్యమౌతుంది. తప్పుకూడా పోవచ్చు. కావున జ్ఞానము యొక్క ఆవశ్యకత ఇక్కడ ఏర్పడుతుంది.

ఈ ప్రపంచములో అందరమూ , జీవితాంతమూ విద్యార్థులమే. విద్య, ఒక ఊట చెలమ. నీరు తోడేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. పరిపూర్ణత, వయోభేదము అన్నది విద్యకు వర్తించదు. సురేశ్వరాచార్యులుగా జగద్గురు ఆది శంకరులవారి శిష్యుడగు మండన మిశ్రుడు వయసులో శంకరులకన్నా చాలా పెద్దవారు. నేర్చుకోనవలసినాద్ ఉన్నపుడు పెద్దవారైనా చిన్నవారికి శిష్యరికము చేయవలసినదే!

గురుకులములలో కుల, మత, వర్గ, ప్రాంత విచక్షణా రహితముగా, విద్యార్థులంతా అక్కడే వుండి, గురువుకు సేవ చేస్తూ, తమ తమ వర్ణమునకు సంబంధించిన విద్యలను నేర్చుకొనేవారు. దీనితో వారికి పాతిక విద్య పట్టుబడేది.  రెండవ భాగము విద్యార్థి తనకున్న మేధోనిధిని ఉపయ్తోగించి నేర్చుకునేవాడు. మూడవ భాగము సహ సహపాఠకులతో, చర్చల ద్వారా గానీ, సంప్రదింపులా ద్వారాగానీ మంచి చెడులనరసి  జ్ఞానాభివృద్ధి గావించుకునేవారు. చివరి భాగం, పెరిగే కొద్దీ, తనచుట్టూ ఉన్న సమాజమును చూసి, ఆలోచనా పూర్వకముగా, అనుభవపూర్వకముగా అనుభూతి పూర్వకముగా ఆజన్మాంతమూ నేర్చుకుంటూనే వుంటాడు.

విద్యను, ఆచరణలో పెట్టుటే విజ్ఞానము. విజ్ఞానానికి సాధన అన్నది పట్టుకొమ్మ. దానితోనే జ్ఞానమును సాధ్యము చేసుకోవాలి. తను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పించడం వల్ల, విద్య వృద్ధి చెందుతుంది.

న చోరహార్యం, న చ రాజహార్యం,

న భ్రాతృభాజ్యమ్, న చ భారకారిl

వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం

విద్యాధనం సర్వధన ప్రధానమ్ll

దొంగలు దోచలేనిది, రాజులు స్వంతము చేసుకోలేనిది, అన్నదమ్ములతో పంచుకోలేనిది, ఎన్నతటి ఎంత సంపాదించినా భారము కానిది, ఖర్చుపెట్టే కొలదీ కలిసి వచ్చేది విద్య. ఇది నిరంతర ధారావర్దితమగు అమృతోపమానము.

ఈ విషయమై ప్ర్ద్దలు ఇంకా ఈ విధముగా తెలియజేసినారు.

శనైః పన్థాః శనైః కన్థా శనైః పర్వత లంఘనమ్ ।

శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనైః శనైః ।।

మెల్లగా అనగా అతిగా నడచి అలసట తెచ్చుకోకుండా,  నడవగా నడవగా గమ్యమును చేరుకొనవచ్చు, అది ఎంత దూరమైనదైనా కానీ. రోజూ కొద్ది కొద్దిగా కుడితే బొంత కొన్ని రోజులకు పూర్తి అవుతుంది. అంతా ఒకే రోజులో కుట్టలేము కదా! గమ్యమును చేరుటకు వెళ్ళే దారిలో ఏదయినా కొండ వస్తే  మెల్లిమెల్లిగా ఎక్కి దాటాలి గానీ తొందరపడితే పిక్కలు పట్టుకుపోయి మనము నడువలేక చతికిలబదడవలసి వస్తుంది. అదేవిధముగా చదువులో కూడా  కొద్దికొద్దిగా నేర్చుకుంటూ విద్యను సంపాదించవలసి వస్తుంది, ధనము విషయములో కూడా అంతే! ధర్మ మార్గమున సంపాదించే వాడు తన ఖర్చు పోగా కొద్దిగా మిగిలినది కూడబెట్టుకొంటూ పొతే లేనిరోజు కూడుబెడుతుంది. శనైర్విద్యా శనైర్విత్తం. అంటే విద్యా ధనములు సంపాదనా పూర్వకముగా రావలేనబనుకొనేవారికి సహనము కాలాఆసరము. మనలో అందరము కాళీదాసులము,నిస్సంతు వీలునామాకు అర్హులము కాలేము.

అందుచేత పెద్దలు  ఈ అయిదింటియందు తొందర పనికి రాదు అని శాసించినారు. ఏదయితే శాసించుతుందో అది శాస్త్రము. అది అజరామరము. దేశకాలపరిస్థితులు ఏవయినా ఈ శాస్త్రవచనములు మారవు. ఈవిషయములోనూ అతి అన్నది పనికిరాదు అని నిర్ద్వంద్వముగా తెలియజేసినారు.

అతిదానాద్ధతః కర్ణస్త్వతిలోభాత్ సుయోధనః ।

అతికామద్దశగ్రీవస్త్వతి సర్వత్ర వర్జయేత్ ॥ "

అతిదానము చేత కర్ణుడు, ఆయన తన సహజ కవచాకుండలములను కూడా దానముచేయుతయే గాక యుద్ధములో అవకాశము వచ్చినా అర్జునుని తప్ప తక్కిన ఉలుగురినీ చంపనని వాగ్దానము చేసి తన ప్రాణము మీదికే తెచ్చుకొన్నాడు. లోభము చేత, అనగా ధర్మరాజు శ్రీకృష్ణునిద్వారా ఐదు ఊర్లనివ్వమని కబురంపినా ససేమిరా అని లోభము చూపి ప్రాణాలు పొగొట్టుకొన్నాడు. అతి కాముకుడై ముందు వెనుక ఆలోచించకుండా సీతను చెరబట్టి రావణుడు అసువుల బాసినాడు.  

     మరొకమాట తెలుసుకొనేఅవకాశము వచ్చినపుడు చిన్న విషయమునైనా విద్యగా భావించి క్షణక్షణము నేర్చుకోవాలి. మన తాత్సారము వల్ల ఆ క్షణము గడిచితే ఆవిద్య మన చేయి జారినట్లే! చిన్న మొత్తమనుకోకుండా పైసా పైసా జమచేయాలి. ఆశ్చర్యకరముగా అదే పెద్ద నిధియై మనల కాపాడుతుంది. చీమ ఆహారాన్ని ముందుజాగ్రత్తగా వాన కాలములో బయటికి పోలేదు కాబట్టి అందుకు తగిన్విధముగా ఆహారు నిలువ చేసుకొంటుంది. అందుకే పెద్దలు ఈవిధముగా చెప్పినారు.

క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్l

క్షనత్యాగే కుతో విద్యా కనత్యాగే కుతో ధనమ్ ll

వీటన్నింటికీ ఆరోగ్యము మూలము. దానిని గూర్చి కూడా పెద్దలు ముందే చెప్పినారు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥

వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యము. స్వామి వివేకానందుల వారు మన ఆర్ష ధర్మాలని గురించి, హిందూ మత గొప్ప తనాన్ని గురించి ఎంతో గొప్పగా మొత్తం ప్రపంచానికి తెలియ చెప్పి, దానికంటే ముందుగా, ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతను గుర్తించమని నోల్లి చెప్పేవారు.

పురుష స్త్రీ బాల వృద్ధులు అన్న అనే భేదం లేకుండా, తమ శరీర దార్ఢ్యమునకు తగిన విధముగా,   అందరూ వ్యాయామము తప్పక చేయవలసిన అవసరాన్ని ఈశ్లోకము తెలియ చేస్తోంది.

స్వాస్థ్యము సర్వవిధ సంపదకూ మూలము. వెల కోట్ల రూపాయలు సంపాదించి రక్త పీడనము, మధుమేహము కలిగియుంటే మహానిధులకు కాపోఅలావుండే కాలసర్పములుగా బ్రతుకవలసి వస్తుంది. చదువు విషయముననియితే మనసును మగము చేయలేక నిస్పృహతో నిస్సారమైన జీవితము గడపవలిసి యుంటుంది. ధనము లేకున్నా ఒక వ్యక్తి విద్వాంసుడైతే సర్వత్రా పూజింపబడుతాడు. అందుకే పెద్దలు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నారు.

 

ఆరోగ్యం రెండు రకాలు. శారీరక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యము.  మనిషి శరీరానికి ప్రతినిత్యము క్రమ శిక్షణతో కూడిన వ్యాయామము అత్యంత ఆవశ్యకము. నిత్య వ్యాయామము వలన శరీరము అరోగ్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది.  మనసుకు నిశ్చల ధ్యానములాంటి ప్రక్రియల ద్వారా మానసిక ఆరోగ్యము చేకూరుతుంది. తద్వారా బుధ్ధి కుశలత పెరుగుతుంది. దీర్ఘ ఆయుర్దాయం చేకూరుతుంది. శరీర అవయవాలకి తగినంత  తగినవిధముగా వ్యాయామము చేయించు సాధనములు ఉపకరణములు ఎన్నోవచ్చినాయి. అవి కొను శక్తి లేకుంటే బస్కీలు దండేలు ఉండనే ఉన్నాయి. వీనిచే స్వాస్త్యత దార్ధ్యము చేకూరుతాయి. అవి వుంటే ఏపని చేయుటకైనా వలసినంత ఉత్సాహము ఉద్వేగము వద్దన్నా వస్తాయి. నిరాశా నిస్పృహలను దరి జేరనీయవు.

ఇటువంటి నేపధ్యములో, ప్రకృతి సిద్ధమైన వనరులతో పెరిగిన ఆహార పదార్థాలను తినడం, కల్తీలకు, బయటి తిండ్లకు దూరముగా ఉండటము, ప్రతి నిత్యమూ బాగా చెమట పట్టేవరకూ, వ్యాయామము, నడక తప్పనిసరి

చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణలో మంచి విలువలు, సాంప్రదాయాలతో జీవితం గడపడం వలన మానసిక ఆరోగ్యానికి తద్వారా బుద్ధి కుశలతకి దోహదపడుతుంది.

ఆరోగ్యమే మహా భాగ్యము. మంచి శారీరక ఆరోగ్యము వలన, చక్కటి మానసిక ఆరోగ్యము వలన  బుధ్ధి కుశలత పెరిగి మంచి ఆలోచనలు కలిగి అవి అన్నియునూ కార్య దీక్షకి, కార్య సాఫల్యతకీ దోహదం చేస్తాయి. మనిషికి ఉండే చక్కటి శారీరక మానసిక అరోగ్యములు సర్వార్థలను సాధించగలిగే సాధనం.

అప్పుడటు విద్యకుగానీ ఇటు దానానికి గానీ కొదువ ఉండదు.

స్వస్తి.

 

 

No comments:

Post a Comment