Wednesday 9 September 2015

కక్షో కిం తవ -- రామాయణం పుస్తకం

కక్షో కిం తవ -- రామాయణం పుస్తకం 

కవితా రీతికి సమయస్పూర్తికి కాళీదాసు పెట్టింది పేరు. సమ్యస్పూర్తి,సరళమైన హాస్యము సామాన్యుని కూడా మాన్యుని చేస్తుంది. 
మరి కాళీ దాసో ఆయన కాళికి దాసుడా లేకకాళి ఆయనకు దాసియా అన్నది నాలాంటివాని  ఊహలకందని విషయము. ఆయన చాటువుగా భావింపబడే ఈ శ్లోకమును గుర్తుచేసుకొనేముందు దాని పూర్వ కథనమును గమనించుదాము.
బంగాళ దేశములో, ఇంకా ఆ చుట్టుప్రక్క ప్రాంతాలలో బ్రాహ్మలు చేపలు తింటారు. వారిని 'మత్స్య బ్రాహ్మలని ఇప్పటిలాగానే అప్పటికాలములో పిలిచేవారో లేదో నాకు తెలియదు. కానీ మన కాళీదాస కవిపుంగవునికి చేపలు తినే అలవాటున్నదో లేక దేవీ కరుణా కటాక్షవీక్షిత మేధో మేరువైనందువల్ల తానే ఒక సన్నివేశమును సృష్టించి సమస్యను పరిష్కరించినాడో మన  ఊహలకందని విషయము. భోజ కాళీదాసుల అన్యోన్యతకు అద్దముపట్టే ఒకసంఘటన వేరొక పర్యాయము ముచ్చటించుకొందాము.
ఇంత దగ్గరితనమును చూసి వోర్చుకోలేని సాటి కవి పండితులు ఎటుదిరిగీ వారిమధ్యన విభేదాలు సృష్టిచవలెననుకొన్నారు. ఇది గమనించినాడు కాళీదాసు. ఆ తరువాత రోజు నుండి ఈ కవిపండితులలో ఎవరో ఒకరు చూసేవిధంగా మస్త్య విక్రయ సాలల వదా విరివిగా కనిపించి తాను చేపలు తింటాదన్న భ్రమ వారిలో కలిగించినాడు. అది నిజమనుకొన్న వారు ఆ విషయానికి కమ్మలు కడియాలు తొడిగి రాజుకు చేరవేసినారు. 
రాజు కాళీదాసును పరిక్షించేరోజు రానే వచ్చింది. భోజుడు  మస్త్య విక్రయ వీధి గుండా వచ్చే కాళీదాసును గమనించినాడు..చంకలో 
వస్త్రములోచుట్ట బడిన నది చేపయా అన్న విధముగా నీచు నీళ్ళు భూమిపై జారుతూ, పంచె బయటికి చేప తోక 
వచ్చినట్లు కనిపించుతూ వుండుట  గమనించినాడు. కాళీదాసును తనవద్దకు పిలిపించినాడు. భోజుడు స్వతహాగా గొప్ప పండితుడు మరియు కవిఅయినందువల్ల తన సంభాషణ శ్లోకరూపములో మొదలుపెట్టినాడు.
ఈ చాటువు సంవాద రూపములో జరుగుతుంది, అంటే ప్రశ్న ఉత్తర రూపములో!
" కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం? కావ్యార్థ సారోదకం; 
గంధః కిం? నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్ఛః కిం? నను తాళపత్ర లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం ||"

ఆ సంభాషణా సారాంశమిది: 

భోజుడు: (కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు: పుస్తకం.
భోజుడు: (కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు: (కావ్యార్థ సారోదకం) : : కావ్యార్థ సారపు ద్రవ, అనగా నీటి, రూపము

భోజుడు: (గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు: (నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ యుద్ధంలో చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు: (పుచ్ఛః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు: (నను తాళపత్ర లిఖితం) ఇంకా తోకలు తుంచని వ్రాయబడిన తాళ పత్రములు.
భోజుడు: (కిం పుస్తకం భో కవే?) ఓ కవీ!ఏమిటా  పుస్తకము?

కాళిదాసు: (రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం) ఓ రాజా! ఇది భూసురులు అంటే బ్రాహ్మలు సేవించే అంటే 
భక్తిప్రపత్తులటో గౌరవించే  రామాయణ గ్రంధము.  

క్షణ కాలము అవాక్కయిన  భోజుడు చూపించమంటే కాళిదాసు . నిజంగానే  చేప గా భ్రమింప జేసిన రామాయణ గ్రంథము 
చూపించినాడు. 

అదీ కాళీదాసంటే!




No comments:

Post a Comment