Tuesday 12 September 2023

అవధానము పై ఒక పండితుని అభిప్రాయము నా సమాధానము

 Ref.అవధానం - సమస్యా పూరణం - దత్తపది (సరసరస)

Nagaraja Sastry Gollapinni

ఔచిత్యం దాటతనంతవరకు అవధానం అభినందనీయం.కానీ సమస్యాపూరణం,దత్తపది, అప్రస్తుత ప్రశంసల్లో అశ్లీలత చోటు చేసుకోవడం దారుణాతి దారుణం. అవధానాలు కేవలం అవధాని పాండిత్య ప్రకర్షకే తప్ప , తెలుగు సాహిత్యానికి చేసిన మేలు చాల తక్కువ. నన్నయ,తిక్కన పోతన శ్రీనాధ మహాకవులజాషువా రచనలు కలకాలం కాల పరీక్షకు నిలబడ్డాయంటే అమూల్యమైన సాహితీ విలువలు వుండటం వల్లే.తిరుపతి వెంకటకవుల అవధాన పద్యాల కన్నా పద్యనాటకాలు కాల పరీక్షకు నిలిచాయంటే అవి హృదయం స్పర్శవికాబట్టే.

"తలయూపింపనిది రసజ్ఞతే

అలరి పట్టినది ఉంగరమే -అంటాడు నన్నె చోడ మహాకవి. అవధానం ముగిసిన వెంటనే అవధాన పద్యాలు అంతటితో సరి.గాలికి పోయిన ప్యాలపిండి కృష్ణార్పణం


అవధానము అన్న మాటకు ఏకాగ్రత అనిచేప్పుకోవచ్చును అనగా Concentration of mind.. ఒక విషయముపైనే ఏకాగ్రత . ఈ ఏకాగ్రత ముఖ్యముగా అష్టాంగ యోగము లోని ధ్యానము ధారణ మననము సమాధి మూలముగా ప్రాప్తించుతాయి. 

పతంజలి యోగమును ౮ విధాలుగా విభాజించినారు. దీనిని అష్టాంగ యోగము అంటారు. ఈ ఎనిమిది భాగములు యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి.

'యోగః చిత్తవృత్తి నిరోధః' అన్నాడు పతంజలి మహర్షి. సాధకుడు ఆత్మను పరమాత్మకు అనుసంధించటమే కాకుండా, లౌకికముగా ఒక వ్యక్తి తన మేధస్సును ఒక ప్రత్యేక విషయమునకు లేక విషయములకు అనుసంధించుటకూడా యోగమే! దీనినే అవధానము అంటారు. ఇది అష్ట శత సహస్ర  ద్విసహస్ర పంచసహస్ర అవధానములు కావచ్చు. సాధారనముగా అవధానులు శక్తి స్వరూపిణిని అనుష్ఠించుచుంటారు తమ ఏకాగ్రతకు. 

ఇక అవధానములో ఆశ్లీలతను గూర్చి- ఉదాహరణకు అష్టావదానమును తీసుకొందాము. అవధానికి పెట్టే భాషా పాండిత్యపరమైన 8 కష్టమైన   ప్రక్రియలకు\ ఆటంకములకు, అందునా నిషిద్ధాక్షరికి ఉద్దండ పండితులు కూర్చుంటారు, సమాధానము చెప్ఫి రక్తి  కట్టించుట అవధాని గొప్పదనము. ఇక దత్త పది, సమస్యా పూరాణములందు  అశ్లీలమును  కాలక్రమేణా జొప్పించి, అవధాని పూరణ మాత్రము అశ్లీలత లేకుండా పూరించామనుత కద్దు. ఈ ప్రతిభా వ్యుత్పత్తులు కల్గిన అవధానము తెలుగువారి సొమ్ము. మీరన్నట్లు పొల్లును చెరిగివేసి గింజలను చేటలో నిలుపుకొన్నచో మన భాషా గౌరవమును దేశ దేశాన్తరములకు విస్తరింపజేయవచ్చును. ఇది ఏభాషలోనూ లేని ఒక అసాధారణ ప్రక్రియ. రూపుమాపవలసినది కాదు.

ఇక ఇక నన్నయ తిక్కన పోతనాది  మహానుభావుల కవితా సుధారసధారలు అవధానములలో కనిపించే అవకాశము తక్కువ. కానీ దేనికదే! పాలకోవా ఎంతో రుచికరమైనదని అదే అదే పడే పడే తినలేదు. భోక్తకు ఎప్పుడైనా పకోడీ కూడా తినవలేనని అనిపించవచ్చు. ఆ పదార్థము మరియు దానిని చేసేవాడినే మరుగున బడవేసితే ఒక సాహితీ ప్రక్రియకు దూరమౌటాము. మీరు చెప్పిన కవికుల తిలకుల కావ్యములు, సత్కవితలు చదువదలచినపుదల్లా పాఠకుడు  చదువగలుగుతాడు. అందుకే ఈ ప్రక్రియను జారవిడువకూడదు. పైపెచ్చు దీనిని విద్యావిదానములో ఒక భాగముగా చేసితే విద్యార్థుల ధారణాశక్తి ప్రబలుతుంది. 

మీరు భాషా పండితులు నేను ఏదయినా తప్పు వ్రాసియుంటే తప్పుగా తలవారని 

No comments:

Post a Comment