Saturday 23 June 2018

డా. కోడూరు ప్రభాకర రెడ్డి (ఆస్య గ్రంధి లో జులై 1, 2016 న వ్రాసిన వ్యాసము)


డా. కోడూరు ప్రభాకర రెడ్డి గారు 
(ఆస్య గ్రంధి లో జులై 1, 2016 న వ్రాసిన వ్యాసము)

డాక్టరు ప్రభాకరరెడ్డిగారిని గూర్చి నాలుగుమాటలునేనుతెలుపుటకు స్పూర్తి నిచ్చినది తాను పర్వతమైయుండి కూడా పరమాణువునని చెప్పుకొనే సంస్కారము. ఇది అతిశయోక్తి కాదు స్వభావోక్తి.

నేను 'శంకరదాస అష్టోత్తర శతి' అన్న1౩5 (ఉత్పలమాలలు1౩0 + చంపక మాలలు 2 + మత్తేభములు2+ శార్ధూలము 1) వృత్తములు వ్రాసినాను. దానిని అచ్చువేయించవలెెనన్న ఆశతో ఒక 10 మంది సామవేదం, మాడుగుల, వేటూరి ఆనందమూర్తి గారి వంటి ప్రముఖులకు తమ అభిప్రాయములు తెలుప బంపి నాను. వారిలో రెడ్డిగారు ఒకరు.

రెడ్డిగారినిగూర్చితెలుపుటకు ముందు ఈవాస్తవాన్నిఅవధరించండి.
కడపజిల్లా ప్రొద్దటూరు కవులకుకాణాచిపండితులకుపట్టుకొమ్మ.

బంగరు వెండి వస్తువుల, బట్టల గుట్టల, పత్తి, నూనెలన్
రంగుల నేత వస్త్రముల రంజగు దోశెల నాణ్యమందునన్
ఏగతి పోటి చేయనగు నేపురమైనను గాని పేటతో
చాగురె ప్రొద్దుటూరు గన చారు తరంబు పురంబు లన్నిటన్

గంటి కృష్ణవేణి గరితను ఎరిగించె
కొరటమద్ది వారి గొప్ప తెలిపె
సుబ్బారావు గారి సౌజన్యమును పంచె
ప్రొద్దుటూరు గాదు ముద్దుటూరు


దుర్భాక జవ్వాది ధూప మాఘ్రాణింప
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
పుటపర్తి పేరుతో పునుగు తావులనెల్ల
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ వీచికల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు

చంద్రశేఖర చందన చర్చితమ్ము
రామిరెడ్డియు రాజన్న రంజితమ్ము
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ విలసితమ్ము
బరగ పేటగ జగతిన పరిచితమ్ము

ఇటువంటి ప్రోద్దుటూరి పేరుప్రఖ్యాతులను ఇనుమడింప జేసిన సమర్థుడు డాక్టరు ప్రభాకర రెడ్డి గారు.
నా పుస్తక రచన సంపూర్ణమౌతూనే నేను మాటలాడిన మొదటి వ్యక్తి డా.ప్రభాకరరెడ్డి గారు.
ఆయన ప్రోద్దుటూరి లో శిశు వైద్య నిపుణుడు.

ఆయనతో నా పరిచయము ఎట్లు జరిగిందో తెలుపుకుంటాను. నేను వ్రాసిన ‘రామమోహనుక్తి రమ్యసూక్తి’ అన్న శతక ఆవిష్కరణ ప్రోద్దుటూరి లో శ్రీ C.V. సుబ్బన్న శతావధాని గారి చేతుల మీదుగా జరిగినది. ఆయన అవధాన మత్తేభము. అప్పటికి ప్రభాకర రెడ్డి గారితో నాకు పరిచయము లేదు. ఆ కార్యక్రమమునకు ప్రభాకర రెడ్డి గారిని, నేను అన్నగా భావించే బ్ర.శ్రీ.వే. సుబ్బరామ శర్మ గారు పిలిస్తే వచ్చినారు. ఆ పిలుపు వారి ఇంటికి వెళ్లి శర్మగారు పిలిచినారు. ఆ సందర్భములో నేను వ్రాసిన శతకములోని కొన్ని పద్యముల Photo Copy ఆయన చేతిలో ఉంటె రెడ్డి గారికి చూపించి నారు. అమితమైన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు ఆయన వయసెంత అన్నారాయన. శర్మ గారు 62 అంటే, అయ్యో చిన్న వయసులో రచన మొదలు పెట్టియుంటే ఎంతో మంచి కావ్యములు వ్రాసే వాడే అని తన బాధను వ్యక్తము ఆయన చేసినారు. ఆయన వస్తానన్న ప్రకారము కార్యక్రమానికి వచ్చినాడు. ఆయన వేదిక మీద కూడా కూర్చోక ప్రేక్షకులలో కూర్చొని, ఆ తరువాత ఒక పాఠకునిగా, ఒక శ్రోతగా వేదిక పైకి వచ్చి, నేను వ్రాసిన ఆ పుస్తకములోని, అంతవరకు ఎవరూ ఉటంకించని, పద్యములనుదహరించి ఎంతగానో మెచ్చుకున్న నిగర్వి. మా పరిచయమునకు అదియే బీజము. మేమెప్పుడు చరవాణి లో మాట్లాడుకున్నా మీ విలక్షణమైన ఆలోచనా విధానము నాకెంతో నచ్చుతుంది అంటారు ఆయన .
ఆయన నిగర్వి, నివురుగప్పిన నిప్పు, నిక్కమైన నీలము. ఆయనలో అన్నీ సల్లక్షణాలే! నాకూ ఆయనకూ వున్నా ఒకే ఒక పోలిక మాది 'అజగజ సామ్య' మగుటయే!
ఆయన సేద్యము, వైద్యము, పద్యము దేనిలోనైనా దిట్ట. శిశు చికిత్సాభిషగ్వరునిగా అమృత మూర్తి ఆచంద్ర కీర్తి. రెడ్డి గారు కాబట్టి స్వతహాగా సేద్యము ఆయన రక్తములోనే అంతర్లీనమై ప్రవహించుతూ వుంటుంది. ఈయన సేద్యమునకు పాండిత్యము, కవిత్వము జోడెడ్లు. సంస్కృతాంధ్రాంగ్ల హిందీ భాషలపై పట్టున్న చెట్టు. చెట్టు అని ఎందుకన్నానంటే సప్తప్రభావిలసిత చరార్క రాగములను (కిరణములను) అనురాగముతో గ్రహించి వానిని ఫల పత్ర ఛాయా రూపములలో ఆంద్ర భాషా తెరువరులకు అందజేయుచున్నాడు. అంటే సూర్య కిరణములలోని 7 రంగులనూ కిరణ జన్య సంయోగ క్రియ ( Photosynthesis) ద్వారా గ్రహించిమనకు నీడ, ఆకులు, పళ్ళ రూపములో ఇస్తున్నవిధముగా సమాజమునకు వివిధ ప్రతిభా వ్యుత్పత్తుల ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. మరి ఆయన చేట్టేకదా!

సేద్యములో వైద్యములో
పద్యములో గద్యములో
విజ్ఞతలో విభవములో
లేడుసాటి లేదుపోటి

‘కోమల సాహితీ వల్లభ’ బిరుదాంకితుడు అనేకానేక పద్య, గద్య, నాటక రచయిత. వారు వ్రాసిన ‘రేనాటి పలుకుబళ్ళు’ అన్న కరదీపికతో రాయల సీమ మారు మూలాలు కూడా సులభముగా చూడవచ్చును. నా పై అభిమానముతో వారు వ్రాసిన ప్రతి పొత్తమునూ పంపే అత్యంత అభిమాన సాహితీ మిత్రుడు. ఇంత వైదుష్యమున్నా నేను వ్రాసిన 'శంకరదాస అష్టోత్తరశతి' లో DTP తప్పులు, వ్యాకరణ దోషములు సవరించి పంపిన వారి అభిమానమునకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

స్నిగ్ధ భావ కమలాలను
ముగ్ధ మొహనముజేసే
కవితా సవితా మూర్తికి
కడు కోమల హృదయానికి
సేద్య వైద్య పద్య విద్య
చేయగలుగు చేవగలుగు
ప్రతిభాకరుడౌ శ్రీయుత
ప్రభాకరున కిదేనా
సవినయంపు హృది స్పందన
సారస్వాత అభినందన
కోమల సాహితీ వల్లభ
కొనుము కడప సుర్యప్రభ

ఆయన వ్రాసిన కావ్యముల రాగ విపంచి, పల్నాటి భారతం, ద్రౌపది, హృదయ రాగం, శ్రీనాధుని చాటువులు, కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి కవిత్వం వ్యక్తిత్వం, శ్రీనాధ విజయం (రేడియో నాటికలు), కవితారస ‘పానశాల’, దేవర ఇత్యాది కావ్యముల కృతికర్త .
వుండేల విజ్ఞాన కళా పీఠము వారిచే 1997 లో తమ పద్య కావ్యము పల్నాటిభారతానికి ఉత్తమ కావ్యంగా రూ.25,000/- బహుమతిగా పొందినారు.
సేద్యము, వైద్యము, పద్యము అన్నమూడుకన్నులుకలిగిన ముక్కంటి ఈయన. ఇన్ని పనులను చేతబూనిన ఈయనకు దేవుడుదినమునకు24 గంటలకు బదులుగా ౩6 గంటలు ప్రసాదించినాడేమో!
ఆయనపై పరమేశ్వరుని కరుణాకటాక్షము కలకాలమూ ఉండుగాక!
స్వస్తి

No comments:

Post a Comment