Friday 13 January 2017

వాతాపి గణపతిం భజే -- ముత్తుస్వామి దీక్షితులవారు


     వాతాపి గణపతిం భజే






కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నది బాదామి. బాదామి గుహాలయములకు ప్రసిద్ధి. 

ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు, 

బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో నిర్మింపబడిన, 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వము వాతాపి 

అనే ప్రాంతము బాదామిగా సుపరిచితము. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ 

శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా ఉండేది.

బాదామి క్షేత్రం బీజాపూర్‌ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక బాదామి  విశిష్ఠత గురించి 

చెప్పవలెనంటే ఇచ్చటి గుహాలయాలు మనదేశములో మాత్రమే కాదు, ప్రపంచంలోనే 

ప్రసిద్ధమయినవి.  ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ 

పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. 

చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. గణపతి, నటరాజస్వామి

మహిషాసుర మర్దిని, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా 

ఉంటాయి. ఈ వాతాపి గణపతిని గూర్చిన ముత్తుస్వామి దీక్షితులవారి వాతాపి గణపతిం 

భజే అన్న హంసధ్వని రాగము లోని కీర్తన అత్యంత లోకఖ్యాతి గాంచినది.


కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూరులో 

జన్మించినారు. వారి పూర్వులు మన రాజమహేంద్రి ప్రాంతము నుండి వలసపోయి 

ఉండినారని విన్నాను. వీరు కర్నాటక సంగీత త్రిమూర్తులు 1. శ్యామశాస్త్రి, 2. త్యాగరాజు, 3. 

ముత్తుస్వామి దీక్షితులు, ఈ ముగ్గురిలో చివరివారు. పైపెచ్చు శ్యామాశాస్త్రి గారి శిష్యులు. 

మరియొక విడ్డూరమయిన విషయము ఏమిటంటే నేను వ్రాసిన క్రమములో ఈ ముగ్గురికీ 

మధ్యన ఇంచుమించు 10 సంవత్సరముల అంతరము. అలనాటి వాతాపి నుండి గణపతి 

విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి 

అచట ప్రతిష్టించినారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి 

కృతులను వ్రాసినారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన "వాతాపి గణపతిం 

భజే". ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి 

దీక్షితులవారు.  అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ కీర్తనను ఒకసారి చిత్తగించండి.

పల్లవి

వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం

చరణము

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతమ్

మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్

పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్

నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్

కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్

హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్

తాత్పర్యం: కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు ఈ విధముగా అంటున్నారు: నేను 

వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని 

పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై

అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త 

భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును, అట్టి గణాధిపతిని సేవించుచున్నాను.

మూలాధార చక్రము నందు స్థిరమై, అందున్న త్రికోణ మధ్య స్థానమందు వసించు 

గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన 

దేవతలు పూజించుచున్నారు. పర, పశ్యతి, మధ్యమ వైఖరి  అను నాలుగు విధములైన 

శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన 

తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత 

బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన 

నీవుచేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. 

శివుడుషణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగమును భూషణముగా

అమ్మ అయినపార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు.

అట్టి వాతాపి గణపతికి మనము కూడా నమస్కరించుదాము. 

1835 దీపావళి దినమున సంధ్యావందన పూజాదికములను ముగించి తన శిష్యులతో 

'గమకక్రియ' రాగములో 'మీనాక్షి మే ముదం' అన్న కీర్తనను ఆలపించమని చెప్పి, వారా 

విధముగా ఆలపించుచుండగా చరణములోని "మీన లోచనీ పాశమోచనీ'' అన్న పదములు 

పాటలో వచ్చినపుడు రెండు చేతులూ పైకెత్తి 'శివే పాహి' అని అంటూ కైలాస పదం 

చేరుకొన్నారు. 

వారి సమాధిని తమిళనాడు ఎట్టయాపురం ( మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టిన వూరు) 

లో చూడవచ్చు. ఇది కోయిల్పట్టి టూటికోరిన్ ల నడుమ వుంది.



స్వస్తి.


i

No comments:

Post a Comment