Thursday, 9 November 2017

తిరుచందూరు - కార్తికేయ లీల

తిరుచందూరు - కార్తికేయ లీల 

https://cherukuramamohan.blogspot.com/2017/11/blog-post.html
2004 డిసెంబరు లో తమిళనాడులోని సముద్రతటములందు వున్న ప్రాంతములన్నీ సునామీ కి గురియైనవే. బహుశ మన దేశ చరిత్రలో ఇది మొదటిసారేమో! కంచి పరమాచార్యులు జయేంద్ర సరస్వతికి నాటి ప్రభుత్వము చేసిన దురంతానికి తగిన శిక్ష విధి విధించినాడా అనికూడా ఒక వార్త చాలా ప్రబలముగా వుండినది. ఏది ఏమయినా, ఆ జలప్రలయమునకుసముద్రము ఒడ్డునే ఉండి కూడా చెక్కు చెదరకుండా నిలచినది ఒక దేవాలయము. అదే తిరుచందూర్ కార్తికేయుని ఆలయము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయము.
ఈ ఆలయమును గూర్చి ఒక వాస్తవ కథ ప్రచారములో వుంది. అది ఆంగ్లేయులు మన దేశమును పరిపాలించుచున్న కాలము. ఈ దేవాలయము లోని విగ్రహము పంచలోహ మూర్తి. ఆ కాలములో స్వామికి ఇప్పుడున్నంత పెద్ద ఆలయము లేదు. ఎన్నో మందిరములలోని ధన రాశులను, పంచలోహ విగ్రహమును దోపిడీదారులగు ఆంగ్లేయులు అపహరించినట్లే ఈ దేవాలయమునకు సంబంధించిన ధన రాశులనూ, స్వామీ పంచలోహ విగ్రహమును దొంగలించి తమ ఓడలో తమదేశమునకు తరలింప దొడగినారు. ఇంచుమించు, ఓడ, ఒక 10 కిలోమీటరు పోయినతరువాత సముద్రములో తుఫాను చెలరేగింది. ప్రాణభయము ఏర్పడిన నావికులలోని ఒక అనుభవజ్ఞుడు వెంటనే స్వామి విగ్రహమును అక్కడికక్కడే నీటిలో  వదలివెయమన్నాడు. వారు అట్లు చేయుటతో తుఫాను నిలచిపోయినది. తమదారిన తాము మిగిలిన సంపదతో తరలిపోయినారు.

ఆరాత్రికి స్వామి పూజారి కలోకనిపించి తన విగ్రహము సముద్రములో ఎక్కడ వున్నది అన్న విషయమును గూర్చి కొన్ని గుర్తులు చెప్పి,  ఎక్కడయితే ఒక నిమ్మకాయ తేలియాడుట చూచుట జరుగుతుందో అక్కడ సముద్రములో వెదకితే విగ్రహము కనిపించుతుందని తెలిపి అంతర్ధానమైనాడు. తెల్లవారిన పిమ్మట ఆ బాపడు మరికొందరి సహాయముతో ఒక పడవలో బయలుదేరి స్వామీ చెప్పినరీతిగానే ఆ విగ్రహమును పునఃప్రతిష్ఠ ఆలయములో చేసినాడు.

తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించినాయి. వారిలో చేరులు, పాండ్యులు ముఖ్యులు. వీరు పెద్ద పెద్ద రాజగోపురములను నిర్మించి ఎంతయో వన్నె తెచ్చినారు ఈ దేవాలయానికి. తారకాసురుని తమ్ముడగు శూరపద్ముని కుమారస్వామి ఇచ్చట వధించినాడు. అందువల్ల ఇది పురాణ ప్రసిద్ధి గాంచిన దేవాలయము. మామిడి చెట్టుగా మారిన శూరపద్ముని రెండుగా చీల్చి చంపినట్లు పురాణ కథనము. ఆ రెండు భాగములు ఒకటి నెమలిగానూ ఒకటి కోడిగానూ మారినట్లు చెబుతూ ఆరెంటినీ కూడా తన వాహనములగా చేసుకొన్నాడని స్థలపురాణము. ఆయన ఆయుధమైన వేల్ అనగా బల్లెముఆయనకు ప్రతీకగా పూజలందు కొంటుంది. ఇక్కడ కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరపటము విశేషము. మరియొక విశేషమేమిటంటే సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించుట. 
 ఇచ్చట స్వామి బ్రహ్మచారి కాదు. శ్రీవల్లీ దేవసేనా సమేతుడు. ఇచట ఎంతో అరుదగు గ్రంథ సముదాయము కూడా మనకు లభించుతుంది. ఇచట శివ కేశవా విగ్రహములను కూడా మనము చూడవచ్చు.
మరొక విశేషమేమిటంటే దేవాలయము వద్ద ఒక శిలాన్యాసము వుంది. అందులో సముద్రుడు తనవల్ల కలిగే, లేక తనకు కలిగే ఏ విపరీతము వలన గూడా ఆ ఆలయమునకు ఎటువంటి ముప్పు కలుగదని చెప్పినట్లు అందు లిఖిత పూర్వకముగా వున్నదని చెబుతారు. 2004 డిసెంబరులో వచ్చిన సునామీ ఈ విషయమును పుష్ఠి చేస్తుంది. అంతటి సునామీ కూడా సముద్రపు ఆటుపోటులను  గుడికి రెండు కిలోమీటర్ల దూరమునకు పరిమితము చేసింది. ఇటు గుడికి గానీ అటు ఆ ప్రాంతమునకు గానీ కలిగిన ముప్పు ఏమియూ లేదు. అది షణ్ముఖుని దయ అందుకే ఆవూరు షణ్ముఖప్రియ.

అటువంటి పుణ్యక్షేత్రమును దర్శించి నేత్రపర్వము గావించుకొనుట సుకృతముగా తలువ వలసియుంటుంది.
స్వస్తి.

Thursday, 12 October 2017

నరక చతుర్దశి – దీపావళి

అత్యంత ఘనమైన మరియు సాంప్రదాయ బద్ధమైన ఈ పండుగను మానవద్దు సరికదా ఎంతో ఉల్లాసము తో ఉత్సాహముతో చేసి మన సహేతుకము శాస్త్రబద్ధము అయిన మన ధర్మమును కాపాడండి.

నరక చతుర్దశి దీపావళి

లంకె: 

https://cherukuramamohan.blogspot.com/2017/10/blog-post.html

నరక చతుర్దశి దీపావళి ప్రాధాన్యత ప్రాముఖ్యత పై లంకెలో చదవండి.

ఎంతో ఘనంగా జరుగవలసిన దీపావళి రాను రాను కొడిగట్టి కొండ ఎక్కుటకు సిద్ధముగా ఉన్నది. తర్కబద్ధమగు మన పండుగలను శ్రద్ధతోను, భక్తి తోనూ, శక్తిమేరకు ఘనంగానూ ఆచరించి  మన ధర్మమును ఉద్ధరించుదాం. జనవరి 1న ప్రపంచమంతా ఎన్నో విధములగు పటాసులను కాలుస్తారు. అర్ధరాత్రి పండుగలు మానవేతరులు మాత్రమే చేస్తారు. మదిరా మదమాంసభక్షణ మగువా పరిష్వంగము వారి పర్వదినపు వేడుకలు. ఆ జుజుగుప్సాకర పద్ధతులు ఇటు వాతావరణమునే కాక అటు నైతిక కాలుష్యమును చేయుట లేదా! మరి వానికి కాలుష్యము అంటదా! ఒక భారతదేశములో దీపావళి రోజే పటాసులు కాల్చుటచేత వాతావరణ కాలుష్యము ఏర్పడుతుందా! ఇది చోద్యముగా లేదా! ఇది కాకుండా, అసలు శాస్త్రపరమైన పండుగే కాని  క్రిస్మస్ ను గొప్ప పండుగగా చేసి మన దీపావళి ఆచారములను ఇప్పటికే, పటాసులు కాల్చుట, బంధు మిత్ర సందర్శనము, మిఠాయి

అసలు పటాసులు కాల్చుట ఆనాడే మన నుండి తస్కరించినాఋ పరమతస్తులు. కానుకలు, పంపకములు మొదలగు విషయములను తస్కరించినారు. అసలు శాంటాక్లాస్ అన్నవ్యక్తికి ఒక చారిత్రికాధారము లేదు. అతనికీ క్రిస్మస్ కు ఏ సంబంధమూ వారి బైబిల్ లో కనిపించదు.  ధర్మాన్ని కాపాడండి. మన ఉనికి ధర్మముతోనే ముడిపడి ఉంది. ‘వందే మాతరం’ అన్న నినాదమును మరువ వద్దు. నరక చతుర్దశి-దీపావళిని గూర్చి ఈ దిగువ లంకెలో సవిస్తారముగా చదవండి. 

ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మానో  ధర్మ హతో వదీత్ll మనుస్మృతి 8.15

నరక చతుర్దశి  దీపావళి

తెలుగు మాసములలో ఆశ్వయుజ మాసము అత్యంత ప్రముఖమైనది. చైత్రాది 6 మాసములలోని మొదటిదయిన చైత్రములో మనకు వసంత నవరాత్రులు(రామ నవరాత్రులు) వస్తాయి. మిగిలిన ఆశ్వయుజాది 6 మాసములలోని మొదటి మాసమయిన ఆశ్వయుజములో శరన్నవరాత్రులు వస్తాయి. అసలు వసంత, శరత్ ఋతువులు ఎంతో ఆహ్లాదమును కలిగించే ఋతువులు. ఉల్లాసము కల మనస్సును పరదైవమునకు అంకితము చేయుట ఎంతో సులభము. అటు వసంత నవరాత్రులు ఇటు శరన్నవరాత్రులు సమశీతోష్ణ స్థితి కలిగి ప్రాణి కోటికి ఆనందాన్ని సమకూరుస్తాయి . శరన్నవరాత్రుల తరువాత ఆ మాసపు చివరిలో వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి అమావాస్య. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి.

 మనము ఎంతో వేడుకతో చేసుకొనే ఈ నరక చతుర్దశి, దీపావళి కి ఒక ప్రత్యేకమయిన ప్రాధాన్యత వుంది.  ఈ పండుగలు రెంటినీ  ఒక రాక్షసుని మరణాన్ని మనము ప్రకటించి జరుపుకొంటున్నాము. భూదేవి సత్యభామావతారమని, శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారమని, నరకాసురుడు భూదేవి కుమారుడనీ అన్న కథను ఎన్నోమార్లు మనము విన్నాము. అందువల్ల ఆ విషయము జోలికి నేను పోవుట లేదు.

ఇక్కడ ఒక్క మాట ముఖ్యమయినది చెప్పుకొని ముందునకు సాగుదాము. ఆశ్వయుజం అనగా గుఱ్ఱముల పూనిక. గుఱ్ఱములు అనగా మన ఇంద్రియాలు. ఆ గుఱ్ఱాలను మనస్సు అనే పగ్గాలతో కట్టి శరీర రథాన్ని పరమాత్మ వైపు పయనింప చేయాలి. ఈ ప్రయాణంలో చీకటిని, సుదర్శనంతో అంటే మంచినిమాత్రమే దర్శించుతూ, అనగా చక్కటి జ్ఞానంతో తొలగించడం నరకాసురుని వధ. అమావాస్య చీకటి యొక్క పరాకాష్టతకు  ప్రతీక. అదేవిధముగా చీకటి జ్ఞానమును మన స్మృతిపథము లోనే లేకుండా చేసి, అజ్ఞాన తిమిరమును ఆవరిపంప జేస్తుంది. అజ్ఞానము ఆవహించిన వ్యక్తికి, అంతా ఉదాసీనతే, నిర్లిప్తతే, అట్లు కాదు అంటే కుళ్ళు, కుట్ర, కుత్సితము, కుతంత్రము,క్రూరత్వము గూడుకట్టుకొని ఉంటాయి. ఇవన్నీ దుఃఖహేతువులే! ఈ దుఃఖము తోలగాలంటే మనకు సుదర్శనము కావాలి. దు:ఖం తొలగితే ప్రసరించేవి వెలుగురేఖలే, ప్రతి గుమ్మంలో వెలిగే దివ్వెలు అవే! ప్రతి హృదయంలోని ఆత్మ అంటే పరమాత్మకు ఇచ్చే  మంగళహారతులు అవే! అదే దీపావళి.
మన అర్ష ధర్మములో ప్రతి పండుగకు ఒక శాస్త్ర పరమయిన కారణము వుంటుంది. ఇతర మతములలో ఈ తర్కమునకు తావివ్వరు. క్రైస్తవులు ఎంతో సంబరముగా జరుపుకొనే క్రిస్మస్ క్రీస్తు జన్మదినముగా చెబుతారు. ఎన్నో మార్లు తమ కేలెండర్ ను మార్చుకొన్న వారు 25డిసెంబరు క్రీస్తు పుట్టిన రోజు అని ఎట్లు చెబుతారు. చివరిసారిగా తమ కేలెండరును సవరించిన పోప్ గ్రెగొరీ  1582లో అక్టోబరు నెలలో 4వ తేదీ తరువాత 14తేదీని ఏర్పరచి 10రోజులను ఇంద్రజాలములో ఇరికించినాడు. అటువంటపుడు 25డిసెంబరు ఏవిధంగా క్రీస్తు పుట్టిన రోజు అవుతుంది. మరి క్రీస్తు శకమునకు ప్రారంభము అదియే కావలెను కదా! అంటే డిసెంబరు 25 ను చెరిపి దానిని తరువాతి సంవత్సరము (వారి పద్ధతి ప్రకారము) జనవరి 1 గా చేయవలసి వస్తుంది. ఇక ముస్లీముల పండగలు ఇంచుమించు 1500 సంవత్సరముల నాడు, అనగా వారి మతము పుట్టిన తరువాత ఇతర మతాలకు పండుగలు వుంటే అటువంటివేవో  తమకూ ఉండవలెనని ఏర్పరచుకొన్నవి. వాళ్లలో ఎక్కువమందికి ఆ పండుగ ఎందుకు జరుపుకొంటారు అన్నది తెలియదేమో అనిపిస్తుంది. అందుకే మేకల పండగ రోజు (బక్రీద్) ఆవులను చంపుతారు, ముఖ్యముగా మన దేశములో. రంజాన్ నెలలో పగలు ఉపవాసమువుండి రాత్రికి వారు కోరుకొన్నవి కోరుకొన్నన్ని మార్లు తింటారు. ఇక ముహర్రము షియాలకు మాత్రమె! సున్నీలకు లేదు. మరి మన పండుగలు అట్లు కాదు.
ఈ దీపావళి పండుగ విషయములో, ఈ పర్వమునకు - ఖగోళ సంఘటనకు సంబంధము ఏవిధముగా ఉన్నది అన్నది ఒకసారి చూద్దాము.   ఆశ్వయుజ బహుళ చతుర్దశి   ఆకాశంలో రాశులస్థితిని సూచించుతుంది. అమావాస్య తో తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్ఠించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు సూర్యభగవానుడు ( ఇక్కడ విశేషమేమిటంటే అత్యంత వెలుగు కల ఆపరాత్పరుని మనముచూస్తే మనకు కనిపించేది నలుపు రంగే, అందువల్ల ఆయనను నల్లనివాడని అనుకొంటున్నాము.) సత్యభామ చంద్రవర్ణము. (సత్యభామ భూదేవి అంశ కావున ఆమె చందన వర్ణ అంటే చంద్రవర్ణమని తలచుకొని, ఆమెను చంద్రునితో పోలుస్తున్నాము.) నరకుడు చనిపోగానే ఆకాశమున తారాదీపచ్ఛాయల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యుని అంటే కృష్ణుని నాయకునిగా చేసుకునింది. కాల చక్రము నరక బాధలకు ప్రతీకయైన నరకుని  ఖండించి, అమావాస్య తిమిరములో పున్నమిని ప్రతిష్ఠించిన రోజు. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనము. స్త్రీలను సదా కాపాడవలేనన్న సంకేతమును మనకందజేయుటయే గాక శక్తికి ప్రతీకయై నిలచినది. కొన్ని పురాణాలలో అసలు నరకుడు సత్యభామ చేతిలోనే మరణించినట్లు చెప్పబడినది.

 చతుర్దశ్యాం తు యే దీపాన్‌

నరకాయ దదాతి చ|

తేషాం పితృగణా స్సర్వే

నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానమును సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” అన్న శ్లోకమును చెప్పుకొంటూ చేయాలి. తెల్లవారిన తరువాత చేయు స్నానము నిష్ఫలము. ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. ఆవిషయమును పుష్ఠి చేస్తూ పెద్దలు ఈ శ్లోకమును చెప్పినారు.

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌

అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||

ఇది శాస్త్ర వచనము. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది.

 యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్ఠంగా పెద్దలు పేర్కొంటారు. తైలాభ్యంగనము ముగిసిన పిదప యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాల్చుట మనకు పెద్దలనుండి సంక్రమించిన ఆచారము. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని ఆర్యవాక్కు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో ఝాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.

 

నరకాసుర చతుర్దశ్యాం భానుదర్శన పూర్వచ

యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||

సూర్యోదయానికి ముందు రాత్రి తుదిఝాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికి మాత్రమే గోచరింపబడి మనకు అందజేసిన రహస్యం.

 అసలు నరక చతుర్దశి తెల్లవారు ఝాము స్నానానికి ఎనలేని ప్రాముఖ్యత కలదు.'ప్రాతః స్నానం తు యః కుర్యాత్‌ యమలోకం నపశ్యతి' సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము అరుణోదయము ఆలోగా చేయాలి. స్నానమధ్యంతరములో ఉత్తరేణి మొదలగు కొన్ని చిన్న చిన్న వృక్ష జాతుల మండలను శిరసు చుట్టూ త్రిప్పి స్నానము చేయమని శాస్త్రమున వున్నది కానీ నేటి కాల పరిస్తితులకు అది సాధ్యము కాదు.

 స్నానం చేసినవెంటనే ఈ క్రింది శ్లోకాలు చెబుతూ యమతర్పణం చేయాలి.

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!

వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ||

 ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|

మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||

 అవేవీ చెప్పలేనివారు దక్షిణ దిశగా తిరిగి యమాయతర్పయామి, తర్పయామి, తర్పయామి. అని మూడుసార్లు నువ్వులతో వదలగలిగిన చాలును.

 దీపదానం

సాయంకాలం ప్రదోషసమయములో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. విష్ణు శివాలయాలలో, ఇవి పెట్టవలెను.

లక్ష్మీపూజ

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.

విష్ణుమూర్తిని, బలిచక్రవర్తి తాను ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమసవాస్య ఆ తరువాతి రోజు తాను పాతాళంనుండి వచ్చి భూలోకాధికారం చేసేవిధముగానూ, అమావాస్య నాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ వరం కోరుకొన్నాడట.

అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః l 

జలే స్థలే యే నివసంతి జీవాః l 

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః l

భవన్తి త్వం శ్వపచాహి విప్రాః ll

అన్న ఈ శ్లోకమును చెప్పుకొంటూ దీపములను కార్తీక మాసమంతా వెలిగించి పంౘ వద్ద వుంవలసి యుంటుంది.

'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసి చేస్తే తృప్తి కూడా కలుగుతుంది.

దాసరి తప్పులు దండముతోసరి.

స్వస్తి

 

Saturday, 30 September 2017

ఆర్య వైశ్యులు

ఆర్య వైశ్యులు
https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post_30.html
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా--అమరము(ఆర్యా = శ్రేష్టురాలు , దాక్షాయణీ = దక్షుని కూతురు, గిరిజా = పర్వతరాజు హిమవంతుని కుమార్తె, మేనకాత్మజా = మేనకా దేవి కూతురు, మేనక హిమవంతులు భార్యాభర్తలు.)
ఆర్య లేక ఆర్యాంబ అన్నది అమ్మవారి బహుళ నామావళిలో ఒకటి. విష్ణువర్ధనుని ఏలుబడిలోని పెనుగొండ రాజ్యమునేలిన కుసుమశ్రేష్టి కుమారితగా జన్మించి, వయోదికుడగు విష్ణువర్ధనుడు ఆమెను మోహించి వివాహము చేసుకోను ప్రస్తాపన కుసుమ శ్రేష్టి గారి ముందు ఉంచితే, వాసవి తన తండ్రితో తానూ వివాహము చేసుకోను ఉద్దేశ్యమే లేదని చెబుతుంది. రాజు ఆగ్రహోదగ్రుడై దండెత్త దలచినపుడు తనకు బాసటగా 714 గోత్రములయందలి 102 గోత్రములవారు నిలచుతారు. ఆమె జీవచ్ఛవాలుగా బ్రతికేకంటే ప్రాయోపవేశము చేయుట సముచితమని వ్గారికి తెలుపుతుంది. ఆమెను మహాత్మురాలిగా గుర్తించి కుసుమశ్రేష్ఠి మొదలగువారు ఆమెను గూర్చి ప్రశ్నించుతారు. తానూ ఆర్యామ్బానని తెలియజేస్తూ వారికి తన దివ్యదర్శనమునొసంగి తనతోబాటు అగ్నికి ఆహుతి కమ్మని చెబుతుంది. వారంతా తిరిగీ ఆర్యవైశ్యులుగా, వాసవాంబ వారి ఇలవేల్పుగా తిరిగీ భూమిపై అవతరించుతారు. ఆర్య అన్న అమ్మయొక్క నామమును ఆలంబనగా చేసుకొని వారు ఆర్యవైశ్యులైనారు. ఆర్య అన్న మాటకు శ్రేష్ఠము అన్న అర్థము ఉండుటవల్ల వారు శ్రేష్ఠి యన్న బిరుదమును వారు కలిగియున్నారు. శ్రేష్ఠి అన్న తత్సమ శబ్దమునకు వికృతే 'శెట్టి'. ఆ విధముగా ఈ శబ్దము ఎంతో గౌరవార్థమును కలిగియున్నది.
నిబద్ధతతో ఒకపనిని సదా ఆచరించుతాను అన్న భావనను వర్తన అని అనుట కద్దు. ఈ వర్తన దురాశతో ముడిపడితే దుర్వర్తన అవుతుంది. పరిమితి ఏర్పరచుకొంటే సద్వర్తన అవుతుంది. అట్టి సక్రమమైన పరిమితితో సమాజములోనికి అడుగు పెట్టినవారే వర్తకులు. అసలు శ్రేష్ఠులైనవారు కావున నాడు వారు వర్తకులైనారు.
ఇది కలికాలము. ఇది వంచన
కల కాలము. సంపదకు ఆకలి కాలము. మోసపు మూకల కాలము. అందుచే ఎంతోమంది వ్యాపారులితే అయినారుగానీ వృత్తి పై నిష్ఠ లేదు. అట్లని అందరూ నిష్ఠ లేనివారేనా అంటే అది సమంజసము కాదు. నీతినియమములన్న పట్టాలపై నేటికి కూడా నడిచే ఆర్య వైశ్యులుండుటచే వాసవాంబ చల్లని చూపుల బాటలో పయనించుతూ, తమ లాభములో 10 శాతము నేటికినీ ప్రజా హితమునకు సంఘ సేవకు దోహదపడుచున్నారు. ఆతల్లికి కృతజ్ఞతగా దసరా ఉత్సవాలను ప్రొద్దుటూరి వైశ్యులు ఎంత ఘనంగా చేస్తారో చెప్పుట, తలకందని విషయము. అమ్మకు అంతటి కృతజ్ఞులు వారు. మైసూరు లో వలె మహారాజు జరిపించడు ఇక్కడ, వైశ్యుల కష్టార్జితముతోనే జరుపుతారు.
నేను నా బాల్యములో ప్రతి రోజూ చూసిన మాట చెబుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో రంగయ్య గారి సత్రము పేద విద్యార్థులకు భోజన వసతులను ఉచితముగా సమకూర్చేది. అచ్చటి అమ్మవారిశాల లో కూడా విద్యార్థులకు ఉచిత గదులను భోజన వసతిని కలిగించేవారు. పత్తి, నూనె, బంగారునకు పెట్టింది పేరు ప్రొద్దుటూరు. వైశ్యులయి కూడా కర్నాటక సంగీతమును దేశ విదేశములలో వినిపించిన నా మిత్రులు శ్రీ తలిశెట్టి వెంకట సుబ్బారావు గారు, వారి కుమార్తె, వాణీ వరప్రసాదిని, వాణీ నామధేయిని చి.కుం.సౌ. వాణి గొప్ప సంగీత విద్వాంసులు. శ్రీ సదానందీశ్వరయ్యగారు గొప్ప Association Leader. జమ్మలమడుగులో వంకదార వారిసత్రము ప్రయాణీకులకు తాత్కాలిక ఉచిత బస కొరకు గదులనిచ్చేది. లభ్ద ప్రతిష్ఠులు, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు, కొణిజేటి రోశయ్య గారు గవర్నర్లగా పనిచేసిన వారు. వెంకటయ సుబ్బయ్యగారు ఇపుడు లేరు. తమిళనాడులో సుంకువారి సత్రము, జనపన వారి సత్రము మొదలగునవన్నీ వైశ్యులవే! మద్రాసు మహానగరములోని G.N. Chetty రోడ్ అన్న వీధి దీవాన్ బహద్దూర్ గోపతి నారాయణస్వామి చెట్టి గారి పేరుతో నేటికినీ విలసిల్లుచున్నదని బహుశ అతి తక్కువమందికి తెలిసియుండవచ్చు. తిరుమల బ్రహ్మోత్సవములకు నేటికినీ చెన్న పట్టణములో వాసికెక్కిన Parrys Corner  ప్రాంతములో వుండే వైశ్యులే గొడుగులు తీసుకొని వస్తారు. ఈ కార్యక్రమము అక్కడి చెన్నకేశవ స్వామి గుడినుండి మొదలోపుతుంది. ఆంధ్రులకు రాష్ట్రమును తెచ్చిన పొట్టి శ్రీరాములు గారు కూడా వైశ్యుడే! ఈ విధముగా వైశ్యులలో అగ్రగణ్యులు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తరిల్లియున్నారు.
పేదరికపు పంచన నిలచిన నేను, మా తండ్రిగారి పట్టుదల, వితరణ పరులైన వైశ్యుల ధన సహాయము వల్ల
P.U.C. నుండి P.G. వరకు చదువగలిగినాను. ప్రచారము వారి ఆచారము కాదు. నాటి దాతలకు ఈ విధముగా కృతజ్ఞత తెలుపుకొనగల్గుట నా సుకృతము. వర్ణములు వుండి కూడా ఆంగ్లేయులు రాకమునుపే కాదు వచ్చిన తరువాత కూడా, 1917 వ సంవత్సరములోRe.1= 13$ లు గా వుండినది. 1947 కు అది Re.1=$1అయినది. ఈ రోజెంత? రూపాయి విలువ అన్నది  మనము చెప్పనవసరము లేదు, తెలిసినదే కాబట్టి. మన పాటికి మన ధర్మమును పాటించనివ్వకుండా చేసి మన ఐక్యతను చిన్నా భిన్నము చేయుటచే మనకీదశ దాపురించినది.

అసలు ఇంత జరిగినా వర్ణాశ్రమ ధర్మమును నిష్ఠతో పాటించుతూ సాంఘీకపరమగు అవమానములను సహించుతూ ధర్మానికి కట్టుబడి నెగ్గుకు వస్తూవున్న ఏకైక వర్ణము వైశ్యులే!
వారి దీక్షాదక్షతకు ఇవే నా నమస్సుమాంజలులు.
స్వస్తి.

Thursday, 14 September 2017

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

ములకనాటిని నేటికీ మొదటి వరుస
నిలుపగల్గిన మేధావి నియమ వ్రతుడు
మోక్షగుండపు వారాశి మూల మణిగ
వెలసె భారత రత్నమై విబుధనుతుడు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు మూడువందల సంవత్సరాల క్రితం ఒకప్పటి కడప జిల్లా, అటుమిమ్మట కర్నూల్‌ జిల్లా, ఇప్పటి ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 'మోక్షగుండం'' అన్న గ్రామము నుండి అప్పటి మైసూరు రాజ్యమయిన,   బెంగళూరు నగరమునకు  38 మైళ్ళ దూరంలోని ముద్దనహళ్ళి గ్రామమునకు వలస వెళ్ళినారు.  అతి సామాన్య మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ గారలు. ఆ దంపతుల సంతానమే విశ్వేశ్వరయ్య గారు. ఆయన 1861 సెప్టెంబరు 15న జన్మించినారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. ఎందరో మహనీయుల మాదిరిగానే విశ్వేశ్వరయ్య జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. విశ్వేశ్వరయ్య విద్యాభ్యాసం చిక్కబళ్ళాపూరులో ప్రారంభమైంది. ఆ బాలుని అనన్య మేధాశక్తిని, కుళాగ్రబుద్ధిని మొదటగా గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించింది ఆయన మొదటి గురువు నాదమునినాయుడు, మేనమామ హెచ్‌. రామయ్య.  అందరూ తెలుగువారే! నేటికిని తెలుగు బ్రాహ్మణులు, ముఖ్యముగా ములకనాడు వారు కర్నాటక రాష్ట్రమున లెక్కకు మిక్కుటముగా నున్నారు. విశ్వేశ్వరయ్య 15వ ఏట పితృవియోగం పొందినారు. అయినా పట్టు వీడక అనేక వ్యయప్రయాసలకోర్చి 20వ ఏట బెంగళూరు సెంట్రల్‌ కాలేజీ నుండి B.A డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులై అందరినీ అందరినీ అబ్బురపరచినారు. సెంట్రల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వెబ్‌స్టరు ఆయన తెలివితేటలు, క్రమశిక్షణకు, ముఖ్యంగా ఆంగ్ల భాష మరియు గణితములో  ఆయన యొక్క అనన్యసామాన్య  పాండిత్యమునకు ముగ్ధుడై అనేక బహుమతులు ఇవ్వటమే గాక ఆయన యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. ఆయన, అప్పటి మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉపకారవేతనంపై పూణేలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్పించినారు. 1883లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరిలోకీ ప్రథమునిగా నిలచినారు  విశ్వేశ్వరయ్య గారు. అటుపిమ్మట 1884లో అప్పటి బొంబాయి రాష్ట్రంలో నేరుగా పిడబ్ల్యుడి శాఖ అసిస్టెంట్‌ ఇంజనీరుగా  నియమితులయినారు. 1884 నుంచి 1909 మధ్య కాలంలో, ఇరిగేషన్‌ ఇంజనీరుగా, శానిటరీ ఇంజనీరుగా అనేక కార్యక్రమాలు చేపట్టి, నిర్ణీత కాలం కంటే ముందుగా పనిని పూర్తిగావించి ఎందరో అధికారుల మన్ననలు పొండినారు. 1909లో స్వచ్ఛందంగా సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి రాజీనామా చేసి విదేశీ పర్యటనకు వెళ్లినారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా, ఎన్నో నగ రాలకు రక్షిత మంచి నీటి సరఫరా, మురుగు నీటి రవాణా, వరద నివారణ పథకాలు అతిస్వల్ప వ్యవధిలో పూర్తి గావించి విదేశీ అధికారులను సైతం ముగ్ధులను గావిం చినారు. 1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజసాగరం జలా శయం కావేరీ నదిపై నిర్మించినారు. ఈ ఆనకట్ట మైసూరు సంస్థానం సమగ్రాభివృద్ధికి దోహదపడింది. ఆ రాజ్యానికి జీవనాడి అయింది. ఇది ఇరిగేషన్‌ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయం.
మైసూరు సంస్థాన సమగ్రాభివృద్ధికై చీఫ్‌ ఇంజనీరుగా బాధ్యత స్వీకరించి తమ రాజ్య ప్రజలకు తన మేధాశక్తి సత్ఫలితాలను పంచి ఇవ్వవలసిందిగా అప్పటి మైసూరు మహారాజా తమ దివాన్‌ ఆనందరావు ద్వారా విశ్వేశ్వరయ్యను కోరినారు. అందుకు విశ్వేశ్వరయ్య తన జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి మొదలైన అన్ని కార్యక్రమాలకూ మహారాజు సహకరించి, ఆమోదముద్ర వేయవలసి ఉంటుందనే షరతులపై చీఫ్‌ ఇంజనీరుగా 1909లో ఆ బాధ్యత స్వీకరించినారు. ఆరేళ్ల కాలంలో మైసూరు రాజ్యం ఆయన నేతృత్వంలో అన్ని రంగాలలో పురోగమించింది. నష్టాల ఊబిలో ఉన్న భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని లాభం ఆర్జించే విధంగా చేసినారు. ఇది ఆర్థికవేత్తగా విశ్వేశ్వరయ్య గారు సాధించిన అపూర్వ విజయం. నేటి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు ఎన్నో పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలను స్థాపించినారు. అతి గొప్ప విషయము ఏమిటంటే ఆయన రాత్రి సమయములలో దీపపు వెలుతురున ప్రభుత్వ కార్యములు చేయవలసి వస్తే వెలుగు కొరకు ప్రభుత్వ ఇంధనమునే ఉపయోగించేవారు. స్వంతపనులు మాత్రము తానూ కొన్న కిరోసిను లాందరను స్వంత ఖర్చుతో కిరిసిను పోసి ఉపయోగించుకోనేవారు. 

ఆయనకు 'భారతరత్న'బిరుదమునిచ్చి దేశము తనను తానుసన్మానించుకొనింది.. 1938 నుంచి 1958 మధ్యకాలంలో దాదాపు 8 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వతము గరిగినది. 1962, ఏప్రిల్‌ 14వ తేదీన ఆయన తనువు చాలించితే, మైసూరు ప్రభుత్వం వారి భౌతికకాయానికి సకల రాజ లాంఛనములతోలతో వారికోరిక మేరకు తమస్వగ్రామముగా నేర్పరచుకొన్న 'ముద్దనహళ్లి'లో అంతిమ సంస్కారం గావించుట జరిగినది.102వ ఏట తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ఆ మహనీయుని కనీసము ఈ రోజయినా తలచుకోకుంటే వేరు ఏరోజున తలచుకొనగలుగుతాము.
స్వస్తి


Monday, 11 September 2017

అవధానం - సమస్యాపూరణం - దత్తపది


అవధానం - సమస్యాపూరణం - దత్తపది

https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post_11.html

అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు

కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ

సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ,

అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు

చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

ఇందులో అవధానికి అతిముఖ్యమయినవి ధార, ధారణ,చమత్కృతి,

సమయస్ఫూర్తి. ఇందులో ఏది కొరవడినా అవధానము రక్తి కట్టదు. అందుకే

అవధానమును అసిధారా వ్రతమన్నారు.

తిరుపతి వేంకటకవులు అవధానమునకు ఆద్యులు కాకపోయినా ఆవిద్యను

దశదిశల వ్యాపింపజేయుటకు ఆద్యులు వారే. ముఖ్యముగా ఈ అవధాన విద్యలోని

సమస్యా పూరణములోనూ, దత్తపదిలోనూ బాహిరముగా అశ్లీలము అగుపించినా

దానిని వేటగాడు వాల్మీకియైన చందమున తమ ప్రజ్ఞాపాటవమును జతజేసి

అవధానులు పూరించుట కద్దు. ఆశుకవితా సంప్రదాయానికి ఇది కొత్త ఊపిరి.

తిరుపతివెంకట కవులకు ముందు అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు

ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు

వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే వున్నాము. వీరికి పృచ్ఛకులుగా

ఉభాయభాషలలోనూ మహా ఉద్దండులు ఉండేవారు. ఒక అవధాన సభలో వారికి

ఇచ్చిన సమస్య: ‘సంధ్యావందనమాచరించ వలదా చౌశీతి బంధంములన్’. ఇది

సాధారణ సమస్య కాదు. భాషా విభవము మిక్కిలి ఎక్కువగా వున్నవారు మాత్రమే

చక్కగా పూరించగలరు, తమ సమయస్ఫూర్తిని జతజేస్తూ. లేకుంటే

సంధ్యావందనమెక్కడ చౌశీతి బంధములు (84 విధములగు బంధములు) ఎక్కడ.

వారు పూరించిన నైపుణ్యమును గమనించండి:

వింధ్యాద్రిప్రభలొప్పు బల్కుచములన్ వేపట్టి పెంపొందు కా

మాంధ్యంబార్పగలేక వేర్రివయి ఎలా మంచి ఈ రాతిరిన్

సంధ్యన్ జేసెదు కాముకేళి యనగా సాహిత్యమా లేక నీ

సంధ్యావందనమా! చరించ వలదా చౌశీతి బంధంములన్

మరి ఇచట శృంగారపరముగా చెప్పుట తప్పనిసరి. అంతమాత్రముచే వారి

పాండితీగరిమను తప్పుబట్ట వచ్చునా!

ఇక 20 వ శతాబ్దములో అవధానమే తన వృత్తి మరియు ప్రవృత్తిగా చేసుకొని

కుటుంబ పరమైన వ్యాపారమునకు పెద్దపీటవేయక, అవధానమే ప్రధానముగా

చేసుకొనుచూ గడియారము వెంకటశేష శాస్త్రి గారి ప్రియశిష్యుడై మహా మహా

ఉద్దండులైన నాటి పండితులను పృచ్ఛకులుగా కలిగి లోకాన్ని ఒప్పించి మెప్పించిన

అనర్ఘ అవధాన రత్నము C.V. సుబ్బన్న శతావధాని గారు. నాటి ఆయన

పృచ్ఛకులలో గడియారము వెంకటశేష శాస్త్రి గారు, దుర్భాక రాజశేఖర

శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యులవారు, విశ్వనాథ సత్యనారాయణ

గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు, గంటి జోగి సోమయాజి

గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తుమ్మల

సీతారామమూర్తి చౌదరి గారు, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు,

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పేరి

సూర్యనారాయణ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు, బోయి భీమన్న

గారు, దాశరథి గారు సినారె గారు, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చేంతాడంత

పట్టిక తయారవుతుంది ఉండగా అవధానమును పండించిన నిండుకుండ ఆయన. అన్నిటికీ మించి వీరి అవధానము శంకరాచార్య పీఠమున చంద్రశేఖర యతీంద్రుల

వారి పనుపున జరిగినపుడు సంస్కృతి, సంస్కృత శిరోమణి యగు జయేంద్ర సరస్వతి

స్వాములవారు పృచ్ఛక స్థానమును అలంకరించి వారికి దత్తపదిని ఇచ్చియుండినారు.

మొదటి ప్రపంచ తెలుగు మహాసభకు ఆదరపూర్వకముగా ఆహ్వానింబడి, అత్యున్నత,

అద్వితీయ గౌరవమును బడసిన ఆదియవధాని వీరే! ఈ ఉపోద్ఘాతమంతా

ఎందుకంటే పైకి అశ్లీలముగా కనిపించే దత్తపది, సమస్యలు పైన తెలిపిన

మహామహులలో కొందరిచ్చినా సుబ్బన్న గారు ఎంత గొప్పగా ఏమాత్రమూ

అశ్లీలమునకు తావివ్వక పూరించినారో తెలియజేయుటకే! వీరు పూరించిన ఒక

సమస్య :’ మీనాక్షికి కుచాములారు మీసములేడున్’

ఆనాడు ప్రోద్దువోయెను

జానయు తత్పతియుగూడి సరి క్రీడింపన్

లూన ముకురమున దోచెన్

మీనాక్షికి, కుచములారు మీసములేడున్

ఒకానొకరోజు తమకముతో తల్లడిల్లిన దంపతులు ఒకరికొకరు తీసిపోక

పెద్దప్రోద్దు క్రీడించిరి. అద్దము చిట్లినది (లూన ముకురము) అన్న జ్ఞాపకము కూడా

వారికి లేదాయే. అలసిన మీనాక్షి అనుకోకుండా అద్దములో చూస్తే ఆరు

కుచములు ఏడు మీసములు కనిపించినవట.ఇక్కడ కవి ‘మీనాక్షి’ అన్న

పదమును సాభిప్రాయ విశేషణముగా చేసినాడు. కామోద్రిక్తయైన మగువ

తత్సమయమున  మత్స్యస్ఫూర్తి పొందునన్నది శాస్త్ర వచనము. ఆశువుగా చెబుతూ

కూడా ఎంత గొప్పగా పూరించినారో చూడండి. ఇందులో చూడవలసినది

చమత్కారముకానీ శృంగారము కాదు. సందర్భానుసారముగా స్పందించినవాడే

నిజమయిన శ్రోత లేక పాఠకుడు.

ఇక ఆయన అవధానము చేయు కాలములోనే మహామహులగు పృచ్ఛకులు

ఆయనకు అలనాటి సినిమా తారామణుల పేర్లు దత్తపదిగా ఇవ్వటము

తటస్తించినది. గమనించండి:

భానుమతి, అంజలి, జయప్రద, జమున

సీత హరించె భానుమతి శిష్ట గతిన్ జని రావణుండు,

జ్ఞాతిని సంహరింప యతి సంఘము గోరగనంజలించి, దో

ర్భూతి జయప్రద ప్రథనమున్ నడిపించి రఘుప్రవీరుడా

క్రోతి యశోక భూజమునకున్ బ్రధితత్వము గూర్చె శూరుడై

భానుమతి = ప్రకాశవంతమైన అంటే జ్ఞానియయ్యును సన్యాసి వేషములో సీతను

అపహరిచగా, అరాచాకములు సేయు ఆతనిని సంహరించమని ఋషిగణము

అడుగగా (ఇచ్చట జ్ఞాతి అన్న శబ్దము ఉపయోగింపబడినది, పులస్త్యుడు బ్రహ్మ

మానస పుత్రుడు మరియు మహర్షి. బ్రహ్మ మానస పుత్రులగు మిగత మహర్షుల

సంతతికి రావణుడు జ్ఞాతియే కదా!) భయంకర (దోర్భూతి జయప్రద ప్రథనము =

జయప్రదమైన భయంకర యుద్ధము) చేసి కోతికీ (హనుమంతునికి), అశోక

వృక్షమునకు యశస్సు(ప్రధితత్వము) ను గూర్చెను.

ఆ కాలముననే ఇటువంటి దత్తపదుఇలు ఉండినవి అని తెలుపుటకు ఈ పద్యము

ఉటంకించినాను. ఇక్కడ చూడవలసినది సినీతారల పేర్లుకాదు. అందులోని

వరుస అక్షరములను భిన్న పాదములలో యథా తథముగా వాడి ఎట్లు రక్తి

కట్టించినారు అన్నది గమనించవలసిన విషయము. అసభ్యత అశ్లీలత ఆవగింజంత

కూడా కనిపించవు పూరణలో. ఆమాటకొస్తే ఆ పద్యము కవియొక్క ఊహాశక్తికి

అద్దము పడుతుంది. ఈవిధమైన తారల పేర్లతో నేను నింపాదిగా పూరించిన

పద్యమును ఒక పండిత పాఠకుడు (నాకు అన్నయ్యతో సమానము) సినిమాతారల

పేర్లెందుకు అని నిరసించుతూ మీరు కూడా అవధానియైపోయినారు అని అనటము

జరిగినది. వారి మాటను ఆశీస్సుగా తీసుకొని, పరమాత్ముని వచ్చే జన్మలో నాకూ అంతటి ధిషణ ప్రసాదించమని కోరుకొంటాను. ఈ విధమైన ప్రయత్నము చేయుట వల్ల ధీజడిమ తగ్గి ధీపటిమ పెరుగుతుంది. నేర్పుగలవారు ఇటువంటి ప్రయత్నము చేయుట మంచిది. నేను చేసినదీ అటువంటి ప్రయత్నమే . తప్పేమీ నాకు గోచరము కాలేదు.

ఇక మాడుగుల వారిని గూర్చి: ఈ కాలములో ఆయన అశేష శేముషీ దురంధరుడు,  అపార పాండితీ ధిషణాలంకృతుడు. నా దృష్టిలో ఆయన వాక్పతి మరియు పుంభావ సరస్వతి.శృంగేరి పీఠాధిపతి సంస్కృతావధానము చేయించనెంచి ఆయనను పిలువనంపి ఏర్పాటు చేయించినారు. తాను తెలుగు పండితునిగా పనిజేసిన   కడప రామకృష్ణ జూనియర్ కాలేజి లో  పనిచేసిన కాలములో ప్రిన్సిపాల్ గా వుండిన శ్గోరీయుతులు గోపాల కృష్ణమూర్తిగారు తాను వ్రాసిన పుస్తక ఆవిష్కరణకు అధ్యక్షత వహించమని ఆహ్వానించితే తన ఖర్చులతో హైదరాబాదు నుండి కడప జిల్లాలోని బద్వేలు తాలూకాలోని బ్రాహ్మణపల్లెకు పోయి ఆపని నిర్వహించి అందరికీ ఆనందము పంచినారు. అంతటి కృతజ్ఞతామూర్తి యతడు.

ఆయన చరవాణి సంఖ్య తెలుసుకొని  నేను ఆయనతో పునః

పరిచయము చేసుకొంటూ  SBI-ZO-తిరుపతిలో ఆయన అవధానమును

ఏర్పాటుచేసిన విషయము గుర్తుచేస్తే కష్టకాలములో వున్నపుడు నాలోని

ప్రత్యేకతను గుర్తించి తగువిధముగా సన్మానించిన మీ వంటివారిని మరచిపోను

అన్నాడు. అది ఆయనలోని సద్గుణము. గుర్తింపు దొరికిన పిమ్మట ప్రతివ్యక్తిలోనూ

మంచి చెడు చూచుట సహజము, కానీ అది సందర్భానుసారముగా ఉండుట

ఎంతో అవసరము. మనము హంసలమై క్షీరమును గ్రోలి నీటిని విడుచుట

మంచిది. కానీ శర్మ గారు అట్లుకాదు. వారొక అన్ని పదార్తములూ వడ్డించిన ఆకు. 

  వారి ఆశు కవితాధారకు ప్రతీకగా ఒక శ్లోకము ఇక పద్యము మీ ముందుంచుచున్నాను.

అనుష్టుప్ ఛందో శ్లోకములో ఉండే అక్షరాల సంఖ్య 32. 14 అక్షరాలూ రూపు తేరా మస్తానా ప్యారుమేరా దీవాన రూపములో పృచ్ఛకులు ఇవ్వగా శ్రీరామ పరంగా ఆ హిందీ శబ్దములను సంస్కృత భాషానుగుణముగా కేవలము తాను స్వంతముగా వాడిన 18 అక్షరములు కలిపి ఎంత మనోజ్ఞముగా ఆశువుగా తెలిపినారో చూడండి.

నీలాభర రూపతేరామ సమస్తానాం శుభంకర 

తత్తధాప్యారమే రామే  నదీవానంద వర్ధన 

వేరొక అవధానములో వారి పూరణ

ఒక చిన్న తేటగీతి పద్యములో ప్రళయము,రౌద్రము. భీభత్సము, వాత్సల్యము లను ఉపయోగించుతూ దఖ నిరీశ్వర యజ్ఞ ధ్వంసమును వర్ణించిన ఈ అసమాన ప్రతిభను గమనించండి.

ప్రళయ దీప్తివి అంబికా ప్రణయ మూర్తి 

నిరత రౌద్రప్రసార నిర్నిద్రకీర్తి 

నెరయు భీభత్స రసమెల్ల కరగి కరగి 

ఒదిగి వాత్సల్య రసమౌను సదయ నిలయ



నేనసలు ఒక నాలుగు దినముల క్రితము ప్రచురించిన దత్తపది ప్రజ్ఞ కలిగిన

యువతను ప్రోత్సహించుటకే! నేనేమీ తప్పు చేయలేదు. అటువంటివి నాకు

తోచినపుడు ఆస్య గ్రంధి లో పెడుతూ వుంటాను, యువత స్పూర్తిని పొందుతారన్న

నమ్మకముతో! నేడు మనకూ, మన తెనుగుకూ జగద్విఖ్యాతిని ఒనగూర్చుచున్న

మహా పండితులను, మహా అవధానులను, మహాకవులను మనసారా గౌరవించి

మన తెలుగునకు సాతియగుభాశాలేదని జగతికి చాటుదాం. మనది “Italian Of

The East’ కాదు, వాళ్ళది ‘Telugu of the West’ ఎందుకంటే ఆ భాషలు

పుట్టకమునుపు వేల సంవత్సరముల క్రితము పుట్టిన భాష మనది.  చివరిగా ఒక

మాట. ఒకరినొకరు గౌరవించుకొంటే వాతావరణము సుహృద్భావముతో నిండి

ఆహ్లాదకరముగా ఒప్పారుతుంది.

ఆదిశగా అడుగేద్దాం.

స్వస్తి.