Monday 11 March 2024

ఆసక్తి కరమైన చాటువు

వెలయాలును, శిశువల్లుడు
ఇలయేలిక, యాచకుండు నేగురుధరలో
గలిమియు, లేమిము, దలపరు
కలియుగమున గీర్తికామ! కాటయవేమా!
కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. వెలయాలు, పసిబాలుడు, ఇంటి అల్లుడు, భూపతి,  బిచ్చగాడు భూమిపై గల ఈ 5 మంది తాము ఆశించే వ్యక్తి వద్ద ఇవ్వగల సత్తా ఉన్నదా లేదా అని యోచించరు.

“ కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా
 కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” అనగా

సూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ గింజలు

కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి మామూలుగా కనపడే ఆ దానిమ్మ గింజలని కవి ఎంత అద్భుతంగా!

వర్ణించాడో చూడండి. ఆ చిలుక తినే దానిమ్మ గింజలు. “ హరి నఖర భిన్న మత్త మాతంగ

కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” హరి అంటే సింహం. సింహం యొక్క

నఖర=గోళ్ళతో (పంజాతో) భేదించ బడిన మత్త గజము యొక్క కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన, (ఏనుగు కనబడితే సింహం ముందుగా దాని కుంభస్థలం పైకి ఎగిరి కొడుతుందిట.)

ముత్యాలహారంలోని ముత్యాలవలె ( కుంభస్థలంనుండి స్రవిస్తున్న రక్తంతో తడిసి, కొంచెంఎరుపు,

కొంచెం తెలుపుగా కనబడే ముత్యాలవలె) దానిమ్మగింజలు ఉన్నాయిట” చూసేరా! చిన్న

విషయాన్ని ఎంత గొప్ప ఉపమానంతో వర్ణించాడో కవి. అందుకనే ---

“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః/

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే”  అనగా

కావ్య సృష్టి చేయటంలో కవి బ్రహ్మవంటివాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించు కొంటాడు. అని ఆర్యోక్తి. అట్టి కావ్య ప్రపంచంలో చాటువులని కూడ కవే సృష్టించాడు.

అందరూ ఇష్టపడే మామిడి పండుని కవి ఎంతగోప్పగా చాటువులో వర్ణించాడో ఇప్పుడు చూద్దాం.---        

“ ఆభూచ్చామా జంబూ:, దళిత హృదయం దాడిమ ఫలం/

సశూలం సంధత్తే హృదయమవమానేన పనసః/

భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలి ఫలం/

సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి//” ఇది శ్లోకరాజం.

ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం చూద్దాం;--- “ జంబూ: = నేరేడు పండు. దాడిమ ఫలం= దానిమ్మ పండు. పనసః= పనసపండు. లాంగలి ఫలం = నారికేళఫలం.( కొబ్బరి కాయని సంస్కృతంలో ఫలమనే అంటారు) చూతం = మామిడిపండు.” ఇవి పై శ్లోకం లోని ఫలాలు. ఇప్పుడు వివరణాత్మకమైన భావాన్ని తెలుసుకొందాం. పై శ్లోకం మరలా చదవండి. ముందుగా నాల్గవ పాదం భావం చూద్దాం

“పళ్ళలో మామిడిపండు ‘ఫలరాజంగా’ ప్రపంచంలో కీర్తించ బడటం చూసి, మిగతాకొన్నిపళ్ళు చాలా బాధ పడ్డాయిట. ఎలా అంటే (ఇప్పుడు మొదటి పాదం నుండి చూద్దాం) నేరేడుపండు ముఖం మాడ్చుకొందట, దానిమ్మపండు గుండె బ్రద్దలైందిట, పనసపండు గుండెలో కత్తి దిగినట్లు అయిందిట, కొబ్బరికాయ గుండె నీరైపోయిందిట. ఈ విధంగా పళ్ళన్నీ తమ బాధని వ్యక్తపరచాయి.!” అని కవి ఎంత అద్భుతంగా వర్ణించేడో చూసేరా!? ఇందులో చమత్కారం ఏమిటంటే నేరేడు పండు నల్లగాఉంటుంది, దానిమ్మని పగలుకొట్టి కాని తినలేము, పనసపండుని కత్తితో గుచ్చికాని విడతీయలేము, కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. ఇవి ఆయా పళ్ళకి సహజంగ ఉండే గుణాలు. వీటిని కవి ఎంత గొప్పగా పైచాటు శ్లోకంలో వర్ణించేడో చూసారా! అది కవియొక్క ప్రతిభ. ఇట్టిదే ఇంకొకటి.

“ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి/

సౌందర్య మాహవసి లోచన లోభ నీయం/

అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే/

యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి //

“రసాలసాలము” అనగా మామిడి పండునే పై చాటు శ్లోకంలో కవి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి.—“ఎవరికైనా కీర్తి, అందము ఉంటే చాలదు, మెత్తనైన మనసు కూడ ఉండాలి అది నీకు (మామిడి పండుకు) లేదు” అని కవి చమత్కరిస్తున్నాడు. ఎలాగో చూడండి.

 “ ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగ ఉంది;” అని మామిడిపండులో సహజంగా ఉండే టెంకని కఠినమైన మనస్సుతో పోల్చి వర్ణించడం కవి “క్రాంత దర్శిత్వానికి” నిదర్శనం. కనుకనే కవిని ‘ప్రజాపతి’తో పోల్చినారు.
స్వస్తి.

No comments:

Post a Comment